గురజాడ అప్పారావు

వికీపీడియా నుండి

 ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కొరకు అయోమయనివృత్తి పేజీ అప్పారావు చూడండి.
గురజాడ అప్పారావు

:ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను పునర్లిఖిస్తుంది-గురజాడ అప్పారావు

తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌

గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.


గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు.హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.


వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు.

విషయ సూచిక

[మార్చు] జీవిత విశేషాలు

గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో 1862 సెప్టెంబర్ 21 అప్పారావు జన్మించాడు. తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. చీపురుపల్లిలో పదేళ్ళ వరకు చదివాడు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు.


1884 లో మహారాజ కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1885 లో అప్పలనరసమ్మ గారితో వివాహమైంది. 1886 లో డిప్యూటీ కలెక్టరు ఆప్ఫీసులో హెడ్‌ క్లర్కు పదవినీ, 1887 లో కళాశాల లో అధ్యాపక పదవిని నిర్వహించాడు. 1886 లో రాజా వారి ఆస్థానంలో చేరాడు. 1911 లో మద్రాసు యూనివర్సిటీ లోని బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ లో సభ్యత్వం లభించింది.


గిడుగు రామమూర్తి తో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు (ఖచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892 లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చాడు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909 లో రచించాడు.

53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గరజాడ అప్పారావు మరణించాడు. ఆయనకు ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు.

[మార్చు] సాహితీ చరిత్ర

[మార్చు] కన్యాశుల్కం

ప్రధాన వ్యాసం: కన్యాశుల్కం (నాటకం)
గురజాడ అప్పారావు

గురజాడ రచనల్లో కన్యాశుల్కం (నాటకం) అగ్రగణ్యమైనది. కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ గురజాడ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన ఉత్తమోత్తమమైన రచనలలో ఒకటి. 1892 లో ప్రచురించిన మొదటి కూర్పుకు ఎన్నో మార్పులు చేసి 1909 లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది.


గురజాడ మరణం తరువాత కన్యాశుల్కం పై ఎన్నో వివాదాలు రేగాయి. అది అసలు ఆయన రాయనేలేదనీ, వేరెవరో రాస్తే, తన పేరు వేసుకున్నారని ఒకటి; ఆయన ఇంగ్లీషులో రాస్తే, వేరే ఒకాయన దానిని తెలుగు లోకి అనువదించారని మరొకటి, ఇలాగ కొన్ని వివాదాలు రేగాయి. చివరికి ఆ వాదనలన్నీ అసత్యాలని తేలిపోయాయి. ఈ వివాదాలన్నీ గురజాడ మరణం తరువాత వచ్చినవే. ఇన్ని వివాదాల మధ్యా కన్యాశుల్కం కొన్ని వందల ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న మొదటి తెలుగు సాంఘిక నాటకమదే!

గురజాడ అప్పారావు
గురజాడ అప్పారావు

[మార్చు] పుత్తడి బొమ్మా పూర్ణమ్మా

పుత్తడి బొమ్మా పూర్ణమ్మా అనే సుప్రసిధ్ద గేయం ఆయన రచనల్లో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కం దురాచారమే.

కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యం లోని చివరి పద్యం ఇది:

కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేని పసల్‌
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ

[మార్చు] దేశమును ప్రేమించుమన్నా

ఆయన రాసిన ప్రముఖ గేయం లోని ఒక భాగం ఇది:

పూర్తి గేయాన్ని కూడా చదవండి.
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌

[మార్చు] ఇతర రచనలు

[మార్చు] కన్యాశుల్కం కర్తృత్వం పై వివాదం

1955 మార్చి 13 న (అప్పారావు మరణించిన దాదాపు 40 ఏళ్ళ తరువాత) జయంతి కుమారస్వామి ఆంధ్ర పత్రికలో రాసిన ఒక వ్యాసంతో ఒక పెద్ద వివాదం చెలరేగింది. పూర్తి వివరాలను కన్యాశుల్కం (నాటకం) పేజీలో చూడండి.

[మార్చు] ఎవరెవరు ఏమన్నారు

  • "కన్యాశుల్కం నాటకానికి సాటి రాగల రచన భారతీయ సాహితంలో మృచ్చకటికం తప్ప మరోటి లేదు" - శ్రీశ్రీ
  • "కన్యాశుల్కం బీభత్స రస ప్రధానమైన విషాదాంత నాటకం"-శ్రీ శ్రీ
  • "కవిత్రయమంటే తిక్కన, వేమన, గురజాడ" - శ్రీశ్రీ
  • "గురజాడ 1915 లో చనిపోలేదు, అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించాడు" - దేవులపల్లి కృష్ణశాస్త్రి
పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు