చివటం అచ్చమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చివటం అచ్చమ్మ అవధూత, యోగిని. ఈమె అసలు పేరు అచ్చమ్మ. ఈమె దిగంబర యోగిని, సాధు అమ్మగా ప్రసిద్ధి చెందింది. ఈమె తణుకు సమీపాన గల చివటం గ్రామములో సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించింది. ఈమె భర్త దుర్మార్గుడు. అతడు బాధ్యతారాహిత్యంతో తిరుగుతుండే వాడు. ఆయన ఎన్ని బాధలు పెట్టినా సహనంతో వివిధ పనులు చేసి తన భర్త బిడ్డలకు వండి పెట్టే సాధ్వి. ఆమెకు భక్తి మెండు. ఆమె రామనామాన్ని స్మరిస్తూ ఉండేవారు. ఖాళీ దొరికితే ధ్యానానికి కూర్చునేవారు. ఒకనాడు ఆమె తన కొడుకుని తల్లికి అప్పగించి ఇల్లు విడిచి వెళ్ళీపోయింది. కొన్నాళ్లు ఆమె చిన్నాయి గూడెం లో ఉన్నారు. ఆ తర్వాత మన్నెం జగన్నాధపురం వెళ్లి ఆ ప్రాంతంలో 12 సంవత్సరాలు మౌనంగా కఠిన దీక్షలు చేసారట. ఈ కాలంలో ఎన్నో మహిమలు ప్రదర్శించేవారని స్థానికుల నమ్మకం. రాజమండ్రి స్త్రీల మఠంలో కొంతకాలముండి, చివటం చేరారు. చివటం లో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడక తన్మయస్థితిలో బట్టలుకూడా జారిపోతున్నా తెలియని స్తితిలో వుండేవారు. ఒకరోజు జారిపోతున్న తనచీరను తీసి ఒకబాలునిపై వేసి అప్పటినుండి దిగంబరంగా ఉండిపోయారు. అమ్మ చివటం సమీపములో జమ్మిచెట్టు క్రింద ధ్యానం చేసుకుంటుండేవారు. ఎవరయినా అడిగితే కాయలు కాయని చెట్టుక్రింద కూర్చోవాలి అనేవారు.

ఈమె ఎక్కువకాలం శ్మశానములో గడిపేవారు. అప్పుడప్పుడూ మూడు ఇళ్ల్ల్లకుమాత్రమే బిక్షకువెళ్ళేవారు. బిక్షచేతిలో ఉంచుకుని పరుగులు తీసేవారు. తనగురించి, శరీరసృహే లేకుండా చిదానందస్థితిలో ఉండే ఆమెకు గ్రామం లోనివారే మంచిచెడ్దలు చూసేవారు. శేషమ్మగారని ఒకావిడ బలవంతంగా తీసుకెళ్ళి స్నానము చేయిం చేవారు. చివటములో అలా 12 సంవత్సరాలు ధ్యానం లో గడిపారు.

మహాత్ములు కూడా ఆమె దర్శనం కోసం వచ్చేవారు. అయితే వచ్చినవారి పాదాలను తాకి నమస్కరించేవారు అమ్మ. ఎదిగేకొద్దీ ఎలా ఒదగాలో సాధకులకు చేసి చూపించారు అమ్మ. సాధూరాం బాబాజీ శిష్యులయిన హఠయోగి అప్పారావుగారికి కూడా అమ్మ అలానమస్కరించబోగా ఆయన బాధపడి, అమ్మా నువ్వు పండిపోయావు నేనింకా పండవలసిన వాడిని అనిఅన్నారు. ధ్యానం ఎలాచెయ్యాలి అని అడిగిన భక్తులతో, మొదట ఓమ్ కారం చెయ్యాలి, ఆతర్వాత రామరామ అనుకుంటూ మౌనంగా కూర్చోవాలి. ధ్యానం లోంచి లేచేటప్పుడు కూడా, ఓంకారం చేయాలి. చీపురుపెట్టి తుడిస్తే వాకిట్లో ఎంత శుభ్రంగా ఉంటుందో, అలాగే ఓంకారము చేసినప్పుడు కూడా మనసులో మాలిన్యము తొలగిపోతుంది అని చెప్పారు. ఆధ్యాత్మికోపన్యాసాలు వినడం కూర అంతవినాలి, ధ్యానం అన్నమంత చేయాలి అనేవారు. ధ్యానం బంగారుముద్ద వంటిది, దానికి మించినదిలేదు. అనిచెప్పేవారు, అందుకొరకు ఎటువంటి నిబంధనలు అక్కరలేదనేవారు. కాలు కడుక్కోక పోయినా పరవా లేదే, రామరామా అనుకోండే అనేవారు. నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి ఎంత తాపయత్ర పడతామో అంతకన్నా ఎక్కువ ఆత్రుత పడాలి దైవంకోసం అనేవారు అమ్మ. రామాలయంలో నివసిస్తూ స్వయంగా వంటచేసి అందరికీ తల్లిలా తినిపిస్తుండేవారు ఆ మహాత్మురాలు. తన సమాధిని ముందుగానే సూచించారు అమ్మ. మహాసమాధికి వారం రోజులముందు తన పంటిని పీకించి సూరమ్మ అనే భక్తురాలికిచ్చి దాచుకోమన్నారు.

నిర్యాణం[మార్చు]

1981, జూన్ 8 , తేదీన ఆమె పరలోక ప్రాప్తి పొందారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]