ఆంధ్రప్రదేశ్ విశిష్ట దేవాలయాలు

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ విశిష్ట దేవాలయాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

(పెద్దపాడు) వీరలక్షీచెన్నకేశవస్వామి ఆలయము {జనమేజయప్రతిస్ఠిత} ఈఆలయము చాలా పురాతనమైనది ||శ్లో|| సుందరాయశుభాంగాయ మంగళాయమహోదధేః ! పెద్దపాడునివాసాయ సార్వభౌమాయమంగళం!! అని కొలిచేవారికి కొంగుబంగారంగా స్వామి వెలుగొందుచున్నారు, ఈఆలయంలో ప్రతి శనివారము ఉదయం 6.00గంటలకు విశేషఅభిషేకములు ప్రతిసంవత్సరం వైశాఖశుద్ధ త్రయోదశీరోజు భూధేవీ శ్రీదేవీసమేత చెన్నకేశవస్వామి వారికి అంగరంగవైభవంగా కళ్యాణం విశేషసేవలు జరుగును, పర్వదినములలో పల్లకిసేవలు జరుగును, ఈఆలయమునకు అనుబంధముగా శివాలయము, హనుమదాలయముు, నవగ్రహములుు, పార్వతీమాతత, బాలసుబ్రహ్మణ్యస్వామి, స్వయంగావెలసినన పురాతన బాలవినాయకుడు కలరు, షష్ఠిపూజలుు, సంకష్టహరచతుర్థిి, దేవీనవరాత్రులుు, వసంతనవరాత్రులుు, గణపతిణవరాత్రులు, హనుమాన్ సేవలు, విశేషహోమాలు, విశేషంగాజరుగును.

ఈరన్న ఆలయం, కర్నూలు జిల్లా[మార్చు]

హిందు మతంలో శైవ సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయం వేరు వేరు. వారి ఆలయాలు కూడా వేరు వేరుగా ఉంటాయి. కాని వైష్ణవ దేవుడైన నరసింహ స్వామికి శైవుల ఆచారం ప్రకారం పూజలు జరిగే ఆలయం కర్నూలు జిల్లాలో ఉంది. అదే ఈరన్న ఆలయం: ఎమ్మిగనూరు నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఇరవై ఏళ్ళ క్రితం వరకు సాదా సీదాగా ఉండిన ఈ గుడి శర వేగంగా అభివృద్ధి చెందొతోంది. ప్రస్తుతం ఈ గుడి వార్షికాదాయం ఐదు కోట్ల రూపాయల పై మాటే. ప్రతి ఏడు శ్రావణ మాసంలో ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగు తాయి. ఆ సందర్భంలో మన రాష్ట్రం నుండే గాక, మహారాష్ట్ర, తమిళ నాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు. ఈ నెలలో సుమారు పది లక్షలకు పైగా భక్తులు ఈ స్వామి వారిని దర్శించు కుంటారని ఒక అంచనా. దేవాదాయ శాఖ నిర్మించిన వసతి గదులు, భక్తుల విరాళాలతో ఏర్పాటు చేసిన నిత్య అన్న దాన పథకం, తుంగ భద్ర దిగుగ కాలువ వద్ద ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలు ఉన్నందున ఇక్కడ సకల సౌకర్యాలు ఉన్నాయి. (మూలం ఈనాడు ఆదివారం 2011 ఆగస్టు 14)

రూ‍పాల సంగమేశ్వరం, కర్నూలు[మార్చు]

క్రీస్తు శకం ఆరు నుండి తొమ్మిదవశతాబ్దం మధ్య కాలంలో బాదామి చాళుక్యులు తుంగభద్రా నది ఒడ్డున అలంపురం ఆలయ సముదాయాన్ని నిర్మించారు. ప్రస్తుతం బాదామి కర్ణాటక లోని చాగల్ కోట జిల్లాలో ఉంది. నిర్మాణాల కవసరమైన రాళ్ళను ఎడ్ల బండ్లపై తరలించే వారు. ఆ బళ్లు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగి పోయేది. మళ్లీ కొత్తగా వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారీకి ఒక గ్రామం వెలసింది. అదే కందెన వోలు. కాలానుగుణంగా దాని పేరు కర్నూలుగా మారింది.

చారిత్రిక ప్రాశస్త్యం

దక్షిణా పథంలో శాతవాహనుల తర్వాత వర్థిల్లిన మొదటిరాజ్యం బాదామి చాళుక్యులది. ఈ వంశం నుండే అనేక చాళుక్య రాజ్యాలు ఏర్పడినాయి. కర్ణాటకలో కళ్యాణి, ఆంధ్రప్రదేశ్ లో వేంగి, వేములవాడ, ఎలమంచిలి, ముదిగొండ మొదలగునవి. బాదామి చాళుక్యుల కాలం నాటికి బౌద్ధ, జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నాయి. వీరు మాత్రం వైదిక మతాన్ని అవలంబించారు. వీరి తొలి రాజధాని ఐహోలోను. తరువాతి కాలం నాటి రాజధాని బాదామిలో ఎన్నో ఆలయాలు, గుహాలయాలను నిర్మించారు. వీటిలో కొన్ని బౌద్ద, జైన ధర్మాలకు సంబంధించినవి ఉన్నాయి. వీరు కృష్ణానది ఉపనది మలప్రభానది ఉత్తర వాహినిగా ఉన్న పట్టాడకల్ లో పట్టాభిషేకాలు జరుపుకునే వారు, అక్కడ పాపనాథ, గులగనాథ, సంగమేశ్వర మొదలైన ఆలయాలను నిర్మించారు. వీరికి పల్లవులతో నిరంతర యుద్ధాలు జరిగేవి. విజయానికి గుర్తుగా వారి రాజధాని కంచి లోని కైలాసనాథ అలయాన్ని పోలిన ఆలయాన్ని చాళుక్య రాజులు పట్టాడకల్లో నిర్మించారు. వీరి రాజ్యంలో మలప్రభ - కృష్ణతో సంగమించే 'కూడలి' లో సంగమేశ్వరాలయం నిర్మించారు. ఇక్కడే కొన్ని శతాబ్దాల తర్వాత తొలి కన్నడ కవి, సంస్కర్త, వీర శైవ మత స్థాపకుడు, బసవన్న సమాధి అయ్యాడు. రాజ్య విస్తరణలో భాగంగా చాళుక్యులు మొలక సీమ లేక ఏరువసీమ లేక రెండేరుల నడిమి సీమగా పిలవబడే రస్తుత మాహబూబ్ నగర్ - కర్నూలు జిల్లాలలోని భూభాగాన్ని తమ ఏలుబడి కిందకు తెచ్చుకున్నారు. ఈ సీమలో తుంగభద్రానది కృష్ణతో కలిసే కూడలి లేక కూడవల్లిలో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాలను నమూనాగా తీసుకుని, శిలాలకు మరింత కొత్త సొబగులను రంగరించి నిర్మించారు. పదడుగుల ఎత్తైన వేదిక పై చుట్టూ ఏనుగు తలలతో ఢిల్లీ లోని అక్షరధామ్ ఆలయానికి ఇది ప్రేరణా అన్నట్లు నిర్మించారు. వేదికపైన ఆలయ ద్వారం ప్రక్కగా శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు, గంగ, యమున, అర్థనారీశ్వర, హరిహర, గజలక్ష్మి, అష్ట దిక్పాలకుల విగ్రహాలే కాక, ఎన్నో లతలను, హంసలను చెక్కారు. మొసలి పట్టుకున్న ఓ మనిషి ముఖంలో మూడు వైపుల నుంచి చూస్తే మూడు వివిధ దశలైన బాల్య, యౌవన, వృద్ధాప్య దశలు కనిపించేలా చెక్కిన శిలం అశ్చ్యరాన్ని గొల్పుతుంది.

కూడలి సంగమేశ్వరాలయ నిర్మాణానంతరం చాళుక్యులు ఇక్కడ మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నారు. కాని వరద సమయాల్లో ఆలయంలోనికి ఒండ్రు మట్టి చేరుతున్నందున మరో ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలని అన్వేషించగా, అలంపురం అనువుగా కనిపించింది. తుంగభద్రానది ఉత్తర వాహిని కావడం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ క్షేత్రం ఉండటం వల్ల, జమదగ్ని ఆశ్రమం ఉండటం వల్ల ఇక్కడ నవ గ్రహాల ఆలయాల సముదాయాన్ని నిర్మించారు. అవి పట్టాడకల్ లోని గలగనాథ, పాపనాథ, ఆలయాలను పోలి ఉంటాయి. కాలక్రమాన చాళుక్యుల ప్రాభవం తగ్గసాగింది. రాష్ట్రకూటుల ప్రాభవం పెరిగింది. వీరు పల్లవులతో సంబంధ, బాంధవ్యాలు నెరపి చాళుక్యులను జయించారు. ఆ విజయానికి గుర్తుగా ఎల్లోరాలో కొండను తొలిచి కైలాసనాథ ఆలయాన్ని నిర్మించారు. ఇక మొలక సీమ వైపు చూస్తే 'నివృత్తి సంగమం' కనిపిస్తుంది. అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని' నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలమది. ఈ నది కృష్ణలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నదీ సంగమమని సప్తనదీ సంగమేశ్వరమనీ వ్వవహరిస్తారు. ప్రజల పాపా ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనుల పాప ప్రక్షాళన చేసిన గంగా దేవికి కాకి రూపం రాగా, ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం. ఆరణ్య వాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి, లింగాల కోసం భీముడిని కాశికి పంపగా, సమయానికి తిరిగి రానందున వేప మొద్దును శివలింగంగా ప్రతిష్ఠించాడని ఒక కథ ప్రచారంలో ఉంది. కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలుండగా ఇక్కడ మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేర్లతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని, ఇవన్నీ భీముడు తెచ్చిన లింగాలపై వెలిశాయని మరొక కథనం.

నివృత్తి సంగమేశ్వరంలో రాష్ట్ర కూటులు నిర్మించిన ఆలయాలకు రూపాల సంగమేశ్వరమని పేరు. వారు తమ నిర్మాణాల్లో చాళుక్యుల మౌలికాంశాలను, తమ బాంధవ్యాల వల్ల పల్లవుల అలంకారాన్ని జోడించారు. సంగమేశ్వరాలయం, దాని ప్రక్కన భుజంగేశ్వరాలయాలు మహాబలిపురంలో రాతి రథాలను పోలి ఉండేవి. ఆలయం వెలుపల నటరాజ మూర్తులు, పైకప్పులో ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలు ఉన్నాయి. అంతేకాక ఒకే రాతిపై గంగ, యమున, పార్వతుల మూర్తులను మలిచారు. తర్వాతి కాలంలోని కళ్యాణి చాళుక్యులు అలంపురం సమీపంలో పాపనాశని ఆలయాల పేరుతో ఆలయ సముదాయాన్ని నిర్మించారు.

శ్రీశైల జలాశయం నిర్మించాక ఈ సంగమేశ్వర, అలంపుర ఆలయాలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాగా..... పురావస్తు శాఖవారు సంగమేశ్వరాలయాలను విడదీసి వేర్వేరు ప్రాంతాలలో పునర్నిర్మించారు. కూడలి సంగమేశ్వరాలయాన్ని, పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్లే దారిలోనే పున: ప్రతిష్ఠించారు. అలంపురం నవ గ్రహాలయాలకు అడ్డుగా ఓ పెద్ద గోడను నిర్మించారు. రూపాల సంగమేశ్వరాలయాన్ని కర్నూలు సమీపంలోని జగన్నాధ గట్టు పై కట్టారు. కాని ఈ జోడు రథాల్లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వరాలయాన్ని నంది కొట్కూరు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద నిర్మించారు. త్రివేణి సంగమ శిల్పం మాతం హైదరాబాదు లోని పురావస్తు శాఖ వారి ప్రదర్శన శాలలో ఉంది. ఇది పబ్లిక్ గార్డెన్స్ లో ఉంది. నివృత్తి సంగమేశ్వరాలయం అలాగే నీటిలోనే మునిగి ఉంది. ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయం లోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయట పడుతుంది. అలా బయట పడే నాలుగు నెలలు అనగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ఈ ఆలయాలన్నీ చూడాలంటే కర్నూలు కేంద్రం చేసుకొని చూడొచ్చు. అదే అనుకూలం. (మూలం: సాక్షి ఆదివారం: 2011 ఏప్రిల్ 17)

యాగంటి క్షేత్రం... విగ్రహ రూపంలో శివ పార్వతులు[మార్చు]

యాగంటి దేవాలయ గోపురం
పౌరాణిక ప్రాశస్త్యం

పూర్వం అగస్త్య మహర్షి యాగంటి ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వరునికి ఆలయం నిర్మించాలనుకొని విగ్రహాన్ని రూపొందిస్తుండగా విగ్రహం కాలి బొటనవేలు గోరు విరిగి పోయిందట. అలా మొక్క పోయిన విగ్రహం స్థాపించ రాదు. అది పూజార్హం కాదు. ఎందుకిలా జరిగిందని శివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడట. మధ్యలో కాకుల వలన తన తపస్సు భంగం వాటిల్లగా ముని కోపించి, ఇక మీదట ఇక్కడ కాకులు ఉండ కూడదని శపించాడట. అప్పటి నుండి వింతగా ఇక్కడ కాకులు ఉండవు. ముని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షం అయి "ముని వర్యా వేంకటేశ్వరుని విగ్రహం గురించి బాధ పడకు. ఇక్కడ నేను లింగాకారంలో కాకుండా విగ్రహ రూపంలో ఉమా సమేతుడనై ఏక శిలపై వెలసి భక్తులను కటాక్షిస్తాను" అని చెప్పాడు. ఆ విధంగా ఇక్కడ ఉమా సమేతుడైన శివుడు ఏక శిలా విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు.

చారిత్రికం

ఆలయ ముఖ మండపంలో నందీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడు. పోతులూరి వీర బ్ర్హహ్మం గారు తన కాల జ్ఞానంలో " యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేశేనయా " అని చెప్పారు. నిజంగానే ఈ నంది పెరుగుతోంది. ఈ విషయాన్ని భారత పురావస్తు శాఖవారు కూడా నిర్థారించారు. శివ రాత్రి మహోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. అగస్త్య మహర్షి స్నానం చేసిన ఇక్కడున్న కోనేరును అగస్త్య పుష్కరిణి అంటారు. యాగంటి క్షేత్రంలో సహజ సిద్దంగా ఏర్పడిన గుహలున్నాయి. వీటిలో రోకళ్ల గుహ, వేంకటేశ్వర స్వామి గుహ, శంకర గుహ ముఖ్యమైనవి. రోకళ్ల గుహలో అగస్త్యుడు శివ లింగ ప్రతిష్ఠచేసి తపస్సు చేశాడట., అగస్త్యుడు వేంకటేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన గుహను వేంకటేశ్వర గుహగా పిలుస్తారు. శంకర గుహ వద్ద వీర బ్రహ్మం గారు తన శిష్యులకు జ్ఞానోపదేశం చేసి నట్లు చెపుతారు. ఇవి కాక ఇక్కడ ఇంకా అనేక గుహలు ఉన్నాయి.

ఎలా వెళ్లాలి?.

కర్నూలు నుండి 70 కిలోమీటర్లు దూరం... బనగాన పల్లి నుండి 15 కిలో మీటర్లు దూరం. ఈ క్షేత్రం నుండి మహానంది, అహో బిల క్షేత్రం సుమారు 70 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. యాగంటిలో అద్దె గదులు, అన్నదాన సత్రాలు ఉన్నాయి.

శ్రీకూర్మం , శ్రీకాకుళం జిల్లా[మార్చు]

శ్రీకూర్మం ఆలయంలో ఒక భాగం
శ్రీకూర్మం ఆలయ ప్రధాన గోపురం
ఈక్షేత్రం ఎక్కడ ఉన్నది?

శ్రీ కూర్మనాథ క్షేత్రం శ్రీకాకుళం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలోను, మండల కేంద్రమైన 'గార' నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. రవాణా సౌకర్యం బాగా ఉంది. శ్రీ కూర్మంలో తిరుమల- తిరుపతి దేవస్థానం వారి సత్రం ఉంది. శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఆరసవెల్లి ఇక్కడకు పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

పురాణేతిహాసం

"పూర్వం దేవ దానవులు అమృతం కొరకు క్షీర సాగరాన్ని మధించడానికి యత్నించి, మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. క్రింద ఆధారం లేనందున మందర పర్వతం నిలవలేదు. దాంతో దేవతలు శ్రీ మహా విష్ణువుని ప్రార్థించగా, విష్ణువు తాబేలు అవతారమెత్తి మందర పర్వతానికి ఆధారంగా నిలిచాడు" అని కూర్మ పురాణం చెపుతున్నది. ఆ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీ కూర్మంలో ప్రతిష్ఠించాడని చెపుతారు. ఈ క్షేత్ర ప్రస్తావన పద్మ పురాణం లోను, బ్రహ్మాండ పురాణాం లోను కనిపిస్తుంది. అత్యంత సుందరమైన శిల్పసంపద కలిగిన ఈ క్షేత్రాన్ని శ్రీరాముని కుమారులు లవ కుశులు కూడా దర్శించారని పురాణ కథనం. ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో ఉంది. తూర్పు, దక్షిణ ద్వారాలపై చక్కని శిల్పాలు కను విందు చేస్తాయి. ఆస్థాన మండపంలోని నల్లరాతి స్థంభాల పై రామాయణ, మహాభారత ఇతిహాస ఘట్టాలు చెక్కి ఉన్నాయి. ఈ ఆలయ ఉపరిత భాగాన్ని గంధర్వులు నిర్మించారని, అందుకు దానిపేరు గంధర్వ విమానమని అంటారని ఒక కథనం. గాలి గోపురం ఎదురుగా సుధా కుండం ఉంది. దీనిని శ్వేత కుండం అని, శ్వేత పుష్కరిణి అని కూడా అంటారు.

ఆలయ విశిష్టత

ఏ ఆలయానికైనా ఒకే ధ్వజ స్థంభం ఉటుంది. కాని ఇక్కడ రెండు ధ్వజస్థంభాలుండడం విశేషం. అవి తూర్పు, పశ్చిమ దిశలలో ఉన్నాయి. ఆలయ మూల విరాట్ పశ్చిమాభిముఖంగా ఉంది. ఇక్కడ ఉత్తరాన భగవద్రామానుజులు, నైరృతిలో వేణుగోపాలస్వామి, వాయవ్యాన వైష్ణవి దుర్గ, లక్ష్మి సన్నిధి ఉంది. ఆలయ ప్రాంగణంలో సుమారు వందకు పైగా తాబేళ్లతో ఏర్పాటు చేసిన పార్కు కూడా ఉంది. జేష్ట బహుళ ద్వాదశి నాడు ఈ స్వామి వారి జయంతి. జయంతి నాడు ఉదయం 5 గంటలకు స్వామికి క్షీరాభిషేకం చేసి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. (మూలం ఈనాడు: ఆదివారం: 2011 జూన్ 26)

జగన్మోహినీ కేశవస్వామి ఆలయం...ర్యాలి[మార్చు]

శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు. జగన్మోహిని అవతార సమయం లోమహేశ్వరుడు జగన్మోహినిని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం క్రింద పడుతుంది. ఈ పుష్పం క్రిందపడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలి (ర్యాలి అంటే పడడం అని అర్థం) అని చెబుతారు .

జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం, ర్యాలి

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉంది ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. ఈ ప్రాంతాన్ని కోనసీమ అంటారు. నిండైన కొబ్బరి చెట్లకు కోనసీమ ప్రసిద్ధి. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. గోదావరి ఉపనదులు ఇక్కడ ప్రవహించ డంవల్ల ఈ ప్రాంతం సాక్షాత్తూ ‘అన్న పూర్ణ’. ర్యాలిలో జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడు. ఇది ఏక శిలా విగ్రహం. ఇటువంటి శిలను సాల గ్రామ శిల అంటారు. ఈ విగ్రహం పొడవు ఐదు అడుగులు. వెడల్పు మూడు అడుగులు. విగ్రహానికి ముందువైపు విష్ణుమూర్తి, వెనుకవైపు జగన్మోహిని. ఇటువంటి విచిత్ర మైన దేవాలయం మరెక్కడా లేదేమో? నల్లరాతి శిల్పం కావడం వల్ల ఈ విగ్రహం కంటికింపుగా ఉంటుంది. ఇం దులోని శిల్ప సౌందర్యం వర్ణనాతీతం. నఖశిఖ పర్యంతం అందంగా ఉంది అని చెప్పడానికి ఇది అచ్చమైన నిదర్శనం.

కాలి గోళ్ళు, చేతి గోళ్ళు నిజంగా ఉన్నాయా? అనిపించేలా అద్భుతంగా మలిచాడు శిల్పి. అదేవిధంగా ‘శిఖ’ జుట్టు వెం ట్రుకలు చెక్కిన తీరు చూస్తే ఇది శిల్ప మా, నిజంగా జుట్టు ఉందా? అనిపించే లా, చెక్కిన శిల్పి నిజంగా ధన్యుడే. ఈ వి గ్రహం పాదాల దగ్గర నుంచి, నీరు నిరం తరాయంగా ప్రవ హిస్తూ ఉంటుంది. ‘వి ష్ణు పాదోధ్బవి గంగ’ అనే ఆధ్యాత్మిక న మ్మకం మాట పక్కన పెడితే శిలల్లో ‘జల శిల’ అనే దా న్నుంచి నీరు నిరంతరం విష్ణుమూర్తి పాదాలను కడుగుతూ ఉం టుందని భక్తుల విశ్వాసం. గుడిప్రాం గణమంతా దశావతారాలకి సంబంధించి న శిల్పాలు కొలువై ఉన్నాయి.

ఆలయ నిర్మాణం...

ర్యాలి ప్రాంతం 11వ శతాబ్దంలో పూర్తిగా అరణ్యం. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చోళ చక్రవర్తి రాజా విక్రమ దేవుడు, ఈ ఆలయాన్ని నిర్మించా డు. తరువాతి రోజులలో దీనిని పునరుద్ధరించారు.

‘ర్యాలి’ విశిష్టత..

గోదావరి జిల్లా ప్రాంతంలో ‘ర్యాలి’ అంటే ‘పడిపోవడం’ అని అర్ధం. ఈ ప్రాంతాన్ని పూర్వం ‘రత్నపురి’ అని పిలిచేవారు. భాగవత కథ ప్రకారం... దేవతలు, దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభిం చారు. వాసుకి అనే పాముని తాడుగా, మంధ ర గిరిని కవ్వంగా చేసుకుని, తలవైపు రాక్షసు లు, తోకవైపు దేవతలు నిలబడి సముద్రాన్ని చిలికారు. అందులోంచి చంద్రుడు, కామధే నువు, కల్పవృక్షం, లక్ష్మీదేవి, విషం... ఇలా వరుసగా వచ్చిన తరువాత చిట్టచివరకు ధన్వంతరి అమృతకలశంతో ప్రత్యక్షమయ్యా డు. దేవదానవులిరువురూ దాని కోసం పోటీ పడుతుండగా, విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలో వచ్చి, అమృతం దానవులకి అందకుండా దేవతలకు మాత్రమే అందజేసి ముందుకు నడుస్తుండగా, వెనుకనుంచి విష్ణువుని చూసి జగన్మోహినిగా భ్రమచెందిన శివుడు విష్ణుమూర్తి చెయ్యిప ట్టుకోగానే ఉలికిపాటుతో విష్ణువు వెనుకకు తిరిగాడు. ఆ సమయంలో సిగలోంచి ఒక పువ్వు రాలిపడింది.

ర్యాలి పేరు ఎలా వచ్చింది;

ఆ కార ణంగా ఆప్రాంతానికి ‘ర్యాలి’ అని పేరు వచ్చిందని స్థలపు రాణం. విష్ణువుని చూసిన శివుడు స్థాణువులా నిలబడిపో యాడని అందుకే శివాలయం, వైష్ణవాలయం ఎదురెదు రుగా ఉంటాయని స్థానికులు చెప్తారు. అలా వెనుకకు తిరిగిన విష్ణుమూర్తి ముందువైపు పురుషుడిగానూ, వెనుక జగన్మోహిని రూపంలోనూ ఉంటాడు.తిక్కన చెప్పినట్లు ఇక్కడ హరిహరనాధ తత్వం కనిపిస్తుం ది. విష్ణుమూర్తి జగన్మోహినీకేశవస్వామిగాను, శివుడు ఉమాకమండలేశ్వరుడుగాను భక్తుల నీరాజనాలు అందు కుంటున్నాడు. ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠ చేసేటపుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలంతో మంత్ర పూతం కావించాడని స్థలపురాణం. అదే విధంగా జగన్మో హినీకేశవస్వామి విగ్రహాన్ని కూడా మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించారని చెబుతారు. గుడిలోని పూజారులు నూనె దీపం సహాయంతో విగ్రహం గురించి వివరిస్తూ అణువణువూ చూపిస్తారు. నల్లరాతి విగ్రహాన్ని దీపం సహాయంతో చూస్తే విగ్రహం అందం రెట్టింపవుతుంది.

ఎలా వెళ్ళాలి?

ర్యాలిని దర్శించడానికి ఉత్తర భారతంనుంచి వచ్చే యాత్రికులు విశాఖపట్నం మీదుగా (ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి) తుని, అన్నవరం, రాజమండ్రి చేరు కోవాలి. రాజమండ్రి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా వెళ్ళి, బొబ్బర్లంక దగ్గర ఎడమవైపు తిరగాలి. బొబ్బర్లంక మీదనుంచిలోల్లమీదుగా మెర్లపాలెం దగ్గర కుడివైపుకి తిరిగితే ర్యాలి చేరుకుంటాం.విజయవాడ వైపు నుంచి వచ్చేవారు రావులపాలెం (ఐదవ నెంబర్‌ జాతీయ రహదారి), దగ్గర కుడివైపుగా తిరిగి మెట్లపాలెం దగ్గర ఎడమవైపు తిరిగితే ర్యాలి చేరుకోవచ్చు.

హేమావతి సిద్ధేశ్వరాలయం, అనంత పురం జిల్లా[మార్చు]

ఈక్షేత్రము ఎక్కడ ఉన్నది?

అనంతపురం జిల్లా అమరాపురం మండలం, హేమావతిలో ఉన్న సిద్దేశ్వరాలయం చాల ప్రసిద్ధి చెందినది. కాలుష్యానికి దూరంగా, ప్రకృతి మధ్యలో వెలసిల్లిన ఈ ఆలయానికి కొన్ని విశిష్టతలు ఉన్నాయి.

చారిత్రక ప్రాముఖ్యము

ఇందులోని శిల్ప కళ చాల విశిష్టమైనది. ఏడవ శతాబ్దానికి చెందిన ఆలయమిది. ఈ ప్రాంతాన్ని అప్పట్లో నొళంబ రాజులు పాలించారు. అందుకే ఈ స్వామిని నొళంబేశ్వరుడు అని కూడా పిలుస్తారు. హెంజేరు సామ్రాజ్యంలో అనంతపురం, చిత్తూరు, కర్ణాటకలోని చిత్ర దుర్గ, కోలారు, తమిళనాడు లోని ధర్మపురి, సేలం జిల్లాలోని 32 వేల గ్రామాలు ఉండేవని ఇక్కడ చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. ఈ స్వామి నొళంబ రాజ వంశీకుల కులదైవం. వీరి వంశానికి చెందిన చిత్ర శేఖర, సోమ శేఖర అనే రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తున్నది. తమకు సంతానం కలిగితే విగ్రహ రూపాన శివాలయం నిర్మిస్తామని వారు మొక్కు కున్నారట. అనంతర కాలంలో వారి కోరిక నెరవేరడంతో సుందరమైన ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. సిద్దేశ్వరుడితో పాటు వారు మరో నాలుగు శివలింగాలను దొడ్డేశ్వర, విరూపాక్షేశ్వర, మల్లేశ్వర, సోమేశ్వర లింగాలు ప్రతిష్ఠించారు. వాటిలో మూడు ఆలయ ప్రాంగణలోనే ఉండగా, నాలుగోది ఊళ్లోని మరో శివాలయంలో ఉంది. భైరవ రూప ధారి అయిన శివుడు సిద్ధాసనంలో కూర్చొని ఉండటం వల్ల ఈ ఆలయానికి సిద్ధేశ్వరాలయంగా పేరు వచ్చింది.

ఆలయ విశిష్టత

గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలాతో కొలువైన సిద్ధేశ్వరుడి జటాజూటాన సూర్య,చంద్రులు కనిపిస్తారు. ఎడమ చేత బ్రహ్మకపాలాన్ని, దక్షిణ హస్తాన జపమాలను ధరించి అర్థనిమీలిత నేత్రుడై ఉంటాడు స్వామి. ఇలా శివుడు విగ్రహరూపంలో ఆశీన స్థితిలో కొలువై ఉన్న ఆలయం భారతదేశంలో ఇదొక్కటే నంటారు స్థానికులు. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమిటంటే......ఆలయంలో సిద్ధేశ్వరుడి ఎదురుగా కొలువై ఉన్న నంది ముఖం ఆ స్వామిని దర్శించుకున్నట్టుగా కాకుండా ప్రక్కకు తిరిగి ఉంటుంది. ఆలయ కుడ్యాలపై కనిపించే చోళ రాజుల శిల్ప కళా చాతుర్యం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. రామాయణ, మహాభారత గాథలు ఇక్కడ జీవం ఉట్టి పడేలా చెక్కారు. ఒకానొకప్పుడు ఈ క్షేత్రంలో కోటి లింగాలు, కోటి నందులు ఉండేవని చెబుతారు. అందుకు నిదర్శనమా అన్నట్టు ఇప్పటికీ త్రవ్వకాలలో అక్కడక్కడా సందులు, లింగాలు బయటపడు తుంటాయి. సిద్ధేశ్వరాలయానికి ఉన్న మరో ప్రత్యేకత....... శివరాత్రి రోజున గర్భగుడిలోని మూల విరాట్ సిద్ధేశ్వర స్వామి నుదుట సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. పడమటి ముఖ ద్వారం కలిగిన ఈ ఆలయ ప్రాగణంలో ఉన్న కోనేరులో ఇరవై ఏళ్ల క్రితం వరకు నీరు సప్త వర్ణాల్లో కనిపించేదని, ఇందులో స్నానం చేసి స్వామి వారిని ఆరాధిస్తే సంతానంకలుగు తుందని సర్వ రోగాలు నయ మవుతాయని భక్తులు విశ్వసించే వారు. ఇప్పటికీ అనేక మంది వ్యాధి పీడితులు ఈ కోనేటిలో స్నానం చేస్తుంటారు.

పూజలు.... అభిషేకాలు

ఆలయ ప్రవేశ ద్వారానికి ముందు ధూపం ఉంటుంది. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు తాము పండించిన పంటల నుంచి కొంత భాగాన్ని మొక్కుబడిగా ఇందులో వేస్తారు. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మిక. ఈ ఆలయానికి భక్తులు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ల నుంచి కూడా వస్తుంటారు. రోజూ త్రికాల పూజలు నిర్వహిస్తారు. ఏటా శ్రావణ మాసంలో నిర్వహించే ఎడగ జాతరకు భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసంలో 45 రోజుల పాటు విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీక, మార్గశిర పౌర్ణమి దినాల్లో లక్ష దీపోత్సవం, పూల రథోత్సవం, సిరిమాను ఉత్సవం, వసంతోత్సవాలను వేడుకగా చేస్తారు. ఇక మహా శివరాత్రి సందర్భంగా అయితే ఎనిమిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగ రంగ వైభవంగా నిర్వహిస్తారు. నిత్యం ఆ సిద్ధేశ్వరుడికి రుద్రాభిషేకం, పంచామృత స్నానం, బిల్వార్చన, భస్మ అర్చన, ఆకు పూజ తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరిపిస్తారు. (మూలం:ఈనాడు ఆదివారం: 24 ఏప్రిల్: 2011)

కదిరి నరసింహాలయం, అనంతపురం జిల్లా:[మార్చు]

చారిత్రకత

ఎత్తైన ప్రహారీతో, విశాలమైన ఆవరణలో విలసిల్లుతున్న ఈ కదిరి నరసింహాలయం: 13 వ శతాబ్దంలో దశలవారీగా అభివృద్ధి చెందిందని శాసనాల వలన తెలుస్తున్నది. ఆలయానికి నాలుగు వైపుల గోపురాలు కలిగి ఉంది. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. రంగ మండపంలో ఉన్న నాలుగు స్థంభాలపై ఉన్న శిల్ప కళా రీతులు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడున్న కోనేరును భృగుతీర్థం అంటారు. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనిమిస్తారు. " బేట్రాయి సామి దేవుడా....నన్నేలినోడా........... బేట్రాయి సామి దేవుడా కదిరి నరసింహుడా................... కాటమరాయడా ................. ఇలా భక్తుల చే కొనియాడబడే ఈ నరసింహ స్వామి విశిష్టత చాల గొప్పది. వేదారణ్యమైన ఈ ప్రాంతంలో ఖదిర చెట్లు ఎక్కువగా ఉన్నందున దీనికి కదిరి అని పేరు వచ్చింది. ఖదిరి చెట్టు అనగా చండ్ర చెట్టు. ఈ అలయంలో రంగ మండపం పై వేసిన రంగుల బొమ్మలు శతాబ్దాల నాటివి. అందుచేత కొంత వెలిసినట్లున్నా, ఇప్పటికీ బాగున్నాయి. ఈ ఆలయం ముందున్న పెద్ద రాతి ధ్వజస్థంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధ్వజ స్థంభం పునాదిలో నుండి కాకుండా ఒక బండ పైనే అలా నిలబెట్టి ఉంది.

ఉత్సవాలు

ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామి వారి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి, భూదేవి లతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండకు పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం. పారువేట అనంతరం స్వామి వారిని ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుక వస్తారు. దీన్నే రథోత్సవం అంటారు. ఈ రథోత్సవానికి చాల ప్రాముఖ్యత ఉంది. ఈ రథం 120 టన్నుల బరువుండి ఆరు చక్రాలతో సుమారు నలబై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ రథోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం., పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లుతారు. క్రింద పడిన వీటిని ప్రసాదంగా భావించి ఏరుకొని తింటే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మిక. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు పాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఈ రోజు భక్తులు ఉపవాస ముంటారు. ఏటా ఈ అలయంలో నృసింహ జయంతిని, వైశాఖ శుద్ధ చతుర్దశి, మల్లెపూల తిరుణాళ్లను వైశాఖ శుద్ధ పౌర్ణమి, చింతపూల తిరుణాళ్లను, అషాడపౌర్ణమి, ఉట్ల తిరుణాళ్లను, శ్రావణ బహుళ నవమి, దసరా వేడుకల్ని, వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు.

ఆలయ విశిష్టత

ఎక్కడా లేని ఈ కదిరి నరసింహుని ఆలయ ప్రత్యేకత ఏమంటే.............. .ఉత్సవాల సమయంలో ముస్లింలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ స్వామిని కొలుస్తుంటారు. ఇక్కడికి భక్తులు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా వస్తుంటారు. ఇక్కడి ఇంకో విశేష మేమంటే, కదిరి పట్టణానికి సుమారు ఇరవై ఐదు కిలో మీటర్ల దూరంలో తిమ్మమ్మ మర్రి మాను ఉంది. ఇది ఏడున్నర ఎకరాల స్థలంలో విస్తరించి, 1100 ఊడలతో ఉంది. దీని వయస్సు సుమారు ఆరు వందల సంవత్సరాలు ఉంటుందని నమ్మకం. ఇది గిన్నిసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో కూడా స్థానం సంపాదించు కున్నది. కదిరికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కటారు పల్లెలో యోగి వేమన సమాధి కూడా ఉంది. ఇది కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

ఎక్కడున్నది ఈ క్షేత్రము ?

అనంతపురం జిల్లాలో ఉన్న కదిరి లోఈ ఆలయం ఉంది. ఇది పాకాల—ధర్మవరం రైల్వే మార్గంలో ఉంది. కదిరిలో స్టేషను కూడా ఉంది. అదే విధంగా బస్సు సౌకర్యంకూడ బాగా ఉంది. (మూలం: ఈనాడు ఆదివారం: 2003 మార్చి 9)

చెన్నకేశవస్వామి ఆలయం, మార్కాపురం[మార్చు]

స్థలపురాణము

శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి దేవాలయం చుట్టూ పెద్ద ప్రాకారం నిర్మితమైంది. . మార్కండేయ మహర్షి తపస్సును కేశి అనే రాక్షసుడు భగ్నం చేయకుండా మహావిష్ణువు రాక్షసుని సంహరిస్తాడు.గర్భాలయాన్ని మారిక అనే యాదవస్త్రీ నిర్మించింది. స్వామివారు మారికను అనుగ్రహించారు. ఆమె పేరుతో వాడుక లోకి వచ్చిన మారికాపురం కాలక్రమేణ మార్కాపురంగా వాసికెక్కింది. ధాన్యకటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగివస్తూ ఈ ఆలయంలో బసచేశాడు. శ్రీకృష్ణదేవరాయలు మధ్యరంగ మండపాన్ని నిర్మించాడు ఆలయానికి ముందున్న రాతిస్తంభాన్ని విజయసూచికగా ఆయనే నిలిపాడు.

చరిత్రలో మార్కాపురం
.

12 వ శతాబ్దంలో పల్నాటి రాజు మలిదేవుడు గురజాలలో జరిగిన కోడి పందేలలో ఓడి పోయాడు. అపుడు రాజు తన మంత్రి బ్రహ్మనాయుడితో కలిసి చెన్న కేశవుణ్ణి పూజించాడు. ఈ విషయాన్ని శ్రీ నాథుడు తన గ్రంథం పల్నాటి వీర చరిత్రలో ప్రస్తావించాడు. 1513 లో శ్రీకృష్ణ దేవరాయలు స్వామి వారిని దర్శించుకొని, తన సామంత రాజు తిమ్మ రాజయ్యను పిలిపించి స్వామి వారికి అంతరాళం, మహాద్వారం, గర్భగుడి పై విమాన గోపురం, రాజ్య లక్ష్మి అమ్మవారికి ఆలయాన్ని పూర్తి చేయమని ఆదేశించాడు. ఆ తర్వాత కాలంలో అచ్యుత దేవరాయలు ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహ స్వామి, వేణు గోపాల స్వామి, రంగనాయక స్వామి, గోదాదేవి, రామానుజుల వంటి మరికొన్ని ఆలయాలను నిర్మించారు. గాలి గోపురం వివిధ దశలలో పూర్తి గావించ బడింది. 1929 లో అప్పటి తాలూకా గుమస్తా పోనంగి లింగ రాజు రెండు అంతస్తులను నిర్మించాడు. మిగతా ఏడు అంతస్తులను 1936 లో నాటి మేజిస్ట్రేట్ రాయసం సంహోగేశ్వరావు భక్తుల సహకారంతో పూర్తి చేశాడు. పురాతన కాలంనుండి ఈ పవిత్రక్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సోమప్రభాపురం అని పిలిచేవారు.

క్షేత్ర విశిష్టత

స్వామి వారి మూల విరాట్టు చుట్టూ మకర తోరణం ఉంది. ఈ తోరణం పై దశావతారాలున్నాయి. సాధారణంగా స్వామివారి కుడి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఈ స్వామి వారి ఎడమ చేతిలో సుదర్శన చక్రం ఉంది. మూల విరాట్టు ప్రక్కనే మార్కండేయ మహర్షి, మారిక, మారకయ్యల విగ్రహాలు కూడా ఉన్నాయి. అస్థాన మండపంలో ఉన్న స్థంభాలన్నీ ఏక శిలా స్థంభాలే. ఈ ఆలయంలో ఉన్న చూరు మరో ఆకర్షణ. అన్ని విధాల ఒకే విధంగా ఉన్న రెండు స్థంభాలను అన్నదమ్ముల స్థంభాలంటారు.

ఎలా వెళ్లాలి ?
.

ఒంగోలు నుండి మార్కాపురానికి సుమారు 90 కిలోమీటర్లు. ఇది రోడ్డు మార్గం. విజయవాడ కర్నూలు రైలు మార్గంలో మార్కాపురం స్టేషను ఉంది. అలా చేరుకోవచ్చు.

కోటిపల్లి/ కోటిఫలి కోటీశ్వారాలయము[మార్చు]

ఉమాసమేత కోటీశ్వరాలయ గోప్పురం, కోటిపల్లి
స్థల పురాణము

ఈక్షేత్రము పూర్వ కాలంలో కోటి తీర్థం గాను సోమ ప్రభాపురముగాను పిలువబడి, నేడు కోటి ఫలి మహా క్షేత్రముగా ఖ్యాతి గాంచింది. ఇచట గౌతమీ పుణ్య నదిలో విష్ణు తీర్థ, రుద్ర తీర్థ, బ్రహ్మ తీర్థ, మహేశ్వర తీర్థత, రామ తీర్థ మొదలగు అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో అంతర్వాహినులుగా ప్రవహించు చున్న కారణంగా దీనికి కోటి తీర్థ క్షేత్రముగా ప్రఖ్యాతి వచ్చింది. కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరస్వామివారు, అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామివారు, శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిఉన్నది. ఈ మూడు విగ్రహాలను ఇంద్రుడు,చంద్రుడు, కశ్యపమహర్షి ప్రతిష్ఠించారని చెబుతారు. ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టు కోవడానికి ఉమా సమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని, రాజరాజేశ్వరి సమేతుడైన సోమేశ్వరుడిని చంద్రుడు ప్రతిష్ఠించి తన పాపాలు పోగొట్టుకొన్నాడని అంటారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన సిద్ధి జనార్దన స్వామి వారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించాడని, ఆయనే క్షేత్రపాలకుడని చెబుతారు.

ఈ క్షేత్రం పవిత్ర గోదావరి నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. గోదావరిని ఈ క్షేత్రం వైపు ప్రవహించేటట్లు చేసింది గౌతమ మహర్షి అని చెబుతారు. శ్రీగౌతమీ మాహాత్మ్యంలో ఈ విధంగా చెప్పబడింది: ఎవరైతే ఈ క్షేత్రం వద్ద ఉన్న పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తారో వారి సర్వ పాపాలు పోతాయని. ఈ క్షేత్రంలో అనేక పవిత్ర జలాలు వచ్చి చేరడం వల్ల ఈ క్షేత్రానికి కోటి తీర్థం అని కూడా పేరు.

క్షేత్ర విశిష్టత

ఈ ఆలయ ప్రాంగణములో ఉమాసమేత కోటీశ్వరాలయము, శ్రీదేవి, భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయం, నాగలింగం, భోగలింగము ఆలయాలు కూడా ఉన్నాయి. ఆలయము ముందొక ధ్వజస్తంభము, నందీశ్వరుడు, కొలను ఉన్నాయి. ఈ రాజరాజేశ్వరీ సహిత సోమేశ్వరాలయములో దసరా ఉత్సవములు, కార్తీక దీపోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆలయానికి ఎదురుగా సోమగుండం అనే ఒక పెద్ద చెరువు ఉంది.ఈ దేవాలయములో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రి రోజు రాత్రి ఈ దేవాలయ ప్రాంగణంలో కోటి దీపాలు వెలిగిస్తారు. ద్రాక్షారామం చుట్టూ ఉన్న అష్ట సోమేశ్వరాలలో కోటిపల్లి ఒకటి. ఆలయ విశేషాలు

పూజలు, అర్చనలు

ఈ పవిత్ర గౌతమీ తీర్థం లోని పుణ్య స్నానం సర్వపాపాలను తొలగించి పుణ్యాన్ని ఇస్తుంది. శివ, కేశవ భేదం లేదని ఈ క్షేత్రం మనకు పున: పున: చెబుతుంది. కోటీశ్వర లింగం యోగ లింగం అని, సోమేశ్వర లింగం భోగ లింగం అని, రాజరాజేశ్వరమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లి అని భక్తుల నమ్మిక. అర్చకులు ప్రతీరోజు ప్రాతః కాలమందే కోటి తీర్థం నుండి జలాలు తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం, అర్చన చేస్తారు. సాయం సంధ్య వేళ స్వామికి ధూప సేవ, ఆస్థాన సేవ, పవళింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పురాతన కాలం నుండి ఈ పవిత్రక్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సోమప్రభాపురం అని పిలిచేవారు. ఇక్కడ సోమ కుండం అనే ఒక పెద్ద పుష్కరిణి నేటికీ ఉంది. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు. ఆలయంలో నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉన్నాయి. ఉత్తర మండపంలో కాలభైరవ స్వామి మందిరం ఉంది. ఈ దేవాలయం లోనే చంద్రమౌళీశ్వర స్వామి శంకరాచార్యుల మందిరం, ఉమా సమేత మృత్యుంజయ లింగం, నవగ్రహాల గుడి ఉన్నాయి.

ఎలా వెళ్లాలి ?

కోటి ఫలి మహా క్షేత్రము తూర్పు గోదావరి జిల్లా, కె.గంగవరం మండలంలో ద్రాక్షారామ క్షేత్రానికి సమీపంలో గౌతమీ నదీ తీరాన ఉంది. కాకి నాడ నుండి బస్సు సౌకర్యమున్నది.

దేవుని కడప... శ్రీ వేంకటేశ్వరాలయం, కడప[మార్చు]

స్థలపురాణం

ఇక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం మూలంగా ఈ ప్రాంతానికి దేవుని కడప అని పేరు వచ్చింది. తిరుమల క్షేత్రానికి దేవుని కడప/ గడప అంటారు. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని కృపాచార్యులు ప్రతిష్ఠించారని ప్రతీతి. అందు వలన ఈ పట్టణానికి కృపాపురమని పేరు వచ్చింది. కృపాపురమే కడపగా మారిందంటారు. ఏడుకొండల వేంకశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలసిన శ్రీలక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుడు. ఈ గుడిలో ఒక మందిరంలో వేంకటేశ్వరుడు, ఆయనకు ఎడమ వైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘ శుద్ధ పాడ్యమి నుండి సప్తమి (రథసప్తమి) వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు.

చారిత్రిక ప్రాముఖ్యత

విజయనగర రాజులు, నంద్యాల రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మడులు, మాన్యాలు, బంగారు సొమ్ములు ఈ స్వామికి సమర్పించారు. తాళ్ళపాక అన్నమాచార్యులు ఈ స్వామి మీద 12 కీర్తనలు చెప్పాడు. ఈ గుడిలో విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాళ్ మందిరం, శమీ వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి చూడదగినవి. ఇక్కడ ఇటీవల నిర్మించిన అద్దాల మందిరం ఒక ప్రత్యేక ఆకర్షణ.

గర్భగుడి వెనుకవైపు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహముంది. ఈ ఆంజనేయస్వామి ఈ క్షేత్రపాలకుడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువు నామాలుండడం విశేషం. దేవుని కడపలో ఇంకా సోమేశ్వరాలయం, దుర్గాలయం, ఆంజనేయ మందిరం ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన కళ్యాణ మంటపముంది.

క్షేత్ర ప్రాశస్త్యం

దేవుని కడప క్షేత్రం తిరుమలకు తొలిగడపగా ప్రసిద్ధిగాంచింది. దక్షిణ ప్రాంత యాత్రికులు కాశీ వెళ్ళడానికి ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళడానికి తిరుమల వేంకటేశ్వరుని వద్దకు కాలిబాటన వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గం. ఈ కారణంగా మూడుచోట్లకు వెళ్ళే భక్తులు కచ్చితంగా ఇక్కడ మొదటిగా శ్రీ లక్ష్మీప్రసన్న వేంకటేశ్వరుణ్ణి, సోమేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం మూడు క్షేత్రాలకు వెళ్ళేవారు. ఇందువల్లనే మూడు క్షేత్రాల తొలి గడపగా దేవుని కడప ప్రసిద్ధి చెందింది. పూర్వ కాలం తిరుమలకు వెళ్లే భక్తులు తమ యాత్రను దేవుని కడపనుండే కాలి నడకన ప్రారంభించేవారు. అప్పట్లో రవాణా సౌకర్యాలు అంతగా లేనందున భక్తులు కాలి నడకనే తిరుమలకు వెళ్లే వారు. మైదాన ప్రాంతంలో ఈ కాలి దారి కనుమరుగైనా తిరుమల కొండలలో అక్కడక్కడా కడప నుండి ఉన్న మెట్ల దారి అక్కడక్కడా కనబడుతున్నది. ఈ దారి చాల దూరమైనందున, రాను రాను రవాణా సౌకర్యాలు పెరిగినందున ఈ మెట్లదారి కనుమరుగైనది.

ఆలయ విశిష్టత

తిరుమలవరాహ క్షేత్రం కాగా ఇది హనుమ క్షేత్రం. అందుకు చిహ్నంగా ఇక్కడ స్వామి వెనుక భాగాన నిలువెత్తు విగ్రహరూపంలో ఆంజనేయ స్వామి నెలకొని ఉన్నాడు. ఆలయ ప్రాంగణంలో ఆండాళమ్మ, విష్వక్సేన, పద్మావతి అమ్మవారు, శంఖ, చక్ర, ధ్వజ, గరుడ ఆళ్వారు, హనుమత్ పెరుమాళ్ళు, నృత్య గణపతి తదితర దేవీ దేవతలు కొలువై ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వినాయకుని విగ్రహానికి అడ్డంగా విభూతి పట్టీలు ఉంటాయి. వాటికి భిన్నంగా ఇక్కడ నృత్య గణపతికి నిలువు నామాలుంటాయి. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండప పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతారు.

పూజలు, ఉత్సవాలు

ఈ ఆలయానికున్న మరో విశిష్టత మతసామరస్యం. ఉగాదినాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామి వారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. వారితో పాటు జైనులు కూడా వస్తుంటారు. రథసప్తమి రోజు జనసందోహం మధ్య స్వామి రథాన్ని కులమతాల కతీతంగా లాగడం మతసామరస్యానికి నిదర్శనం. దేవుని కడప ఆలయ చెరువుల సముదాయాన్ని హరిహర సరోవరంగా పిలుస్తారు. హనుమ క్షేత్రం అయినందున హనుమత్ పుష్కరిణి అనికూడా అంటారు. కొలనులోని నిరయమంటపం, పడమరన తీర్థవాశి మంటపం ఉన్నాయి. పాతకడప చెరువు నుంచి నీరొచ్చే మార్గం ఉంది. పుష్కరిణిలో స్వామి తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఏటా ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది మాఘ శుద్ధ పాడ్యమి నుంచి ఏడురోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఏడో రోజు మాఘ శుద్ధ సప్తమి (రథసప్తమి) నాడు జరిగే రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడవాహన సేవలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. రథోత్సవంలో భాగంగా స్వామి గ్రామంలో ఊరేగుతాడు. తాళ్ళపాక అన్నమాచార్యులు దేవుని కడప శ్రీ వేంకటేశ్వరుని కీర్తిస్తూ వ్రాసిన కీర్తన.

"కాదనకు నామాట కడపరాయా నీకు,,,, గాదెవోసే వలపులు కడపరాయా
కలదాననే నీకు గడపరాయా వో...........కలికి శ్రీ వేంకటాద్రి కడపరాయ"
ఎలావెళ్ళాలి ?

వై.ఎస్.ఆర్ జిల్లా ముఖ్యకేంద్రమైన కడప పట్టణంలోనే ఈ ఆలయమున్నది. ఇక్కడికి చేరుకోవడానికి రైలు, బస్సు రవాణా సౌకర్యాలు ఉన్నాయి.

  • మూలం.... వైఎస్ఆర్ జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి, విద్వాన్ కట్టా నరసింహులు

ఒంటిమిట్ట కోదండ రామాలయం[మార్చు]

ఒంటిమిట్ట కోదండరామాలయ సముదాయము
ఎక్కడున్నదీ క్షేత్రం ?

ఒంటిమిట్ట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఈ క్షేత్రము ఏకశిలానగరము అని ప్రసిద్ధి చెందినది.


ఇక్కడ ఉన్న కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడు. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థము ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామ బాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. గోపురనిర్మాణము చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతముగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి, ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే.

స్థల పురాణం

రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.

ఆలయ విశిష్టత

ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వేంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి, దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.

చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ ఆలయ స్థంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. చరిత్ర మధ్యయుగాల్లో మన దేశాన్ని దర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ తాను చూసిన గొప్ప ఆలయాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు. ప్రౌఢ దేవరాయల ఆస్థానంలోని అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపైన ”శ్రీ రఘువీర శతకాన్ని” రచించాడు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగు వారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ, సరళ కవి బమ్మెర పోతన, జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలున్నప్పటికీ, ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండరాముడికే. ఈ సహజకవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి.

ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామి భక్తుడిగా మారిపోయాడు. అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, ఇక్కడి విశేషం. పుట్టపర్తికి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చటపడిపోతుంటారు.

పూజలు,ఉత్సవాలు

ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

సిద్ధులకొండ., నెల్లూరు జిల్లా[మార్చు]

స్థలపురాణము

ఒక దట్టమైన అడవిలో ఒక కొండపైన ఇద్దరు సిద్ధులు తపస్సు చేసుకుంటున్నారు. అక్కడ సంచరిస్తున్న ఒక గిరిజనుడు దేదీప్యమానంగా వెలుగు విరజిమ్ముతున్న వారిని చూస్తూ అలాగే రెండు రోజులుండిపోయాడు. సిద్ధులు తర్వాత కళ్లు తెరిచి గిరిజనుని చూసి తమగురించి ఎవ్వరికి చెప్పొద్దని చెప్పితే తనకే ప్రమాదమని హెచ్చరించి వెళ్లిపొమ్మన్నారు. కొన్నిరోజులు నిగ్రహించుకున్న ఆ గిరిజనుడు తాను చూసిన వింతను తమ వారికి చెప్పాడు. అందరూ కలిసి ఆ అటవీ ప్రాంతానికి వచ్చి చూడగా, ఆ సిద్ధులు శిలలుగా మారిపోయారు. ఆ గిరిజనుడు మరణించాడు. అప్పటినుండి గ్రామస్థులు ఆ సిద్ధులను పూజిస్తూ వచ్చారు. వారి కోరికలు సిద్ధిస్తుండడముతో ఆ కొండకు సిద్ధుల కొండ పేరు స్థిరపడింది.

చారిత్రికము

రాజరాజ నరేద్రుని చిన్న భార్య చిత్రాంగి రాజరాజ నరేంద్రుని కొడుకు సారంగధరుని మోహించి భంగ పడి ప్రతీకారంతో రాజుగారికి తప్పుడు ఫిర్యాదు చేస్తుంది. దాంతో రాజు సారంగధరుని కాళ్లు, చేతులు నరికి వేయమని ఆదేశిస్తాడు. అతని ఆదేశాల ప్రకారం సైదాపురం మండలం చాగణం సమీపంలో కత్తుల కొండపై సారంగధరుని కాళ్లు చేతులు నరికినట్లు ఆధారాల వల్ల తెలియ వస్తుంది. అవిటి వాడైన సారంగధరుడు సిద్ధుల కొండపైకి వచ్చాడు. శిలారూప నవకోటి, నవనాధసిద్ధులయ్యలు.... సారంగధరుని తమ శిష్యునిగా చేసుకున్నారు. ఆ విధంగా సిద్ధుల తోపాటు సారంగధరుని బొమ్మకూడ అక్కడ చేరిందని స్థానికులు చెపుతారు. ఈ ఆలయానికి రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు తెలుస్తున్నది.

పూజలు, ఉత్సవాలు

ప్రతిఏడు కార్తీక మాసములో వచ్చే అన్ని సోమ వారాల్లో ఇక్కడ ప్రత్యేక తిరునాళ్లను నిర్వహిస్తారు. అంతేగాక, కార్తీక పౌర్ణమి, మహా శివరాత్రి, నాగ పంచమి, వసంత పంచమి రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ తిరుణాళ్లకు పరిసరజిల్లాలనుండే గాక తమిళనాడు నుండి కూడా భక్తులు విశేషంగా తరలి వస్తారు. గతంలో చిరుత పులి, పాము మొదలగునవి స్వాములను పూజించేవట. వీటిని దూరంగా పంపి, తాము పూజ చేసుకోవడానికి వీలుగా పూజకొరకు కొండ ఎక్కే ముందు పూజారి శంఖం వూదేవాడట. ఆ ఆచారము మొన్నటిదాక కొనసాగిందని స్థానికులు చెపుతారు.

ఆలయవిశిష్టత

మొదట్లో ఈ ఆలయానికి తలుపులు ఉండేవి కావు. ఆతర్వాత తలుపులు ఏర్పాటు చేసినా అవి ఉండేవి కావు. ఇది సిద్ధుల మహత్యమని ఆ తర్వాత తలుపులు ఏర్పాటు చేయడము మానేశారు. ఈ కొండపై సప్త దొరువులుగా పిలిచే ఏడు కొలనులున్నాయి. వాటిలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మిక. ఈ కొలనులో సర్వ వేళలా పుష్కలంగా నీరు ఉం డటము ఒక విశిష్టత. ఈ ఆలయంలో మరో విశేషమేమంటే.... భక్తులు ఒక పుష్పాన్ని తీసుకొని మనసులో ఒక కోర్కెను కోరుకొని ఆ పుష్పాన్ని నవకోటి నవ నాథుల శిలా మూర్తుల పై పెడితే .... అది క్రింద పడితే వారు కోరుకున్న కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఆ విధంగా కోరికలు తీరిన భక్తులు తమ పిల్లలకు సిద్ధులయ్య, నవకోటి, నవ నాథ్, సారంగధర అనే పేర్లు పెట్టుకుంటారు. అందుచేత ఈ ప్రాంతంలో ఆ పేర్లు ఉన్నవారే ఎక్కువగా ఉంటారు. ఈ కొండకు సమీపంలో బండరాతిపై సర్పాకృతిలో వెలసిన ఆకారాలను రాహు, కేతువులుగా చెపుతారు. అందుకే ఈ కొండను సర్పక్షేత్రమని పిలుస్తారు. ఈకొండ క్రింద సతీసమేత నవగ్రహ మంటపాలున్నాయి. నవగ్రహాలు ఎక్కడైనా ఉంటాయి. కాని సతీసమేత నవగ్రహాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి.

వసతులు

కొండకు వచ్చే భక్తుల కొరకు కార్తీక, మాఘ మాసాల్లో, ఇతర మాసాల్లో సోమ, శని వారాల్లో మధ్యాహ్నం పూట ఉచిత అన్నదానం చేస్తున్నారు. మాఘ మాసంలో వచ్చే వసంత పంచమి రోజున చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మధ్యన దాతల సహకారంతో... ఆలయ ప్రాంగణంలో సాయిబాబా మందిరం, దక్షిణామూర్తి ఆలయం, యాగమంటపం నిర్మించారు.

ఎలావెళ్ళాలి?

నెల్లూరు పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలోను, లేదా గూడూరు నుండి అరగంట ప్రయాణం చేసినా సైదాపురం చేరుకోవచ్చు. సైదాపురానికి సమీపంలోనే ఉన్నదీ సిద్ధులకొండ క్షేత్రము. (మూలం: ఈనాడు: 2 0012 సెప్టెంబరు 2)

రుద్రకోటేశ్వరాలయం, చిత్తూరు జిల్లా[మార్చు]

స్థలపురాణం

శివుని ఆజ్ఞ మేరకు దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి చంద్రగిరి - తిరుపతి మధ్యయలో ఉన్న తొండ వాడ ప్రాంతలో స్వర్ణముఖి, భీమ, కల్యాణి నదుల సంగమ ప్రదేశము పవిత్రమైన దని భావించి అక్కడ ఒక శివ లింగాన్ని ప్రతిష్ఠించి రుద్ర కోటేశ్వరునిగా పూజలు చేశాడు. కాల క్రమంలో అది రుద్ర కోటి అగస్తేశ్వరాలయం అనే పేరుతో స్థిరపడింది. నారాయణ వనంలో శ్రీనివాసుడు, పద్మావతి ల వివాహం జరిగింది. శ్రీనివాసుడు పసుపు వస్త్రాలతో తిరుమలకు బయలుదేరాడు. మార్గమధ్యంలో తొండవాడలో అగస్త్యుని కోరిక మేరకు ఆ మహర్షి వద్ద ఆరు నెలలు ఉండి పోయాడు. వెళ్తూ వెళ్తూ ఈ క్షేత్రంలో పెద్ద పాద ముద్ర పడేలా చేశాడు. ఇది హరిహరుల విగ్రహములు కొలువైన వేదిక వద్ద ఉంది.

క్షేత్ర విశిష్టత

సామాన్యంగా శివాలయాలు, విష్ణు ఆలయాలు వేరు వేరుగా ఉంటాయి. కాని ఇక్కడ ఈ రెండు కలిసే ఉంటాయి. అదే ఈ క్షేత్ర విశిష్టత. శివ, కేశవులు ఒకే విగ్రహంలో చెరి ఒక వైపు కనిపించడము ఈ రుద్ర కోటేశ్వరాలయంలో మాత్రమే సాధ్యం. ఒక వైపునుండి చూస్తే శివుడు, మరొక వైపునుండి చూస్తే శ్రీ హరి దర్శనమిస్తారు. మరొక విశిష్టత: పరమశివుని ద్వారా పాలకులు నంది, భృంగి. సాధారణంగా శివాలయల్లో నంది మాత్రమే ప్రతిష్ఠించబడి ఉంటుంది. కాని ఈ క్షేత్రంలో నంది తోబాటు భృంగి విగ్రహం కూడా ఉంది. ఇది మరో విశేషము.

పూజలు, ఉత్సవాలు

ఈ క్షేత్ర ఆవరణంలో రావి చెట్టుతో పాటు వేప, ఊడగ, చింత, బిల్వ వృక్షాలు ఒకేచోట ఉండి ఒక మహావృక్షంగా కనిపిస్తుంది. మహిళలు సంతానం కొరకు ఈవృక్షాలకు పూజలు చేస్తారు. ఈ ఆలయంలో ఏటా కార్తీక మాసం పౌర్ణమి నాడు రుద్ర పాదాల ముక్కోటీ" పేరుతో పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. కార్తీక మాసంలో మిగతా రోజులు, మహా శివరాత్రి నాడు కూడా భక్తులు విశేషంగా తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో హరిహరులతో బాటు విఘ్నేశ్వరుడు, కార్తికేయుడు, వీరభద్రుడు, సుందరేశ్వరుడు, శ్రీ కృష్ణుడు ఆంజనేయ స్వామి, అయ్యప్పస్వామి, దుర్గా దేవి, మహాలక్ష్మి దేవతా మూర్తులు కూడా కొలువై ఉన్నారు.

ఎలా వెళ్ళాలి ?

ఈ క్షేత్రము చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి, చారిత్రక ప్రదేశమైన చంద్రగిరి మధ్యన తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి—చిత్తూరు, తిరుపతి—చంద్రగిరి వెళ్లే ప్రతి బస్సు ఈ క్షేత్రము ముందునుండే వెడు తుంటాయి. తి.తి.దే వారి ఆలయ దర్శన బస్సులు కూడా ఇక్కడి నుండే నడుస్తాయి. శ్రీనివాస మంగాపురంలో కొలువై ఉన్న కళ్యాణ వేంకటేశ్వరాలయము కూడా ఇక్కడికి అతి సమీపంలోనే ఉంది.

తిరుపతిలో శివాలయం, కపిల తీర్థం[మార్చు]

కపిల తీర్థంలో దాని వివరాలు తెలిపే బోర్డు. తిరుపతి
కపిల తీర్థంలో ఆంజనేయ ఆలయము

తిరుమల-తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్య క్షేత్రం. ఇక్కడ తిరుమల లోని శ్రీవేంకటేశ్వరుని ఆలయంతోబాటు అన్నీ వైష్టవాలయాలే... గోవిందరాజ స్వామి ఆలయం, కోదండ రామాలయం, కళ్యాణ వేంకటేశ్వరాలయము, వరదరాజ స్వామి ఆలయము, పద్మావతి అమ్మవారి ఆలయము మొదలగునవన్నీ వైష్ణవాలయాలే. కాని తిరుమల కొండ పాద భాగాన అలిపిరికి అతి సమీపంలో ఒక శివాలయమున్నది. అదే కపిల తీర్థము.

కపిల తీర్థం (తిరుపతి) ముందున్న నంది
కపిల తీర్థం క్షేత్రము (తిరుపతి)
పురాణేతిహాసము

కృత యుగంలో కపిల మహర్షి ఇక్కడ శివుని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు భూమి చీల్చుకొని వచ్చి ఇక్కడ వెలిశాడని స్థల పురాణం. కపిల ముని తపస్సు కారణంగా వెలసినది ఈశ్వరుడు గాబట్టి ఈ తీర్థానికి కపిల తీర్థమని, ఇక్కడ వెలసిన స్వామి కపిలేశ్వరుడని పేరు వచ్చింది. ఇక్కడి శివలింగాన్ని కూడా కపిల లింగమని అంటారు. ఆ తర్వాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ దేవదేవుని పూజించి నందున ఈ లింగాన్ని అగ్ని లింగమని కూడా అంటారు. ఇక్కడి కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువై ఉన్నాడు. ఈ కపిల తీర్థము పరమ పవిత్రమైనదని పురాణాలు చెపుతున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్న వేళ ముల్లోకాల్లోని సకల తీర్థాలు నాలుగు గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీతి.

కపిలతీర్థం కోనేరు ముందున్న మండపము
చారిత్రక ప్రాశస్త్యము

11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. రాజేంద్ర చోళ అనే అధికారి దీని నిర్మాణానికి ముఖ్య సూత్రధారి. చోళులు శివ భక్తితత్పరులు గాన ఈ ఆలయాన్ని వారు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్మించారు. ఆ తర్వాతి కాలంలో విజయనగరాధీశుడైన అచ్యుత దేవరాయలు కాలంలో దీనిని ఆళ్వారు తీర్థంగా మార్చారు. అప్పటినుండి 18 వ శతాబ్దం వరకు దీనిని ఆళ్వారు తీర్థంగానే వ్వవహరించేవారు.

కపిల తీర్థం క్షేత్రంలో ఒక ద్వారము
ఆలయ విశిష్టత

ఎంతోఎత్తు నుండి జాలువారి ఆలయ పుష్కరిణిలో పడే జలపాత దృశ్యం అత్యంత మనోహరంగా, చూపరులకు అమిత ఆనందాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో తిరుపతి పట్టణ ప్రాంత ప్రజల దృష్టి అంతా ఈ కపిల తీర్థంవైపే. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆళ్వారు తీర్థమని పిలిచేవారు. ఆ నాడు వైష్ణవులు ఇక్కడి పుష్కరణి చుట్టు నాలుగు మూలల్లో నాలుగు సుదర్శన రాతి శిలలను స్థాపించారు. అదే విధంగా రాతిమెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. ఆ కారణంగా దీన్ని చక్ర తీర్థమని అనేవారు. ప్రస్తుతం శైవులు, వైష్ణవులు అనే భేదము లేనందున, అన్ని వర్గాల భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తున్నారు. తి.తి.దేవస్థానం వారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో బాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీ కృష్ణుడు, అగస్తేశ్వరుడు, సుబ్రహ్మణేశ్వరుడు కూడా ఉన్నారు.

పూజలు, ఉత్సవాలు

కపిలతీర్థము పరమ పవిత్రమైనదని పురాణాలు ఘోషిస్తున్నందున,..... ముల్లోకాల్లోని సకల తీర్థాలు ఇందులో కొంత సమయం ఉంటాయని చెపుతున్నందున ఈ తీర్థములో స్నానమాచరించుటకు భక్తులు ఉవ్విళ్లూరుతుంటారు. పైనుండి ధారగా పడే జలధారల క్రింద నిలబడి స్నానం చేయడానికి భక్తులు పోటీలు పడుతుంటారు. ఆ కారణంగా కార్తీక మాసం ప్రారంభంకాగానే ఈ తీర్థానికి భక్తులు పోటెత్తుతారు. నిత్యం ఈ తీర్థములో పుణ్య స్నానాలు చేసి పరమేశ్వరునికి దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో, ఆరుద్రా నక్షత్రం రోజున ..... ఆలయంలో లక్ష బిల్వార్చన, అన్నాభిషేకము ఘనంగా జరుగుతాయ. శివ రాత్రికి ప్రత్యేక ఉత్సవాలతో బాటు ప్రతి ఏడు పుష్య మాసంలో తెప్పోత్సవాలు, మాఘ మాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఈక్షేత్రానికి ఎలా వెళ్ళాలి ?

తిరుమల, తిరుపతి క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినందున ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్తూరు జిల్లాలో పవిత్ర మైన తిరుపతి పట్టణానికి ఉత్తరదిక్కున తిరుమల కొండ పాద భాగాన అలిపిరికి సమీపంలో ఈ క్షేత్రము ఉంది.

గుడిమల్లం... పరశురామేశ్వరాలయం, చిత్తూరు జిల్లా[మార్చు]

ఆలయ విశిష్టత

గుడిమల్లం శివాలయం లోని శివుడు లింగాకారంలో కొలువై ఉన్నాడు. దేశంలో ఎక్కడా లేవి విధంగా ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సుమారు ఐదారు అడుగుల ఎత్తున నిలబడిన పురుషాంగమే ఇక్కడి శివలింగము. ఈ తరహా మూల విరాట్టు మరెక్కడా కనబడదు. ఈ లింగాకారము పైనే మరొక మానవాకృతి చెక్కబడి ఉంది. ఆ ఆకృతి ఒక పురుషునిపై నిలబడి ఒకచేతిలో ఒక పొట్టేలు కాళ్ళను పట్టుకొని, మరొక చేతిలో ఒక చిప్పను పట్టుకొని భుజానికి గండ్ర గొడ్డలిని తగిలించుకొని ఉంది. ఇందులోని శిల్పకళ అత్యంత సుందరంగా ఉంది. ఈ మూల విరాట్టు మొత్తం కాఫీ రంగు రాతిలో అత్యంత అందముగా చెక్కబడి ఉంది. ఈ ఆలయ గర్భాలయము మిగతా ఆలయ ఆవరణముకన్నా భూమట్టానికి సుమారు నాలుగడుగులు లోతులో ఉంది. మూలవిరాట్టు ఆలయ ప్రాంగణానికి మధ్యలో కాకుండా ఒక ప్రక్కగా ఉంది. మిగాతా ఆవరణము ఆనగా... అంతరాళము, రంగ మండపము అన్నీ భూ మట్టానికి సమాంతరంగా ఒక ప్రక్కగా ఉన్నాయి. గర్భాలయం వెనుక భాగము అర్థ చంద్రాకారంలో ఉంది. మూల విరాట్టునకు ఎదురుగా ఆలయం గోడలకు రంధ్రాలున్నాయి. ఉదయ భానుని కిరణాలు నేరుగా మూల విరాట్టు పై పడేటందుకు ఈ ఏర్పాటు చేసారు. ఈ ఆలయము తూర్పు ముఖంగా ఉన్నా తూర్పు ముఖాన ప్రవేశ ద్వారము లేదు. దక్షిణాన ఉన్న ద్వారం గుండా ఈ ఆలయంలోనికి ప్రవేశించాలి. ఆలయం లోనికి ప్రవేశించగానే ఎడమ చేతి వైపున భూమట్టానికి దిగువున మూల విరాట్టు ఉంది.

ప్రస్తుతం ఈ ఆలయంలో ఎలాటి పూజా కార్యక్రమాలు జరగడము లేదు. ఇది పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. ఆ శాఖవారి ఉద్యోగి ఈ ఆలయానికి పరిరక్షకుడిగా ఉండి చూడ వచ్చిన వారికి చూపెట్టి ఆలయ వివరాలు చెపుతుంటాడు. ఆలయ ప్రాంగణంలో పాతిన బండలపై అస్పష్టంగా ఉన్న శిలా శాసనాలు చెక్కి ఉన్నాయి. ఈ ఆలయము అతి ప్రాచీనమైనది. చారిత్రాత్మక విషయాలపై ఆసక్తి ఉన్న వారు మాత్రమే ఈ ఆలయ సందర్శనానికి వస్తుంటారు. పూజాదికాలు లేకున్నా ఈ ఆలయము చాల ప్రత్యేకతలు సంతరించు కున్నది.

ఎలా వెళ్ళాలి ?.

ఈ ఆలయం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం అనే చిన్న గ్రామంలో ఉంది. ఇది ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో ఉంది. రేణిగుంట విమానాశ్రయం ముందు నుండి పాపానాయుడు పేట మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. తిరుపతి నుండి విరివిగా బస్సులున్నవి. ప్రత్యేకించి ఈ క్షేత్రానికి మాత్రమే ఎటువంటి రవాణా సౌకర్యంలేదు. ఇక్కడికి వెళ్లలేని వారు.... చంద్రగిరి కోటలోని వస్తు ప్రదర్శనా శాలలో ..... ఈ ఆలయంలోని మూల విరాట్టు ప్రతిమను తిలకించవచ్చు. రూపు, రంగు, ఆకారము, పరిమాణము ఇలా అన్నివిధాల ఒకే విధంగా ఉన్న ప్రతి రూపాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ప్రదర్శనకు పెట్టారు.

కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి,. ప.గో. జిల్లా[మార్చు]

స్థలపురాణము

పూర్వం తిరుమల కొండపై శ్రీధరుడనే బ్రాహ్మణుడుండే వాడు. అతను శ్రీవారి ఆలయంలో నాట్యంచేసే పద్మావతి అనే ఆమెను ప్రేమించి తనను పెండ్లాడమని కోరగా ఆమె తిరస్కరిస్తుంది. దానికి కోపగించిన శ్రీధరుడు ఆమెను శపిస్తాడు. దానికి కినుక వహించిన ఆమె కూడా శ్రీధరుడిని శపిస్తుంది. శాపవిమోచనము కొరకు ఆ ఇద్దరు శ్రీ వేంకటేశ్వరుని సేవిస్తారు. దాంతో ఆ దేవ దేవుడు కరుణించి పద్మావతికి తన పేరుతో నదిగా గోదావరి సమీపాన అవతరిస్తావని....... శ్రీధరునికి..... బ్రాహ్మణుడిగా జన్మించి అష్టకష్టాలు పడి శిష్యులతో పద్మావతీ నది తీరంలో తన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడని .... శాప విమోచన మార్గాలు చెపుతాడు. కొన్నాళ్లకు శ్రీధరుడు గోదావరి ప్రాంతాన పద్మావతీ నదీ తీరాన వేంకటేశుని బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. కాని ఆవిగ్రహం దొంగల పాలు కాగా, శ్రీవేంకటేశ్వరుడు... శ్రీధరుని కలలోకొచ్చి ... నదికి పశ్చిమాన ఉన్న అశ్వత్థ వృక్షంలో శిలారూపంలో ఉన్నానని చెప్పగా,... శ్రీధరుడు ఆ విగ్రహాన్ని తెచ్చి నదికి తూర్పు దిక్కున ప్రతిష్ఠించి పూజించాడు. అలా ఆ ఇరువురికి శాప విమోచనము కలుగుతుంది. శ్రీధరుడు ప్రతిష్ఠించిన విగ్రహము నడుము క్రింది భాగమంతా భూమిలో కూరుకు పోయి.... కాళ్లు కనబడకుండా ఉండేది. అందువలన ఆ క్షేత్రానికి కాళ్లకూరు అనే పేరు స్థిరపడి పోయింది.

చారిత్రికము

గతంలో మొగల్తూరు ప్రాంతాన్ని పాలించిన కలిదిండి రంగరాజు ప్రస్తుతమున్న ఈ ఆలయ నిర్వహణకొరకు 83 ఎకరాల భూమిని దానంచేశాడు. నేటికీ ఆ భూమి ఈ ఆలయ ఆధీనంలోనే ఉంది. ఇందులో కొంత భూమిలో వరి పండిస్తుండగా మరి కొంత భూమిలో తోటలు, చేపల చెరువులు ఉన్నాయి. ఈ క్షేత్రానికి పూజలే కాదు కోరిక తీరిన భక్తులు భూములు, ఇతర వసతులు కానుకలుగా సమర్పిస్తున్నారు. తర్వాతి కాలంలో అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి రామలింగరాజు దంపతులు 7.50 లక్షల రూపాయలతో భక్తులకు విశ్రాంతి గృహాన్ని నిర్మించారు. అలాగే జవ్వల పల్లె గ్రామానికి చెందిన గోకరాజు, మహాలక్ష్మమ్మ కుమారుడు నడింపల్లి వెంకట్రామ రాజు ఇచ్చిన 7 లక్షల రూపాయలతో కార్యనిర్వాహక అధికారి కార్యాలయాన్ని నిర్మించారు.

ఆలయవిశిష్టత

పచ్చని పంటపొలాల మధ్యన ఉన్న గ్రామంలో కొలువై ఉండటం ఈక్షేత్రానికి ఒక ప్రత్యేకత అయితే మరొక ప్రత్యేకత స్వామివారికి తల వెనుక భాగంలో స్త్రీలకి వలె కొప్పు ఉండడము. ఈ విధమైన రూపము దేశంలో మరెక్కడాలేదు. అదే విధంగ స్వామి వారి హృదయంలో లక్ష్మీ దేవి రూపం కనిపిస్తుంది. స్వామివారికి కుడి ఎడమల్లో పద్మావతీ, ఆండాళ్ అమ్మ వార్లు దర్శనమిస్తారు. ఈ స్వామి వారు కోరిన కోరికలను నెరవేరుస్తారని ..... పూజలే గాదు ... భక్తులు భూములు ఇతర వసతులు కల్పిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణము రంగు రంగుల పూలతో, పచ్చని మొక్కలతో శోభిల్లుతుంటుంది. ఈ ఆలయ ఆవరణములో మనోహర మైన ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమాచార్య విగ్రహం మనోహరంగా కనిపిస్తుంది. ఇంతటి విశిష్టతలున్న ఈ ఆలయాన్ని తప్పక సందర్శించ వలసినదే.

పూజలు, ఉత్సవాలు

ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ ఏకాదశి, ఆశ్వయుజ శుద్ధ చతుర్ధశి రోజుల్లో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఆ సందర్భంలో తయారు చేసే పొంగలి ప్రసాదానికి చాల ప్రాముఖ్యత ఉంది. దానిని తింటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మిక, ఈ పులిహోర ప్రసాదానికి దేశ విదేశాల్లోను మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. కొంత మంది భక్తులు ఈ పులిహోర పోపు తయారు చేయించుకొని విదేశాలకు కూడా తీసుకెళుతుంటారు. తిరుమలలో శ్రీ వారి లడ్డుకు దేశ విదేశాలలో ఎంత ప్రాముఖ్యత ఉన్నదో ఈ ఆలయంలోను పులిహోరకు స్థానికంగా అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో శాంతి కళ్యాణం జరిపిస్తే తమ ఇంట మంచి జరుగు తుందని భక్తుల విశ్వాసం. మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారు ప్రతి ఒక్కరు తమ మొదటి జీతాన్ని ఈ స్వామి వారికి ఇవ్వడము కాళ్లకూరు పరిసర ప్రాంతాల్లో సర్వ సాధారణము.

ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి?

ఈ ఆలయము భీమవరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి కలిదిండి మీదుగా పశ్చిమ గోదావరి లోకి ప్రవేశించగానే ఏలూరుపాడు, జువ్వలపాలెం గ్రామాలు దాటాక ఈ క్షేత్రము కనిపిస్తుంది. భీమవరం నుండి ఈ క్షేత్రానికి ప్రతి అరగంటకు RTC బస్సులుంటాయి.

తల్పగిరి రంగ నాధస్వామి ఆలయము: నెల్లూరు[మార్చు]

తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయ గాలి గోపురము: నెల్లూరు
ఈ ఆలయము ఎక్కడున్నది ?

నెల్లూరు పట్టణంలోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి ఆలయం ఉంది. రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు. ప్రసిద్ధి చెందిన రంగనాధ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు.

చారిత్రక ప్రాముఖ్యత

12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది.17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

ఆలయ విశిష్టత

ఈ దేవాలయానికి సంబంధించిన గాలి గోపురం 7 అంతస్తులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ గాలి గోపురం పైభాగాన బంగారు పూత పూసిన 7 కలశములు ఉంటాయి. ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు. గర్భగుడిలోనికి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి ఉంచుతారు.

పూజలు.. ఉత్సవాలు

నిత్య పూజా కార్యక్రమాలు జరిగే ఈ ఆలయంలో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో పైకప్పుకు చిత్రించిన శ్రీ కృష్ణుని తైల వర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మనవైపే చూస్తున్నట్లుగా ఉండి, మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది.

మావుళ్లమ్మ, ప.గో. జిల్లా[మార్చు]

చారిత్రిక నేపథ్యం

మామిడి చెట్లు అధికంగా ఉన్న ప్రాంతంలో వెలసింది గనుక ఈ అమ్మవారికి మామిళ్ళమ్మగా పేరు వచ్చింది. కాల క్రమంలో అది మావుళ్ళమ్మగా మార్పు చెందినది. ఈ క్షేత్రము చాల పురాతనమైనా 1800 వ సంవత్సరం నుండి మాత్రమే చారిత్రికాధారాలు లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవన ప్రాంతంలో ఉన్న వేప, రావి చెట్లు కలిసిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికుల కథనము. 1880 వ సంవత్సరంలో భీమవరానికి చెందిన మాచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించ వలసినదిగా ఆదేశించిందట. అమ్మవారి ఆదేశానుసారం వారు అయిదు దీపాలు ఉన్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు. 1910 వ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాల వరకు పాడైంది. 1920 లో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచాడు. కాని ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చి దిద్దాడు.

ఆలయ విశిష్టత

ఈ క్షేత్రంలో గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్ధుని, రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉండడము ఇందలి ప్రత్యేకత. అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు.... చీరలు వంటి వాటిద్వారా ప్రతియేటా రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం అమ్మవారికి ఆభారణాల రూపంలో 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. అమ్మవారికి 65 కిలోల బంగారంతో చీర ఆభరణాలు తయారు చేయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. దీని కొరకు స్థానిక ప్రముఖులు.... విదేశాలలో ఉన్నవారు స్పందిస్తున్నారు. అమ్మవారికి 16 కిలోల బంగారంతో త్రిశూలం, ఢమరుకం తయారు చేశారు. ప్రస్తుతం అమ్మవారికి బంగారు కిరీటము, త్రిశూలము ఉన్నాయి. ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండడము, ఇంతటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగడము దేశంలో మరెక్కడా లేదని అదే ఈ ఆలయ విశిష్టత అని పూజారి రామలింగేశ్వర శర్మ అంటాడు.

పూజలు, ఉత్సవాలు

ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు. జ్యేష్ట మాసంలో నెల రోజులు గ్రామ జాతర, నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు. ప్రతి రోజు లక్ష కుంకుమార్చన, చండీ హోమం ఇతర పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడు జనవరి 13 నుండి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఉత్సవాల చివరి 8 రోజులలో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరిరోజున వేలాదిమంది భక్తులకు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది.

ఈక్షేత్రం ఎక్కడున్నది?

పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య పట్టణమైన ఏలూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరంలో ఉన్నది ఈ క్షేత్రము. (మూలం: ఈనాడు.. ఆదివారము 2012 జనవరి 8)

శ్రీవేదనారాయణస్వామివారి ఆలయం నాగలాపురం .. చిత్తూరుజిల్లా.[మార్చు]

నాగలాపురం, వేదనారాయణస్వామి వారి ఆలయ ప్రధాన గోపురము. పై భాగమంతా ఈ మద్య కాలంలో తి.తి.దే. వారి చే నిర్మించ బడింది.
నాగలాపురం, వేదనారాయణ స్వామి వారి ఆలయ రెండవ గోపురము
స్థలపురాణము
..

సోమకాసురడనే రాక్షసుడు.. బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచెను. శ్రీమహావిష్ణువు మత్స్యావతారము దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి, బ్రహ్మకిచ్చిన స్థలము ఇదే. దీనిని అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరు గాంచింది.

చారిత్రకాంశాలు

ఈ ఆలయ ఉత్త కుడ్యమునందు గల శాసనము ద్వారా తెలియ వచ్చిన విషయం: శ్రీకృష్ణ దేవరాయలు తన దక్షిణ దేశ పర్యటనలో .... హరికంఠ పురములో పల్లవులచే నిర్మించబడిన శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్ అనే ఈ చిన్న ఆలయాన్ని సందర్శించి, శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంగా మార్చి, పంచ ప్రాకారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్ది, పునర్మించి అనేక దానములు చేసి తన తల్లి పేరున దీనిని నాగలాపురముగా నామకరణము చేసెనని తెలియుచున్నది.

దస్త్రం:Dwaja sthambam of nagalapuram temple9.JPG
నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం
నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం వెనకనున్న మండపం పైనున్న స్వామి వారి మూర్తి ( ప్రధాన గర్భగుడి లోని మూర్తిని పోలినది (స్వామి వారు మత్సావతారంలో)
పూజలు

ప్రతి యేడు మార్చి 23, 24, 25 వ తేదీలలో సూర్య పూజోత్సవము మిక్కిలి వైభవంగా జరుగును. 26, 27, 28 వ తేదీలలో మూడు రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. అదే విధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగును. ప్రతిరోజు ముప్పూటలా నిత్య పూజలు జరుగును. ఈ ఆలయం 24/9/1967 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోనికి వచ్చింది. ఆ నాటి నుండి నిత్య, వార, వక్ష, మాస, సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుచున్నవి.

ఆలయ విశేషాలు

ఈ ఆలయ ప్రధాన గోపురమందున్న ద్వారము అతి విశాలముగా నున్నది. దానిపైనుండిన గోపురము కూలిపోగా.... తి.తి.దేవస్థానం వారు కొత్తగా గోపురాన్ని నిర్మించారు. కనుక ఇది చిన్నదిగానున్నది. ఈ గోపురం నుండి సాగిన ప్రహరీలో కుడి ఎడమలకు మరో రెండు గోపురములు ఉన్నాయి. అవి ఆనాటివైనందున శిథిలావస్థలో నున్నందున ఇనుప స్తంభాలతో భద్రపరిచారు. బొమ్మ చూడండి ఈ ప్రాకారంలో కొబ్బరి తోట, పూల తోటలు ఉన్నాయి. మరెటువంటి కట్టడాలు లేవు. ఈ ఆవరణంలో వెనుకనున్న చిన్న ద్వారం పైన మత్స్యావతార చిత్రాన్ని చూడ వచ్చు. ఆ తరువాత రెండో గోపురముతో చుట్టబడిన ప్రహరీ లోపల ప్రధాన ఆలయమున్నది. అందులోనే కళ్యాణ మండపము, ఇతర దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రాకారంలో నుండి గర్భాలయం లోనికి వెళ్ళవచ్చు. చాల దూరంలో స్వామి వారి మూల విరాట్టు ఉంది. మూల విరాట్టు పాదభాగము మత్స్య రూపంలో ఉండగా, శంఖు, చక్రాలు ధరించిన మూర్తిని దేవేరులతో సహా దర్శించ వచ్చు. ఈ గర్భాలయం చుట్టూ మరో ప్రాంగణము ఉంది. అందులో వరండాలలో అనేక ఉప ఆలయాలు, దేవతా మూర్తులతో అలారారు తున్నవి. గర్భాలయ ప్రదక్షిణకు ఇదే మార్గము.

నాగలాపురం, శ్రీ వేదనారాయణ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆలయ వివరాలను తెలిపే బోర్డు
నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం ఎడమ ప్రక్కనున్న గోపురము పైభాగము

ఈ ఆలయ ప్రహరీ గోడలు అక్కడక్కడా కూలి పోయినందున తిరిగి నిర్మించి ఉన్నారు. (బొమ్మ చూడుము) ప్రధాన గోపురాల లోని శిల్ప కళ చాల అద్భుతంగా ఉంది. ప్రతి రోజు పర్యటక శాఖవారి ఆలయ దర్శన బస్సులు తిరుపతి నుండి నాగలాపురమునకు నడుపబడు చున్నవి.

ఆలయ విశిష్టత

ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.

ఎక్కడుందీ ఆలయం

ఆంధ్ర ప్రదేశ్... చిత్తూరు జిల్లాలోని తిరుపతికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి అనేక బస్సులున్నాయి. తి.తి.దే వారి ఆలయ దర్శన బస్సు ప్రతి రోజు ఇక్కడికి వస్తుంది. మూలం: స్వయంసందర్శన: స్వామివారి సూర్యపూజా ఉత్సవాల ఆహ్వాన పత్రిక.

అప్పలాయగుంట ... ప్రసన్న వేంకటేశ్వరాలయం, చిత్తూరు జిల్లా.[మార్చు]

అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం ముందున్న, ఆలయ వివరాలు తెలిపే బోర్డు

అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంటలో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది.

స్థల పురాణం

శ్రీ వేంకటేశ్వరుడు........ నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురంలో ఆరునెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం.

ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొలాలు ఉండడముతో వాతావరణము చాల ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం ఎదురుగా గర్భ గుడిలో శ్రీ వారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది. శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు అనగా ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము ఉంది.

అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరాలయ కోనేరు, దీనికి అవతలనున్నది ఆంజనేయ స్వామి ఆలయం

ప్రతి నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి, తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగ జేస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు తక్కువ ఉన్నందున ఆలయం ప్రశాంత వాతావరణములో ఉన్నందున భక్తులు సావధానంగా చిత్త శుద్ధితో దైవ దర్శనం చేసుకోవచ్చు.

ఈక్షేత్రానికి ఎలా వెళ్ళాలి?

అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి పరిసరప్రాంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడా ఇక్కడి వస్తుంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయమిది.

మూలం
స్వయంసందర్శనం : ఆలయ ప్రాంగణంలో నిలిపిన ఆలయ వివరాలు తెలిపే బోర్డు.