ఇంద్రకీలాద్రి పర్వతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయవాడలోని కనకదుర్గ ఆలయం
విజయవాడలోని కనకదుర్గ ఆలయం

ఇంద్రకీలాద్రి పర్వతం విజయవాడ నగరంలో ఉంది. ఈ పర్వతం మీద అర్జునుడు శివుని కొరకు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడని ప్రతీతి. ఇక్కడే అర్జునుడు శివపార్వతులతో యుధ్దం చేసాడని నమ్మకం. ఆ స్థలం లోనే కనకదుర్గ ఆలయం వెలసిందని నమ్మకం. స్ధానికంగా వాడుకలో ఉన్న కథనం ప్రకారం, అసలు ఆలయం కొండ మీద ఉందని, సామాన్య మానవులకు కనిపించదని, ఇప్పుడు వున్న ఆలయం మానవుల కోసం నిర్మించబడిందని అంటారు. ఇంద్రకీలాద్రి కొండ అప్పట్లో మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకూ విస్తరించి ఉండేదనీ, చుట్టుపక్కల సుమారు పది కిలోమీటర్ల మేర దట్టమైన అడవి ఉండేదనీ ఓ కథనం. మధ్యలోకి కృష్ణానది ప్రవాహం రావడంతో...కొండ మధ్యలో బెజ్జం ఏర్పడిందనీ, ఆ తర్వాత రూపుదాల్చిన పీఠభూమిలోనే విజయవాడ నగరం వెలసిందనీ చరిత్రకారులు చెబుతారు. అందుకే, బెజవాడను మొదట్లో 'బెజ్జంవాడ' అని పిలిచేవారట. ఆరోజుల్లో, ఇంద్రకీలాద్రికి వెళ్లడానికి కనీసం నడకదారి కూడా ఉండేది కాదట 1906 నాటికి ఇక్కడో చిన్నగుడి ఉన్నట్టు తెలుస్తోంది. అభిషేకాలూ అర్చనలూ లేవు కానీ, దీపం మాత్రం వెలిగించేవారు. క్రూరమృగాల బారిన పడతామేమో అన్న భయంతో అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఇంద్రకీలాద్రికి వచ్చేవారట. 1992 ప్రాంతంలో కొండపైకి రహదారి ఏర్పాటైంది. ఆలయం చుట్టూ రాతికట్టడం నిర్మించారు. 2002లో ఆలయ గోపురానికి బంగారు కవచం తొడిగారు. గతంతో పోలిస్తే, 1990 నుంచీ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

భావనలు[మార్చు]

కిరాతార్జునీయం అనే సంస్కృత కావ్యంలో ఇంద్రకీల పర్వతంపై అర్జునుడికి, కిరాతుడి అవతారంలో ఉన్న శివుడికి మధ్య యుద్ధం జరిగింది. అయితే ఇంద్రకీల పర్వతం గురించి దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక అభిప్రాయాలున్నవి. కిరాతార్జునీయాన్ని వ్రాసిన భారవి ఉత్తరభారత దేశానికి చెందినవాడు కనుక, తన ప్రకారం ఇంద్రకీల అనగా హిమాలయాల్లో భగీరధ నది (గంగా నది) ఒడ్డున ఉన్న పర్వతమని,[1][2] పూర్వం కవులు సర్వసాధారణంగా తమ కావ్యాల్లో స్థానికంగా లేక చేరువలో ఉన్న భౌగోళిక ప్రదేశాలను మాత్రమే పేర్కొనేవారని పలువురి అభిప్రాయం. కిరాతార్జునీయాన్ని శ్రీనాధుడు తెలుగులోకి అనువదించి విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఉన్న కొండని ఇంద్రకీలాద్రిగా భావించి, శివుడిని బోయవాడి అవతారంలో పరిచయం చేయడం వలన తెలుగువారు కిరాతార్జునీయం కథ విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిందని నేటికీ భావిస్తున్నారు. అలాగే కిరాతార్జునీయాన్ని కన్నడ భాషలోకి అనువదించటాన కర్నాటక రాష్ట్రంలో కొప్పల్ జిల్లాలో పల్కిగుండు అనే కొండ ప్రదేశం ఈ పేరున ఉంది.[3] [4] బౌద్ధ మతం, హిందూ ధర్మం విరాజిల్లుతున్న ఇండొనేషియా దేశంలోని హిందువులు అక్కడ ఉన్న ఒక పర్వతాన్ని ఇంద్రకీల పర్వతంగా భావిస్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. RUDRA - THE AMAZING ARCHER, Author: Bharat Bhushan, ISBN 978-81-909471-4-5 (Paper Edition)
  2. Design and Rhetoric in a Sanskrit Court Epic: The Kiråatåarjunåiya of Bhåaravi
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-27. Retrieved 2013-09-08.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-09. Retrieved 2013-09-08.

వెలుపలి లంకెలు[మార్చు]