జువ్వాడి గౌతమరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జువ్వాడి గౌతమరావు
జననంజువ్వాడి గౌతమరావు
1 ఫిబ్రవరి 1929
కరీంనగర్ మండలం ఇరుకుళ్ళ
ప్రసిద్ధిభాషాభిమాని, సాహితీకారుడు, కవి
పిల్లలుఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు

జువ్వాడి గౌతమరావు (ఫిబ్రవరి 1, 1929 - 2012) భాషాభిమాని, సాహితీకారుడు.

జువ్వాడి గౌతమరావు దంపతులు, అతను చనిపోవటానికి కొద్దిరోజులు ముందు తీసిన చిత్రం

జననం[మార్చు]

కరీంనగర్ మండలం ఇరుకుళ్ళ గ్రామంలో 1929, ఫిబ్రవరి 1జువ్వాడి గౌతమరావు జన్మించాడు. కరీంనగర్‌లో విద్యాభ్యాసం సాగించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నాడు. అతనుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పీవీ నరసింహారావు, కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య వంటి సాహితీ మిత్రులతో అతనుకు చాలా సాన్నిహిత్యం ఉంది. కరీంనగర్ సాహిత్య చైతన్య కేంద్రంగా భాసిల్లడంలో గౌతంరావు పాత్ర ఘననీయమైనది. వరంగల్‌లో కాళోజీ, ఆదిలాబాదులో సామల సదాశివ మాదిరిగా కరీంనగర్‌లో జువ్వాడి గౌతంరావు సాహితీ వటవృక్షంగా వేలాదిమంది సాహితీకారులకు ఆశ్రయమిచ్చాడు. ఔరంగాబాద్ జైలు గోడలను ఛేదించుకొని వచ్చిన ధైర్యశాలి. కరీంనగర్‌లో తెనుగు ఉనికిని కాపాడుతూ, అనేక కవితా గోష్ఠులలో పాల్గొంటూ నిరంతర సాహిత్య సేవ చేసిన భాషాభిమాని జువ్వాడి. ఆధునిక కాలంలో అడుగంటి పోతున్న సంప్రదాయ కవితా పరిరక్షణ కోసం పాటుపడ్డాడు.[1]

స్వాతంత్ర్య పోరాటంలో యోధుడిగా పనిచేసిన అతను సోషలిస్టుగా పరిణతి చెందాడు. ప్రగతిగామిగా ఉంటూనే విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి, విశ్వనాథకు భక్తుడిగా మారాడు. ప్రేమతో విశ్వనాథుని తన హృదయంలో దాచుకొని ఆ స్కూల్ ఆఫ్ థాట్‌కు తనను తాను పరిమితం చేసుకున్నాడు. రాజకీయాలంటే ఇష్టం లేకుండానే ఎన్నికల్లో జనతా పార్టీ పక్షాన 1977లో పోటీ చేశాడు.

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు జువ్వాడి అత్యంత ఆత్మీయుడు. విశ్వనాథ రచించిన రామాయణ కల్పవృక్షాన్ని శ్రావ్యమైన కంఠంతో తమదైన శైలిలో అంతరార్థాలను విశదీకరిస్తూ రసికులకు వినిపించగలిగి, వారి మూర్తితత్వాన్ని ఆవిష్కరించాడు. తానే రచించాడా అన్నంతగా ప్రజల్లోకి రామాయణ కల్పవృక్షాన్ని తీసుకెళ్లాడు. జువ్వాడి ప్రోద్బలంతోనే విశ్వనాథ సత్యనారాయణ కరీంనగర్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. విశ్వనాథ ‘భక్తియోగ’ అనే పద్యకావ్య సంపుటిని జువ్వాడి కోసం రాసి అంకితం ఇచ్చారు. ‘కల్పవృక్షంలో కైకేయి’, ‘వేయిపడగలలో విశ్వనాథ జీవితం’ వంటి జువ్వాడి సాహిత్య వ్యాసాలు సాహిత్యలోకంలో సంచలనాలు సృష్టించాయి.

నవ్య సాహిత్యోద్యమ కాలంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కొంతకాలం పాటు జయంతి అనే సాహిత్య పత్రిక నడిపాడు. తర్వాత దానికి జువ్వాడి సారథ్యం వహించారు. వివిధ పత్రికల్లో జువ్వాడి రాసిన వ్యాసాలన్నింటినీ సంకలనం చేసి వెలిచాల కొండలరావు ‘సాహిత్యధార’ పేరుతో ఒక పుస్తకాన్ని ముద్రించాడు. జువ్వాడి సాహిత్య కృషికిగాని, సంపాదకత్వం వహించినప్పటి జయంతి పత్రికకు గాని రావాల్సిన కీర్తి ప్రతిష్ఠలు రాలేదు. అయినా జయంతి సంపాదకుడిగా అతను సంపాదకత్వం పత్రికా రంగానికే వన్నె తెచ్చింది. నాడు ఇంటర్ ఫైనలియర్ చదువుతున్న సీ నారాయణడ్డి తొలి కవిత అచ్చయింది ఆ పత్రికలోనే.జీవితమంతా సాహితీ అధ్యయనంతోను, విశ్వనాథ కల్పవృక్ష గానంతోను గడిపారు. ఇటీవలే విశ్వనాథ ప్రత్యేక సంచికను సాహిత్యపీఠం అతనుకు అంకితం చేసింది.

మూలములు[మార్చు]

  1. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/juvvadi-gautham-rao-passes-away/article3819061.ece