ఆంధ్రజ్యోతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రజ్యోతి
రకంప్రతిదినం
రూపం తీరుబ్రాడ్షీట్
యాజమాన్యంకె.యల్.ఎన్.ప్రసాద్ (తొలి దశ), ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్(మలిదశ)
ప్రచురణకర్తవేమూరి రాధాకృష్ణ
సంపాదకులుకె. శ్రీనివాస్
స్థాపించినది1960-07-01
విజయవాడ, ఆంధ్రప్రదేశ్, 2002-10-15(కొత్త నిర్వహణ)[1]
ముద్రణ నిలిపివేసినది2000-12-30 నుండి 2002-10-14
కేంద్రంహైదరాబాద్
జాలస్థలిhttp://andhrajyothy.com

ఆంధ్రజ్యోతి ఒక తెలుగు దినపత్రిక.[2] సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి 1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు.[3][4][5] 2000లో ప్రచురణ నిలిచిపోయింది. 2002 లో కొత్త యాజమాన్యంతో వేమూరి రాధాకృష్ణ సారథ్యంలో తిరిగి ప్రచురణ మొదలైంది[6]. ఈ పత్రికకు అనుబంధంగా నవ్య వారపత్రిక, ఆంధ్రజ్యోతి జర్నలిజం పాఠశాల, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టివి ఛానల్ నడుపబడుతున్నాయి.

చరిత్ర[మార్చు]

1960-2000[మార్చు]

ఆంధ్రజ్యోతి మొదటిపేజీ 1961, ఆగస్టు, 1

సంపాదకుడు, హేతువాది అయిన నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్ పక్షాన1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు.[1] అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు. నాలుగు ఎడిషన్లుగా ప్రచరించబడింది. 2000లో ప్రచురణ నిలిచిపోయింది.

మొదట నార్లతో విద్వాన్ విశ్వం, నండూరి రామమోహనరావు సహాయ సంపాదకులుగా పనిచేశారు. 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, నండూరి రామమోహనరావు ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి సంపాదకత్వం స్వీకరించాడు. నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత ఇనగంటి వెంకట్రావు సంపాదకులైనారు[7]. ఆ తరువాత సంపాదకులుగా తుర్లపాటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ మొదలైనవారు పనిచేశారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడింది.

2002-[మార్చు]

2002 అక్టోబరు 15 న పాత పత్రికలో సీనియర్ రిపోర్టరుగా పనిచేసిన వేమూరి రాధాకృష్ణ మేనేజింగ్ డైరెక్టరుగా, కె.రామచంద్రమూర్తి సంపాదకులుగా 9 ప్రచురణ కేంద్రాలతో ఒకేసారి తిరిగి ప్రారంభించబడింది. తరువాత 18 ప్రచురణ కేంద్రాలకు విస్తరించింది. 2008 నుండి కె. శ్రీనివాస్ సంపాదకుడిగా ఉన్నాడు. వేమన వసంత లక్ష్మి, నవ్య అనుబంధం, ఆదివారం అనుబంధం ఫీచర్ సంపాదకులుగా, జగన్ ఆన్లైన్ సంపాదకునిగా, పురందరరావు సీనియర్ అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ గా ఉన్నారు.

అమ్మకాలు, చదువరులు[మార్చు]

తెలుగు రాష్ట్రాలలో 19 చోట్ల, బెంగుళూరు, చెన్నైలనుండి ముద్రితమవుతున్నది.

అమ్మకాలు

ఆంధ్రజ్యోతికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ లో సభ్యత్వం లేదు కావున మూడవ వ్యక్తిచే తనిఖీ చేయబడిన సగటుఅమ్మకాలు తెలియవు,

చదువరులు

ఐఆర్ఎస్ 2019 రెండవ త్రైమాసికం గణాంకాల ప్రకారం ఈనాడుకు తెలుగు రాష్ట్రాల్లో రోజువారి సగటున పత్రిక చదివేవారి సంఖ్య 22,39,000 వుండగా, గత నెలలో ఏనాడైనా పత్రిక చదివిన వారి సంఖ్య 58,49,000 గా ఉంది. గత త్రైమాసికంతో పోల్చితే రోజు వారి సగటు చదువరుల సంఖ్య 9.5% తగ్గింది. ఆంధ్రజ్యోతి తెలంగాణాలోని తెలుగు దినపత్రికలలో నాల్గవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ లో మూడవ స్థానంలో ఉంది.[8]

భాష[మార్చు]

ఆంధ్రజ్యోతి శైలి, అన్న ప్రచురణ ఈ పత్రిక యాజమాన్యం ప్రచురించింది.

శీర్షికలు[మార్చు]

  • నవ్య మహిళల పేజీ
  • ఆదివారం అనుబంధమ్
  • వివిధ హ్సాహిత్య వేదిక
  • దిక్చూచి (విద్య, ఉద్యోగావకాశాల ప్రత్యేకం)
  • సకల
  • చింతన
  • వైద్యం
  • సంస్కృతి

ప్రముఖ కాలమిస్టులు[మార్చు]

శీర్షిక కాలమిస్టు ప్రచురణ వారం, విషయాలు
సందర్భం కె. శ్రీనివాస్ వార్తావిశ్లేషణ
దీప శిఖ రాజ్ దీప్ సర్దేశాయ్ శుక్రవారం,వార్తావిశ్లేషణ
పత్రహరితం మేనకా గాంధీ జీవకారుణ్యం
సమాంతరం సుధీంధ్ర కులకర్ణి వార్తా విశ్లేషణ
భరత వాక్యం భరత్ ఝన్ ఝన్ వాలా వార్తా విశ్లేషణ
గతానుగతం రామచంద్ర గుహ చారిత్రిక విశ్లేషణ
గమనం తెలకపల్లి రవి వార్తా విశ్లేషణ
ఇండియాగేట్ ఎ కృష్ణారావు జాతీయ వార్తా విశ్లేషణ
కొత్త పలుకు వేమూరి రాధాకృష్ణ

గతంలో ప్రాణహిత శీర్షికన అల్లం నారాయణ తెలంగాణ వాదం విశ్లేషించారు.

ఆన్ లైన్ రూపాలు[మార్చు]

ఆన్లైన్ సంచిక వివిధరూపాల్లో లభ్యమవుతున్నది.

  • హెచ్టిఎమ్ఎల్ పాఠ్యం రూపంలో ఇంటర్నెట్ లో ఆంధ్రజ్యోతి [2] అందుబాటులో ఉంది. మొదట్లో స్వంత ఖతి "శ్రీ తెలుగు" వుపయోగించిన తరువాత ప్రామాణిక యూనికోడ్‌కి మార్చబడింది. పాత సంచికలు వెబ్సైట్ కొత్త రూపంతో అందుబాటులోలేవు
  • పిడీయఫ్ ఆంధ్రజ్యోతి ఈపేపర్ లింకు
    ఈ పిడీయఫ్ ఆన్‌లైన్ సంచికలో ఆంధ్రజ్యోతి పేపరును అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు.

రాజకీయ ప్రభావం[మార్చు]

మొదట్లో తటస్థ, రాజకీయేతర పార్టీ ఆధారిత వార్తాపత్రికగా ప్రారంభించి, తరువాత వేరే సంస్థలు స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఈ సంస్థ ఆధ్వర్యంలోని వార్తాపత్రిక ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, అతని రాజకీయ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి బద్ధ ప్రత్యర్థిగా మారింది.[9] చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వార్తలను ప్రచురించడంపై పత్రిక, దాని మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధా కృష్ణ తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2019 మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా ఈనాడు/ఈటీవీ, ఆంధ్రజ్యోతి/ఏబీఎన్ టీవీ వంటి వాటిని ఆయన ఎల్లో మీడియా (ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రంగు)గా అభివర్ణించారు.[10]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 బెందాళం, క్రిష్ణారావు, (2006). "మేటి పత్రికలు-ఆంధ్రజ్యోతి", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 412–413.{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
  2. 2.0 2.1 "ఆంధ్రజ్యోతి జాలస్థలి". Retrieved 2020-07-10.
  3. బెందాళం, క్రిష్ణారావు (2006). "మేటి పత్రికలు-ఆంధ్రజ్యోతి", వార్తలు ఎలా రాయాలి. ఋషి ప్రచురణలు. pp. 412–413.
  4. India Today (in ఇంగ్లీష్). Thomson Living Media India Limited. 1989. p. 48.
  5. Kandula, Ramesh (2021-01-25). Maverick Messiah: A Political Biography of N.T. Rama Rao (in ఇంగ్లీష్). Penguin Random House India Private Limited. ISBN 978-93-5305-223-2.
  6. "Andhra Jyothi to be re-launched in October - Exchange4media". Indian Advertising Media & Marketing News – exchange4media (in ఇంగ్లీష్). Retrieved 2023-08-05.
  7. "About: Inaganti Venkata Rao". dbpedia.org. Retrieved 2023-08-05.
  8. "Indian Readership Survey Q2,2019" (PDF). 2019-08-14. Archived from the original (PDF) on 2019-08-17.
  9. "Telugu media outlet carries fake survey on AP polls, Lokniti-CSDS calls them out" (in ఇంగ్లీష్). The News Minute. 2019-04-01. Retrieved 2021-03-10.
  10. "In Jagan's Andhra Pradesh, Media and Journalists In Line of Fire". The Wire. Retrieved 2023-08-06.

బాహ్య లంకెలు[మార్చు]