ఆంధ్ర విశ్వవిద్యాలయం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
|
ఆంధ్ర విశ్వవిద్యాలయం |
|
|---|---|
| స్థాపన | 1925 |
| తరహా | సార్వత్రిక |
| ఉప సంచాలకుడు | బేల సత్యనారాయణ |
| Dean | ఎమ్.సి.హెచ్.శివ ప్రసాద్ |
| ప్రదేశం | విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారత్ |
| క్యాంపస్ | పట్టణ ప్రాంతం |
| Affiliations | యుజిసి |
| వెబ్సైటు | www.andhrauniversity.info |
ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఆంధ్ర విశ్వకళా పరిషత్ లేదా ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University), భారతదేశంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది విశాఖపట్నంలో ఉంది.
ఈ విశ్వవిద్యాలయం 1926 లో ఏర్పడింది. మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమలలో ఉన్న కళాశాలతో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పడింది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించాడు. ఆ మధ్య కాలములో సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం "కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం". ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ యొక్క ఆదర్శ విశ్వవిద్యాలయము రూపులో తీర్చిదిద్దబడినది.
తర్వాత 1954 లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము ఏర్పడింది. ఆతర్వాత, 1967 లో గుంటూరులో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1976 లో నాగార్జున విశ్వవిద్యాలయము గా అవతరించింది. దీని పేరును ఆచార్య నాగార్జునుని పేరిట 2004 లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయము గా మార్చారు.
ఆంధ్ర విశ్వ విద్యాలయము ఉత్తర, దక్షిణ ఆవరణ(క్యాంపస్)లు గా ఉంది. దక్షిణ ఆవరణ (ఇదే మొదటినుంచీ ఉన్న ఆవరణ) లో పాలనా విభాగముతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962 లో కొత్తగా ఏర్పరచిన ఉత్తర ఆవరణలో ఇంజనీరింగ్ కళాశాల ఉంది.
విశ్వవిద్యాలయానికి విశాఖపట్నం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల లోను, తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ లోను, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం లోను, విజయనగరం జిల్లా లో విజయనగరం లోను ఆ కేంద్రాలు ఊన్నాయి. కాని, 2006 లో రాజమండ్రి లో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయము ను ఏర్పాటు చేసి దాని పరిధి లోకి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ఆ విధంగా, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. కాని అనుబంధ కళాశాలలకు సంబంధించి కొంత కుదించుకు పోయినా, విశ్వవిద్యాలయ ఆవరణలో దాని ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. నాక్(NAAC) సంస్థ " ఎ " గ్రేడు తో అనుబంధం ఇవ్వడం దీనికి తార్కాణం.
విషయ సూచిక |
[మార్చు] విశ్వవిద్యాలయ చిహ్నము
ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నాన్ని కట్టమంచి రామలింగారెడ్డి (సిఆర్రెడ్డి) ఉప కులపతిగా ఉన్న సమయంలో కౌతా రామమోహనశాస్త్రి రూపకల్పన చేశాడు. చిహ్నంలో ఉన్న తామరపుష్పం సిరి సంపదల దేవత లక్ష్మీదేవి, చదువుల దేవత సరస్వతీదేవి ల ఆసనానికి గుర్తు. స్వస్తిక్ ముద్ర ఆర్యుల ఆశీర్వచనానికి గుర్తు. బయటి వృత్తంలో ఉన్న 64 తామర రేకులు 64 కళలకు గుర్తులు. చిహ్నంలో ఉన్న తేజస్వినావధీతమస్తు అనే వాక్యానికి "నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు" అని అర్ధం. చిహ్నంలో ఉన్న రెండు పాములు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కాపాడుకోవడానికి గుర్తులు. ప్రాచీన నాగ వంశీకులలో ఆంధ్రుల మూలాలు ఉన్నాయంటారు. ఆ విధంగా ఈ రెండు పాములు ఆంధ్రుల ప్రాచీన మూలాలను గుర్తుకు తెస్తాయి.[1]
[మార్చు] ప్రత్యేకతలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతదేశంలోనే మొదటిసారిగా 1934 నుండే కామర్సులో ఆనర్సు డిగ్రీ మొదలుపెట్టింది, 1957లో దేశంలోనే మొట్టమొదటి సారిగా MBA కోర్సుని ప్రవేశపెట్టింది. [2]
- ఫార్మసీ విభాగం ఏర్పాటులో భారతదేశంలో రెండవ స్థానం (మొదట బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం).
- మానవ వనరులను, సాఫ్టువేరు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ మధ్యనే (2008 నుండి) "స్కూల్ ఆఫ్ ఐటి" అనే ఒక సంస్థను నెలకొల్పింది.[3]
[మార్చు] ఉపకులపతులు
- 1. కట్టమంచి రామలింగారెడ్డి (26-04-1926 - 31-07-1930)
- 2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (01-05-1931 - 19-05-1936)
- 3. కట్టమంచి రామలింగారెడ్డి (20-05-1936 - 07-12-1949)
- 4. వి.ఎస్.కృష్ణ (08-12-1949 - 16-06-1961)
- 5. ఎ.ఎల్.నారాయణ (17-06-1961 - 30-06-1966)
- 6. కె.ఆర్.శ్రీనివాస అయ్యంగారు (30-06-1966 - 29-11-1968)
- 7. ఎల్.బుల్లయ్య (30-11-1968 - 12-12-1974)
- 8. ఎమ్.ఆర్.అప్పారావు (13-12-1974 12-12-1980)
- 9. ఆవుల సాంబశివరావు (13-12-1980 - 14-11-1983)
- 10. కోనేరు రామకృష్ణారావు (05-06-1984 - 23-03-1988)
- 11. కె.వి.రమణ (24-03-1988 - 23-03-1991)
- 12. ఎమ్.గోపాలకృష్ణారెడ్డి (18-09-1991 - 15-09-1997)
- 13. ఆర్.రాధాకృష్ణ (22-04-1998 - 04-03-2001)
- 14. వై.సి.సింహాద్రి (03-04-2002 - 02-04-2005)
- 15. ఎల్.వేణుగోపాలరెడ్డి (06-05-2005 - 03-05-2008)
- 16. బేల సత్యనారాయణ (20-06-2008 ఇప్పటిదాకా)
[మార్చు] కళా ప్రపూర్ణ
- ప్రధాన వ్యాసం: కళా ప్రపూర్ణ
కళా ప్రపూర్ణ ఒక బిరుదు లేదా పురస్కారం. ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్.
[మార్చు] మూలాలు
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్సైటులో విశ్వవిద్యాలయ చిహ్నం గురించి వివరిస్తున్న పేజీనుండి మే 21, 2007న సేకరించబడింది.
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైటులో కళలు మరియు కామర్సు కళాశాల పేజి నుండి మే 21, 2007న సేకరించబడింది.
- ↑ ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైటులో స్కూల్ ఆఫ్ ఐటి గురించి. ఏప్రిల్ 23, 2008న సేకరించబడింది.
[మార్చు] బయటి లింకులు
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధికారిక వెబ్సైటు.
