కోన ప్రభాకరరావు

వికీపీడియా నుండి
Kona Prabhakararao.jpg

కోన ప్రభాకరరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు మరియు 1940లలో తెలుగు సినిమా నటుడు, దర్శకుడు మరియు నిర్మాత.

ప్రభాకరరావు 1916, జూలై 10న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు. ప్రాధమికవిద్య బాపట్లలో పూర్తి చేసుకొని మద్రాసులోని లయోలా కళాశాలనుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత పూణేలోని ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాలనుండి న్యాయ శాస్త్రములో డిగ్రీ పూర్తిచేశాడు.

పాఠశాలలో ఉండగా మోతీలాల్ నెహ్రూ మరణించిన సందర్భముగా తరగతుల బహిష్కరణ నిర్వహించాడు. ఉప్పు సత్యాగ్రహములోనూ చురుకుగా పాల్గొన్నాడు. స్వాతంత్ర్యోద్యమ కాలములో ఒక యువబృందాన్ని నిర్వహించి ఖాదీ వాడకాన్ని వ్యాప్తి చేయటానికి కృషి చేశాడు.

ప్రభాకరరావు 1940 అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రములోని బాపట్లలో న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు. 1967లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు తొలిసారిగా ఎన్నికైనాడు. ఈయన బాపట్ల శాసనసభ నియోజకవర్గం నుండే వరుసగా మూడు పర్యాయములు (1967, 1972 మరియు 1978) శాసనసభకు ఎన్నికైనాడు. 1980-81 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకరుగా నియమితుడైనాడు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. భవనం వెంకట్రామ్ మరియు కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో విత్త మరియు ప్రణాళికా శాఖమంత్రిగా కూడా పనిచేశాడు.

ప్రభాకరరావు 1983 సెప్టెంబరు 2 న అప్పట్లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న పాండిచ్చేరి గవర్నరుగా నియమితుడయ్యాడు. ఆ పదవిలో 1984 జూన్ వరకు కొనసాగి, 1984 జూన్ 17న సిక్కిం గవర్నరుగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తరువాత 1985, మే 30 న మహారాష్ట్ర గవర్నరుగా నియమితుడైనాడు. 1986 ఏప్రిల్లో బొంబాయి విశ్వవిద్యాలయం మార్కుల విషయంలో చేలరేగిన దుమారంలో ఈయన పాత్రపై సంశయం ఏర్పడ్డంతో మహారాష్ట్ర గవర్నరు పదవికి రాజీనామా చేశాడు.[1]

క్రీడలలో ఆసక్తి కలిగిన ప్రభాకర్ 1938లో బొంబాయి విశ్వవిద్యాలయంలో టెన్నిస్ ఛాంపియన్ అయ్యాడు. బాపట్ల మరియు ఇతర ప్రదేశాలలో శివాజీ వ్యాయామ మండలి స్థాపనకు తోడ్పడ్డాడు. పూణేలో కళాశాల రోజుల్లో ప్రభాకర్ కుస్తీలు పట్టేవాడు. మరియు బాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఈయనకు అనేక సాంస్కృతిక సంస్థలతో అనుబంధం ఉన్నది. తొలినాళ్ళలో అనేక తెలుగు సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించాడు. కొన్నింటిలో స్వయంగా నటించాడు కూడా. ఈయన సినిమాలలో మంగళసూత్రం, నిర్దోషి, ద్రోహి మరియు సౌదామిని.[2]

బాపట్ల శాసనసభ్యునిగా ఉన్నంత కాలం ప్రభాకరరావు బాపట్ల అభివృద్ధికి విశేషంగా కృషిచేశాడు. విద్యారంగంలో బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి సొంతవూరులో అనేక విద్యాసంస్థలు అభివృద్ధి చెందేందుకు దోహదం చేశాడు. కృష్ణా జలాలను బాపట్లకు రప్పించడానికి కృషిచేసి వ్యవసాయరంగానికి దోహదపడ్డాడు.

మూలాలు[మార్చు]

  1. President Shankar Dayal Sharma, the Scholar and the Statesman By Attar Chand పేజీ.46 [1]
  2. ఐ.ఎమ్.డి.బి.లో కోన ప్రభాకరరావు పేజీ.