గంగోత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇదే పేరుతోని తెలుగు సినిమా వ్యాసం గంగోత్రి చూడండి.

గంగోత్రి

గంగోత్రి ఉత్తరాఖండ్‌ రాష్ట్రం, ఉత్తర కాశీ జిల్లాలోని ఒకనగర పంచాయితీ. ఇది భాగీరథీ నదీతీరంలో ఉన్న హిందువుల పుణ్యక్షేత్రం. ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో 4,042 మీటర్ల ఎత్తులో ఉంది.

నగర చరిత్ర[మార్చు]

Gaumukh, source of the Ganges above Gangotri
Gaumukh, source of the Ganges above Gangotri

గంగోత్రి గంగా నది పుట్టిన ప్రదేశం. గంగాదేవి ప్రతిష్ఠితమైన ప్రదేశం. హిమాలయాలలోని చార్‌ధామ్‌లలో ఒకటి. ఇక్కడ గంగానది భాగీరథీ పేరుతో పిలవబడుతుంది. గంగా నదిని భూమికి తీసుకు రావడానికి భాగీరథుడు కారణం కనుక ఆ పేరు వచ్చింది. దేవ ప్రయాగ నుండి గంగానదిలో అలకనంద నది ప్రవేశించే ప్రదేశం నుండి గంగా నదిగా పిలవబడుతుంది. గంగానది పుట్టిన ప్రదేశం గౌముఖ్. ఇది గంగోత్రినుండి 40 కిమీటర్ల ఎగువలో పర్వతాలలో ఉంటుంది.

హరిద్వార్, రిషికేశ్, డెహరాడూన్ నుండి ఒక రోజు ప్రయాణంచేసి గంగోత్రిని చేరవచ్చు. యమునోత్రి నుండి రెండురోజుల ప్రయాణం చేసి చేరుకోవచ్చు. యమునోత్రి కంటే గంగోత్రికి వచ్చే సందర్శకుల సంఖ్య అధికం. గంగోత్రిని బస్సు లేక కారులో ప్రయాణించి చేరుకోవచ్చు. గంగోత్రిలో గంగాదేవాలయం ముఖ్యమైన ప్రదేశం. గంగాదేవాలయంలో ఉన్న గంగాదేవి దీపావళి నుండి మే మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ మిగిలిన సమయంలో హార్సిల్ సమీపంలోని ముఖ్బ లోనూ ఉంటుంది. 18వ శతాబ్దపు ఆఖరి భాగం లేక 19వ శతాబ్దపు ఆరంభంలో గంగాదేవి ఆలయం గుర్కా జనరల్ అమర్‌సింఘ్ థాపాచే నిర్మించబడి నట్లు అంచనా. ఇక్కడి సంప్రదాయక పూజలు సెమ్వాల్ కుటుంబానికి చెందిన పూజారులు నిర్వహిస్తారు. గంగానది ఉదృతంగా ప్రవహించే ప్రదేశంలో ఉన్న గంగాదేవికి ఆరతి ఇచ్చే దృశ్యం భక్తులకు మనోహర దృశ్యం. పర్వతారోహకులకు గంగోత్రి ముఖ్య కేంద్రం. ఇక్కడి నుండి కొందరు సాహసయాత్రికులు గౌముఖ్ పర్వతాన్ని అధిరోహిస్తుంటారు.

స్థల పురాణం[మార్చు]

గంగోత్రిలో భాగీరధుడు తపస్సు చేసిన స్థలం

హిందూ పురాణలలో గంగాదేవి స్వర్గ నివాసితురాలని రాజకుమారుడు భాగీరధుడు కపిలమునిచే శపించబడిన తన పూర్వీకులను ఉద్దరించడానికి గంగానదిని స్వర్గంనుండి తీసుకు వచ్చాడని వర్ణించబడింది. గంగా ఉధృతిని భూదేవి భరించలేదని అందువలన శివుడు తన జఠాఝూటాలలో బంధించి భూమికి మెల్లగా పంపాడని ప్రతీతి.
సగరుడు అనే రాజు రాక్షస సంహారం తరువాత పాప పరిహారార్ధం ఆశ్వమేధం చేశాడు. దేవేంద్రుడు సగరుని వైభవాన్ని చూసి కించిత్తు భయపడి సగరుడు తనపదవికి పోటీకి రాగలడన్న భీతితో సాగరుని అశ్వమేధ అశ్వాన్ని అపహరించి దానిని కపిలముని ఆశ్రమంలో కట్టి వేస్తాడు. ఈ విషయం తెలియని 60 వేల సగరుని కుమారులు అశ్వరక్షణార్ధం అశ్వం వెంట వచ్చి కోపంతో కపిల మహాముని ఆశ్రమంలో ప్రవేశిస్తారు. తపోదీక్షలో ఉన్న కపిలముని తన తపోభంగానికి కారణమైన సగరుని కుమారులు 60వేల మందిని భస్మం చేస్తాడు. సగరుని మనుమడు తన పితరుల ఊర్ధ్వ గతుల కోసం తపస్సు చేసి గంగాదేవిని ప్రత్యక్షం చేసుకుంటాడు. ప్రత్యక్షం చేసుకున్న గంగాదేవిని స్వర్గంనుండి భూమికి వచ్చి తన పితరులకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. గంగాదేవి తనరాక భూమి భరించలేదని దానిని భరించగలిగినవాడు ఒక్క సాంభ శివుడేనని చెప్తుంది. భాగీరధుడు శివుణ్ణి గంగాదేవిని భూమికి తీసుకువచ్చే ప్రయత్నంలో సహకరించమని కోరుకుంటాడు. శివుడు అందుకు అంగీకరించి గంగానదిని తన జటాఝూటాలలో బంధించి మెల్లగా భూమి మీదికి వదిలినట్లు పురాణాలు చెప్తున్నాయి.

భవిష్య బద్రీ దేవాలయం[మార్చు]

తపోవనం సమీపంలోని దట్టమైన అరణ్యాల మధ్య భవిష్య బద్రీ దేవాలయం ఉంది. భవిష్య బద్రీ దేవాలయం జోషిమఠానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. తపోవనానికి సమీపంలోని శిఖరంపైన ఉన్న భవిష్య బద్రీ దేవాలయంలో నరసింహస్వామి ప్రతిష్ఠితమై ఉన్నాడు. భవిష్యత్తులో బద్రీనాధ్‌ని చేరుకోలేని పరిస్థితి వస్తుందని అప్పుడు విష్ణుమూర్తి ఈ దేవాలయంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ కారణంగా ఈ దేవాలయం భవిష్య బద్రీ దేవాలయం ఆలయంగా పిలువబడుతుంది.

జనాభా గణాంకాలు[మార్చు]

2001 జనాభా లెక్కలననుసరించి ఇక్కడి జనాభా 606. పురుషులు 96%, స్త్రీలు 4%. గంగోత్రి 80% అక్షరాశ్యులను కలిగి ఉంది పురుషుల అక్షరాస్యత 91%, స్త్రీల అక్షరాస్యత 48%. 6 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లల జనాభా 0%.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గంగోత్రి&oldid=3882383" నుండి వెలికితీశారు