ఖడ్గ సృష్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖడ్గ సృష్టి తెలుగు సాహిత్యరంగంలో మహాకవిగా పేరొందిన శ్రీశ్రీ రచించిన కవితల సంకలనం. శ్రీశ్రీ సాహిత్యంలో మహా ప్రస్థానం తర్వాత ప్రసిద్ధి చెందిన పుస్తకం ఇది. ఇందులో శ్రీశ్రీ అధివాస్తవికత మొదలుకొని తనను ప్రభావితం చేసిన అనేక పాశ్చాత్య కవితా ధోరణుల్లో కవితలు రాశారు.

రచన నేపథ్యం[మార్చు]

ఖడ్గ సృష్టి కవితా సంకలనాన్ని తన జీవితం మలిదశలో రచించిన కవితలతో ప్రచురించారు శ్రీశ్రీ. 1966లో ఈ కవితా సంకలనం మొదటి సారి ప్రచురితమైంది.

కవితా వస్తువులు[మార్చు]

శ్రీశ్రీ రచించిన అసంపూర్ణ కావ్యం సదసత్సంశయం, అధివాస్తవిక రచనలు, అనువాదాలు, అనుసృజనలు ఉన్నాయి. ఈ రచనలోని కవితల వస్తువు స్పష్టంగా మార్క్సిజాన్ని వ్యక్తీకరించేలా రాశారు. ఖడ్గ సృష్టి, శరశ్చంద్రిక, విషాదాంధ్ర, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, గాంధీజీ, మంచి ముత్యాలసరాలు, ఆఖరిమాట మొదటిమాట!, విదూషకుని ఆత్మహత్య, టాంటాం, అభిసారిక కడసారి, ఒకటీ-పదీ, నగరంలో వృషభం, అధివాస్తవికుల ప్రవేశం, మాటల మూటలు, ఎన్నాళ్ళు ఇంకా, కొంటె కోణాలు, ఏవి తల్లీ, సామాన్యుని వేదన, రుబాయత్, భ్రమరగీత, బొమ్మలాంతరు మొదలైనవి కొన్ని శీర్షికలు.
వీటిలోని అత్యధిక కవితావస్తువులు సాహిత్యాన్ని గురించే ఉన్నాయి. రాజకీయాల గురించి, సమకాలీన స్థితిగతుల గురించీ ఉన్నాయి. గాంధీ, నెహ్రూల మరణాల గురించిన ఎలిజీ వంటి కవితలు కూడా ఉన్నాయి.

శైలి[మార్చు]

ఖడ్గ సృష్టిలో అతివాస్తవికత అనే తెలుగు సాహిత్యానికి కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టారు శ్రీశ్రీ. దానితో పాటుగా అధివాస్తవికమైన కవితలు కూడా ఇందులో ఉన్నాయి. సమకాలంలోని రాజకీయ సామాజిక సాహిత్య స్థితిగతులను అధిక్షేపిస్తూ కవితలు రాసి వాటికి కార్టూన్ కవిత్వమని పేరుపెట్టారు. దీని గురించి విమర్శకుడు, శ్రీశ్రీ జీవితచరిత్రకారుడు బూదరాజు రాధాకృష్ణ రాస్తూ ఇది శ్రీశ్రీకి కమ్యూనిజంలో ఉన్న నిబద్ధతకు అద్దంపడ్తుందేగాని, అక్కడక్కడ తప్ప మహాప్రస్థాన గీతాలతో పోలిస్తే దీని కవితాస్థాయి చాలా తక్కువ అన్నారు. దీనిలని శైలిగురించి భాష సులభీకృతమైంది, ఛందోధిక్కారం పరాకాష్ఠకు చేరుకుంది, భావాలు బండగా వ్యక్తీకరించారని ఆయన పేర్కొన్నారు.[1]

ఉదాహరణలు[మార్చు]

  • అహింస ఒక ఆశయమే కాని, ఆయుధం ఎప్పడూ కాదు. (ఖడ్గసృష్టి)
  • ఆణవ శక్తి కన్న, మానవశక్తి మిన్న. (శరశ్చంద్రిక)
  • అందరికీ అన్నీ తెలుసు, అదే మన అజ్ఞానం.
  • ఈ విశాల జగతినుంచి, ఏమిటినే కోరినాను, ఒక జానెడు సానుభూతి, ఒక దోసెడు తిరుగుబాటు. (సదసత్సంశయం)
  • మానవుడే నా సంగీతం, మానవుడే నా సందేశం. (మహాసంకల్పం)

ప్రాచుర్యం[మార్చు]

శ్రీశ్రీ ఈ పుస్తక ప్రచురణ నాటికే మహాకవిగానూ, సినీకవిగానూ ప్రఖ్యాతి పొంది వుండడంతో దీనిపై బాగా చర్చ జరిగింది. ముఖ్యంగా దీనిలోని కొన్ని వాక్యాలను విరసం కవులూ, వామపక్ష రాజకీయ కార్యకర్తలూ తరచుగా ఉదహరించేవారు. ఈ సంపుటిలోని అతివాస్తవిక రచనలమీద చాలా దుమారం రేగింది. కఠోరమైన విమర్శలు, వేళాకోళాలు బయలుదేరాయి. ఇటువంటి స్థితిలోనూ ఆ కవితల్ని అనుకరించేవారూ తయారయ్యారు[1]. ఆపైన కూడా మహాప్రస్థానం తర్వాత ప్రాచుర్యం పొందిన మరో శ్రీశ్రీ కవితా సంకలనంగా ఇది నిలిచింది.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 రాధాకృష్ణ, బూదరాజు (1999). మహాకవి శ్రీశ్రీ (ప్రథమ ముద్రణ ed.). న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడమీ. ISBN 81-260-0719-2.