జిడ్డు కృష్ణమూర్తి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం యొక్క ప్రధాన వస్తువు పరిచయము లేని వారికి వ్యాసం యొక్క పరిచయం లేదా ప్రవేశిక అరకొరగా ఉన్నది. |
జిడ్డు కృష్ణమూర్తి మే 12, 1895న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో జన్మించాడు. 1929 నుండి 1986లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ అనేక ప్రసంగాలు చేశాడు. మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం మరియు మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించాడు.
విషయ సూచిక |
[మార్చు] జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ముఖ్య ఘట్టాలు
జిడ్డు కృష్ణమూర్తి 1895 లో మదనపల్లి లో జన్మించాడు.తరువాత వారి కుటుంబమంతా మద్రాసు లో నివాసం పెట్టారు . మద్రాసు లోని "అడయారు" థియోసాఫికల్ సొసైటీ కి అంతర్జాతీయ కేంద్రం గా వుండేది. అనిబిసెంట్ దానికి ప్రెసిడెంట్. కృష్ణమూర్తి , ఆయన తమ్ముడు నిత్యానంద కలసి అడయార్ నది సముద్రం లోకలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ వుండేవాళ్ళు. అడయార్ లైబ్రేరియన్ ఈ సోదరులిద్దరినీ చూసి ఆకర్షింపబడ్డారు. ఈ విషయం డాక్టర్ అనిబిసెంట్ కి తెలియజేసి ఆ ఇద్దరినీ ఆమె వద్దకు రప్పించారు. ఆ సొదరులిద్దరినీ చూసి అనిబిసెంట్ కూడా చాలా ప్రభావితురాలైంది. అంతటి తో వారిద్దరినీ విద్యార్జన నిమిత్తం ఇంగ్లాండ్ పంపించింది. పారిస్ లోని సారబాన్ విశ్వ విద్యాలయం లో కృష్ణమూర్తి సంస్కృతమూ , ఫ్రెంచ్ భాషలను అధ్యయనం చేయసాగాడు. తన కొడుకులను తనకు తిరిగి ఇప్పించమని కృష్ణమూర్తి తండ్రి కోర్టు లో దావా వేశాడు. చివరికి అనిబిసెంట్ కు ఆదావా వ్యతిరేకమైంది. అయినప్పటికీ ఏదో విధంగా ఆ సోదరులిద్దరూ తన వద్దే వుండే విధంగా ఏర్పాటు చేసుకున్నది. జిడ్డు కృష్ణమూర్తి కాబోయే జగద్గురువని ఆమె విశ్వాసం. ఆ మేరకు ప్రపంచమంతా చాటింది. అప్పటికి కృష్ణమూర్తి తాను జగద్గురువుని అవునని కాని,కాదని కాని ఏమీ వెల్లడించలేదు. ఇంతలో తన తమ్మునికి జబ్బు చేసినందున తన తమ్ముని తీసుకుని ఆయన అమెరికా లోని కాలిఫోర్నియా కు వెళ్ళిపోయాడు. అక్కడి వాతావరణం తమ్ముని ఆరోగ్యాన్ని ఏమైనా బాగు చేస్తుందేమో అని 1922 లో కాలిఫోర్నియా కొండల్లో ఒక ఇంటిలో సోదరులిద్దరూ నివాసం ఏర్పరుచుకున్నారు. 1925 లో తమ్ముడు నిత్యానంద మరణించాడు. తమ్ముని మరణం కృష్ణమూర్తి ని శోకం లో ముంచింది. ఆ దు ఖావేశంలో తనకు కనిపించే బాటసారులందరినీ తన తమ్ముడెక్కడైనా కనిపించాడా అని అడిగేవాడు. నిత్యానంద మరణం కృష్ణమూర్తి లో విపరీతమైన మార్పును తెచ్చింది. చిన్నప్పట్నుంచీ ఆయన ఏవిషయాన్ని పూర్తిగా నమ్మక ప్రతీ విషయాన్నీ శంకించేవాడు. తనకు ప్రత్యక్ష ప్రమాణం దొరికినప్పుడు మాత్రమే దాన్ని నమ్మేవాడు. కరడు కట్టిన సంప్రదాయ వాసనల తో బూజు పట్టిపోతున్న మతాలమీద ఆయనకు నమ్మకముండేది కాదు. థియోసాఫికల్ సొసైటీవారు నమ్మే గుప్తవిద్య(Occultism) మీద కూడా ఆయనకు నమ్మకముండేది కాదు. తనను జగద్గురువని ప్రచారం చేసిన దానిలోనూ ఆయనకు నమ్మకముండేది కాదు. తమ్ముని మరణం తో ఆయన దృక్పధం మరింత బలీయమైంది.
కృష్ణమూర్తిని జగద్గురువుగా భావించిన డాక్టర్ అనిబిసెంట్ "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్" అనే ఒక అంతర్జాతీయ సంఘాన్ని స్దాపించి కృష్ణమూర్తిని దానికి ప్రధానిని చేసింది. కొంతకాలం వరకూ కృష్ణమూర్తి అందుకు అభ్యంతరం ఏమీ చెప్పలేదు. అంతవరకూ తాను కృష్ణమూర్తినా లేక జగద్గురువునా అనే విషయంలో ఏ నిర్ణయానికీ రాలేకపోయాడు. సోదరుని మరణం ఆయనలో తెచ్చిన దు ఖం కొంతకాలానికి ఆయనలో ప్రతిక్రియను తెచ్చింది.దుఖం సమసిపోయి ఒక విధమైన ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని తీసుకువచ్చింది ఆయనలోకి. ఆయనలో జీవం ప్రవేశించింది. తాను జగద్గురువు అని అనిబిసెంట్ చేసిన ప్రచారాన్ని కాదనలేదు. ప్రపంచంలో ఎక్కడలేని గౌరవాలు ఆయనకు జరగసాగేయి. ఆయన నడచేదారిలో గులాబిపూలు పోసేవారుకూడా. హాలెండ్ లో ఒకరు బ్రహ్మాండమైన సౌధాన్నీ,అయిదువేల ఎకరాలు భూమిని సమర్పిస్తామంటే వద్దని నిరాకరించాడు. ఇటువంటి అద్భుతమైన గౌరవాలు జరుగుతున్నప్పటికీ కృష్ణమూర్తి ఆ గౌరవాలకు విలువ ఇవ్వక తన ఎప్పటి సాదా జీవితాన్నే గడపసాగేడు. చివరకు అధికారపూర్వకంగా జగద్గురు పీఠాన్ని స్వీకరించమనే ఒత్తిడి ఎక్కువైంది. అది తనకు ఇష్టంలేదు. తనకు బయట జరుగుతున్న దానంతకూ వ్యతిరేకం కాజొచ్చాడు. తన విశ్వాసానికి విరుద్దంగా ప్రాపంచిక కీర్తి నిమిత్తమో, పెద్దలకు ఆశాభంగం చేయకుండా వుండే నిమిత్తమో, భౌతిక లాభాల నిమిత్తమో, ఆయన ప్రవర్తించదలచక చివరకు 1929 లో హాలెండ్ లోని ఆమెన్ లో తాను జగద్గురువును కాదని ప్రకటించి "ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ " ను రద్దుపరచాడు.
ఈ మహాత్యాగానికి జగత్తంతా విస్తుపోయింది.డాక్టర్ అనిబిసెంట్ లాంటి పెద్దలంతా నిరాశతో బాధపడ్డారు. అభిప్రాయాన్ని మార్చుకోమని వత్తిడి తేబడింది. కాని లాభం లేకపోయింది. తాను జిడ్డు కృష్ణమూర్తినే కాని జగద్గురువును కానని చాటసాగేడు. చివరికు లాభం లేకపోయింది.ఎక్కడివారక్కడ అసంతృప్త హృదయాలతో మౌనం దాల్చారు. అప్పటినుంచీ కృష్ణముర్తి స్వతంత్రమానవుడు, స్వేచ్చాచింతకుడు, నవమానవతావాది, ఎవరి అభిమానాలనూ ఆశించక, ఎవరి సహాయాలనూ కాంక్షించక, ఎవరి నిందలనూ లెక్కచేయక, జీవన సంగ్రామపు వాస్తవాన్ని గుర్తించి గొప్ప జీవన శిల్పిగా రూపొందాడు.
[మార్చు] కృష్ణమూర్తి ప్రసంగాల సారాంశం
| “ | అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో. మనిషిలో సమూలమైన పరివర్తన కలగపోతే ఈ యుద్ధాలు, ఈ హింసాకాండ, ఈ విధ్వంసము ఇట్లాగే కొనసాగుతూ వుంటాయి. | ” |
| “ | రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది. | ” |
[మార్చు] తెలుగులోకి వెలువడిన కొన్ని రచనలు
- క్రిష్ణమూర్తి తత్వం-పరిచయ సంపుటం
- శ్రీలంక సంభాషణలు
- గతం నుండి విముక్తి
- ఈ విషయమై ఆలోచించండి
- ముందున్న జీవితం
- ధ్యానం
- విద్య అందు జీవితమునకుగల ప్రాధాన్యత
- మన జీవితాలు-జిడ్డు క్రిష్ణమూర్తి వ్యాఖ్యానాలు
- స్వీయజ్ఞ్యానం
- స్వేచ్ఛ (ఆది లోనూ-అంతంలోనూ)
- నీవే ప్రపంచం
- గరుడయానం

