ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 814
ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 814 (కాల్ సైన్ IC_814) ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్ బస్ A300 విమానం. నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా అది భారత్ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సి ఉంది. మార్గమధ్యంలోనే హైజాకింగ్కు గురైంది. ఇది తమ పనేనని పాకిస్థాన్ నుంచి కార్యకలాపాలు నడిపే హర్కతుల్ ముజాహిదీన్ అనే ఓ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు భారత వాయుతలంలోకి ప్రవేశించిన కాసేపటికే విమానాన్ని సాయుధ ముష్కరులు హైజాక్ చేశారు. అమృత్సర్లో, తర్వాత లాహోర్, దుబాయ్లలో దిగిన తర్వాత ఎట్టకేలకు విమానాన్ని బలవంతంగా అఫ్గానిస్థాన్లోని కాందహార్లో హైజాకర్లు దించేశారు. మొత్తం 176 మంది ప్రయాణికుల్లో 27 మందిని వారు దుబాయ్లో దించేశారు. కానీ ఒకరిని దారుణంగా కత్తులతో పొడిచారు. మరికొంత మందిని బాగా గాయపరిచారు.
అఫ్గానిస్థాన్లోని పాలక తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ గుర్తించకపోవడంతో భారత అధికారులు, హైజాకర్ల మధ్య చర్చలకు అడ్డంకులు తలెత్తాయి. భారత ప్రత్యేక దళాలు విమానం పై పెద్దపెట్టున దాడికి దిగకుండా అడ్డుకునేందుకు తాలిబన్లు తమ సాయుధ పోరాట యోధులను విమానం పరిసరాల్లో భారీగా మోహరించారు. హైజాకింగ్ మొత్తం ఏడు రోజుల పాటు కొనసాగింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ముస్తాక్ అహ్మద్ జర్గర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ (వీరిద్దరినీ అనంతరం డేనియల్ పర్ల్ హత్య కేసులో తిరిగి అరెస్టు చేశారు), మౌలానా మసూద్ అజర్ (ఇతను అనంతరం జైషే మహ్మద్నుస్థాపించాడు)లను భారత్ విడుదల చేసిన తర్వాత హైజాకింగ్ ముగిసింది.
ఈ హైజాకర్లకు అల్ఖైదా, తాలిబన్లతో సన్నిహిత సంబంధాలున్నాయని అమెరికా, భారత నిఘా వర్గాలు నివేదించాయి. ఐదుగురు హైజాకర్లకు, విడుదలైన ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులకు తాలిబన్లు సురక్షిత ప్రయాణాన్ని కల్పించారు. ఈ విషయంలో తాలిబన్లు పోషించిన పాత్ర పట్ల పెద్దపెట్టున విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా భారత్, తాలిబన్ల మధ్య సంబంధాలు మరింతగా క్షీణించాయి.
విషయ సూచిక |
ప్రయాణీకులు [మార్చు]
విమానంలో 178 మంది ప్రయాణికులున్నారు. వారిలో అత్యధికులు భారతీయులే. వారంతా నేపాల్లో సెలవులు గడిపి తిరిగొస్తున్నారు.[1]
హైజాకింగ్ [మార్చు]
ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 814 (VT-EDW)ను 1999 డిసెంబర్ 24న శుక్రవారం హైజాక్కు గురైంది. భారత కాలమానం ప్రకారం[2] సాయంత్రం 5.30కు భారత గగనతలంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే హైజాకింగ్ జరిగింది. భారత ప్రభుత్వం చెప్పిన మేరకు హైజాకర్ల గుర్తులు ఈ విధంగా ఉన్నాయి:[3]
- ఇబ్రహీం అథార్, బహావల్పూర్, పాకిస్థాన్
- షాహిద్ అక్తర్ సయీద్; కరాచీ, పాకిస్థాన్
- సున్నీ అహ్మద్ ఖాజీ, కరాచీ, పాకిస్తాన్
- మిస్త్రీ జహర్ ఇబ్రహీం, కరాచీ, పాకిస్థాన్
- షకీర్ సుకుర్, పాకిస్థాన్
ఘటనా క్రమాన్ని ఐసీ-814 ఫ్లైట్ అటెండెంట్ అనిల్ శర్మ తర్వాత ఇలా చెప్పుకొచ్చారు. మాస్కు, అద్దాలు దరించిన ఒక వ్యక్తి విమానాన్ని బాంబుతో పేల్చేస్తానని బెదిరించాడు. పశ్చిమ దిశగా విమానాన్ని మళ్లించాల్సిందిగా కెప్టెన్ దేవీ శరణ్ను ఆదేశించాడు.[4] విమానాన్ని లక్నో మీదుగా మళ్లించి నేరుగా లాహోర్ తీసుకెళ్లాలని హైజాకర్లు భావించారు. కానీ పాకిస్థాన్ అధికారులు అందుకు వెంటనే అనుమతి నిరాకరించారు. లేదంటే ఉగ్రవాదులతో కలిసిపోయామన్న అపవాదు వస్తుందని వారు భయపడ్డారు. దాంతోపాటు విమానంలో ఇంధనం కూడా చాలినంత లేదు. దాంతో కెప్టెన్ దేవీ శరణ్ అదే విషయాన్ని హైజాకర్లకు చెప్పి భారత్లోని అమృత్సర్లో విమానాన్ని దించేశాడు.[4]
భారత్లోని అమృత్సర్లో దిగిన విమానం [మార్చు]
అమృత్సర్ చేరిన తర్వాత విమానంలో ఇంధనం నింపాల్సిందిగా కెప్టెన్ వరణ్ కోరారు. కానీ విమానం కదలకుండా చేయాల్సిందిగా అమృత్సర్ వర్గాలకు సంక్షోభ నిర్వహణ గ్రూపు ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ పోలీస్కు చెందిన సాయుధ దళాలు అప్పటికే అందుకు సిద్ధమయ్యాయి. కానీ ఢిల్లీ నుంచి వారికి అనుమతులు రాలేదు. ఎట్టకేలకు ఒక ఫ్యూయల్ ట్యాంకర్ను పంపించారు. కానీ విమానం దారిని మూసేయాల్సిందిగా నిర్దేశకాలు అందాయి. ట్యాంకర్ విమానం కేసి వెళ్తుండగా నెమ్మదించాల్సిందిగా అందులోని పైలట్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఆదేశాలందాయి. దాంతో అది ఆగిపోయింది. ఈ హఠాత్ చర్య హైజాకర్లలో అనుమానాలు పెంచింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులు కూడా లేకుండానే తక్షణం విమానాన్ని బలవంతంగా టేకాఫ్ చేయించారు. ఆ సమయంలో ట్యాంకర్ను కేవలం కొద్ది అడుగుల తేడాతో విమానం మిస్సవుతూ వెళ్లింది.[5]
పాకిస్థాన్లోని లాహోర్లో దిగడం [మార్చు]
ఇంధన నిల్వలు అట్టడుగుకు పడిపోవడంతో అత్యవసర ల్యాండింగ్కు అనుమతించాల్సిందిగా పాకిస్థాన్లోని లాహోర్ వర్గాలను విమానం అభ్యర్థించింది. కానీ తమ దేశానికి ఉగ్రవాద సంబంధాలు అంటగడతారన్న భయంతో పాకిస్థాన్ అందుకు నిరాకరించారు. తమ ఎయిర్ ట్రాఫిక్ సేవలను కూడా పాక్ మూసేసింది. భారత విమానానికి పాక్ గగనతలాన్ని దాదాపుగా మూసేసింది. లాహోర్ విమానాశ్రయంలో[6] లైట్లన్నింటినీ ఆర్పేసింది. ATC నుంచి ఏ సాయమూ లేకూపోవడంతో కెప్టెన్ శరణ్ తన కళ్ల ముందు కనబడుతున్న దృశ్యాల పై మాత్రమే ఆధారపడుతూ తాను రన్వేగా భావించిన స్థలం పై విమానాన్ని దించబోయాడు. కానీ అది కేవలం మామూలు రోడ్డేనని గుర్తించి సకాలంలో విమానాన్ని పైకి లేపాడు.[7] ఇక క్రాష్ ల్యాండింగ్ తప్ప విమానానికి మరే అవకాశమూ లేదని తేలిపోవడంతో ఎట్టకేలకు పాక్ వర్గాలు లాహోర్ విమానాశ్రయం లైట్లను వెలిగించాయి. విమానం ల్యాండింగ్ను అనుమతించాయి. అక్కడ విమానంలో లాహోర్ విమానాశ్రయ వర్గాలు ఇంధనం నింపాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.32కు అక్కడి నుంచి బయల్దేరేందుకు దానికి అనుమతి కూడా ఇచ్చాయి. పైగా కొందరు మహిళలు, పిల్లలను దించేందుకు అనుమతించాలన్న పైలట్ అభ్యర్థనను కూడా పాక్ వర్గాలు నిరాకరించాయి.[8]
UAEలోని దుబాయ్లో ల్యాండింగ్ [మార్చు]
లాహోర్ నుంచి విమానం దుబాయ్కి వెళ్లింది. ఆ అభాగ్య విమానం నుంచి 27 మంది ప్రయాణికులను అక్కడ దించేశారు.[8] వారితో పాటు తీవ్ర గాయాల పాలైన 25ఏళ్ల రిపన్ కత్యాల్ అనే భారతీయున్ని కూడా కిడ్నాపర్లు వదిలేశారు. అతన్ని వారు పలుమార్లు కత్తితో పొడిచారు. ఆ తర్వాత గాయాలతో అతను మరణించాడు. ఈ మొత్తం ఉదంతంలో తొలి, ఏకైక మృతుడు అతనే అయ్యాడు.[9]
ఈ ప్రయాణికులను దించేయగానే హైజాకైన విమానం కాందహార్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లింది.[2]
అఫ్గానిస్థాన్లోని కాందహార్లో ల్యాండింగ్ [మార్చు]
విమానం కాందహార్లో దిగగానే తాలిబన్ వర్గాలు అంతర్జాతీయ గుర్తింపు పొందే లక్ష్యంతో భారత వర్గాలకు సహకరించేందుకు అంగీకరించాయి. హైజాకర్లకు, భారత వర్గాలకు మధ్య ప్రతినిధుల అవతారమెత్తాయి.[10] కానీ తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ గుర్తించకపోవడంతో ఇస్లామాబాద్లోని తమ హై కమిషన్ నుంచి ఒక అధికారిని కాందహార్కు భారత్ పంపింది.[8] గతంలో తాలిబన్ వర్గాలతో భారత్ ఎప్పుడూ సంప్రదించి ఉండకపోవడంతో పూర్తి ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది.[11][12]
అయితే సాయుధ బలగాలు హైజాకైన విమానాన్ని చుట్టుముట్టడంతో తాలిబన్ల వ్యవహార శైలి పై అనుమానాలు తలెత్తాయి.[13] బందీలను చంపకుండా లేదా గాయపరచకుండా హైజాకర్లను అడ్డుకోడానికే బలగాలను దింపామని తాలిబన్లు చెబుతూ వచ్చారు. అయితే హైజాకర్ల పై భారత సైన్యం దాడి చేయకుండానే తాలిబన్లు ఈ పన్నాగం పన్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.[14][15]
తీవ్రవాదుల విడుదల [మార్చు]
భారత జైళ్లలో ఉన్న 35 మంది ఇస్లామిక్ మిలిటెంట్లను విడుదల చేయాలని, డబ్బు రూపంలో 200 మిలియన్ డాలర్లను[14] ఇవ్వాలని హైజాకర్లు మొదట డిమాండ్ చేశారు. కానీ ముగ్గురు ఖైదీలను మాత్రమే విడిచిపెట్టడానికి హైజాకర్లను ఒప్పించడంలో భారత మధ్యవర్తులు సఫలీకృతులయ్యారు. వారి వివరాలు:[16]
- మౌలానా మసూద్ అజర్ - 2000 సంవత్సరంలో జైష్ ఇ మొహమ్మద్ తీవ్రవాద సంస్థను స్థాపించాడు. 2001లో భారత పార్లమెంటు పై దాడిలో ఈ సంస్థ హస్తముందన్న ఆరోపణలున్నాయి.[17][18]
- అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ - డేనియల్ పెర్ల్ కిడ్నాప్ మరియు హత్య కేసులో పాక్ అధికారులు 2002లో అరెస్టు చేశారు.[19][20]
- ముస్తాఖ్ అహ్మద్ జార్గార్ - విడుదలయ్యాక పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మిలిటెంట్లకు శిక్షణ ఇవ్వడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు.[21]
భారత్ లో 1994లో జరిగిన విదేశీ పర్యాటకుల అపహరణ కేసులో అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ జెలుకెళ్లాడు. అలాగే డేనియల్ పెర్ల్ హత్య కేసులోనూ ప్రమేయముంది. అమెరికాలో జరిగిన సెప్టెంబర్ 11దాడుల ప్రణాళికలో కూడా ఇతను కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలున్నాయి.[22]
కాందహార్ లో ముగ్గురు తీవ్రవాదులు దిగిన తర్వాత విమానంలోని బందీలను విడిచిపెట్టారు. 1999 డిసెంబర్ 31న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం 814 నుంచి విడుదలైన బందీలను ప్రత్యేక విమానంలో భారత్ తీసుకువచ్చారు.
జనరంజిక సంస్కృతిలో [మార్చు]
IC 814 విమాన హైజాకింగ్ ఘటనను ఇతివృత్తంగా చేసుకుని బాలీవుడ్ లో జమీన్ అనే హిందీ సినిమా తీశారు. ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తీవ్రవాదులు హైజాక్ చేస్తారు.
బాలీవుడ్ సినిమా హైజాక్ కూడా ఇదే కథతో సాగుతుంది.[citation needed]
హర్యానాలోని గుర్గావ్ కు చెందిన మిడిటెక్ అప్పటి హైజాక్ ఘటనను ప్రదర్శిస్తూ ఎయిర్ హైజాక్ పేరుతో ఒక లఘు చిత్రాన్ని తీసింది. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ లో కూడా ఒక లఘు చిత్రం వచ్చింది.[23][24]
వీటిని కూడా పరిశీలించండి [మార్చు]
- చెరలో 173 గంటలు, హైజాకింగ్ పై పుస్తకం
- ఎయిర్ ఇండియా విమానం 182
- ఎయిర్ ఫ్రాన్స్ విమానం 8969
సూచనలు [మార్చు]
- ↑ "ఎయిర్ హైజాక్." [డాక్యుమెంటరీ టీవీ షో] మిడిటెక్
- ↑ 2.0 2.1 Vohra, Ranbir (2000). The making of India. M.E. Sharpe. ISBN 9780765607119.
- ↑ భారత రాయబార కార్యాలయం: హైజాకర్స్ వివరాలు
- ↑ 4.0 4.1 "How Govt lost the IC-814 hijack deal". 2006-09-07. Retrieved 2006-09-07.
- ↑ "Cover Story: Hijacking; ... in Amritsar, a speeding tanker causes panic". India-today.com. 2000-01-10. Retrieved 2010-06-08.
- ↑ "Cover Story: Hijacking; ... in Lahore, there is a political sideshow". India-today.com. 2000-01-10. Retrieved 2010-06-08.
- ↑ http://www.indiarightsonline.com/Sabrang/ethnic2.nsf/38b852a8345861dd65256a980059289d/d2a5602660dc9ade65256dd400236ede?OpenDocument
- ↑ 8.0 8.1 8.2 జ్యోతింద్రనాథ్ దీక్షిత్ రాసిన భారత్ - పాకిస్తాన్ వార్ అండ్ పీస్
- ↑ ఆన్ ఎయిట్ డే ఆర్డియల్
- ↑ శ్రీకాంత ఘోష్ రాసిన పాకిస్తాన్స్ ISI
- ↑ డేవిడ్ వాన్ ప్రాగ్ రాసిన ద గ్రేటర్ గేమ్
- ↑ రీడెల్, బ్రూస్. "ది సెర్చ్ ఫర్ అల్-ఖైదా", 2008
- ↑ గిరిరాజ్ షా రాసిన హైజాకింగ్ అండ్ టెర్రర్ ఇన్ స్కై
- ↑ 14.0 14.1 రోహన్ గుణరత్న రాసిన ఇన్ సైడ్ అల్ ఖైదా
- ↑ జె. పౌల్ డి బి. తైల్లన్ రాసిన హైజాకింగ్ అండ్ హోస్టేజస్
- ↑ భారత రాయబార కార్యాలయం
- ↑ ద ఇండిపెండెంట్: పార్లమెంటుపై దాడి ఘటనకు పాకిస్తాన్ పై భారత్ నిందలు
- ↑ రాయ్ గౌతమ్ రాసిన హౌ వి మిస్సుడ్ ద స్టోరీ
- ↑ "Profile: Omar Saeed Sheikh", BBC News, 2002-07-16. Retrieved on 2010-05-05.
- ↑ ఆన్ లైన్ న్యూస్ అవర్ అప్ డేట్: పెర్ల్ హత్య కేసులో నలుగురిని దోషులుగా తేల్చిన పాక్ - జులై 15, 2002
- ↑ Abhinandan Mishra (2008-07-27). "India's Response To Terrorism - Are We Losing The War?". Archived from [8126110902http://desicritics.org/2008/07/27/132626.php the original] on 2008-08-04. Retrieved 2008-08-04.
- ↑ CNN ట్రాన్సుక్రిప్ట్ ""Suspected Mastermind of Pearl Killing Arrested"", CNN, 2001-02-07. Retrieved on 2006-06-29. ఫిబ్రవరి 12, 2002.
- ↑ IC 814 హైజాక్
- ↑ ద హిందు: న్యూ ఢిల్లీ న్యూస్: ఇన్ సైడ్ ద వరల్డ్ ఆఫ్ టెర్రర్
బాహ్య లింకులు [మార్చు]
- హైజాకైన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం IC-814 గురించి సమాచారం,భారత రాయబార కార్యాలయం
- పాకిస్తానీ హైజాకర్ల ఛాయాచిత్రాలు
- IC-814లో నా అనుభవాలు
- ఇండియన్ ఎయిర్ లైన్స్ కేప్టెన్ దేవీ శరణ్ కు 1999 సేఫ్ స్కైస్ అవార్డు
- కందహార్ హైజాకింగ్ లో అజీజ్ హస్తం
- పాక్ లో స్వేచ్ఛగా IC-814 హైజాకర్స్
- భారత్ లో సెలబ్రిటీగా మారిన IC-814 కేప్టెన్
- మూస:ASN accident
మూస:Coord missing మూస:Aviation incidents and accidents in 1999
- All articles with unsourced statements
- Articles with unsourced statements from October 2008
- Articles with invalid date parameter in template
- 1999లో విమానయాన దుర్ఘటనలు మరియు సంఘటనలు
- విమానాల హైజాకింగ్స్
- భారత్ లో విమానయాన ప్రమాదాలు మరియు సంఘటనలు
- భారత్ లో ఇస్లామిక్ తీవ్రవాదం
- 1999లో భారత్ లో తీవ్రవాద సంఘటనలు
- బందీలుగా పట్టుకోవడం
- ఇండియన్ ఎయిర్లైన్స్
- 1999లో భారత్
- ఎయిర్ బస్ A300 ప్రమాదాలు మరియు సంఘటనలు