కొండగట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం
కొండగట్టు ఆంజనేయస్వామి
కొండగట్టు ఆంజనేయస్వామి
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:జగిత్యాల జిల్లా
ప్రదేశం:కొండగట్టు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:హనుమంతుడు
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూమతము
ఇతిహాసం
వెబ్ సైట్:http://www.kondagattu.com/

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, తెలంగాణలోని జగిత్యాల జిల్లా, మల్యాల మండలం, ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కి.మీ.లు దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయం. ఇది జిల్లాలో జగిత్యాల నుండి 15 కి.మీ. దూరములో ఉంది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశము. జానపదాల ప్రకారము, ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకము,.

చరిత్ర[మార్చు]

పూర్వము రామ రావణ యుద్ధము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చునపుడు ముత్యంపేట అనెడి ఈ మార్గమున కొంతభాగము విరిగిపడుతుంది. ఆ భాగమునే కొండగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తున్నారు.

దేవాలయ చరిత్ర[మార్చు]

సుమారు నాలుగువందల సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణా లలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింతచెట్టు కనబడగా, సేదతీరడనికై ఆ చెట్టు కింద నిద్రపోయాడు. కలలో స్వామివారు కనిపించి, నేనిక్కడ కోరంద పొదలో ఉన్నాను. నాకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకగా, 'శ్రీ ఆంజనేయుడు' కంటపడ్డాడు. సార్థకనాముడు సంజీవునికి మనస్సులో నిర్మల భక్తిభావం పొంగి పొరలింది. ఆనంద బాష్పజలాలు రాలి, స్వామివారి పాదాలను తడి పాయి. చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి ఆవు 'అంబా' అంటూ పరిగెత్తుకు వచ్చింది. సంజీవుడు చేతి గొడ్డలితో కోరంద పొదను తొలగించగా, శంఖు చక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. నారసింహస్వామి ముఖం (వక్త్రం) ఆంజనేయస్వామి ముఖం, రెండు ముఖాలతో వేంచేసి యుండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి స్వయంగా నారసింహవక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవులకాపరి నిర్మించాడు. ప్రస్తుతము ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితము కృష్ణారావు దేశ్‌ముఖ్‌ చే కట్టించబడింది.[1]

శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీబేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది.

విగ్రహంలోని విశేషం[మార్చు]

ఓ వైపు నృసింహస్వామి మరో వైపున ఆంజనేయస్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించడం శంఖు చక్రాలు హృదయంలో సీతారాములను కలిగి ఉండటాన్ని విశేషంగా చెప్పుకుంటారు.

చరిత్ర[మార్చు]

త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపం యజ్ఞయాగా దులు చేసుకొంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడి రక్షణార్థం సంజీవని పర్వతం తీసుకొని వెళ్ళసాగాడు. అది గమనించిన ఋషులు, రామదూతను సాదరంగా ఆహ్వానించారు. మీ మర్యాద బాగుంది. ఇది ఆగవలసిన సమయం కాదు కదా! శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి వాయుసుతుడు వేగంగా వెళ్ళి పోయాడు. కొన్నిరోజులకు అవ్యక్త దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవకార్యాలను ఆటంకపర్చసాగారు. తిరిగి వస్తానన్న హనుమ రాలేదు. వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వైరియైన భూతనాథుడి భేతా ళాన్ని ప్రతిష్ఠించారు. లాభం లేకపోయింది. వారి ఉపాసనా తపశ్శక్తిని ధారపోయగా, వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనసుతుడు 'శ్రీ ఆంజనేయుడు' స్వయంభువుగా వెలిసాడు. నాటినుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ, వారి దైవకార్యాలను నిర్విఘ్నంగా చేసుకో సాగారు.

పునరుద్ధరణ[మార్చు]

కొండగట్టు దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 2023-2024 రాష్ట్ర బడ్జెట్ లో 100 కోట్లు కేటాయించింది. 2023 ఫిబ్రవరి 15న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించాడు.[2][3] అనంతరం అధికారులతో దేవాలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి, దేశంలోనే గొప్ప క్షేత్రంగా రూపుదిద్దడంలో భాగంగా సుమారు 850 ఎకరాల్లో దేవాలయ అభివృద్ధి చేయడంకోసం మరో 500 కోట్ల రూపాయల నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించాడు.[4][5] ఈ కార్యక్రమంలో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఆలయంలో నిర్వహించే పూజల సమయాలు[మార్చు]

  • ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ
  • ఉదయం 4.30 నుంచి ఉదయం 5.45 గంటల వరకు శ్రీ స్వామివారి ఆరాధన
  • మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు విరామం (మంగళ, శనివారాలు మినహా.. ఆలయ మూసివేత)
  • మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు విరామం ఉంటుంది. రాత్రి 8 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.

దర్శన టికెట్ల సమాచారం[మార్చు]

  • అంజన్న అభిషేకం... టికెట్‌ ధర.. రూ.100
  • మండపంలో నిర్వహించడానికి రూ. 250
  • ప్రత్యేక దర్శనానికి రూ. 20
  • సాధారణ ధర్మదర్శనం ఉచితం
  • ప్రత్యేక దర్శనానికి రూ. 20
  • అంతరాలయంలో త్వరిత దర్శనానికి రూ. 120, రూ.200
  • గర్భగుడిలో ప్రత్యేక దర్శనానికి ఐదుగురు సభ్యులకు రూ. 316

ప్రత్యేక పూజలు.. టికెట్ల వివరాలు

  • ఉదయం అంజన్నకు అభిషేకం రూ. 100
  • మహామండపంలో రూ. 250
  • మహామండపంలో రూ. 250
  • అమ్మవారికి కుంకుమపూజ రూ. 50
  • సత్యనారాయణ వ్రతానికి రూ. 100
  • సాయంత్రం వేంకటేశ్వరస్వామికి ‘సేవా’ టికెట్టు రూ. 150
  • ఫోన్‌ లేదా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సదుపాయం లేదు.

ఆర్జిత సేవల టికెట్ల వివరాలను ఫోన్‌ లేదా ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే సదుపాయం లేదు.

ఉపాలయాలు... పూజా కార్యక్రమాలు

ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవారి ఉపాలయాలు ఉన్నాయి. వేంకటేశ్వర స్వామికి సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అమ్మవారికి కుంకుమార్చన చేయవచ్చు. సాయంత్రం నిత్యహారతులు ఉంటాయి. ప్రధాన ఆలయానికి వెనుక వైపున బేతాళస్వామి, రామాలయాల్లో ఎలాంటి ప్రత్యేకపూజలు ఉండవు.

వసతి సౌకర్యాలు[మార్చు]

  • కొండపై మూడు ప్రత్యేక గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. వీటికి రోజుకు రూ. 250 అద్దె ఉంటుంది.
  • మరో 30 గదుల వరకు భక్తులకు రోజువారీగా అద్దెకు ఇవ్వడానికి ధర్మసత్రాల గదులు లభిస్తాయి. వాటిలో కొన్నింటికి రూ. 50 చొప్పున, మరికొన్నింటికి రూ. 150 వరకు అద్దె ఉంటుంది.
  • ఉచితంగా ఉండటానికి డార్మిటరీ రేకుల షేడ్లు ఉన్నాయి.
  • కొండపై హరిత హోటల్‌ ఉంది. ఎలాంటి కాటేజీలు లేవు.

దగ్గరలోని ఆలయాలు, దర్శనీయ స్థలాలు[మార్చు]

ఈ దేవాయలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాయుని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని బోజ్జ పోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, భేతాళుడి ఆలయం, పులిగడ్డ బావి,, కొండలరాయుని గట్టు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీవేంకటేశ్వర ఆలయం, అమ్మ వారు, శ్రీరామ పాదుకలు, అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్లు, హరిత వర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి. దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాలు చూపరులను ఆకర్శిస్తాయి.

ప్రత్యేక ఉత్సవాలు, పండుగలు[మార్చు]

శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయ దశమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, ధనుర్మాసోత్సవం, గోదాకళ్యాణం, పవిత్రోత్సవం, శ్రావణ మేళా ఉత్సవం శ్రీ సుదర్శన యాగం మొదలగు ఉత్సవాలను ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ప్రతి ఏడాది చైత్రమాసం పౌర్ణమి నాడు హనుమంతుని జన్మోత్సవాన్ని వైభవంగా జరుపుతారు.[6]

రవాణా సౌకర్యం:[మార్చు]

హైదరాబాద్‌కు 160 కి.మీ.ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లేందుకు హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి.. జగిత్యాలకు వెళ్లే బస్సులు ప్రతి 30 నిమిషాలకో బస్సు, కరీంనగర్‌ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసులను టీఎస్‌ ఆర్టీసీ నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేటు క్యాబ్‌లు, ఆటోల సౌకర్యమూ ఉంది.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "కోరికలు తీర్చే కొండగట్టు అంజన్న". EENADU. Retrieved 2022-04-16.
  2. "కొండగట్టు అంజన్న క్షేత్రానికి మరో రూ.500కోట్లు: కేసీఆర్‌". EENADU. Archived from the original on 2023-02-16. Retrieved 2023-02-16.
  3. Velugu, V6 (2023-02-15). "కొండగట్టు అంజన్న ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు". V6 Velugu. Archived from the original on 2023-02-16. Retrieved 2023-02-16.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "దేశంలోనే గొప్ప క్షేత్రంగా కొండగట్టు". EENADU. 2023-02-16. Archived from the original on 2023-02-16. Retrieved 2023-02-16.
  5. telugu, NT News (2023-02-15). "కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో రూ.500 కోట్లు: సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-02-16. Retrieved 2023-02-16.
  6. "కొండగట్టులో హనుమాన్‌ జయంతి వేడుకలు..పెరిగినభక్తుల రద్దీ". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-04-16. Retrieved 2022-04-16.

బయటి లింకులు[మార్చు]