ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగం, ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. గోదావరి, కృష్ణా జీవనదులు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. వరి, చెరకు, ప్రత్తి, మిరపకాయలు, మామిడి, పొగాకు ఇక్కడి ప్రధాన పంటలు. ఇటీవలి కాలంలో వంటనూనెలకు వాడే పొద్దుతిరుగుడు పువ్వు, వేరుశెనగల పంటల సాగు బాగా పెరిగింది. గోదావరి మరియు ఇతర నదుల పరివాహక ప్రాంతంలో బహుళార్థక సాధన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. సుప్రసిద్ధ నాగార్జున సాగర్ డ్యాం కూడా ఇక్కడే ఉంది.
ఇటీవలి కాలంలో, సమాచార సాంకేతిక రంగం, జీవసాంకేతిక రంగాలపైన రాష్ట్రం దృష్టి పెడుతోంది. ఆంధ్రప్రదేశ్, ఐ.టి ఎగుమతుల్లో మహారాష్ట్ర, కొత్త ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల తర్వాత 7వ స్థానంలో ఉన్నది. ఖనిజసంపదలో దేశంలో రెండవ స్థానంలో ఉన్నది. దేశంలోని సున్నపురాయి నిల్వల్లో మూడవ వంతు అంటే సుమారు 30 బిలియన్ టన్నులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి.
సుమారు 11% వాటాతో, జలవిద్యుదుత్పత్తిలో దేశంలో మొదటిస్థానంలో ఉన్నది. కృష్ణా-గోదావరి హరివాణంలోని 60 ట్రిలియన ఘనపు అడుగుల సహజవాయునిల్వ భారతదేశపు అవసరాలను 1/3 వరకూ తీర్చగలవు. గత దశాబ్దాలలో రాష్ట్రపు ఆదాయం ఈ క్రింది విధంగా ఉన్నాయి.
| సంవత్సరం | రాష్ట్ర ఆదాయం (Rs. MM) | డాలర్లలో ($ Billion) | వృద్ధి |
|---|---|---|---|
| 1980 | 81,910 | $10.2 | - |
| 1985 | 152,660 | $15.2 | 50% |
| 1990 | 333,360 | $25.64 | 67% |
| 1995 | 798,540 | $124.2 | -4% |
| 2000 | 1,401,190 | $33.2 | 37.5% |
| 2007 | 2,294,610 | $48.2 | 45.5%(7 yr) |
