తేళ్ల లక్ష్మీకాంతమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తేళ్ల లక్ష్మీకాంతమ్మ
తేళ్ల లక్ష్మీకాంతమ్మ


పార్లమెంట్ సభ్యురాలు
పదవీ కాలం
1962 - 1977
ముందు టి. బి. విఠల్ రావు
తరువాత జలగం కొండలరావు
నియోజకవర్గం ఖమ్మం

వ్యక్తిగత వివరాలు

జననం (1924-07-16) 1924 జూలై 16 (వయసు 99)
ఆలంపూర్, తెలంగాణ, భారత దేశము
మరణం డిసెంబర్ 13, 2007
విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, India
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి టి. వి. సుబ్బారావు
సంతానం 1 కూతురు
మతం హిందూమతం

తేళ్ల లక్ష్మీకాంతమ్మ (జూలై 16, 1924 - డిసెంబర్ 13, 2007) తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ పార్లమెంటు సభ్యురాలు. రచయిత్రి, సంస్కృత పండితురాలు.[1]

జననం, విద్య[మార్చు]

లక్ష్మీకాంతమ్మ 1924, జూలై 16న తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా, ఆలంపూర్ లోని కమ్మ భూస్వాముల పెద్ద కుటుంబానికి చెందిన వెంకట్ రెడ్డి - మంగమ్మ దంపతులకు జన్మించింది.[1] 5వ తరగతి వరకు కర్నూలులో చదివి, సోదరి సహకారంలో గుడివాడలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో, మచిలీపట్నంలో బిఏ పూర్తి చేసింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 1971లో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ పట్టా పొందింది.[2][3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

లక్ష్మీకాంతమ్మకు 1944, నవంబరు 1న అనంతపురం జిల్లా అటవీ అధికారి టి.వి.సుబ్బారావుతో వివాహం జరిగింది. లక్ష్మీకాంతమ్మ లేడీస్ క్లబ్ కార్యదర్శిగా కూడా ఎన్నికయింది. మద్రాస్‌లోని పచ్చిఅప్ప కాలేజీలో ఎంఏ పూర్తి చేసింది. ఆమె భర్త ఇంగ్లాండ్‌కు వెళ్లి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా శిక్షణ పొందాడు. 1960, జూన్ 5న కుమార్తె (జోగులాంబ) జన్మించింది. తెలుగు పాప్ సింగర్ స్మిత ఆమె మనవరాలే.

రాజకీయ జీవితం[మార్చు]

లక్ష్మీకాంతమ్మ ఖమ్మం నియోజకవర్గం నుండి 1957లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై, ఆ తర్వాత 1962లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికై పార్లమెంటు సభ్యురాలయ్యింది. వరుసుగా మూడుసార్లు అదే నియోజకవర్గమునుండి ఎన్నికై 1977వరకు లోక్‌సభలో ఖమ్మంకు ప్రాతినిధ్యం వహించింది. 1967లో పార్లమెంటు బృందంలో సదస్యురాలిగా ఆస్ట్రేలియాను పర్యటించింది. 1978లో జనతా పార్టీ తరఫున హైదరాబాదు నగరంలోని హిమాయత్ నగర్ శాసనసభా నియోజకవర్గం నుండి గెలుపొందింది.[4]

పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక సభ్యురాలిగా[5] ఉన్న లక్ష్మీకాంతమ్మ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ వైఖరిని బహిరంగంగా విమర్శించి ఆమె ఆ కాలంలో వార్తలకు ఎక్కింది. ఇందిరాగాంధీ పాలనను తీవ్రంగా నిరసించి జనతాపార్టీలో చేరింది. జనతా పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించి,[6] పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన లక్ష్మీకాంతమ్మ, 1978 శాసనసభా ఎన్నికలలో ఓటమి తర్వాత, వృద్ధాప్యం వల్ల చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంది.[7] ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరింది.

లక్ష్మీకాంతమ్మ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావుకు సన్నిహితురాలు.[8] నరసింహారావు రచించిన ఆత్మకథా ఆధారిత నవల ది ఇన్‌సైడర్‌లోని అరుణ పాత్రకు స్ఫూర్తి లక్ష్మీకాంతమ్మేనని భావిస్తున్నారు.[9]

రచనలు[మార్చు]

ఈమె తెలుగులో ప్రగతి పథంలో మహిళలు అనే పుస్తకాన్ని, ఆంగ్లంలో కో-ఆపరేషన్ టుడే అండ్ టుమారో అనే పుస్తకాల్ని ప్రచురించారు. బాద్షాఖాన్ జీవితచరిత్రను తెలుగులోకి అనువదించింది.

మరణం[మార్చు]

లక్ష్మీకాంతమ్మ 83 ఏళ్ళ వయసులో విజయవాడలోని తన కూతురు ఇంట్లో 2007, డిసెంబర్ 13 మరణించింది.[10]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Sitapati, Vinay (2018-04-03). The Man Who Remade India: A Biography of P.V. Narasimha Rao (in ఇంగ్లీష్). Oxford University Press. p. 25. ISBN 9780190692865.
  2. Women of Andhra Pradesh at a Glance: International Women's Year 1975 (in ఇంగ్లీష్). State Level Committee, Andhra Pradesh, India. 1975. p. 35.
  3. Women of Andhra Pradesh at a Glance: International Women's Year 1975 (in ఇంగ్లీష్). State Level Committee, Andhra Pradesh, India. 1975. p. 35.
  4. తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్ పేజీ.286
  5. Report By India Parliament. Lok Sabha. Committee on Petitions, India
  6. Encyclopaedia of Political Parties By Ralhan, O. P[permanent dead link]
  7. మాజీ ఎంపీ తేళ్ల లక్ష్మీకాంతమ్మ కన్నుమూత - యాహూ తెలుగు వార్త[permanent dead link]
  8. http://thatstelugu.oneindia.mobi/news/2007/12/13/1660.html[permanent dead link]
  9. http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19980420/11050834.html
  10. "హిందూ పత్రికలో లక్ష్మీకాంతమ్మ మరణవార్త". Archived from the original on 2008-10-26. Retrieved 2010-08-08.