ఉన్నత విద్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాంధీ వైద్య కళాశాల కళాశాల (ఉన్నత విద్య)

ఉన్నత విద్య, పాఠశాల విద్య (సెకండరీ) తరువాత ప్రారంభమయ్యే విద్య. మన దేశంలో విద్యా విధానం 10+2+3 విధానం. 10 అనగా సెకండరీ విద్య, 2 అనగా ఇంటర్మీడియట్ విద్య (సీనియర్ సెకండరీ), 3 అనగా కాలేజి డిగ్రీ విద్య. కాలేజీ డిగ్రీలో మొదటి స్థాయి విద్యని పట్టభద్ర విద్య (గ్రాడ్యుయేషన్) అని, దాని తరువాత స్థాయి పట్టభద్ర తరువాత స్థాయి (పోస్ట్ గ్రాడ్యుయేట్) అని వ్యవహరిస్తారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత పరిశోధన స్థాయి విద్య (రీసర్చ్ పోగ్రాంలు అయిన ఎం.ఫిల్., పి.హెచ్.డీ. పట్టాలు) ఉన్నాయి. ఇవన్నీ ఉన్నత విద్యాశ్రేణిలోకి వస్తాయి.

ఈ విద్యలన్నీ వివిధ రంగాలలో వుండవచ్చు. ఉదాహరణకు, కళలు, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం జీవశాస్త్రం, గణితం, వాణిజ్యం, విద్య, సామాజిక శాస్త్రం, మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, భాషా శాస్త్రం, కంప్యూటర్ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వైద్య శాస్త్రం, న్యాయశాస్త్రం, ఇంజినీరింగ్, ఇతర రంగాలు.ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నత విద్యా పరిషత్ సమన్వయం చేస్తుంది.

పాచీన కాలంలో ఉన్నత విద్య[మార్చు]

రోమన్ సామ్రాజ్యము పతనమయ్యాక గ్రీకులు నివసించే ప్రాంతమంతా బైజంటైన్ రాజ్యంగా ఏర్పడింది. లాటిన్ ప్రబలంగా ఉన్న పశ్చిమభాగమంతా జర్మన్ జాతీయుల ఆధీనమైనది. పశ్చిమ ప్రాంతాలలో లాటిన్-జర్మన్ సంస్కృతుల సంయోగం జరిగినప్పటికీ, రోమనుల సాంస్కృతిక, రాజకీయ, విద్యావ్యవస్థలు జర్మన్ ల కాలంలో దెబ్బతిన్నవి. 12వ శతాబ్దమువరకు ఈవ్యవస్థలు తిరిగి కోలుకోలేదు. అదేసమయంలో మధ్యధరా, తదితర తూర్పు ప్రాంతాలలో మాత్రము పాండిత్యం, విద్య భాగా వర్ధిల్లినది. బైజంటైన్ రాజధాని కాంస్టాట్ నోపుల్. సంప్రదాయాలు, ఉన్నత విద్యా విధానం ఇక్కడ యధాతధంగా కొనసాగినది.సా.శ.425లో 5వ థియొడొసియస్ అనేరాజు ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం మిచ్చి, పోషించినట్లు ఆధారాలున్నవి.కాంస్టాట్ నోపుల్ లో లాటిన భాషకు 3, లాటిన వ్యాకరణానికి 10, గ్రీకు భాషకు 5, గ్రీకు వ్యాకరణానికి 10 పీఠాలు నెలకొల్పి తత్త్వ విచారానికి ఒక ఆచార్యానుని, న్యాయశాస్త్రంలో ఇద్దరు ఆచార్యులకు జీతభత్యాలు చెల్లించినట్లు తెలుస్తున్నది. ఇక్కడే విశ్వవిద్యాలయ వ్యవస్థకు పునాదులు పడినవి.ఇది ఎప్పుడు కచ్చితంగా ఏర్పడినదనేది చెప్పడం కష్టం. 7వ శతాబ్దంలోని పాఠ్య ప్రణాళికాల్లో వ్యాకరణం, సాహిత్యం, తర్కం, అలంకారం, తత్త్వ విచారం, ఖగోళం, గణితం పేర్కొనబడినవి. సా.శ.863లో విజ్ఞానశాస్త్రాలకు బాగా ప్రోత్సాహం లభ్యమైనది.సా.శ.1045లో 9వ కాంస్టాంటైన్ అనేరాజు ఈవిశ్వవిద్యాలయాన్ని న్యాయశాస్త్ర విభాగం, తత్త్వ విచార విభాగం అని రెండుగా విభజించాడు.విద్యావంతులు, శిక్షితులు అయిన ప్రభుత్యోగులను పొందేటందుకు ఈ సంస్కరణ తెచ్చినట్లు చెప్పబడింది. మత విషయాల బోధనకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు.లాంచనము, వ్యవస్థీకృతము అయినా విద్యాబోధన ఎల్లప్పుడూ జరగకపోయినా, లియో నైసిఫరోస్, ప్లిథాన్, బెస్సరియన్ అనేమహామేధావులు ఈ విశ్వవిద్యాలయాల్లో పనిచేసినట్లు ఆధారాలున్నాయి.

7వ శతాబ్దంలో తురుష్కులు రంగప్రవేశం చేయటంతో, పూర్వ రోమన్ సామ్రాజ్యము మూడు ముక్కలైనది. తూర్పు గ్రీక్ బైజంటైన్ ప్రాంతము, పశ్చిమ లాటిన్ జర్మన్ ప్రాంతము, అరేబియన్ ఇస్లామిక్ ప్రాంతము.ఉన్నత విద్యకు సంబంధించి తురుష్కులు రెండు మంచిపనులు చేసారు.ఒకటి అనువదాలను ప్రోత్సహించడము, రెండు, అనేక స్వంత రచనలు చేయడం. 9వ శతాబ్దములో బాగ్దాద్ విజ్ఞాన కేంద్రముగా మారినది. అలానే ఉత్తర ఆఫ్రికాలో బాగ్దాద్ మాదిరి విద్యా విధానం ఏర్పడింది.తురుష్కుల తరువాత వచ్చిన షియా-సున్నీ వివాదము వారి విద్యా సంస్థలపై కూడా ప్రభావం చూపింది.షియాలు మాత్రమే విజ్ఞాన శాస్త్రాలకు, గణితానికి ప్రాముఖ్యత నిచ్చారు. మొత్తంమీద, ఇస్లామిక్ ప్రపంచం మధ్య యుగంలో అల్రజ్వ, అల్ ఫరాబి, ఇబన్ సివా, ఇబన్ రుషాద్ మొదలైన మేధావులను తయారుచేసింది. వీరె తరువాతి కాలంలో క్రైస్తవ విశ్వవిద్యాలయాలకు పునాదులు అయినాయి.

పశ్చిమ ఐరోపా చరిత్రలో 11, 12, 13వ శతాబ్దాలు పేర్కొనదగినవి. ఈకాలంలోనే నగరీకరణం, వర్తకం బైజంటైన్-తురుష్క రాజ్యాలమధ్య సంబంధాలు, సాంస్కృతకార్యకలాపాలు బాగా అభివృద్ధి చెందాయి.చర్చి ప్రాముఖ్యత పెరగడం, చర్చి అవసరాలకు, యోగ్యులైన చర్చి ఉద్యోగుల కోసం అనేక విద్యాలయాలు ఏర్పడినవి.ఫలితంగా విజ్ఞానం పెరిగి, మహాకావ్యాలపట్ల జనంలో ఆసక్తి పెరిగింది.శాస్త్రీయ పరిశోధనలో ప్రవేశం, రోమన్ న్యాయశాస్త్రం పట్ల మొజు పెరిగింది. అంతర్జాతీయంగా చర్చి పాఠశాలలు విద్యార్థులను ఆకర్షించినవి. 14-17 శతాబ్దాల మధ్య ఐరోపాలో అనేక మార్పులు వచ్చినవి. జనజీవనంలో తొలి మధ్యయుగపు లక్షణాలు క్రమీణ క్షీణించడం, రినైసన్స్ తలెత్తడము, క్రైస్తవ ప్రపంచం ప్రాటెస్టెంట్, కేధలిక్ అని రెండుగా చీలడం, సంస్కరణ, ప్రతికూల-సంస్కరణోద్యమాలు ఉత్పన్నం గావడం జరిగినవి. 14-15వ శతాబ్దాలు ఐరోపాలో నూతన విశ్వవిద్యాలయాల స్థాపనకు ఎంతో ఫలమంతమైన కాలంగా పరిగణించబడినవి. ఇదేసమయంలో మత విషయాలకు విశ్వవిద్యాలయాలన్నింటిలో అధికప్రాముఖ్యత ఇవ్వడంచేత, ఈకాలంలో శాస్త్రీయమైన పరిశోధనలకు తగిన మద్దతుగాని, ప్రోత్సాహం లభించలేదనే చెప్పవచ్చును.

కళాశాల విద్య[మార్చు]

ఆర్ట్స్, కామర్స్, సైన్స్ కోర్సుల గల కళాశాలను కళాశాల విద్యాశాఖ పర్యవేక్షిస్తుంది.[1] రాష్ట్రంలో 249 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 179 ఎయిడెడ్ కళాశాలలలో 3, 64, 726 మంది విద్యార్థులు చదువుతున్నారు.[2] ఉద్యోగావకాశాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. వీటిలో కొన్ని జీవసాంకేతిక శాస్త్రం (బయో టెక్నాలజీ), మైక్రో బయాలజి, కంప్యూటర్ సైన్స్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, ఎడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషన్ లాంటివి ఉన్నాయి.. జెకెసిలు 29 ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నాయి. 130 ప్రభుత్వ కళాశాలలు నాక్ అక్రిడిటేషన్ పొందాయి. వీటిలో 120 బి ఆ పై స్థాయి పొందాయి. ఇంగ్లీషు భాష నైపుణ్యాన్ని పెంచడానికి 75 ఇంగ్లీషు భాషా ప్రయోగశాల (ఇంగ్లీషు లాంగ్వేజ్ లాబ్స్) ఏర్పాటు చేశారు. చాలా విషయాలు సాంప్రదాయ శాఖల (ఆర్ట్స్, సామాజిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం) ద్వారా మాత్రమే చదవడానికి వీలుండగా, కంప్యూటర్ అనువర్తనాలు లాంటి అధునిక విషయాలు, శాఖలలో కొన్ని విషయాలు అందరికి ఐచ్ఛికంగా చదివే అవకాశం సార్వత్రిక విశ్వవిద్యాలయాలలో లేక దూర విద్యా విధానంద్వారా చదివే వారికి వుంటుంది.

ఆర్ట్స్[మార్చు]

సాంప్రదాయక డిగ్రీ చదువులో ఇది ఒకటి. దీనిలోని ముఖ్యంశాలు. ఆర్థిక శాస్త్రము, చరిత్ర, రాజకీయ శాస్త్రము, ప్రజా పరిపాలన, సామాజిక శాస్త్రము, మానసిక శాస్త్రము, భాషలు (తెలుగు సాహిత్యము, ఇంగ్లీషు సాహిత్యము, హిందీసాహిత్యము, ఉర్దూ సాహిత్యము) .

కామర్స్[మార్చు]

సాంప్రదాయక డిగ్రీ చదువులో ఇది ఒకటి. దీనిలో ముఖ్యాంశాలు వ్యాపార నిర్వహణ, గణాంకాలు గురించి వుంటాయి.

సైన్స్[మార్చు]

సాంప్రదాయక డిగ్రీ చదువులో ఇది ఒకటి. దీనిలో ముఖ్యాంశాలు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, భూగర్భ శాస్త్రం, జీవ శాస్త్రం, జంతు శాస్త్రం.

వృత్తివిద్య[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్య మండలి[3] వృతి విద్యలను పర్యవేక్షిస్తుంది. సాంకేతిక విద్య శాఖ [4] ఆంధ్ర ప్రదేశ్ లో సాంకేతిక విద్యని పర్యవేక్షిస్తుంది. సామాజిక, ఆర్థిక సర్వే 2009-10 ప్రకారం వివరాలు.[2]

వివరము కళాశాలల సంఖ్య ప్రవేశానికి సీట్లు
ఇంజినీరింగ్ 665 226870
ఎం.బి.బి.ఎస్. 23 4250
ఎమ్సిఎ 703 47595
పాలిటెక్నిక్ 144 63075
ఎమ్బిఎ 881 59676
బి ఫార్మసీ 213 16675
బి.ఇడి[5] 607 *

2008 లో విద్యార్థుల సీట్ల వివరాలు [5]
ఇంజినీరింగ్: 1, 74, 352
ఉన్నత, సాంకేతిక విద్య మొత్తం: 15, 00, 000

స్థూల నమోదు నిష్పత్తి[మార్చు]

స్థూల నమోదు నిష్పత్తి (Gross Enrollment Ratio) ఆనగా, 18-23 సంవత్సరాల వయస్సుగల యువతలో ఉన్నత విద్య ఆభ్యసిస్తున్న వారి శాతం. ఇది 2005 లో దేశంలో 11శాతంగా, ఆంధ్ర ప్రదేశ్ లో 12.9 శాతంగా నమోదయింది. ఇది 2012 నాటికి దేశంలో 15 శాతంగా పెంచటం 11 వ ఆర్థిక ప్రణాళిక ఉద్దేశం. ఆప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో 19.2 శాతంకి పెరుగుతుందని అంచనా..[6] 2001-02 లో ప్రపంచ సగటు స్థూల నమోదు నిష్పత్తి 23.2 శాతంగాను, ఆభివృద్ధి చెందిన దేశాలలో 54.6 గావుంది.

వనరులు[మార్చు]

  1. "కళాశాల విద్యాశాఖ వెబ్ సైటు". Archived from the original on 2010-02-08. Retrieved 2010-05-29.
  2. 2.0 2.1 "సామాజిక, ఆర్థిక సర్వే 2009-10 - సంకలనం రఘురామ్". Archived from the original on 2012-01-10. Retrieved 2010-05-23.
  3. "ఉన్నత విద్య మండలి". Archived from the original on 2010-06-19. Retrieved 2010-09-22.
  4. "సాంకేతిక విద్యా శాఖ వెబ్సైటు". Archived from the original on 2011-09-02. Retrieved 2012-02-17.
  5. 5.0 5.1 "విద్యాభివృద్ధికి కృషి చేశాం", వార్త, 27 మార్చి, 2009 లో రోశయ్య వ్యాఖ్యలపై సమాచారం
  6. "12. Report of the HIGHER EDUCATION IN INDIA Issues Related to Expansion, Inclusiveness, Quality and Finance". Archived from the original on 2010-08-22. Retrieved 2010-05-29.