ఆడ బ్రతుకు (1952 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆడబ్రతుకు
(1952 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎ. సుబ్బారావు
కథ తాపీ ధర్మారావు
తారాగణం ఎ.వి.సుబ్బారావు,
రఘురామయ్య,
శ్రీరంజని,
కృష్ణకుమారి
సంగీతం ఓగిరాల రామచంద్రరావు
నృత్యాలు వెంపటి చినసత్యం
కళ టి.వి.ఎస్.శర్మ
నిర్మాణ సంస్థ ఎ. ఎన్. ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఆడబ్రతుకు 1952లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఎ.వి.సుబ్బారావు, రఘురమయ్య, శ్రీరంజని, కృష్ణకుమారి ప్రధాన తారాగణంగా నటిందిన ఈ సినిమాకు ఓగిరాల రామచంద్రరావు సంగీతాన్నందించాడు.[1]

కథ[1][మార్చు]

ఆనందుసేను మహా పండితుడు. కళావేత్త. అతని భార్య శాంత మహా పతివ్రత. వారికి ప్రసూన అనే ఒక్కర్తే కుమార్తె. ఒకనాడు ప్రసూన ఉద్యానవనంలో తోటి బాలికలతో ఆడుకుంటూ ఉంటుంది. శాంతానందులు అక్కడికి వచ్చి పిల్లల ఆటలను చూసి ముచ్చట పడతాడు. అదే సమయంలో చందనపురం నుండి వచ్చిన ఒక భటుడు ఆనందసేనునికి చందనపురం రాజు ఇచ్చిన ఆహ్వాన పత్రికను ఇస్తాడు. బహుంతులతో స్వరగా వస్తానని శాంతకు నచ్చచెప్పి ఆనందు సేను బయలుదేరుతాడు

చందనపురంలో వేడుకలు సలక్షణంగా జరుగుతాయి. ఆనందుసేనునికి ఘనమైన రాజసన్మానం జరుగుతుంది. ఆ వేడుకలలో నర్తకి అయిన మోహిని ఆనందసేనుని విద్యా రూపాలను మెచ్చుకొని అతణ్ణి మోహిస్తుంది. ఎలాగైనా ఆనందుని తన ఇంటికి తీసుకు పోవాలని తలచి ఒక శ్లోకం తెలియలేదన్న మిష పెట్టి ఆనందుని తన ఇంటికి తీసుకు పోతుంది. జయపాల వర్మ మొదలైన విటులు కూడా అక్కడ సమావేశమౌతారు. సంభాషణ పతివ్రతలమీదకి పోతుంది. ఈ కాలంలో పతివ్రతలంటూ లేనేలేరని జయపాలవర్మ అంటాడు. పతివ్రత లున్నారని ఆనందుడు వాదిస్తాడు. మాటలు ముదురుతాయి. ఆనందు జయపాలవర్మను చావగొట్టి వెళ్ళిపోతాడు. ఆ క్రోధంతో జయపాల వర్మ ఆనందు భార్య పాతివ్రత్యాన్ని చెరచి ఆనందునికి గర్వభంగం కలిగిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. మోహిని అతణ్ణి ప్రోత్సహిస్తుంది.

జయపాలవర్మ శాంత ఉన్న గ్రామానికి వెళ్ళీ శాంతను కలుసుకొని వాసు ఆనందసేనుని మిత్రుడనంటాడు. శాంత జయపాలుని కుత్సితబుద్ధి తెలుసుకోలేక అతణ్ణి ఆదరిస్తుంది. కొంత సేపటికి మాటల థోరణీలో వాని ఆంతర్యాన్ని తెలుసుకొని తూలనాడి ఇంటినుండి పొమ్మంటుంది. జయపాలుడు ఎలాగైనా కార్యం సాధించాలని అర్థరాత్రివేళ దొంగతనంగా శాంత ఇంటిలో దూరి ఆమెకు ప్రాణప్రదమైన రత్న కంకణాన్ని దొంగిలించి, మైమరచి నిద్రపోతున శాంత గుండలమీద పుట్టిమచ్చను గుర్తుంచుకొని చందనపురం చేరుకుంటాడు.

మోఃఇని ఇంటికి జయపాలుడు వచ్చి కంకణాన్ని చూపి, పుట్టిమచ్చ గుర్తు చెప్పగానే ఆనందునికి మతిపోయినట్టయి తన పెళ్ళి ఉంగరాన్ని తీసి క్రింద కొట్టి అక్కడనుంచి వెళ్ళిపోతాడు. సమయం దొరికింది కదా అని, మోహిని ప్రేమ పుట్టినట్టు అతణ్ణి సముదాయించి తన వలలో వేసుకుంటుంది. ఆనాటి నుంచి మోయిని ఇంటనే ఉంటాడు.

భర్త ప్రేమతో ఇచ్చిన ఆ కంకణం పోయినందున శాంత భయపడి ఈ వార్త తెలియజేయడానికి నౌకరు శంకరాన్ని ఆనందు దగ్గరకు పంపుతుంది. శాంత వ్యభిచరిణియని శంకరాన్ని నమ్మించి, ఆమెను చంది తన కూతుర్ని తీసుకు రమ్మని ఆనందు శాంకరాన్నే పంపిస్తాడు.

విధిలేక శంకరం తిరిగి వెళ్ళి శాంతనుకలుసుకొని భర్తవద్దకు తీసుకువెళ్తానన్న మిషతొ ఆమెనీ, ఆమె కూతుర్నీ ప్రయాణం చేయించి నట్టడవిలోకి వచ్చి, ఆనందు యిచ్చిన ఆజ్ఞను తెలియజేస్తాడు. శాంత వల వల ఏడ్చి, తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోగల అవకాశం ఇమ్మంటుంది. శంకరం ఒప్పుకొని శాంతను అక్కడే విడిచి పెట్టి ప్రసూనను తీసుకొనిపోయి మోహిని ఇంటిలో ఆనందుకి అప్పజెప్పి తాను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. మోహినీ, ఆమె చెల్లెలు శోభా ప్రసూనను అష్ట కష్టాలను పెడుతూ ఉంటారు. మోహినీ వ్యామోహంలో పడ్డ ఆనందు ప్రసూన పాట్లు గుర్తించడు. మోహిని ఇంటిలో ఉన్న కళావంతులు రామయ్య, సీతయ్యలు మాత్రం ప్రసూనను చూసి జాలి పడుతూ ఉంటారు.

అడవిలో శాంత కోయరాజు చేతుల్లో పడుతుంది. కోయరాజు బిడ్డను శాంత పెంచవలసి వ్స్తుంది. సమయం చూచుకొని శాంత అక్కడ నుంచి తప్పించుకొని పోయి రాజభటుల చేతికి దొరికి, వారి బారి నుండి కూడా తప్పించుకుని పురుష వేషం వేసుకొని మనోహరదాసని పేరు పెట్టుకొని, జయపాలుడున్న ఊరికి వెళుతుంది.

శాంత ఊళ్ళో ప్రవేశిస్తుండగా ఆ ఊరి రాజు గుర్రం మీద సవారీ చేస్తూ గుర్రాన్ని ఆపలేని అపాయ స్థితిలో ఉండగా, శాంత ఉపాయముతో గుర్రాన్ని నిలిపివేసి రాజు ప్రాణాలను కాపాడుతుంది. శాంత తెలివికి మెచ్చుకొని ఆమెను పురుషునిగా భావించి, రాజు ఆమెను తన అంతరంగిక ఉద్యోగిగా చేసుకుంటాడు. మోహినీ ఇంట ప్రసూన కష్టాలు పెరుగుతూనే ఉంటాయి. ఇంటి చాకిరీ అంతా చేసినా ఆమెకు దెబ్బలూ, తిట్లూ తప్పవు. ఆనందు, కూతురు కష్టాలు తెలుకోలేడు. మోహిని మాటే ఆడుతుంటాడు. ఒకనాడు శోభ కోసం కొందరు విటులు మోహిని ఇంటికి వస్తారు. శోభ రూపాన్ని వారు అసహ్యించుకుంటారు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన ప్రసూననుకావాలంటారు. మోహిని కోపం పట్టలేక వారందరూ ఉన్న చోటికి వచ్చినందుకు ప్రసూనను తూలనాడి కొడుతుంది. దిక్కు లేని ప్రసూన మోహిని చావుదెబ్బలు తిని వెక్కి వెక్కి ఏడుస్తుండగా, రామయ్య, సీతయ్యలు ఆమె దగ్గరికి వచ్చి ఓదార్చి ఎక్కడికైనా పారిపోయి గౌరవంగా బ్రతుకుదాం రమ్మని ప్రసూనకు సలహా యిస్తారు. తనకు సోదర తుల్యులైన రామయ్య, సీతయ్యలతో ప్రసూన మోహిని యింటి నుండి పారిపోయి వీధుల్లో నృత్యాలు చేస్తూ పొట్ట గడుపుకుంటూ శాంత ఉన్న ఊరు చేరుకుంటుంది.

కూతుర్ని వెతుక్కుంటూ ఆనందు శాంత ఉన్న ఊరికొచ్చి పురుష వేషంలో ఉన్న శాంతను పోల్చుకోలేక ఆమెకు అతిథిగా ఉంటాడు.

పతివ్రతను అన్యాయంగా కష్టాలు పెట్టిన జయపాలుడికి మనశ్శాంతి లేక బాధపడుచుండగా, తీర్థయాత్రలు చేవిస్తూ ఆ దారిన వచ్చిన శంకరం జయపాలుణ్ణి పోల్చుకొని, అతని బాధకు కారణం గ్రహించి, ఉపాయంతో వాని చేతనే వాని మోసాన్ని కాగితం మీద వ్రాయించి తాయెత్తులో కట్టిస్తాడు.

అందంగా నృత్యం చేస్తున్న ప్రసూన ఒకనాడు జయపాలుని చేతుల్లో పడుతుంది.

ప్రసూన జయపాలుని నుండి రక్షించబడుట, శాంత పాతివ్రత్యం నిరూపించుకొనుటతో కథ ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

  • శ్రీరంజని
  • కృష్ణకుమారి
  • కనకం
  • బేబీ మల్లిక
  • కనకరత్నం
  • నాగరత్నం
  • రఘురామయ్య
  • ఏ.వి.సుబ్బారావు
  • కోటేశ్వరరావు
  • ఎ.ఎల్.నారాయణ
  • వెంకటేశ్వరరావు
  • కుంపట్ల
  • లక్ష్మయ్యచౌదరి
  • ప్రభల
  • తుమ్మలదర్ల

సాంకేతిక వర్గం[మార్చు]

  • నిర్మాత: అరిగే నరసయ్య
  • దర్శకత్వం: బి.ఎ.సుబ్బారావు
  • అసిస్టెంట్స్:చాణుక్య, కుటుంబరావు.
  • కవి: తాపీ
  • కెమేరా: సూరి
  • సౌండ్: వాల్కే, దాము
  • కళ: టి.వి.ఎస్.శర్మ,వాలి
  • సంగీతం: వెంపటి
  • కూర్పు:వేణు, వెంకటేశ్వరరావు
  • మేకప్: నాగేశ్వరరావు, నరశింహులు
  • నేపథ్యగానం: జిక్కి, పి.లీల, శకుంతల, సరోజిని, ఎం.ఎస్.రామారావు, కవిరట్
  • ప్రొడక్షన్: రంగారావు, సూర్యనారాయణ
  • సెట్టింగులు: యం.వి.రంగయ్య
  • స్టిల్ ఛాయాగ్రహణం: ఆర్. వెంకటాచారి

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Aada Brathuku (1952)". Indiancine.ma. Retrieved 2020-08-13.

బాహ్య లంకెలు[మార్చు]