చెంచులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెంచు వేటగాడు

ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 3వ కులం. హరిదాసులు, బుడబుక్కల, కాటికాపరులు, బోయ, కోయ, ఎరుకల, యానాది, లంబాడి మొదలైన ఆదిమ జాతుల్లో చెంచు కూడా ఒకటి. వీరు పూర్తిగా ఆదివాసీలు. ఆంధ్రప్రదేశ్‌లోని చెంచు తెగ ప్రాచీన సంచార తెగలలో ఒకటి. నల్లమల ప్రాంతంలోని కొండలు, గుట్టలే చెంచుల ప్రస్తుత నివాస స్థలం. అంటే కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో చెంచులు[1] విస్తరించి, అటు నిజాం రాజ్యానికీ, యిటు బ్రిటిషు పరిపాలనలోని మద్రాస్ ప్రెసిడెన్సీ‌కి సరిహద్దుగా ఉన్న కృష్ణానదికి ఇరువైపులా వున్న ప్రాంతాల్లో కనిపించేవారు. చెంచులు తెలుగు కూడా మాట్లాడతారు. శ్రీలంకలోని ప్రాచీన తెగ అయిన వెద్దా (vedda) ల మాదిరిగానే చెంచులు కూడా రింగుల జుత్తు, విశాల వదనం, చప్పిడి ముక్కు, పొడవాటి దవడతో పొట్టిగా, నల్లగా ఉంటారు. శరీరాన్ని తమ పూర్వీకులలాగా ఆకులతో చుట్టుకోవడం ఇప్పుడు లేకపోయినా, మగవాళ్ళు గోచీ మాత్రమే పెట్టుకుంటారు. ఆడవాళ్ళు నూలు రవిక, చీర కట్టుకుంటారు.అడవి చెంచుల కన్నా నిరుపేదలు మొత్తం భారతదేశంలోనే ఉండరు. విల్లంబులు, ఒక కత్తి, గొడ్డలి, గుంతలు తవ్వే కర్ర, కొన్ని కుండలు, బుట్టలు, మరికొన్ని చింకిపాతలు - యివే చెంచుల సమస్త ఆస్తిపాస్తులు. చెంచుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అన్న భావనలు బలంగా కనిపిస్తాయి. చెంచులు వేటనూ, అడవి పండ్లనూ ప్రసాదిస్తుందని విశ్వసించే ఒక దేవతను పూజిస్తారు. హిందువులు పరమాత్మగా పూజించే భగవంతుడిలో కొన్ని లక్షణాలతో సారూప్యం ఉన్న ఒక "ఆకాశదేవుణ్ణి" కూడా చెంచులు పూజిస్తారు. జీవితం దేవుడి వరప్రసాదమేననీ, మరణించిన జీవుడు దేవుడిలో కలిసిపోతాడనీ, చెంచులు బలంగా నమ్ముతారు. హిందూ సమాజ సంపర్కం వల్లే యీ విశ్వాసాలన్నీ చెంచుల ఆలోచనా విధానాల్లోకి ప్రవేశించాయి. అప్పటికప్పుడే ఆశువుగా పాటలు పాడుతూ స్త్రీ పురుషులు నృత్యం చేస్తారు. వీరి ఆటల్లో సింగి సింగడు ప్రధాన పాత్రధారులు, నాయికా నాయకులు. డప్పుకు తగినట్టుగా గంతులేస్తారు. ఇప్పపువ్వు సారా తాగితే మైమరచి కుప్పిగంతులేస్తారు. నెమలి నృత్యం, కోతి నృత్యం వీరి నృత్యాల్లో ముఖ్యమైనవి. చెంచుల కథలు కూడా పూర్వం ప్రసిద్ధి చెందిన జానపద కళల్లో ఒకటి.

వేటాడుతున్న చెంచు

పావనంబైన తమిలేటి పరిసరమున
వేగి కురువాటికా దేశ విపినభూమి
గోవులనుపేరి చెంచుల కులమునందు
గడిమికత్తుల నా గలుగ గమ్మి యలదు - (వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం)

విలు నమ్ముల్‌ ధరియించి చెంచులు తదాభీలాటవీ మధ్య భూ
ముల కన్పట్టిన నంజలింపుము మహాత్ముండైన భర్గుండు భ
క్తుల కిష్టార్థము లీయగోరిన గణస్తోమంబుతో మాయ పం
దుల వేటాడుచు భిల్లుడై నరుల కన్నుల్‌ గప్పి క్రీడించెడిన్‌ - ( గుర్రం జాషువా గబ్బిలం)

  • బోయలు, చెంచులు మొదలైన వాళ్ళకి పాలన్నం పెట్టినంత మాత్రాన విశ్వాసవంతులౌతారు. ఐతే వాళ్ళకి కోపం రావటం కూడా చాలా తేలికే. వాళ్ళ విషయంలో మంచితనంతో ఉండాలి - యామునిడి రాజనీతి సూత్రాలు
  • వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు చెంచులను విందుకు పిలిచి వాళ్ళు భోజనం చేశాక 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి నరికించాడనీ అందుకే ఆ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారిందనీ తరువాత తాను చేసిన హత్యలకు పశ్చాత్తాపపడి గుళ్ళూ గోపురాలూ కట్టించాడనీ చరిత్ర.
  • ఆదిమ గిరిజన జాతి అయిన చెంచులు అంతరించిపోతున్నారు. నల్లమల అడవికి మాత్రమే పరిమితమైన ఈజాతి క్రమంగా కాల గర్భంలో కలిసిపోతోంది. (సాక్షి 21.10.2008)
  • అస్తిత్వ ప్రమాదంలో చెంచులు (ఆంధ్రజ్యోతి 28.12.2008)

క్షయ, మలేరియా వంటి వ్యాధుల మూలంగా చెంచులు మరణిస్తున్నారు. సంతాన లేమి కూడా ప్రధాన సమస్యగా మారింది. అతి ప్రాచీన ఆదివాసి తెగయైన చెంచు జాతి అస్తిత్వానికే ముప్పు ఏర్పడుతున్నది. మహబూబ్ నగర్, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, నల్గొండ జిల్లాల్లోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారు చెంచులు.రాష్ట్రంలోని మిగతా జన సమూహాలతో కానీ, ఇతర గిరిజన తెగలతో కానీ, చెంచు తెగకు దగ్గరి పోలికలు లేవు. వీరి మనస్తత్వాలు, అలవాట్లు, మానసిక, శారీరక స్థితిగతులు, సంస్కృ తి భిన్నమైనవి.నల్లమ ల అటవీ ప్రాంతంలోని ఐదు జిల్లాలను పులుల అభయారణ్యంగా ప్రకటించి, శాశ్వత నిర్మాణాలు లేని 'నో మాన్ లాండ్'గా ప్రకటించారు. చెంచు పెంటలను పునరావాసం పేరి ట అడవి బయటకు పంపించవద్దని జి.సి.సి నిర్వహణను చెంచు యువతకు అప్పగించాలని వీరు కోరుతున్నారు.చెంచుల వ్యవసాయ భూములు అధికభాగం అన్యాక్రాంతమయ్యాయి. అంతేకాక వీరి విలువైన వనరులు గిరిజనేతరుల చేతికి పోయాయి.చెంచుల ఇలవేల్పులైన శ్రీశైలం మల్లికార్జున స్వామి, అహోబిళ లక్ష్మీనరసింహ్మ స్వామి దేవాలయాలు వందల సంవత్సరాలుగా చెంచుల సంరక్షణలోనే ఉండేవి. చెంచులు వీటిని వారసత్వ సంపదగా భావించుకుంటారు. చెంచుల గజ్జల కొండడు, మల్లయ్య తాత దొర వంటి వారు శ్రీశైలం మల్లన్న అర్చకులు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో జరిగే పూజాకార్యక్రమంలో చెంచులకు ప్రత్యేక స్థానం ఉంది. వీరు పార్వతీ దేవిని తమ ఆడపడుచుగా భావిస్తారు. శ్రీశైల మల్లన్న సన్నిధిలో చెంచులకు ఉద్యోగాలివ్వాలని కోరుతున్నారు.చెంచుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాలు చెంచుల కు ఏమాత్రం ఉపయోగ పడటంలేదు. చెంచుల ఆధీనంలో వారు సాగుచేసుకుంటున్న భూములు వారికే చెందుతాయి అని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన అటవీ హక్కుల చట్టం దేవాదాయ, అటవీశాఖల మధ్య

అభివృద్ధి అంతా పైపైనే - గుడిసెల్లోనే నివాసం .. పక్కా ఇళ్లకు తాళం[మార్చు]

  • గిరిజనుల్లో ప్రత్యేకత కలిగిన ఒక వర్గం. వారిలో ఎక్కువ మంది బంధువులే. అయినా ఒకటిగా కలిసుండేందుకు ప్రయత్నించరు. ఇతర గిరిజనుల మాదిరిగానే వారు కూడా అభివృద్ధికి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపిస్తారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలకు దగ్గరగా ఉన్న గూడేల్లో నివసిస్తున్నప్పటికీ ఆ అభివృద్ధిని అందుకోవడంలో వారు వెనుకబడే ఉంటున్నారు. ఇక మారుమూల దట్టమైన కీకారణ్యంలో ఉన్న చెంచుల మాట చెప్పనక్కర్లేదు. అటు పౌష్టికాహారం, ఇటు వైద్యంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. అంతా కలిసి ఒకటిగా ఉండేందుకు చొరవ చూపించకపోవడం, ప్రభుత్వం కట్టించిన పక్కా ఇళ్లలో నివసించేందుకు ఇష్టపడకపోవడం, స్వచ్ఛమైన నీరు లభించకపోవడం వంటి అంశాలు చెంచులను వేధిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం నుండి కూడా అవసరమైన ప్రణాళిక లేకపోవడంతో అరణ్యంలో సమస్యల మధ్యనే చెంచులు కాలం వెళ్లదీస్తున్నారు. ఒకరిద్దరు చెంచులు కూడా ఒక గూడేన్ని ఏర్పాటుచేసుకుని ముందుకు సాగడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.
  • చెంచులు ప్రధానంగా నల్లమలలోనే కనిపిస్తారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కొంతమంది చెంచులు నివసిస్తున్నప్పటికీ 80 శాతానికిపైగా నల్లమలలోని నాలుగు జిల్లాల అటవీ ప్రాంతంలోనే కనిపిస్తున్నారు. మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 42 వేల మంది చెంచులు నివసిస్తుండగా, వారు తమ కోసం 340 చిన్న చిన్న గూడేలు, పెంటలు ఏర్పాటుచేస్తున్నారు. 46 మండలాల్లో 10768 కుటుంబాలున్నాయి. మొత్తం రాష్ట్ర జనాభాలో 0.0055%. ఉన్నది తక్కువ మంది అయినప్పటికీ ఎక్కువ గూడేలు ఏర్పాటుచేసుకోవడం వల్ల ఒక ప్రాంతంలో తక్కువ మంది నివసించే పరిస్థితి నెలకొంది. నలుగురు చొప్పున ఒక పెంటలో నివసిస్తున్న వారు కూడా నల్లమలలో కనిపిస్తున్నారు. పది మంది కన్నా తక్కువగా చెంచులు నివసిస్తున్న పెంటలు 13 ఉన్నాయి. 25 మంది కన్నా తక్కువ చెంచులు నివసిస్తున్న పెంటలు 26 వరకు ఉన్నాయి. ఇంత తక్కువ సంఖ్యలో చెంచులు ఒక పెంటలో నివసిస్తుండడంతో వారికి సంక్షేమ పథకాలు అమలు పరచడం కష్టంగా ఉన్నట్లు అధికారులు చెబున్నారు. బయటకు రమ్మన్నా రావడం లేదని, దీంతో వారికి అభివృద్ధి ఫలాలు అందడం లేదని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చెబున్నారు. రెండు వందల మంది కన్నా చెంచులు ఒక చోట నివసించే గూడేలు కేవలం 60 మాత్రమే ఉండటం పరిస్థితి దయనీయతకు అద్దం పడుతోంది. పర్యాటకంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద పల్లెలకు సమీపంలోని అటవీ పెంటలు, గూడేల్లో కొంతవరకు అభివృద్ధి ఉన్నట్లు బయటకు కనిపిస్తున్నప్పటికీ సామాజిక అభివృద్ధి మాత్రం లేదనే చెప్పవచ్చు.
  • ఆధునిక ప్రపంచంలో మహిళలు ధరించే చుడీదార్, చీరలు వంటి వస్త్రాలు కొంతమంది ధరిస్తున్నప్పటికీ అక్కడ ఇతర విద్య, ఆరోగ్యం వంటి అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. వైద్యం కోసం వచ్చే వైద్యులు, సిబ్బందికి కూడా సహకరించని వారు కోకొల్లలుగా కనిపిస్తారు. రాకపోతే వైద్యుల నిర్లక్ష్యం అంటూ, వస్తే ఎందుకు వచ్చారని ప్రశ్నించే వారు చెంచుల్లో అధికంగా ఉన్నారు. వైద్యులు వచ్చే సమయంలో ఇళ్లలోకి వెళ్లిపోయి తాళాలు వేసుకోవడం కూడా కద్దు.
  • ఇక ఎన్ని పక్కా ఇళ్లు నిర్మించినా వాటికి దూరంగా ఉండడం చెంచుల్లో దర్శనమిస్తుంది. పక్కా ఇళ్లలో ఉంటే శుభం జరగదన్న భావం కారణంగా వారంతా ఇప్పటికే గుడిసెల్లోనే కాలం వెళ్లదీస్తుంటారు. ఐటిడిఎ అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లు దశాబ్దాల తరబడి తాళాలు వేసే కనిపిస్తున్నాయి. అప్పాపూర్ అనే ప్రధాన గూడెంలో ఐటిడిఎ అధ్వర్యంలో చుట్టుపక్కల చిన్న చిన్న గూడేలన్నింటికీ కలిపి కొన్ని పక్కా ఇళ్లను నిర్మించారు. అయితే నిర్మాణం పూర్తయిన తరువాత ఆ ఇళ్లకు తాళాలు వేసి మళ్లీ తమతమ పెంటలకు వెళ్లిపోయిన చెంచుల సంఖ్య అధికంగా ఉంది. ఇదే పరిస్థితి దాదాపు నల్లమలలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక అనేక గూడేల్లోని పిల్లల కోసం ఏర్పాటుచేసిన పాఠశాలలు కూడా దీనావస్థలోనే ఉంటున్నాయి. పశువుల పాకలుగా కొన్ని మారిపోతుండగా, మరికొన్ని ఎప్పుడూ తాళాలు వేసే దర్శనమిస్తున్నాయి. ఐదో తరగతి చదివితే గొప్ప అన్న పరిస్థితి చెంచుల్లో ఉండడం గమనార్హం. పదో తరగతి, ఇంటర్ చదివితే వారు అత్యంత విద్యావంతులుగా గుర్తించబడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో అటవీశాఖ, గిరిజన సంక్షేమం, ఐటిడిఎ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు పుష్కలంగా ఉన్నాయి. తాగునీటికి కూడా చర్యలు లేవని చెంచుల నుండి ఆరోపణలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో స్థానికంగా లభించే ఊటలు, బావుల్లో నీటినే తాగాల్సి వస్తుండడంతో డయేరియా వంటి సమస్యలు తరచూ తలెత్తుతున్నట్లు చెంచులు అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులు కూడా వీరికి స్వచ్ఛమైన నీరు అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. (చిత్రం) మూఢనమ్మకాలతో ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇళ్ళలో ఉండటానికి భయపడి...చెంచులు గుడిసెల్లోనే ఉండటానికిష్టపడుతున్నారు [2]
  • చెంచులు నివసించే గ్రామాలను 'పెంట' అంటారు. 'పాచిపెంట', 'సున్నిపెంట' వంటి పేర్లు వినగానే అవి 'చెంచుల' నివాసాలుగా గుర్తించవచ్చును. 'తాటిపాక', 'కొలనుపాక' గ్రామ నామాలలోని 'పాక' జైనుల నివాసాలుగా గుర్తించవచ్చును.

చెంచుల వర్గీకరణ[మార్చు]

చెంచులను నాలుగు వర్గాలుగా వర్గీకరించారు.అవి

  1. అడవి చెంచులు.
  2. దేవ చెంచులు.
  3. బొంత చెంచులు.
  4. కృష్ణ చెంచులు.

వీరిలో అడవి చెంచులు, దేవ చెంచులు నల్లమల ప్రాంతంలో, బొంత చెంచులు, కృష్ణ చెంచులు లోతట్టు పల్లపు ప్రాంతాలలో నివసిస్తుంటారు.బొంత చెంచులు మాట్లాడే భాషను 'బొంతకోర్ 'అని అంటారు.చెంచు స్త్రీలు గృహోపకరణాలను, వెదురు నిచ్చెనలను తయారు చేసి గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని ప్రజలకు అమ్మి వచ్చిన ఆదాయంతో జీవిస్తారు.

ఒక్కొక్క గోత్రానికి చెందిన చెంచులు తేనె తీసుకునేందుకు ఒక్కో ప్రాంతాన్ని కేటాయించుకుని రాత్రి పూటల్లో తేనెను సేకరిస్తారు. తేనె సేకరించడానికి వెళ్ళినపుడు బావామరదుల్ల్ని వెంట తీసుకువెళతారు. అన్నదమ్ములను మాత్రం తీసుకువెళ్ళరు. ఎందుకంటే వీరిలో అన్న చనిపోయినపుడు అతని భార్యను తమ్ముడు వివాహం చేసుకునే ఆచారం ఉంది. ప్రతీ గూడెంకు ఒక హద్దు ఉంటుంది. ఒక గూడెంకు ఉన్న హద్దులోకి వేరొక గూడెం వారు రారు.

చెంచుల ఆరాధ్య దైవాలు[మార్చు]

చెంచులు వారి సొంత దేవుళ్ళతో పాటుగా నరసింహస్వామి, భ్రమరాంబ, మల్లికార్జున స్వాములను ఆరాధ్య దైవాలుగా కొలుస్తారు. నరసింహ స్వామి సతీమణి అయిన చెంచు లక్ష్మి వీరి తెగకు చెందినదిగా చెప్పుకుంటారు. దీనికి ఆధారం అహెూబిలం దేవాలయ కుడ్యాల మీద చెక్కబడిన ప్రతిమలు, శ్రీశైల దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలలో చెంచుల పాత్ర.

చెంచులు దర్శించే ముఖ్యమైన యాత్రా స్థలాలు[మార్చు]

  1. శ్రీశైలం.
  2. మహానంది.
  3. అహెూబిలం.

చెంచుల ఆచారవ్యవహారాలు[మార్చు]

వివాహ కార్యక్రమాలు[మార్చు]

చెంచుల వివాహ నిశ్చయ కార్యక్రమం పెళ్ళి కుమార్తె ఇంట్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెళ్ళి కుమారుడితో పాటుగా అతని తల్లిదండ్రులు, తొమ్మిది మంది పెద్దలు కన్యాదాత ఇంటికి వస్తారు.ఇరువర్గాలకు, పెద్దలకు సమ్మతి అయిన తరువాత పెళ్ళి నిశ్చయమైనట్లు ప్రకటించి అందరూ కలిసి సారాయి త్రాగుతారు.దీనితో పెళ్ళి నిశ్చయ తంతు ముగుస్తుంది.

చెంచుల పెళ్ళి తంతు రెండురోజులు జరుగుతుంది. ముందురోజు పెళ్ళి కుమారుని ఇంటి ముందు అడవి నుండి తెచ్చిన కట్టెలు, ఆకులూ, పూలతో ఆకర్షణీయ పందిళ్ళు వేస్తారు. వధూవరులను ఒకే పందిరి క్రింద కూర్చుండబెడతారు. చెంచులలో నేటికీ కట్నాలు లేవు. పెళ్ళి మెుదటిరోజు, రెండో రోజు యాటను కోసి భోజనంతో పాటుగా ఒక్కొక్కరికి ఒక సీసా సారాయిని ఇస్తారు. చెంచు గూడెంలో తక్కువ కుటుంబాలు ఉన్నందున ఏ కుటుంబంలో పెళ్ళి జరిగినా ఆ గూడెంలో ఉన్న మెుత్తం కుటుంబాలను పెళ్ళికి పిలుస్తారు.మా వారు అన్ని ఉండదు.

వితంతు వివాహం[మార్చు]

చెంచులలో భర్త చనిపోతే రెండో పెళ్ళి చేసుకునే పద్ధతి ఉంది. 25 నుండి 40 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న స్త్రీలు భర్త చనిపోయి పిల్లలు ఉన్నప్పటికీ ఆమెకు ఇష్టమైతే రెండో పెళ్ళి చేసుకోవచ్చు.

కుటుంబ వ్యవస్థ[మార్చు]

చెంచుల కుటుంబాలలో ఉమ్మడి కుటుంబాలు ఉండవు. వివాహం జరిగిన వెంటనే విడిగా కాపురం పెట్టుకుంటారు.చాలా కుటుంబాలలో వివాహానికి పూర్వమే మగవాడు ఒక గుడిసెను ఏర్పాటు చేసుకునే ఆచారం ఇప్పటికీ ఉంది. చెంచులు స్వేచ్ఛను కోరుకునే మనస్తత్వం కలవారు. స్త్రీలు నెలసరి వచ్చినపుడు వారు నివాసం ఉంటున్న గుడిసెకు దూరంగా ఉండే సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తారు.

కర్మకాండ[మార్చు]

చెంచుగూడెంలో ఏ వ్యక్తి చనిపోయినా గూడెంలో ఉన్న మెుత్తం జనాభా ఆ రోజున చనిపోయినా వారి ఇంటికి వచ్చి దహన సంస్కారాలు జరిగే వరకూ ఉంటారు.చెంచు గూడెంలలో చనిపోయిన వారిని పూడ్చడం లేదా కాల్చడం వంటివి అడవిలో చేస్తుంటారు.దహనం చేసిన తర్వాత ఒక్కో గూడెంలో ఒక్కోలా తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు కర్మకాండ నిర్వహిస్తారు. అన్నం, కూరలు, మాంసం, చుట్టలు, సారాయి, రొట్టెలు మెుదలైనవి పిండంతో పాటుగా పెడతారు. కర్మకాండను చనిపోయిన వ్యక్తి యొక్క పెద్ద కుమారుడు నిర్వహిస్తాడు.

గూడెం పెద్ద[మార్చు]

ప్రతి చెంచు గూడెంకు ఒక పెద్ద మనిషి ఉంటాడు.ఇతడిని గూడెంలోని వారందరూ కలసి ఎన్నుకుంటారు.గూడెంకు సంబంధించిన అన్ని వ్యవహారాలతో పాటుగా ఇతర గూడెంకు సంబంధించిన అన్ని వ్యవహారాలతో పాటుగా ఇతర గూడెం వారితో సత్సంబంధాలు నెరపడం వంటివి కూడా చేస్తుంటాడు. గూడెంలో ఏ విధమైన శుభ కార్యం జరిగినా ఆయన తప్పనిసరిగా హాజరై ఆశీర్వచనాలు అందజేస్తాడు. కర్మకాండలు జరిగినపుడు ప్రధాన పాత్ర వహిస్తాడు.

చెంచులు ఒకచోట స్థిరంగా ఉండరు. ఒక్కొక్క సీజన్ లో ఒక్కో చోటుకు మారతారు. ఇటువంటి సందర్భాల్లో ఒక గూడెం ఇంకొక చోటుకు మారాలంటే స్థల నిర్ణయం గూడెం పెద్ద చెప్పిన ప్రకారం నిర్ణయించడం జరుగుతుంది.

మూలాలు[మార్చు]

  1. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. pp. 8–14. ISBN 978-93-5445-095-2.
  2. ఆంధ్ర భూమి 6 జూన్ 2011

ఆధారాలు[మార్చు]

ఇతర పఠనాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చెంచులు&oldid=3878090" నుండి వెలికితీశారు