కైలాసం బాలచందర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కైలాసం బాలచందర్

జననం: (1930-07-09)1930 జూలై 9
నన్నిలం, తంజావూరు, తమిళనాడు, భారతదేశం
మరణం:2014 డిసెంబరు 23(2014-12-23) (వయసు 84)[1]
కావేరి హాస్పిటల్, చెన్నై

భార్య: రాజం

సంతానం:కుమారులు:కైలాసం, ప్రసన్న, కుమార్తె:పుష్ప కందస్వామి
వృత్తి: సినిమా దర్శకుడు, రచయిత, సినిమా నిర్మాత
బానర్: కవితాలయ మూవీస్ అవార్డులు: కళైమణి, పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

కె.బాలచందర్ గా ప్రసిద్ధిచెందిన కైలాసం బాలచందర్ (1930 జూలై 9 - 2014 డిసెంబర్ 23 [1]) ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత. వీరు 1930 సంవత్సరంలో తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జన్మించాడు. తొలుత అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో పనిచేసేవాడు. అక్కడ ఉద్యోగం చేస్తూనే పలు నాటకాలు రాశాడు. ఎంజీఆర్‌ కథానాయకుడిగా నటించిన దైవతాయ్‌ చిత్రానికి సంభాషణల రచయితగా చలనచిత్ర రంగంలో ప్రస్థానం ప్రారంభించాడు. 45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించాడు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేశాడు.

భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డు కింద స్వర్ణకమలం, రూ.10లక్షల నగదు, శాలువాతో సత్కరించారు.[2]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

తమిళనాడు, తంజావూరు జిల్లాలోని నన్నిలం గ్రామం ఆయన స్వస్థలం. వస్త్రాలపై వేసే రంగురంగుల పెయింటింగులకు ఈ గ్రామం ప్రసిద్ధి. వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. నాన్న దండపాణి కైలాసం. అమ్మ సరస్వతి. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి బీయస్సీ పూర్తి చేశాడు. తరువాత అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉద్యోగిగా ఆయన జీవితం ప్రారంభమైంది. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో సరదాగా నాటకాలు రాస్తుండేవాడు. అలా రాసిన ఒక నాటకం ఎం.జి. రామచంద్రన్ దృష్టిలో పడటంతో ఆయన్నుంచి ఆహ్వానం వచ్చింది. ఎంజీఆర్ నటించిన దైవతాయి అనే చిత్రానికి సంభాషణలు, స్క్రీన్‌ప్లే అందించాడు.

సినిమాలు[మార్చు]

ఆయన సినిమా పరిశ్రమలో అడుగు పెట్టేసరికి సినిమాలన్నీ హీరోయిజంతో నిండిన కథలే ఉండేవి. అంటే కథలన్నీ పురుష ప్రధానంగా సాగుతూ ఉండేవి. ఈ పంథాను మార్చడానికి, తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి ఆయన మధ్యతరగతి కుటుంబాలను, వారి ఆశలు, ఆశయాలను, ప్రేమను, అభిమానాలను కథా వస్తువులుగా ఎన్నుకొన్నాడు. ఆయన సినిమాలోని పాత్రలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి.

మొదటి సినిమా తరువాత ఆయన రాసిన నాటకాల్లో ఒకటైన నీర్కుమిళిని సినిమాగా తీశాడు. ఆ సినిమాలో అన్ని సన్నివేశాలు దాదాపు ఒకే సెట్ లో ఉంటాయి. అలాంటి కథ అప్పటి ప్రేక్షకులకు కొత్త. అనుకున్నట్టే అది విజయం సాధించింది. దాంతో ఆయన చిత్ర దర్శకుడిగా మారాడు. తరువాత మేజర్ చంద్రకాంత్, ఎదిర్నేచ్చల్ లాంటి చిత్రాలు తీశాడు.

అప్పుడాయనకు పెద్ద స్టార్లతో సినిమాలు తీయమని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ ఆయన ఎప్పుడూ హీరోలు దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేసుకోలేదు. సర్వర్ సుందరం (1964) కథ తయారు చేసినప్పుడు మాత్రం ఆ పాత్రకు నగేష్ అయితే చక్కగా సరిపోతాడనిపించింది. అప్పటికి ఆయన చాలా బిజీ హాస్యనటుడు. కానీ ఆయన్ని కలిసి కథ వినిపించడంతో అందుకు అంగీకరించాడు. ఆ సినిమా బాలచందర్ కు మేలిమలుపు నిచ్చింది. క్రిష్ణన్ పంజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తే బాలచందర్ దానికి మాటలు రాశాడు. ఆ చిత్ర సంభాషణలకు గాను ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అవకాశాలు బాగా పెరిగాయి.

అవకాశాలు పెరగడంతో ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలా వద్దా? అని కొన్నాళ్ళు సందేహించాడు. అయితే మెయ్యప్పన్ అనే నిర్మాత ఆయనకు ధైర్యం చెప్పి ఉద్యోగానికి రాజీనామా చేయించడమే కాకుండా వరుసగా మూడు అవకాశాలిచ్చాడు. దాంతో ఆయన సినిమా పరిశ్రమలో స్థిరపడ్డాడు.

అప్పట్లో ఆచారాలు, కట్టుబాట్ల పేరుతో స్త్రీలు ఎదుర్కొనే బాధలు ఆయన కథల్ని బాగా ప్రభావితం చేశాయి. అలా వెలుగులోకి వచ్చినవే సుజాత నటించిన అంతులేని కథ, సుహాసిని ప్రధాన పాత్రలో వచ్చిన సింధు భైరవి, ప్రమీలతో తీసిన అరంగేట్రం. సింధుభైరవిలో మగవాడి సహాయం లేకుండా బ్రతకాలనుకునే పాత్ర సుహాసిని ది. అరంగేట్రంలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కుటుంబాన్ని పోషించడం కోసం వేశ్యావృత్తిని స్వీకరిస్తుంది. అప్పటి సమాజంలో ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసేవారు కావడంతో ఈ కథలు వివాదాస్పదం అయ్యేవి. అంతేకాదు అప్పట్లో వచ్చే సినిమాల్లో విషాదాంతాలు ఉండేవి కావు. చాలావరకు పెళ్ళితో అంతమయ్యేవే. కానీ ఆయన సినిమాలు అందుకు భిన్నంగా ఉండేవి.

చిరంజీవి, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రవీణ గ్రామాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్న ఓ యువకుడి కథ. దీనికి ఆయన ఆ చిత్ర నిర్మాత నాగేంద్రబాబుతో కలిసి ఉత్తమ చిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు. కమల్ హాసన్, సరిత నటించిన మరో చరిత్ర అప్పట్లో యువతను బాగా ఆకట్టుకున్న విషాదాంత ప్రేమకథ.

పురస్కారాలు[మార్చు]

  • 1973 లో తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి పురస్కారం
  • 1982లో ఏక్ దూజే కేలియే సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు గెలుచుకున్నారు.
  • 1987 లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం
  • 1989లో రుద్రవీణ సినిమా కోసం జాతీయ స్థాయిలో నర్గీస్ దత్ అవార్డు, వెండి కమలం బహుమతుల్ని చిరంజీవి, నాగేంద్రబాబులతో పంచుకున్నారు.

కుటుంబం[మార్చు]

ఆయన భార్య పేరు రాజం. వీరికి ముగ్గురు పిల్లలు. కైలాసం, ప్రసన్న అనే ఇద్దరు కుమారులు. పుష్ప కందస్వామి అనే కుమార్తె.

పరిచయం చేసిన నటులు[మార్చు]

పరిచయం చేసిన సాంకేతిక వర్గం[మార్చు]

  • ఏ.ఆర్.రెహమాన్ రోజా సినిమాను నిర్మించిన బాలచందర్, సంగీత దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చారు.

చిత్ర సమాహారం[మార్చు]

దర్శకత్వం వహించిన సినిమాలు[మార్చు]

రచయితగా[మార్చు]

నిర్మాతగా[మార్చు]

  • 47 నాట్కళ్ (1981)
  • శ్రీ రాఘవేంద్ర (1985)
  • వేలైకరన్ (1987)
  • ఉన్నైసొల్లి కుట్రమిల్లై (1990)
  • రోజా (1992)
  • నామ్ ఇరువర్ నమక్కిరువర్ (1998)
  • సామీ (2003)
  • తిరుమలై (2003)
  • అయ్యా (2005)
  • ఇదయ తిరుడన్ (2006)
  • కుచేలన్ (2008)
  • తిరువన్నామలై ( 2008)
  • క్రిష్ణ లీలై (2009)
  • నుట్రుకు నూరు (2009)

నటునిగా[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 special correspondent (23 December 2014). "Filmmaker K.Balachandar passes away". The Hindu. Retrieved 23 December 2014.
  2. http://www.thehindu.com/arts/cinema/article1978248.ece?homepage=true