2015 గోదావరి పుష్కరాలు

వికీపీడియా నుండి
(ఆంధ్రప్రదేశ్ గోదావరి పుష్కరాలు 2015 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

2015 సంవత్సరంలో గోదావరి పుష్కరాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేసి జరిపించాయి.[1] ఈ పుష్కరాలు గోదావరి నది తీరాన వివిధ ప్రాంతాలలో జరిగాయి.[2] తెలంగాణ ప్రభుత్వం ఈ పుష్కరాల నిర్వాహణకు 2014-15 బడ్జెటులో 100 కోట్ల రూపాయలు కేటాయించింది. గోదావరినది మహారాష్ట్ర నాసిక్లో పుట్టి సుమారు 1665 మైళ్ళకు పైబడి ప్రవహించి చివరకు తూర్పున బంగాళాఖాతంలో సాగర సంగమమవుతుంది. ఈ నది గో కళేబరమును ఆవరించి ప్రవహించినది కావున "గోదావరి" అని పేరు వచ్చింది. బృహస్పతి ప్రతిరాశిలోను ప్రవేశించు ఒక్కో సంవత్సర సమయాన్ని ఒక్కొక్క నదికి ఇలా పుష్కర సమయాన్ని బ్రహ్మ నిర్దేశిస్తాడు. బృహస్పతి ప్రవేశించిన రాశి కర్కాటక రాశి.

పుష్కర ప్రదేశాలు, తేదీలు, ఇతర విశేషాలు[మార్చు]

పుష్కరాలు గోదావరి నదీ తీరం పొడవునా జరుగుతాఅయి. ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రాచలము, రాజమహేంద్రవరం, నరసాపురం మొదలైనవి ఉన్నాయి. ఆది పుష్కరాలు 2015 జూలై 14 న మొదలై 2015 జూలై 25 వరకు 12 రోజుల పాటు జరుగుతాయి. ఈ పుష్కర సమయములో దాన ధర్మములు, పితృకార్యక్రమములు చేయవలయును. పుష్కర సమయములో చేయవలసిన దానములు:

తేది దైవం పేరు దానములు/పూజలు
జూలై 14 నారాయణ ధాన్యము, రజితము, సువర్ణము
జూలై 15 భాస్కర వస్త్రము, లవణము, గోవు, రత్నము.
జూలై 16 మహాలక్ష్మి బెల్లము, కూరలు, వాహనము
జూలై 17 గణపతి నేయి, నువ్వులు, తేనె, పాలు, వెన్న
జూలై 18 శ్రీకృష్ణ ధాన్యము, బండి,గేదె, ఎద్దు, నాగలి
జూలై 19 సరస్వతి కస్తూరి, గంధపుచెక్క, కర్పూరము.
జూలై 20 పార్వతి గృహము, ఆసనము, శయ్య.
జూలై 21 పరమేశ్వరుడు కందమూలములు, అల్లము, పుష్పమూలము
జూలై 22 అనంత కన్య,పఱుపు,చాప
జూలై 23 నరసింహ దుర్గ, లక్ష్మి, దేవి పూజ, సాలగ్రామం
జూలై 24 వామన కంబళి, సరస్వతి, యజ్నోపవీతము, వస్త్రము, తాంబూలము
జూలై 25 శ్రీరామ దశ,షోడశ మహాదానములు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015 గోదావరి పుష్కరాలు[మార్చు]

భద్రాచలం వద్ద భక్తులు
రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద భక్తులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015 గోదావరి పుష్కరాలను 2015 జూలై 14 నుండి 2015 జూలై 25 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పుష్కరాల లోగోను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు విడుదల చేసారు.[3] ఈ పుష్కరాల కోసం భక్తకోటి వేయికళ్లతో నిరీక్షించింది. ఈ వేడుకల్లో భక్తులకు ఆనందం కలిగేలా.. పుష్కర ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధమౌతున్నాయి. రాజమహేంద్రవరానికి తరలివచ్చే యాత్రికులకు ఈ ప్రాంత చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా... రంగస్థల, సినీ ప్రముఖుల, ఆధ్యాత్మిక ఉపాసకులతో ఏర్పాట్లు చేస్తున్నారు.[4][5] ఈ పుష్కరాల కొరకు 100 కోట్లు ధనాన్ని ప్రభుత్వం విడుదలచేసింది.[6]

భారీగా ప్రజలు తరలివచ్చే పట్టణాలు, ప్రాంతాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ముఖ్య ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించి పుష్కరాల కొరకు వాటిని అభివృద్ధి పరుస్తున్నది వాటిలో కొన్ని

ఏ గ్రేడుగా విడగొట్టబడిన పుష్కర రేవులు[మార్చు]

బి గ్రేడుగా విడగొట్టబడిన పుష్కర రేవులు[మార్చు]

సి గ్రేడుగా విడగొట్టబడిన పుష్కర రేవులు[మార్చు]

సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన[మార్చు]

పన్నెండేళ్ళ కోసారి వచ్చే గోదావరి పుష్కరాలు.. ఇవి భారతీయుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలుస్తాయి. దేశం నలుమూలల నుంచి తూర్పుతీరం రాజమండ్రి నగరానికి పుణ్యస్నానాల కోసం తరలివచ్చే భక్తులకు సకలసౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే భక్తిభావాన్ని చూపేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది.

కళాకారులు, సినీ ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తల సహకారం[మార్చు]

ఇందుకోసం ఆయా రంగాలలో నిష్ణాతులు, ప్రముఖులతో అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయి కళాకారుల, సినీప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తల సహకారాన్ని, భాగస్వామ్యాన్ని కోరుతున్నారు.

మే 22-28 వరకు నందినాటకోత్సవాలు[మార్చు]

మే 22నుంచి 28వరకు రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో నంది నాటకోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సారి కూడా సినీ దర్శకుల సారథ్యంలో థీమ్‌సాంగ్‌ రూపొందిచనున్నారు. సంగీత విభావరిలకు సంబంధించి యువ గాయకులకు అవకాశం ఇవ్వనున్నారు. ఈ పుష్కరాలల్లో బుల్లితెర కళాకారుల సహకారాన్ని తీసుకోవాలని ఫ్లాన్ చేస్తున్నారు.. మరోవైపు స్టేజ్‌ షోలు, రియాలిటీ షోలలో సెలబ్రెటీలుగా తమకంటూ గుర్తింపును తెచ్చుకున్న వారితో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

పలు కళారూపాలకు స్థానం[మార్చు]

హిందుస్తానీ, కర్ణాటక సంగీత మహానుభావులను గోదావరి తీరానికి పరిచయం చేయాలని నిర్ణయించారు. పుష్కరాలకు ఉత్తరాది నుంచి వచ్చే భక్తులను సంగీత కచేరీలు అలరిస్తాయని అంటున్నారు. వీరితో పాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని, వారికి ఆర్థికంగా చేయూత నివ్వాలని భావిస్తున్నారు. కోలాటం, గంగిరెద్దులు, చెడితాలింఖానా, ఇంద్రజాలం, హిప్నాటిజం, కూచిపూడి, నృత్యకళారూపం, ఆదివాసీల రేలపాటలు, కొమ్ము నృత్యాలు, విశాఖ మన్యం థింసా నృత్యం, ఉత్తరాంధ్ర తప్పెటగుళ్ళు వంటి కళారూపాలకు పుష్కరాలలో చోటు కల్పించాలని నిర్ణయించారు.

తెలుగు ఖ్యాతి తెలిసేలా ఏర్పాట్లు[మార్చు]

వీటితో పాటు ఆధ్యాత్మిక వేత్తల, ఉపాసకుల ప్రవచనాలను భక్త కోటికి ముక్తిమార్గం చూపేలా, అలౌకిక ఆనందాన్ని కల్గించే వేదికలకు రూపకల్పన చేస్తున్నారు. మొత్తంగా చారిత్రక నగర వైభవాన్ని తెలుగువారి ఖ్యాతిని యావత్ భారతావనికే ఘనంగా చాటిచెప్పేలా గోదావరి పుష్కరాల మహత్తర ఘట్టం ఇందుకు వేదికగా నిలవనుంది.

గోదావరి నిత్య హారతి[మార్చు]

గోదావరి నదికి ప్రతి పౌర్ణమికీ ఇస్తున్న హారతి కార్యక్రమాన్ని ఈ పుష్కరాల సందర్భంగా నిత్య హారతిగా మార్చారు. కాశీ, హరద్వారాల్లో గంగానదికి ఇస్తున్న హారతి తరహాలోనే ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. నదిలో ఏర్పాటు చేసిన పంటుపై హారతి కార్యక్రమాన్ని రోజూ నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో 2015 గోదావరి పుష్కరాలు[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో 2015 గోదావరి పుష్కరాలను 2015 జూలై 14 నుండి 2015 జూలై 25 వరకు నిర్వహించారు.[7] నూతనంగా యేర్పడిన రాష్ట్రం అయినందున ఈ పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.[8] ఈ నేపథ్యంలో వరంగల్‌ జిల్లాలో మేడారం జాతర తరహాలో సకల ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని గోదావరి పుష్కరాలకు నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాలలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.[9] ఈ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాలున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.[10] రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తొలిసారిగా వస్తున్న గోదావరి పుష్కరాలను 500 కోట్ల రూపాయలతో వైభవంగా, కుంభమేళాను తలపించే విధంగా నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మొత్తం ఐదు జిల్లాల పరిధిలోని 27 స్నానాల ఘాట్లను 80 కి పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రకటిచింది. గోదావరి పుష్కరాలకు సుమారు మూడు కోట్లమంది దాకా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.[11]

పుష్కరఘాట్లు[మార్చు]

జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతాలైన ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పుష్కరఘాట్‌లపై కసరత్తు మొదలుపెట్టారు. సర్వే నిర్వహించిన అధికారులు నాలుగు ప్రాంతాల్లో 13 కోట్ల 56 లక్షల అంచనాలతో 410 మీటర్ల పొడవున స్నానఘట్టాలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.[12]

సౌకర్యాలు[మార్చు]

2003లో 12 రోజుల పాటు జరిగిన గోదావరి పుష్కరాల్లో సుమారు 10 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారుల అంచనా. అప్పటి ప్రభుత్వం అరకొర సౌకర్యాలతోనే పుష్కరాలు నిర్వహించాయని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరోపించింది. తాము గోదావరి పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తామని చెప్పడమే గాకుండా బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జూన్‌లోగా పనులను పూర్తి చేస్తామని అధికారులంటున్నారు. జూలైలో గోదావరి పుష్కరాలు వస్తున్న నేపథ్యంలో గోదావరి వరద ఉధృతంగా ఉన్నా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్నాన ఘట్టాలపై బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ నిర్మిస్తున్నారు.

గోదావరి పరివాహక ప్రాంత పుణ్యక్షేత్రాలు[మార్చు]

ఐనవిల్లి[మార్చు]

శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం (శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం) - ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి. మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ పూజలు జరిపాడని చెబుతారు. స్వయంభువ వినాయకక్షేత్రాలలో ఇది మొదటిదని విశ్వసించబడుతుంది. ఇది కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. మరొక కథనం అనుసరించి వ్యాసమహర్షి దక్షిణ భారత దేశ యాత్ర ప్రారంభసమయంలో ఇక్కడ పార్వతి తనయుడైన వినాయకుని ప్రతిష్ఠించాడని ఈ వినాయకుడే భక్తుల కోరికలు తీర్చే సిద్ధి వినాయకుడు అయ్యాడని చెబుతారు.

అప్పనపల్లి[మార్చు]

అప్పనపల్లి భాలాజీ దేవాలయము.

శ్రీ బాల బాలాజీ దేవస్థానం - ప్రధాన దేవస్థానమునకు కొంచెం దూరములో పురాతన దేవాలయము ఉంది. అప్పన ముని తపస్సు చేసినదిక్కడేనని అంటారు. ఇక్కడ కళ్యాణ కట్ట ఉంది. గోదావరిలో స్నానం చేసి పాత దేవస్థానములో దేవుని దర్శించిన పిదప కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయానికి వెళ్ళి బాలాజీ దర్శనము చేసుకొనుట పరిపాటి.

కోరుకొండ[మార్చు]

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం - 120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం చేరుకొవడానికి 615 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు చాలా ఆశ్చర్యంగా కొండకు చేర్చడంవల్ల ఈ గ్రామానికి కోరుకొండ అని పేరు వచ్చింది అంటారు. మరొక కథనం కొండపై కోరుకొన్న కోరికలు తీరుతాయని నమ్మకంతో కోరుకొండగా పిలుస్తారు. ఆలయం యొక్క శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది.

కోటిపల్లి[మార్చు]

సోమేశ్వరస్వామి దేవస్థానం

శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం - ఈ పవిత్ర గౌతమీ తీర్థం లోని పుణ్య స్నానం సర్వపాపాలను తొలగించి పుణ్యాన్ని ఇస్తుంది. శివకేశవ భేదం లేదని ఈ క్షేత్రం మనకు పున: పున: చెబుతుంది. కోటీశ్వర లింగం యోగ లింగం అని, సోమేశ్వర లింగం భోగ లింగం అని, రాజరాజేశ్వరమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లి అని భక్తుల నమ్మిక.

మందపల్లి[మార్చు]

శ్రీ మందేశ్వరాలయం స్వామి (శనీశ్వరాలయం) ఆలయం - ఇక్కడకు దగ్గరలో ధండిచి మహర్షి ఆశ్రమం ఉండేది.పురాణాల ప్రకారం ధండిచి మహారిషి తన వెన్నుముకను ఇంద్రుడుకి వజ్రాయుధంగా అసురలను చంపడానికి ఇక్కడే దానం ఇస్తాడు.

మురమళ్ళ[మార్చు]

శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయము - ఐ.పోలవరం మండలానికి చెందిన మురమళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం జిల్లాలోని ఒక చారిత్రక ప్రదేశం.

అన్నవరం[మార్చు]

అన్నవరం ప్రధాన దేవాలయ దృశ్యం.

రత్నగిరి కొండల పై శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి ప్రధాన దైవం. అన్నవరంలో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి కూడా ఈ రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. కొండ క్రింద గ్రామ దేవత గుడి ఉంది.

బిక్కవోలు[మార్చు]

బిక్కవోలు వద్ద పొలాలలో ఉన్న పురాతన శివాలయం

పురాతనమైన, చారిత్రికమైన జైన శివ ఆలయాలకు, వాటిలోని శిల్పకళా సంపదకు బిక్కవోలును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును.

శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం[మార్చు]

శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయ గోపురం

వానపల్లి[మార్చు]

ఈ గ్రామంలో ప్రసిద్ధ పళ్ళాలమ్మ అమ్మవారి ఆలయము ఉంది. ఈ గ్రామం కొత్తపేట - అయినవిల్లి రహదారిలో ఉంది.

అంతర్వేది[మార్చు]

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మందిర విమాన భాగం

కృత యుగము లోని మాట ఒకసారి నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయంలో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.

ద్రాక్షారామం[మార్చు]

భీమేశ్వరస్వామి దేవాలయం

ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని సా.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది.

ర్యాలీ[మార్చు]

జగన్మోహినీ - చెన్న కేశవస్వామి ఆలయం ఉంది. ఈ గుడిని ఘంటచోళ మహారాజు కట్టించాడని చెబుతారు. ఇక్కడ మూల విరాట్టు ముందు భాగం చెన్నకేశవస్వామి, శంఖం, చక్రం, గద, పద్మం ధరించిన నాలుగు చేతులున్నాయి. వెనుకవైపు జగన్మోహినీ రూపం ఉంది. అచ్చంగా జగన్మోహినివలె కళ్ళు చెదరే అందంతో జీవకళ ఉట్టిపడుతుంటుంది. అమే సిగ, ఆభరణాలు కాక తొడవైపు వెనుక భాగాన పుట్టుమచ్చతో కూడా సహజంగా అలరారుతుంటుంది. స్వామి పాదాలచెంత నిత్యం జలం ఉరుతుంది. తీసిన కొద్దీ నీరు వస్తుంటుంది.

జి.మామిడాడ[మార్చు]

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం - గొల్లల మామిడాడ, పెదపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లాలో తుల్యభాగ (అంతర్వాహిని) నది ఒడ్డున గత వంద సంవత్సరాలుగా బాగా తెలిసిన పుణ్యక్షేత్రంగా ఉంది.

సర్పవరం[మార్చు]

భావనారాయణ ఆలయగోపురం

భావనారాయణ ఆలయం - పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన పాతాళభైరవాలయం ఇక్కడ ఉంది. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది. నారదుడు ముందుగా స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను . ఆ తరువాత స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్న కొలను నేటికీ ఇక్కడ పక్కపక్కనే దర్శనమిస్తాయి.విశాలమైన ప్రాంగణం .శిల్ప కళా శోభితమైన గాలి గోపురం ఆహ్లాదాన్ని .ఆనందాన్ని . ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ క్షేత్ర మహిమ గురించి శ్రీ నాథుడు తన కావ్యాల్లో ప్రస్తావించాడు. 'వైశాఖ శుద్ధ ఏకాదశి' రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరపబడుతుంది. శేష . గజ . అశ్వ వాహనాలపై ఊరేగే లక్ష్మీ నారాయణులను చూడటానికి భక్తులు ఈ ఉత్సవంలో విశేష సంఖ్యలో పాల్గొంటారు.

కోరుకొండ[మార్చు]

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం - 120 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం చేరుకొవడానికి 615 మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు చాలా ఆశ్చర్యంగా కొండకు చేర్చడంవల్ల ఈ గ్రామానికి కోరుకొండ అని పేరు వచ్చింది అంటారు. మరొక కథనం కొండపై కోరుకొన్న కోరికలు తీరుతాయని నమ్మకంతో కోరుకొండగా పిలుస్తారు. ఆలయం యొక్క శిల్పకళా సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది.

పలివెల[మార్చు]

శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామి - ఇక్కడి శివలింగ ప్రతిష్థ అగస్త్య మహర్షి ద్వారా జరిగింది అని ప్రతీతి. ఈ దేవాలయములోని కళ్యాణ మండపాన్ని11 వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు జీర్ణోద్ధారణ చేశాడని చెబుతారు. ఈ ఆలయ కళ్యణ మండపములో వేదిని అల్లాదరెడ్డి సా.శ. 1416లో కట్టించి ఈ మండపమునకు కొత్త రూపాన్ని ఇచ్చినట్లు ఈ మండపములోనే శాసనము ఉంది. అగస్త్యమహర్షి శివ పార్వతుల కళ్యాణం చూడవలెనని కొరికతో కౌశిక నది ఒడ్డున శివలింగ ప్రతిష్థ చేశాడు. దక్ష యజ్ఞానికి పూర్వం ఇంద్రాది దేవతలు, హిమవంతుడు అగస్త్య మహర్షి పార్వతి కళ్యాణానికి వస్తే ప్రళయం వస్తుంది అని భావించి విశ్వంభరుడుని అగస్త్య మహర్షి వద్దకు పంపుతారు. అగస్త్య మహర్షి తన దివ్యదృష్టితో శివ పార్వతుల కళ్యాణం వీక్షించగా శివ పార్వతులు మధుపర్కాలలో కనిపిస్తారు. అగస్త్య మహర్షి శివుని ప్రార్థిచగా శివుడు ప్రత్యక్షమై వరాన్ని కొరుకోమనగా అగస్త్య మహర్షి శివపార్వతులను ఒకే పీఠంపై అనుగ్రహించమని కోరుతాడు. ఇదే ఇక్కడ విశేషం. వేరే ఎక్కడ శివ పార్వతులు ఒకే పీఠం మీద కనపడరు. మొదట ఈ క్షేత్రంలో శివుడు లోల అగస్త్య లింగేశ్వరునిగా తరువాత కొప్పులింగేశ్వర స్వామిగా పూజలందుకొంటున్నాడు.

పిఠాపురం[మార్చు]

కుక్కుటేశ్వర దేవాలయం - పురుహూతికా దేవి ఆలయం కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషనుకు ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు.

పెద్దాపురం[మార్చు]

  • మరిడమ్మ తల్లి దేవాలయం
  • పాండవుల మెట్ట
  • సూర్యనారాయణ స్వామి దేవాలయం
  • పాండవుల మెట్ట దగ్గరున్న పాండవ గుహలు
  • శివుడు, వెంకటేశ్వర దేవాలయాలు
  • భువనేశ్వరి పీఠము
  • హజరత్ షేక్ మదీనా పాఛ్ఛా ఔలియా వారి దర్గా

సామర్లకోట[మార్చు]

దర్శనీయ స్థలాలు:-

  • శ్రీ కుమరారామ మందిరం (శ్రీ భీమేశ్వరాలయం)
  • శ్రీ మాండవ నారాయణస్వామి ఆలయం
  • శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం
  • శ్రీ మాండవ్య నారాయణస్వామి వారి దివ్యక్షేత్రము

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "గోదావరి పుష్కరాల వెబ్ సైటు". Archived from the original on 2016-05-20. Retrieved 2015-05-30.
  2. "Banks of Godavari River". Archived from the original on 2015-05-30. Retrieved 2015-05-30.
  3. Chandrababu Naidu releases logo, to invite PM-హిందూ ఆర్టికల్
  4. "రాజమండ్రి లో గోదావరి పుష్కరాలు". Archived from the original on 2015-05-22. Retrieved 2015-05-30.
  5. Preparations begin for Godavari Pushkaralu
  6. Rs 100 crore allocated for Godavari Pushkaralu 2015: Andhra Pradesh CM Naidu
  7. "Telangana Godavari Pushkaralu 2015 Dates". Archived from the original on 2015-06-11. Retrieved 2015-05-30.
  8. "Telangana Godavari Pushkaralu 2015". Archived from the original on 2015-06-01. Retrieved 2015-05-30.
  9. "CM KCR about Godavari Pushkaram". Archived from the original on 2015-06-12. Retrieved 2015-05-30.
  10. Telangana plans ‘Godavari Pushkaralu’ on the lines of Kumbh Mela
  11. "ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలు." Archived from the original on 2015-01-01. Retrieved 2015-05-30.
  12. Bathing ghats all along Godavari river for Pushkaralu