గోవిందరాజులు సుబ్బారావు
వికీపీడియా నుండి
గోవిందరాజులు సుబ్బారావు (1895 - 1959) వైద్యులు, సాహిత్య ప్రియులు, రచయిత, తెలుగు సినిమాలలో మరియు నాటకాలలో తొలితరం నటుడు.
వీరు 1895 సంవత్సరంలో జన్మించారు. వీరు వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణులై డాక్టరుగా తెనాలిలో స్థిరపడి, దానివలన పేరుప్రతిష్టలు సంపాదించారు. తరువాత కాలంలో వీరు హోమియోపతి వైద్యానికి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించారు. అణు విజ్ఞానాన్ని చదివి, ఐన్ స్టీన్తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. అయితే ఆంధ్ర రాష్ట్రమంతా మంచి పేరు తెచ్చిపెట్టింది వీరి నటనా వైదుష్యం.
పాఠశాలలో చదివేటప్పుడు, వార్షికోత్సవ సందర్భంలో 'మర్చంట్ ఆఫ్ వెనిస్' అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో వీరి నట జీవితం ప్రారంభమైంది. వీరు 20 ప్రముఖ రాగాలు పాడాటం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో గయోపాఖ్యానం నాటకంలో సాత్యకిగా, భీముడుగా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టారు. తెనాలిలో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని 'బొబ్బిలి'లో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. 'కన్యాశుల్కం'లో గిరీశం పాత్రవలననూ, 'ప్రతాపరుద్రీయం'లో పిచ్చివాడు పాత్రవలననూ సుబ్బారావు ఆంధ్రదేశంలో అసమాన ఖ్యతిని పొందారు.
సినిమా రంగంలో వీరు ఎంతగానో రాణించారు. మాలపిల్లలో సుందర రామశాస్త్రిగా, షావుకారులో చెంగయ్య, 'బాలనాగమ్మ'లో మాయల మరాఠీగా వీరు ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందారు.
వీరు విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవారు. ఆంగ్లంలో 'ఇనార్గానిక్ ఎవల్యూషన్' అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించారు.
వీరు చెన్నైలోని స్వగృహంలో అక్టోబరు 29, 1959 సంవత్సరంలో పరమపదించారు.
[మార్చు] చిత్ర సమాహారం
- భాగ్యరేఖ (1957)
- పాండురంగ మహత్యం (1957)
- చరణదాసి (1956) .... బసవయ్య
- కన్యాశుల్కం (1955) .... లుబ్ధావధానులు
- షావుకారు (1950) .... షావుకారు చంగయ్య
- ధర్మాంగద (1949)
- గుణసుందరి కథ (1949)
- పల్నాటి యుద్ధం (1947) .... బ్రహ్మనాయుడు
- రత్నమాల (1947)
- బాలనాగమ్మ (1942) .... మాయల మరాఠి
- గృహలక్ష్మి (1938)
- మాలపిల్ల (1938) .... సుందర రామశాస్త్రి