ఎం.శాంతప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.శాంతప్ప
జననంఎం.శాంతప్ప
1923, అక్టోబర్ 2
కర్నూలు జిల్లా,తుగ్గలి మండలం జొన్నగిరిగ్రామం
మరణంఫిబ్రవరి 26 , 2017 (వయస్సు 93)
వృత్తిమాజీ వైస్‌ఛాన్స్‌లర్
ఉద్యోగంశ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిశాస్త్రవేత్త
ముందు వారుకొత్త సచ్చిదానందమూర్తి
తర్వాత వారుఎం.వి.రామశర్మ
తండ్రిఅరికేవి బసప్ప

మూషి శాంతప్ప రాయలసీమకు చెందిన ప్రముఖ విద్యావేత్త. ఇతను రసాయన శాస్త్రవేత్త, చర్మ పరిశ్రమ పరిశోధకులు.

జీవితవిశేషాలు[మార్చు]

ఎం.శాంతప్ప 1923, అక్టోబర్ 2వ తేదీన కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామంలో జన్మించాడు.[1] తండ్రి అరికేవి బసప్ప. బాల్యంలోనే ఇతని కుటుంబం అనంతపురం జిల్లా ఉరవకొండలో స్థిరపడింది. ఇతని ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య ఉరవకొండలో ముగిసింది. 1939లో అనంతపురంలోని దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్‌లో చేరాడు. ఇతని తల్లిదండ్రులు సంవత్సరం వ్యవధిలో మరణించడం, తీవ్ర అస్వస్థతకు గురికావడం వంటి ప్రతికూల పరిస్థితులలో పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. రెవెన్యూ శాఖలో గుమాస్తాగిరీ కోసం పరీక్ష వ్రాసి రెవెన్యూ శాఖలో కొంతకాలం, పోలీసు శాఖలో మరికొంతకాలం పనిచేశాడు. విద్యాతృష్ణతో ఉద్యోగం విరమించి 1941 నుండి 1943 వరకు దత్తమండల కళాశాలలోనే బి.ఎ. రసాయనిక శాస్త్రం అభిమాన విషయంగా చదివి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత ఇతడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 1944-46లో ఎం.ఎస్.సి, లండన్ విశ్వవిద్యాలయం నుండి 1946-49లో పి.హెచ్.డి, మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుండి 1949-51లో మరొక పి.హెచ్.డి సంపాదించాడు.

ఉద్యోగపర్వం[మార్చు]

ఇతడు 1952లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఫిజికల్ కెమిస్ట్రీ విభాగానికి రీడర్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించాడు. ప్రొఫెసర్ గా, హెడ్‌గా రెండు దశాబ్దాలపాటు (1952-72) ఉన్నాడు. అంచెలంచలుగా ఎదుగుతూ 1980లో ఆ శాఖకు అధిపతిగా పదవీ విరమణ చేశాడు. మధ్య కాలంలో మధురై ఎక్స్‌టెన్షన్ సెంటర్‌కు ప్రొఫెసర్ గా కూడా (1952-62) ఉన్నాడు. 1973-81 మధ్యకాలంలో కేంద్రీయ చర్మ పరిశోధన సంస్థ (CLRI) డైరెక్టర్‌గా వ్యవహరించాడు. 1979-80లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశాడు. 1981-84 మధ్యకాలంలో మద్రాసు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశాడు. తమిళనాదు ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా ఉన్నాడు. తమిళనాడు అకాడమీ ఆఫ్ సైన్సెస్ చైర్మన్‌గా, యుజిసి రిటైర్డ్ ప్రొఫెసరుగా (1984), అన్నా యూనివర్శిటీ (మద్రాసు) లోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీకి సీనియర్ సైంటిస్టుగా కేంద్ర ప్రభుత్వ పథకంలో రిటైర్డ్ సైంటిస్ట్ గా (1988-91) తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సైంటిఫిక్ అడ్వయిజర్ గా (1989-2002) పలు పదవులను నిర్వహించాడు.

పరిశోధనలు[మార్చు]

స్థూలంగా చెప్పాలంటే ఉష్ణ గతి ప్రేరణ విధానం మీద నూతన పరిశోధనలు అనేకం చేశాడు. థర్మల్ శక్తి పరంగా, ఫోటో కెమికల్ పరంగా వినైల్ పోలిమెరైజేషన్ గూర్చి, విశేష అధ్యయనం చేశాడు. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మాంగనీస్ ప్రభావం వినైల్ పోలియెరైజేషన్ వద్ద, జీరో డిగ్రీ సెల్సియస్ వద్ద ఉండగల విధానాలను శోధించి విజయం సాధించాడు. పోలిమెర్స్, గ్రాప్ట్ కోపోలిమెర్స్ నూతన విచ్ఛేదన సంశ్లేషణ (సంయోగం) కనుగొన్నాడు.

మద్రాసు విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా ఉన్నప్పుడు దేశంలో తొలిసారిగా మధురై ఎక్స్‌టెన్షన్ సెంటరును నెలకొల్పి దాదాపు నాలుగేళ్ళు రసాయన శాస్త్ర ఆచార్యునిగా ఉన్నాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో అనేక నూతన విస్తరణ కార్యక్రమాలను చేపట్టాడు. నూతన విశ్వవిద్యాలయాలకు బీజం వేశాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఉంటూ అనేక నూతన బోధనా విధానాలను ప్రవేశపెట్టాడు. కేంద్ర చర్మ పరిశోధనా సంస్థకు డైరెక్టరుగా ఆ సంస్థ పురోగతికి విశేష కృషి చేశాడు. యలవర్తి నాయుడమ్మ ప్రణాళికలన్నింటికి కార్యరూపం ఇచ్చాడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గౌరవ సలహాదారుగా దశాబ్దం పాటు వ్యవహరించి కాలుష్య రహిత వాతావరణ పరిరక్షణకు ఎంతో కృషి చేశాడు.

ఇతడు అనేక జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో సుమారు 350[2] పరిశోధనాపత్రాలను ప్రచురించాడు. "ఇండియన్ జర్నల్ ఆఫ్ టెక్నాలజీ" మాస పత్రిక సంపాదక వర్గ సభ్యులుగా చాలా కాలం వ్యవహరించాడు. చర్మ పరిశ్రమకు సంబంధించి ఈయన చేసిన ప్రత్యేక పరిశోధనల ఫలితంగా చర్మ పారిశ్రామికరంగాభివృద్ధి జరిగి ఉత్పాదనా సామర్థ్యం వృద్ధి చెందింది. మరో వైపు ఈయన చేసిన పరిశోధనల మూలంగా మన దేశంలో ప్లాస్టిక్ పరిశ్రమ అనూహ్యంగా అభివృద్ధి చెందింది. కాలుష్య రహితంగా ప్లాస్టిక్ వినిమయం అభివృద్ధి ఒకే శాస్త్రవేత్త ద్వారా ఘనతరమైన కృషి జరగడం విశేషం. ఇతని ఆధ్వర్యంలో 59మంది విద్యార్థులు పరిశోధనలు జరిపి డాక్టరేట్ పట్టాలు పొందారు.

ఈయన ప్రధానంగా 1) సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ పాలిమర్స్ (ప్లాస్టిక్స్), 2) ఫోటో కెమిస్ట్రీ, 3) ఫిజికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, 4) ఇనార్గానిక్ కెమిస్ట్రీ, 5) సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ లెదర్ రంగాలలో అవిశ్రాంత పరిశోధనలు చేసి మన దేశాన్ని స్వావలంబన పథంలో పయనింపజేశాడు. ఈ సందర్భంగా ఈయనకు అనేకానేక అవార్డులు, రివార్డులు అందాయి.

విజయాలు[మార్చు]

ఇతడిని ఆంధ్ర విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇన్ సైన్స్ అవార్డుతో సత్కరించాయి. గుల్బర్గా విశ్వవిద్యాలయం ఇతడి సేవలను గుర్తించి డి.లిట్ ప్రదానం చేసింది. ఇతడు పొందిన అవార్డులలో కొన్ని:

  1. 1967: రసాయన శాస్త్రంలో ఎస్.ఎస్.భట్నాగర్ ప్రైజ్
  2. 1982: ఇండియన్ కెమికల్ సొసైటీ వారి సర్ జె.సి.ఘోష్ మెమోరియల్ మెడల్
  3. 1985: ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్&ఇండస్ట్రీ) చే సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు - సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ పాలిమెర్స్ లో అద్వితీయ కృషికి.
  4. 1990: " వాయిస్" అవార్డు - సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ లెదర్ లో కృషికి.

ఇతడు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సస్ - బెంగళూరు, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సస్ (ఇండియా) - అలహాబాదు, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ - న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్సస్, తమిళనాడు అకాడెమీ ఆఫ్ సైన్సస్ లకు ఫెలోగా ఎంపికయ్యాడు. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్రీ ఇంగ్లాండులో సభ్యుడిగా ఉన్నాడు.

కుటుంబం[మార్చు]

ఈయన ముగ్గురు కుమార్తెలలో ఇద్దరు డాక్టర్లు, ఒక ఇంజనీరు. ఇద్దరు కొడుకులలో ఒకరు డాక్టరు ఒకరు ఇంజనీరు. మద్రాసులోనే స్థిరపడ్డాడు. చెన్నైలో, కస్తూర్బానగర్ లో నివసిస్తున్నాడు.

ప్రొఫెసర్ ఎం.శాంతప్ప అవార్డ్[మార్చు]

ది సొసైటీ ఫర్ పాలిమర్ సైన్స్, ఇండియా ఇతడి సేవలను గుర్తించి గౌరవసూచకంగా ఇతని పేరుతో శాస్త్ర సాంకేతిక పరిశోధనలలో విశిష్టమైన కృషిచేసిన శాస్త్రవేత్తకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక పురస్కారాన్ని ప్రకటిస్తున్నది.[3] 2014లో ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్‌కు చెందిన నిఖిల్ కె.సింఘాకు ప్రదానం చేశారు.

మూలాలు[మార్చు]

  1. రావినూతల, శ్రీరాములు (1999). "అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శాస్త్రవేత్త శాంతప్ప". అనంతనేత్రం వార్త అనంతపురం జిల్లా ప్రత్యేక అనుబంధం: 17.
  2. వెబ్ మాస్టర్. "Browse by Fellow". Indian Academy of Sciences. Archived from the original on 6 December 2019. Retrieved 6 February 2015.
  3. వెబ్ మాస్టర్. "PROF. SANTAPPA PROFILE". THE SOCIETY FOR POLYMER SCIENCE, INDIA. SPS(I). Archived from the original on 31 మే 2014. Retrieved 6 February 2015.