ద్రాక్ష
| ద్రాక్ష | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ద్రాక్ష పండ్లు
|
|||||||||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||
|
|||||||||||||
|
|
|||||||||||||
|
ద్రాక్ష (ఆంగ్లం Grapes) ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది పుష్పించే మొక్కలైన వైటేసి కుటుంబంలోని వైటిస్ ప్రజాతికి చెందినది. ద్రాక్షలో ఇంచుమించు 60 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఉత్తరార్ధ గోళంలో ఎక్కువగా పెరుగుతాయి. ద్రాక్ష పండ్లను అలాగే తినవచ్చును లేదా వాటి నుండి పానీయాలు, సలాడ్లు, మరియు వైన్ తయారుచేయవచ్చును. ద్రాక్ష తోటల పెంపకాన్ని 'వైటికల్చర్' అంటారు.
ద్రాక్ష పండ్లు అతి ప్రాచీనమైన కాలం నుండీ సాగుచేస్తున్న పండ్లు. వీటి సాగు క్రీస్తు పూర్వం ఐదువేల ఏళ్ల కిందటే ఆసియా ప్రాంతంలో జరిగేది. అయితే అప్పుడు ఇప్పట్లా తినడానికి కాకుండా మధువు తయారీలో వాడేవాళ్ళు. ఇంకా ఇప్పుడు వీటితో జామ్లు, జెల్లీలు, కిస్మిస్లు తయారుచేస్తున్నారు.
ప్రాచీన గ్రీకు, రోమన్ నాగరికతలలో ఇవి వైన్ తయారీకి పెట్టింది పేరు. క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో జర్మనీలోని రైన్లోయలో కేవలం మధువు తయారీకే వీటినిప్రత్యేకంగా సాగు చేసేవారు. అప్పటికే ఇవి సుమారు తొంభై వెరైటీలలో వుండేవి. యూరోపియన్ల ద్వారా ఇవిఅంతటా వ్యాపించాయి. అమెరికాలో పదిహేదవ శతాబ్దంలో ప్రవేశించాయి. అప్పుడు మెక్సికోలో కాలూనినా, వెంటనే కాలిఫోర్నియాలో స్థిరపడిపోయాయి. వీటికి ఎన్నో చీడపీడల దాడి సామాన్యం. అందులోనూ సాగులో విస్తృతంగా మందులు వాడవలసి వుంటుంది.
భారతదేశంలోనూ వీటి చరిత్ర ఘనమైనదే. క్రీస్తుపూర్వం పదమూడు, పన్నెండు శతాబ్దాల మధ్య రచించబడిన సుశ్రుత సంహిత, చరక సంహితలలో వీటి ఔషధీయ లక్షణాల గురించి వివరణ వుంది. క్రీస్తు పూర్వం నాల్గవ శతాబ్దంలోని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో కూడా వీటి సాగుకు అనువైన నేల ప్రస్తావన చేశాడు. హిమాలయ పర్వత పాదాల చెంత అడవి రకాలుగా విస్తృతంగా పెరిగేవి. అయితే సాగుచేసినా వీటి రకాల ప్రవేశం క్రీస్తు శకం పదమూడు వందల కాలంలో పర్షియన్ల ద్వారా జరిగింది. వారు వీటిని ఔరంగాబాద్లోని దౌలతాబాద్లో పరిచయం చేశారు. అక్కడినుండి క్రైస్తవ మిషనరీల ద్వారా ఇవి సాలెం, మధురై ప్రాంతాలకు పాకాయి. ఇరవైయ్యవ శతాబ్దపు తొలి కాలంలో నిజాం వీటిని హైదరాబాద్ తీసుకువచ్చాడు.
ఇక వీటి నుండి తీసిన మధువు మామూలు మందులా కాకుండా నిజంగా మందులానే పనిచేస్తుంది. గుండె ఆరోగ్యానికి ద్రాక్షరసం (మధువు) సేవించాలని అంటారు. ఫ్రెంచ్వారు ద్రాక్ష మద్యాన్ని (రెడ్వైన్) ఎక్కువగా సేవిస్తారు. వారి భోజనంలో కొవ్వు విపరీతంగా వుంటుంది. అయినా వారు గుండె జబ్బుల బారిన పడకపోవడమే కాదు, దీర్ఘకాలం జీవిస్తారు కూడా. అందుకు కారణం వారు తాగే రెడ్వైన్ అని ఇప్పుడు పరిశోధకులు అంటున్నారు. ప్రాచీన గ్రీకులు, రోమన్లు ద్రాక్షరసానికి దైవత్వాన్ని ఆపాదిస్తే, నవీన ఫ్రెంచ్వారు వైన్ తయారీని కళ స్థాయికి తీసుకెళ్లారు. ఈనాటికీ ప్రపంచంలో అత్యున్నత ద్రాక్షమద్యం ఫ్రెంచ్వారి తయారీనే.
స్థూలంగా అమెరికన్, యూరోపియన్, ఫ్రెంచ్ రకాలుగా వీటిని వర్ణించినా, వీటిలో యాభై జాతులు, సుమారు ఎనిమిది వేల రకాలు వున్నాయి. వాటిలో దాదాపు అయిదారు వందల రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అవన్నీ సంకర జాతి రకాలే. ఒకప్పుడు అనాబ్ షాహి అనే రకం బాగా లభించేది. చిన్న సైజు ఉసిరి కాయంత ఉండే ఆ రకం ద్రాక్ష ఇప్పుడు దాదాపు కనుమరుగై పోయింది. వాటిలో గింజలుండేవి. ద్రాక్షలో గింజలు పంటికింద రాయిలా రుచిని దెబ్బతీస్తాయని, గింజలులేని రకాల రూపకల్పన జరిగింది. ఇప్పుడైతే విత్తులేని ద్రాక్షలే ఎక్కువ కనిపిస్తాయి. అప్పట్లో గింజల్ని ఊసేస్తే, ఇప్పుడు తొక్కల్ని ఊస్తున్నారు. ప్రస్తుతం థామ్సన్ సీడ్లెస్, రెడ్ ప్లీం వంటివి కనిపిస్తాయి.
[మార్చు] ఉపయోగాలు
వీటిలో ఉండే పోషక పదార్థాల వల్ల ఎన్నో లాభాలు వున్నాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మల బద్ధకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. వీటిలోని అనేక విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి పూర్తి రక్షణ కలిగిస్తాయి. ఏనుగు బతికినా చచ్చినా విలువే అన్నట్లు ఇవి ఎండిన తర్వాత కిస్మిస్గా కూడా పోషక విలువలను కోల్పోవు. కేవలం నీటిని తప్ప. వీటిలోని పాలిఫినాల్లు కొలెస్టాల్ని అదుపు చేయడంలో, క్యాన్సర్ను ఎదుర్కోవడంలో సహకరిస్తాయి. వీటిలోని సోడియం, కొవ్వు పదార్ధాలు చాలా తక్కువ. విటమిన్ సి, కే చాలా ఎక్కువ.
[మార్చు] వైన్
ద్రాక్షరసం(వైన్)లో రెండు రకాలున్నాయి. రెడ్వైన్ ఇంకా వైట్వైన్. నీలం ద్రాక్షల నుండి ఎరుపు వైన్ చేస్తే, పచ్చ రకాల నుండి వైట్వైన్ చేస్తారు. యూరోపియన్లు భోజనంలో మంచి నీళ్ల బదులు రెడ్వైన్ తాగడం పరిపాటే. అందులో ఆల్కహాల్ శాతం తక్కువగా వుండి ఇతర మద్యాల ప్రభావాన్ని కలిగించదు.