చైతన్య మహాప్రభు

వికీపీడియా నుండి
చైతన్య మహాప్రభు
Chaitanya-Mahabrabhu-at-Jagannath.jpg
చైతన్య మహాప్రభు
జన్మనామం విశ్వంభర్
పుట్టినతేదీ 1486
జన్మస్థలం నవద్వీప్ , ప్రస్తుతం నదియా జిల్లా , పశ్చిమ బెంగాల్
మరణం 1534
పూరీ, ఒరిస్సా, భారత దేశం

వల్లభాచార్యుని సమకాలికుడైన చైతన్య మహాప్రభు రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్ళిన ఒక మహా భక్తుడు. ఇతని జీవిత కాలం 1485-1533. జన్మస్థలం నవద్వీపం (ఇప్పటి నదియా). వల్లభుడు మథుర, బృందావన ప్రాంతాలలో రాధాకృష్ణ మతాన్ని ప్రచారంచేస్తున్న కాలంలోనే చైతన్యుడు బెంగాల్, ఒరిస్సాలలో అదే మతాన్ని ప్రచారం చేశాడు.

విషయ సూచిక

జననం, బాల్యం [మార్చు]

చైతన్యుడి తల్లిదండ్రులకు మొదట ఎనిమిదిమంది సంతానం పుట్టడం, వెంటవెంటనే చనిపోవడం జరిగిన తర్వాత తొమ్మిదవ సంతానంగా విశ్వరూపుడు జన్మించాడు. అతడు చిన్నతనంలోనే సన్యాసం స్వీకరించి దక్షిణానికి వెల్లిపోయాడు. ఆఖరి సంతానం చైతన్యుడు. అతనికి తల్లిదండ్రులు పెట్టిన పేరు విశ్వంభరుడు. తెల్లగా మెరిసిపోతూ ఎంతో అందంగా ఉన్నందున అతడిని గౌరాంగుడు అని పిలిచేవారు. ఇది కాక ఇతడి తోటి పిల్లలు ""నిమాయి" అని పిలిచేవారు. సన్యాసం స్వీకరించిన తర్వాతనే "శ్రీకృష్ణచైతన్యుడు" అనే పేరు వచ్చింది.

గౌరాంగుడు చిన్నతనంలోనే సకల శాస్త్రాలూ, పురాణేతిహాసాలూ చదివి మహా పండితుడయ్యాడు. తర్కం, వ్యాకరణం అతని అభిమాన విషయాలు. 16వ ఏటనే నవద్వీపంలో అతడు పాఠశాల స్థాపించి, వందలాది విద్యార్థులకు తర్క, వ్యాకరణాలు బోధించాడు. సంస్కృతంలో ఒక వ్యాకరణ గ్రంథం కూడా రచించాడు.

గౌరాంగుని 11వ ఏట తండ్రి చనిపోవడం జరిగింది. ఆయన శ్రాద్ధ కర్మలను నిర్వర్తించడానికి తన 23వ ఏట గౌరాంగుడు ఒకసారి గయ వెళ్ళాడు. అక్కడ ఒక విష్ణ్వాలయంలో పూజలు చేస్తుండగా అతని హృదయం భగవంతుని పట్ల అపార భక్తి భావంతో తన్మయుడయిపోయాడు. ఆ స్థితిలో అతడిని చూసిన ఈశ్వరపురి అనే సాధువు అతడు మహాభక్తుడు కాగలడని తలచి కృష్ణమంత్రోపదేశం చేసాడు.

సన్యాస స్వీకారం [మార్చు]

గయ నుండి నవద్వీపం తిరిగివచ్చిన గౌరాంగుడు పాఠశాలను మూసివేసి, నిరంతర కృష్ణ ధ్యానంలో, కృష్ణ సంకీర్తనంలో మునిగిపోయాడు. కృష్ణభక్తి రోజురోజుకీ పెరిగిపోతుండగా ఇక భరించలేక సాంసారిక జీవనాన్ని విడనాడి, తన 25 వ యేట భార్యకు, నవద్వీప ప్రజలకు వీడ్కోలు పలికి కేశవభారతి అనే సన్యాసి దగ్గర సన్యాసాశ్రమాన్ని స్వీకరించాడు. కొంతకాలం జగన్నథ క్షేత్రమైన పూరీలోనూ, కొంతకాలం బృందావనంలోనూ నివసించాడు. అతడికి తరచుగా తన్మయ స్థితి కలిగేది. చివరి 12 ఏళ్ళు సగం సమాధి స్థితిలోను, సగం జాగ్రదావస్థలోను గడిపాడు. సమాధిలో ఉండగా కృష్ణ సంయోగ సుఖాన్ని, జాగ్రదావస్థలో కృష్ణవియోగ వేదనలోని సుఖాన్ని అనుభవించేవాడు.

రచనలు [మార్చు]

చైతన్యుడు ఒక ప్రత్యేక మతాన్ని, సిద్ధాంతాన్ని స్థాపించకపోయినా అతని శిష్యులు తర్వాతికాలంలో బ్రహ్మసూత్రాలకు అతని దృష్టి నుంచి భాష్యంతో పాటు, అతని సిద్ధాంతాలకు విస్పష్ట రూపం ఇచ్చి అనేక గ్రంథాలు వ్రాసారు. చైతన్య మతానికి అవి ప్రామాణికాలు. చైతన్యుడి శిష్యులలో రూపగోస్వామి, సనాతన గోస్వామి, జీవ గోస్వామి ప్రముఖులు. రూప గోస్వామి "భక్తి రసామృత సింధువు", "ఉజ్జ్వల నీలమణి" అనే గ్రంథాలు, సనాతనుడు "వైష్ణవతోషిణి", జీవ గోస్వామి "సత్సందర్భం", "భాగవత టీక", "భక్తి సిద్ధాంతం", "ఉపదేశామృతం" అనే గ్రంథాలు వ్రాసారు.

నిర్యాణం [మార్చు]

చైతన్యుడు తన 48వ ఏట జగన్నాథాలయంలో పూజానిమిత్తం తలుపులు తెరుచుకుని లోనికి వెళ్ళినవాడు వెళ్ళినట్టే మహాప్రస్థానం చెందాడని ఒక కథనం. నదిలో స్నానం చేస్తుండగా అతడిని మామూలుగా ఆవరించే భగవత్తన్మయత్వంలో ఆ నీటిలో మునిగిపోయి తనువు చాలించడని మరొక కథనం.

బోధనలు [మార్చు]

చైతన్య సాంప్రదాయానికి చెందిన వేదాంతాన్ని అచింత్య భేదాభేదవాదం అని అంటారు. మతపరంగా దానికి గౌడీయ వైష్ణవం అని కూడా పేరు.

చైతన్యుడి జ్ఞానమీమాంస మరియు ధార్మిక బోధనలు పదివున్నాయి. వీటినే "దశ మూల బోధనలు" అని వ్యవహరిస్తారు.

  1. ధార్మిక గ్రంధాలు అయినటువంటి భగవద్గీత మరియు శ్రీమద్భాగవతం, గ్రంధాల ఆధారంగా క్రింది తొమ్మిది సత్యాలు స్థాపించబడినవి;
  2. శ్రీకృష్ణుడు "మహా" మరియు "అనంత" 'సత్యం'.
  3. శ్రీకృష్ణుడు దివ్యశక్తి (transcendental), జీవశక్తి (living entities), మరియు భౌతిక (material nature) శక్తులకు మూలము.
  4. కృష్ణుడు రస సముద్రుడు.
  5. జీవులులన్నిటికీ మూలవస్తువు కృష్ణుడే.
  6. కొన్ని జీవులు భౌతికశక్తుల ప్రభావాలకు లోనవుతాయి.
  7. ఇతర జీవుల దివ్యశక్తులు, భౌతిక విధానాలకూ మరియు శక్తులకు అతీతంగా వుంటాయి.
  8. జీవులు మరియు భౌతికపరమయిన ప్రకృతి అచింత్య భేద అభేద, ఒకదానికొకటి అంతర్భాగమైనప్పటికీ, శ్రీకృష్ణుడి అంతర్భాగాలు కావు.
  9. భక్తి లేదా కృష్ణుడి పట్ల పరిపూర్ణ భక్తి మాత్రమే ముక్తికి మార్గము.
  10. శ్రీకృష్ణుడి పట్ల ప్రేమ అత్యున్నత లక్ష్యం.

ఇవీ చూడండి [మార్చు]

పాదపీఠికలు [మార్చు]

బయటి లింకులు [మార్చు]