ఆస్వాల్డ్ కూల్డ్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగిరెద్దు- ఆస్వాల్డ్ కూల్డ్రే

ఆస్వాల్డ్ కూల్డ్రే (ఆంగ్లం: Oswald Couldrey) (1882-1958) ఆధునిక ఆంధ్ర చిత్రకారులకు ఆదిగురువు. ఆధునిక చిత్రకళా ఉద్యమాన్ని ఆరంభించినవాడు, ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కు దేశంలో ఒక విశిష్ట స్థానాన్ని సాధించిన తొలి చిత్రకారుడు దామెర్ల రామారావు అయితే, ఆయనకు, ఆయనను అనుసరించిన తొలితరం చిత్రకారులకు గురువు ఆస్వాల్డ్ జెన్నింగ్ కూల్డ్రే.

జీవితం[మార్చు]

1882 సెప్టెంబరు,17 వ తేదీన ఇంగ్లండులో ఆక్స్‌ఫర్డ్ సమీపాన గల అబింగ్టన్ లో జన్మించిన కూల్డ్రే , 1909 లో రాజమండ్రి కి వచ్చి, అప్పుడే ప్రారంభించిన గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపల్ గా పదవీబాధ్యతలు చేపట్టాడు. జీవితమంతా అవివాహితుడుగానే వుండి, 1958 జూలై, 24 వ తేదీన దివంగతుడైనాడు. రాజమండ్రిలో నివసించిన తొమ్మిదేళ్ళ కాలంలో కూల్డ్రే ఆంధ్రదేశానికి చేసిన సేవ మరువరానిది. కూల్డ్రేతో పరిచయమయ్యే నాటికి, దామెర్ల రామారావు వయస్సు పధ్నాలుగేళ్ళు. ఆ బాలునిలోని చిత్రకళా ప్రతిభను, పిపాసను గుర్తించి, అతడికి ప్రేరణ యిచ్చి, ప్రోత్సాహం అందించి, ఒక ఉత్తమ పరిణత చిత్రకారునిగా తీర్చిదిద్దాడు కూల్డ్రే. పాశ్చాత్య చిత్రకళా ప్రభావంతో భారతదేశంలో సంప్రదాయక చిత్రకళ శైలులు మరుగున పడిపోతున్న సమయంలో, 1920 దశాబ్దంలో భారతీయ చిత్రకళ పునరుద్ధరణకు ఉద్యమాలు బయలు దేరాయి. అవనీంద్రనాథ్ ఠాగోర్, నందలాల్ బోస్ వంటి బెంగాలీ చిత్రకారులు బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ను స్థాపించగా, ట్రినడే, శారదా వకీల్, ధురంధర్, చుగతాయ్ వంటి బొంబాయి చిత్రకారులు బాంబే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ను నెలకొల్పారు. కూల్డ్రే నాటిన జాతీయతా భావబీజాలతో దామెర్ల రామారావు, ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ స్థాపించాడు.

కూల్డ్రే గీసిన దామెర్ల రామారావు చిత్తరువు

కూల్డ్రే కేవలం విద్యాధికారే కాక, గొప్ప చిత్రకారుడు. అంతకు మించి గొప్ప సంస్కార హృదయుడు. భారతదేశంలో ఉన్నంత కాలం ఆయన జాతీయ జీవనవిధానంతో మమేకం చెందాడు. ఇంగ్లండు తిరిగి వెళ్ళాక రచించిన సౌత్ ఇండియన్ అవర్స్ (దక్షిణభారత స్మృతులు) లో తనకు భారతదేశంలో గడిపిన కాలమంతా, మధురస్మృతిగా మిగిలిపోయిందని పేర్కొన్నాడు. కూల్డ్రే చిత్రాలు ఎంతో పొందికగా, జీవం ఉట్టిపడుతూ, ఫోటోగ్రాఫిక్ ప్రెసిషన్ తో ఉంటాయి. పల్లె జీవితపు అందాలను తన రచనలలోనే కాక, చిత్రాలలో కూడా అందంగా చూపించాడు. కుప్పనూర్పిళ్ళు,మోటబావి నుండి నీళ్ళు తోడడం, చెట్టు కింద పశువులు విశ్రమించడం, గోదావరి గట్టు, దేవాలయాలు, వాటి పరిసరాలు - యివన్నీ అతనికి ప్రియమైన దృశ్యాలు. అతడు ఒక్క దామెర్ల రామారావుకే కాదు, వరదా వెంకటరత్నం, అడవి బాపిరాజు, కవికొండల వెంకటరావు, దామెర్ల వెంకటరావు వంటి పలువురికి మార్గదర్శకుడైనాడు. అతని ప్రేరణతోనే అడవి బాపిరాజు అజంతా చిత్రాలను, అమరావతి శిల్పాలను అధ్యయనం చేసి, తన కళకు మెరుగులు దిద్దుకున్నాడు. ఆదివారాలలో సెలవు దినాల్లో కూల్డ్రే సాహిత్య, చిత్రకళాభిమానులను తన బంగళాకు ఆహ్వానించి, అనేక విషయాలపై చర్చలు జరిపిస్తూ వుండేవాడు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో అప్పుడు జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నసర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఆ చర్చల్లో పాల్గొనేవాడు. కూల్డ్రే తన పుస్తకంలో ఆంధ్రదేశంలోని తోలుబొమ్మలాట ను ఎంతగానో మెచ్చుకొన్నాడు. అది ఎంతో సృజనాత్మకమైన కళా ప్రక్రియ అని అతడు పేర్కొన్నాడు. ఆంధ్ర చిత్రకళారంగ పునరుజ్జీవనానికి ఎంతో దోహదం చేసిన కూల్డ్రేకు ఆంధ్రులు ఎంతో ఋణపడి ఉంటారు.

నీటి వర్ణ చిత్రాలు[మార్చు]

ఇతడు సృష్టించిన కొన్ని నీటి వర్ణ చిత్రాలు:

  • The Mistaken Fury (1914)
  • Thames and Godaveri (1920)
  • South Indian Hours (1924)
  • Triolets and Epigrams (1948?)
  • The Phantom Waterfall (1949)
  • Sonnets of East and West (1951)
  • Verses over Fifty Years (1958).


మూలం[మార్చు]

అక్షర డి.ఆర్. అభినందన, నవంబరు, 2005 - విప్పర్తి కలికావతారం వ్యాసం; ఆధునిక ఆంధ్ర చిత్రకారులకు ఆదిగురువు ఆస్వాల్డ్ కూల్డ్రే .

బయటి లింకులు[మార్చు]