తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం
గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోనే, కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజ స్వామి. ఈయన శ్రీవేంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ నిర్వహణలోవే ఉంది.
ఆలయానికి రెండు గోపురాలున్నాయి. బయటి ఈ ఆలయం గాలి గోపురం బాగా పెద్దది. లోపలి వైపు గోపురం ఇంకా పురాతనమైనది. రామాయణ భాగవత గాధల శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. మూల విరాట్టు గోవిందరాజ స్వామితో బాటు, అండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామానుజ తిరుమంగై ఆళ్వారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీ లక్ష్మి, శ్రీ మనవాళ మహాముని సన్నిధులున్నాయి. ఉత్తర దిశ ఆలయంలో అనంత శయనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజ స్వామి కొలువైయున్నాడు. ఆలయం దక్షిణ భాగాన రుక్మిణీ సత్యభామా సహితుడైన పార్ధ సారధి మందిరం ఉంది. వైశాఖ మాసంలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. గుడి ముందు పెద్ద కోనేరు ఉంది. కోనేరు నాలుగు ప్రక్కలా విశాలమైన మెట్లు కట్టారు. ఆలయం ప్రక్కనే "ఆలయ వాస్తు మ్యూజియం" ఉంది. ఇక్కడి మూల విగ్రహం మట్టితో చేసినందువలన అభిషేకం చేయకపోవడం ఒక విశేషం.
ఆలయంలో ఉన్న అనేక శాసనాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైన సమచారాన్ని అందిస్తున్నాయి. అన్నింటికంటె పాత శాసనం ప్రకారం 1235లో మూడవ రాజరాజ చోళుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. 1239లో వీర నరసింగ యాదవరాయలు భార్య ఆలయం రధం నిమిత్తం, మరి కొన్ని మరమ్మతుల నిమిత్తం కానుకలు సమర్పించింది. 1506లో విజయ నగర రాజుల సాళువ వంశ కాలంలో ఆలయం బాగా అభివృద్ధి చెందింది.
కోనేటి చుట్టూ నాలుగు ప్రక్కలా నిర్మించిన మెట్లు అనేక ఉద్యమాలకు ప్రచారస్థలాలుగా ఉపయోగపడ్డాయి. వైష్ణవోద్యమం ప్రచారానికి ఈ కోనేటిగట్టు కేంద్రంగా ఉండేది. రామానుజాచార్యుల భక్తి కూటములు ఇక్కడినుండే దక్షిణ భారతంలో విష్ణవ ప్రచారం సాగించాయి. స్వాతంత్ర్యోద్యమ సమయంలో తిరుమల రామచంద్ర ఈ ఆలయం ఎక్కి స్వాతంత్ర్య పతాకాన్ని ఆవిష్కరించి పెద్ద సభను ఏర్పాటు చేశాడు. మొరార్జీ దేశాయి, నీలం సంజీవరెడ్డి, ఎస్.వి.సుబ్బారెడ్డి, కామరాజ్ నాడార్, నిజలింగప్ప, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి. రామారావు వంటి నాయకులు ఇక్కడినుండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసిద్ధ కవి శ్రీశ్రీ, హరికథకుడు సలాది భాస్కరరరావు, బుర్ర కధకుడు నాజర్, జర్నలిస్ట్ వరదాచారి, తెలుగుతల్లి గీత రచయిత శంకరంబాడి సుందరాచారి వంటి కళాకారుల ప్రదర్శనలు లేదా జీవితంలో ఘట్టాలు ఈ కోనేటిగట్టుతోముడివడి ఉన్నాయి. అయితే ఇప్పుడు పెరిగిన జన సమ్మర్ధం, కాలుష్యం కారణంగా ఈ కోనేటిగట్టు ఏ విధమైన సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలకూ వేదిక కావడంలేదు.[1]
[మార్చు] విశేషాలు
- "గోవిందా గోవిందా" అని స్మరిస్థు వెళ్ళి ముడుపులు మాత్రం వెంకటేశ్వరుడికి ఇస్తారని - గోలగోవిందుడిది అనుభవం వెంకటేశ్వరుడిది అనే సామెత భక్తులు పుట్టించారు.
[మార్చు] మూలాలు
- ↑ తిరుమల కొండ పదచిత్రాలు - పున్నా కృష్ణమూర్తి - ప్రచురణ : సూర్య పబ్లికేషన్స్, హైదరాబాదు (2002)