చ్యవన మహర్షి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చ్యవన మహర్షి తండ్రి భృగు మహర్షి. చ్యవన మహర్షి వృత్తాంతం మహాబారతం, దేవీ భాగవతం, అష్టాదశ పురాణములో చెప్పబడింది. చ్యవన మహర్షి సూర్య కుమారులైన అశ్వనీదేవతలకు యజ్ఞాలలో హవిస్సులు సోమరసాన్ని ఇప్పించాడు. ఈతని భార్య సుకన్య. మామ గారు ఇక్ష్వాక వంశం సూర్యవంశస్థుడైన శర్యాతి. వీరి కుమారులు ప్రమతి, దధీచి, ఆప్రవానుడు.

శర్యాతి వన నిహారం - చ్యవన మహర్షి చూపు పోవడం[మార్చు]

చ్యవన

శర్యాతికి ఒక కుమారుడు, కుమార్తె ఉండేవారు. కుమార్తె పేరు సుకన్య నవయవ్వన సుందరాంగి. ఒక రోజు శర్యాతి వనవిహారానికి రాజధానికి దగ్గరలో ఉన్న మానస సరోవరం అనే సరస్సుకు కుటుంబసమేతంగా చేరు కొంటాడు. ఆ సరొవరం దగ్గరలో ఉన్న ప్రదేశంలో అనేక వైవిధ్య పశు పక్ష్యాదులు ఉండేవి. ఆక్కడే ఉండే అడవిలో భృగు మహర్షి కుమారుడు చ్యవన మహర్షి ప్రాణామాయంతో తపస్సు చేసుకొంటుండేవాడు. దీర్ఘ తపస్సు వల్ల ఆయన మీదకు చలి చీమల పుట్ట చేరుతుంది. ఆ పుట్ట చుట్టు చేరడం వలన చ్యవన మహర్షి ఒక మట్టి ముద్ద వలే కనిపించేవాడు. శర్యాతి కుమార్తె సుకన్య కూడా వన విహారం జరుపుతూ చ్యవనుడు తపస్సు చేసుకొంటున్న పుట్ట వద్దకు వస్తుంది. చ్యవన మహర్షి పుట్టతో కప్పబడి ఉండడం వల్ల శరీరం కనిపించకుండా రెండు కళ్ళు మాత్రమే మిణుగురు పురుగు వలే సుకన్యకు కనిపిస్తాయి. సుకన్య అది ఒక పురుగు వలే ఉన్నదని భావించి పుల్లతో తీయడానికి ప్రయత్నిస్తుంది. అది గమనించిన చ్యవన మహర్షి తాను లోపల తపస్సు చేసుకొంటున్నానని తనని పుల్లతొ పొడవద్దని వారిస్తాడు. కాని ఆ విషయం గ్రహించక సుకన్య పుల్లతొ చ్యవన మహర్షి రెండు కళ్ళు పొడుస్తుంది, చ్యవనుడి కంటి చూపు పోతుంది. కంటి చూపు పోవడంతో చ్యవన మహర్షి కోపించి, శర్యాతి సైనికులకు, మంత్రులకు, శర్యాతికి మలమూత్రాలు రాకుండా బంధించేశాడు. మలమూత్రాలు బంది అవడంతో తాను చింతుడై ఉన్న శర్యాతి వద్దకు సుకన్య వచ్చి తాను అడవిలో తెలియక చేసిన అకృత్యం గురించి చెబుతుంది. అప్పుడు విషయం గ్రహినంచిన శర్యాతి సకల పరివారంతో అడవి వెళ్లి మహర్షి కలిసి అపచారాన్ని మన్నించి క్షమించమంటాడు. అప్పుడు చ్యవన మహర్షి శాంతి చిత్తుడై ఉండి తన చూపు పోవడం వల్ల తనకు ఉపచారాలు చేయడానికి వీలుగా శర్యాతి కుమార్తె సుకన్య అని తనకిచ్చి వివాహం జరపమంటాడు. దానికి శర్యాతి సంకోచిస్తుంటే సుకన్య ముందుకు వచ్చి తన వలన అపచారము జరిగిందని ఆ అపచార నివృత్తి చ్యవన మహర్షికి ఉపచారాలు చేయడం ద్వారా నే తీరుతుందని తండ్రితో తన వివాహం చ్యవన మహర్షితో జరపమని చెబుతుంది. వివాహం జరిగాక చ్యవన మహర్షి ఆశ్రమానికి నార చీరలు కట్టుకొని చేరుతుంది. పతికి సర్వ విధాల ఉపచర్యలు చేస్తూ ఏ లోటు లేకుండా చూసుకొంటుంటుంది.

కాలము గడుచుచుండగా ఒక రోజు సుకన్య నదికి నీరు తెచ్చు కోవడానికి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో వెళ్ళుతున్న అశ్వనీ దేవతలు సుకన్యని చూసి ఏవరీ నవయవ్వన సుందరాంగి అని అనుకొని పరిచయం అడుగగా సుకన్య చ్యవన మహర్షి భార్యనన్ని చెబుతుంది. అప్పుడు వారు ఆ గుడ్డి మునితో కాలం వెలిబుచ్చే బదులు తమతో వచ్చి సర్వసుఖాలు అనుభవించమని కోరుతారు. దానికి సుకన్య అంగీకరించక తన పాతివ్రత్య ధర్మాన్ని తెలుపుతుంది. అప్పుడు అశ్వనీ దేవతలు ఒక పరీక్ష పెట్టదలచి ముసలి వాడు గుడ్డి వాడు అయిన చ్యవన మహర్షిని తాము తమ వైద్యశక్తులతో తమ వలే నవయవ్వనుడిని చేస్తామని ఆమె తన భర్తని గుర్తించమని పల్కుతారు. ఆ విషయం చ్యవన మహర్షికి తెలుపగా చ్యవన మహర్షి అందుకు అంగీకరిస్తాడు. ఆ ముగ్గురు నదిలో స్నానము చేసి బయటకు వస్తారు. ఆ ముగ్గురు చూడాడానికి ఒకే విధంగా నవయవ్వనంలో ఉంటారు. ఆ ముగ్గురుని చూసి మొదట తన పతి ఎవరని సంశయించి జగన్మాతని ప్రార్థించి చ్యవనుడీని గుర్తిస్తుంది. దానికి అశ్వనీ దేవతలు కూడా సంతసించి తమకు సెలవు ఇవ్వమని చ్యవన మహర్షిని కోరుతారు. అప్పుడు చ్యవన మహర్షి తనకు యవ్వనము ప్రసాదించిన కారణమున ఏదైన వరము కోరుకోమంటాడు. అప్పుడు అశ్వనీదేవతలు తమకు యజ్ఞయాగాదులలో సోమరసం ఇంద్రుడు ప్రసాదించడం లేదని ఆ సోమరస పానం కావాలని కోరుకుంటారు.

మూలాలు[మార్చు]

  • చ్యవన మహర్షి: రచన. ఎమ్.కొండమాచార్యులు, వేదకథాభారతి - 16, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1999.

బయటి లింకులు[మార్చు]