ఎన్.వి.బ్రహ్మం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్.వి.బ్రహ్మం

ఎన్.వి.బ్రహ్మం ప్రముఖ హేతువాది, రచయిత.[1]

జననం, కుటుంబం[మార్చు]

ఎన్.వి.బ్రహ్మం (నాసిన వీర బ్రహ్మం) 1926 ఏప్రిల్ లో గొనసపూడి (పరుచూరు, ప్రకాశం జిల్లా) లో హనుమాయమ్మ, వెంకటస్వామి ల సంతానంగా పుట్టారు. భార్య సీతారామమ్మ. కుమార్తె పేరు మనీషా. ఆ పేరుతోనే ట్యుటొరియల్ సంస్థ నడిపారు. కుమారులు జగీష్, గణేష్ లు హోమియోపతీలో వైద్య వృత్తి చేపట్టారు.

దార్శనికుడు ఎం.ఎన్.రాయ్ , ఇతర రచయితల ప్రభావం[మార్చు]

చాలాకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన బ్రహ్మం, కవిరాజు త్రిపురనేని రామస్వామి రచనల ప్రేరణతో ఎందరో విద్యార్థులను, హేతుబద్ధంగా ఆలోచించే విధంగా సుశిక్షితులను చేశాడు. ఎం.ఎన్.రాయ్ భావాల ప్రభావానికి లోనై, 1946 మే మాసం లో, డెహ్రాడూన్లో జరిగిన రాడికల్ హ్యూమనిస్ట్ రాజకీయ పాఠశాలకు వెళ్ళి, ఆంధ్రలో రాయ్ భావ వ్యాప్తికి చాలా కృషి గావించాడు. రచయితలు గోపిచంద్, కోగంటి సుబ్రహ్మణ్యం, పి.వి.సుబ్బారావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, గుత్తికొండ నరహరి, జి.వి.కృష్ణారావుల రచనలు బ్రహ్మాన్ని ప్రభావితం చేసాయి. ఎం.వి.రామమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి, సి.హే చ్. రాజారెడ్డి బ్రహ్మానికి దగ్గరి రాడికల్ ఆప్తులు.

హేతువాదిగా జీవనం[మార్చు]

1946 నుండి బ్రహ్మం వివిధ రాడికల్ హ్యమనిస్ట్ అధ్యయన కాంప్ లలో అధ్యాపకుడిగా మానవాదం విడమరిచి చెప్పేవాడు. రాష్ట్ర రాడికల్ హూమనిస్ట్ సంఘ పత్రిక సంపాదకుడిగా 1982-83 లో ఉన్నాడు.1965లో అవనిగడ్డ, కృష్ణా జిల్లాలో జరిగిన హ్యమనిస్ట్ స్టడి కాంప్ లో చురుకుగా ఎ.బి.షా, ఆవుల గోపాలకృష్ణమూర్తి, ఎన్.ఇన్నయ్య, కోనేరు కుటుంబరావు, త్రిపురనేని వెంకటేశ్వరరావు లతో కలసి సుదీర్ఘ చర్చలలో పాల్గొన్నాడు. బి.ఎ. వరకు చదివి చింతనాపరుడుగా పేరు తెచ్చుకున్నాడు.కొన్ని వివాహాలకు ఆధ్వర్యం వహించి, కవిరాజు విధానంలో ప్రమాణాలు తెలుగులో చేయించాడు. గుడివాడ కాలేజ్ లో భౌతిక శాస్త్ర ఆచార్యుడైన యెర్నేని వెంకటేశ్వర రావు ఆధ్యర్వం లో, రాజమండ్రి పట్టణంలో హోమియో వైద్యవిధానం పై జరిగిన చర్చలో నరిసెట్టి ఇన్నయ్య హోమియో అశాస్త్రీయమని వాదించగా, డా. పావులూరి కృష్ణయ్య చౌదరి, ఎన్.వి. బ్రహ్మం హోమియోను సమర్ధిస్తూ మాట్లాడారు. ఐతే ఇన్నయ్య వాదనను, ఆయనను వ్యతిరేకించిన వారు శాస్త్రీయంగా ఖండించుటలో విఫలమయ్యారు కావున, ఇన్నయ్య వాదనే సబబైనదని ఆచార్య వెంకటేశ్వరరావు సెలవిచ్చాడు. సురేంద్రబాబు వ్యవస్థాపకుడిగా ఉన్న సత్యాన్వేషణమండలితో, బ్రహ్మం కొంత కాలం కలిసి పనిచేశాడు.

వివాదగ్రస్త రచనలు[మార్చు]

మత ఛాందసాలను, బైబిల్ బండారం పుస్తకం ద్వారా ఎండగట్టాడు.[2] ఈ విమర్శనాత్మక బైబిల్ పరిశీలనను క్రైస్తవ సంఘాల అభ్యంతరాల కారణంగా ఆంధ్ర ప్రభుత్వం నిషేధించింది. 1958 మార్చి 23 న హైకోర్టు కూడా దీనికి ఆమోద ముద్ర వేయగా,[3] సుప్రీం కోర్ట్ 1962 లో నిషేధం తొలగించింది. మెదడుకు మేత, కలలో దేవుడు వంటి రచనలు సమీక్ష, రాడికల్ హూమనిస్ట్ పత్రికలలో వ్రాశాడు. కలలో దేవుడు అనే రచన లో, మనిషికి ఉన్న అనేక లక్షణాలలో హేతువాదం కూడా ఒకటని చర్చ లేవనెత్తాడు.

మిత్రుడు, సహ హేతువాది ఐన రావిపూడి వెంకటాద్రి భావాలతో విభేదిస్తూ "కళ-శాస్త్ర వివాదం లో 'హేతువాది' హేతివాదం" అనే పుస్తకాన్ని 1985 లో వెలువరించినా, వారిరువురూ మిత్రులుగానే కొనసాగుతున్నారు. ప్రస్తుతం చీరాలలో విశ్రాంత జీవనం గడుపుతూ, ఆంగ్ల రాడికల్ హూమనిస్ట్ మాస పత్రికకు రచనలు చేస్తున్నాడు.

మరణం[మార్చు]

ఆయన 2015 జూలై 28 న తన 85వ యేట కన్నుమూసారు.[1][4]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Rationalist Brahmam passes away". R. RAVIKANTH REDDY SPECIAL CORRESPONDENT. The Hindu. Retrieved 29 July 2015.
  2. నేషనల్ లైబ్రరీలో గ్రంథ వివరాలు
  3. JUDGMENT Chandra Reddy, C.J.
  4. రాడికల్ కమ్యూనిస్టు ఎన్.వి.బ్రహ్మం కన్నుమూత - సాక్షి దినపత్రిక-4/8/2015

ఇతర లింకులు[మార్చు]