టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ వీరుల పట్టిక
టెస్ట్ క్రికెట్ లో ఒకే ఇన్నింగ్సులో బ్యాట్స్మెన్ 300 పరుగులకు పైగా స్కోరు సాధించిన వారి పేర్లు ఈ పట్టికలో ఇవ్వబడింది. ఈ ఘనతను 6 టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలకు చెందిన 19 గురు బ్యాట్స్మెన్లు 21 సందర్భాల్లో సాధించారు. బంగ్లాదేశ్, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే ల నుంచి ఇంతవరకు ఏ బ్యాట్స్మెన్ కూడా ఒకే ఇన్నిగ్సులో 300 పరుగులు సాధించలేడు. న్యూజీలాండ్ కు చెందిన మార్టిన్ క్రో 1991 లో శ్రీలంక పై ఆడుతూ 299 పరుగుల వద్ద అవుటై ఈ అవకాశాన్ని వదులుకున్నాడు.
టెస్ట్ క్రికెట్ లో మొట్టమొదటి త్రిపుల్ సెంచరీ సాధించిన ఘనత ఇంగ్లాండు కు చెందిన ఆండీ సాంధమ్ కు దక్కింది. ఇతడు 1930 లో వెస్ట్ఇండీస్ పై ఆడుతూ 325 పరుగులు సాధించాడు. కాగా భారత్ నుంచి ఈ ఘనతను సాధించిన ఏకైక వీరుడు వీరెంద్ర సెహ్వాగ్. 2004 లో పాకిస్తాన్ పై ఆడుతూ 309 పరుగులు సాధించాడు. ఈ ఘనతను సాధించిన తాజా ఆటగాడు శ్రీలంక కు చెందిన మహేలా జయవర్థనే . ఇతను జూలై 20065 లో దక్షిణాఫ్రికా పై 374 పరుగులు చేసి ఈ ఘనత పొందినాడు. బ్యాట్స్మెన్లు టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీలు సాధించడం బౌలర్లు హాట్రిక్ చేసిన సందర్భాల కన్నా తక్కువగా ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో బౌలర్లు 36 పర్యాయాలు హాట్రిక్ లు సాధించగా బ్యాట్స్మెన్ల ట్రిపుల్ సెంచరీల సంఖ్య 21 మాత్రమే.
టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు ట్రిపుల్ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్లు ఆస్ట్రేలియా కు చెందిన డొనాల్డ్ బ్రాడ్మెన్ మరియు వెస్ట్ఇండీస్ కు చెందిన బ్రియాన్ లారా లు. వీరిరువురు చెరో 2 సార్లు ట్రిపుల్ సెంచరీ సాధించారు. 1932 లో బ్రాడ్మెన్ దక్షిణాఫ్రికాపై ఆడుతూ 299 పరుగుల వద్ద ఉండగా చివరి బ్యాట్స్మెన్ సున్నాకే అవుటవడంతో మరో ట్రిపుల్ సెంచరీ సాధించే అవకాశం కోల్పోయాడు.
బ్రియాన్ లారా 2004 లో ఇంగ్లాండు పై ఆడుతూ 400 పరుగులు చేసి నాటౌట్ గా నిల్చి తన రెండో ట్రిపుల్ సెంచరీ ఘనతనే కాకుండా టెస్ట్ క్రికెట్ చరిత్ర లోనే ఏకైక క్వాడ్రుపుల్ సెంచరీ (400 పైబడి పరుగులు ) సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ గా చరిత్ర సృష్టించాడు.