ద్రాక్షారామం
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
ద్రాక్షారామ, తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామము. కాకినాడకి 32 కి.మీ దూరములోను, రాజమండ్రికి 60కి.మీ దూరములోను ఉన్నది.
ఇక్కడ భీమేశ్వరస్వామి లింగాకారం లో ఉన్నాడు. లింగం సగభాగం నల్లగా, సగభాగం తెల్లగా ఉంటుంది. అర్థనారీశ్వరుడు అనటానికి ఇది నిదర్శనం అంటారు. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తు ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి.
ఇక్కడగల వినాయకుడి తొండం కుడి చేతిమీదుగా ఉంటుంది. కాశీలోని విశ్వేశ్వరాలయం లో వినాయకుడికి కూడా అలాగే ఉంటుంది. దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడు కనుక 'ద్రాక్షారామం' అన్నపేరు వచ్చిందని ప్రతీతి.
తారకాసురుని కంఠంలో అమృత లింగం ఉండేది. అది ఉండగా అతడిని జయించలేరని దానిని ఛిన్నం చేయడానికి దేవతలు కుమారస్వామి ని ప్రార్థించారు. కుమారస్వామి దెబ్బకు అది 5 ముక్కలైంది. ఒకటి ద్రాక్షారామం లో , రెండవది అమరారామము (అమరావతి) లో, మూడవది క్షీరారామము (పాలకొల్లు) లో, నాలుగవది సోమారామము (గుణుపూడి), (భీమవరం)లో, అయిదవది కుమారారామము (సామర్లకోట దగ్గరగల భీమవరం) లో పడ్డాయట.
శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు.
మాణిక్యాంబిక అన్న బాలిక స్వామికి తనను తాను అర్పించుకొని ఆయనకు దేవేరి అయినట్లు భీమేశ్వర దండకం లో వుంది. ఈమె గుడి కూడ యిక్కడ ఉంది. ఈమె పరాశక్తి అవతారం. భీమేశ్వరాలయానికి వెళ్లే యాత్రికులు మాణిక్యాంబ గుడికి కూడా వెళతారు. స్వామి ఊరేగింపును కూడా మాణిక్యాంబ గుడి చుట్టూ త్రిప్పి తీసుకువెళ్లటం ఆచారం.
భీమేశ్వరాలయం శిల్ప సంపదకు పేరు పొందింది. మహా శివరాత్రి కి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.
తిట్టుకవి గా ప్రసిద్ధి నందిన వేములవాడ భీమకవి " ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్.... " అని చెప్పుకొన్నాడు. అతనికి కవిత్వం అబ్బటం స్వామి ప్రసాదం అయి ఉండవచ్చు.
ఎంతో మంది తెలుగు కవులు శ్రీ భీమేశ్వరస్వామి ని తమ పద్యాలలో కీర్తించినారు.వాటిలో ఈమధ్య వచ్చిన "దక్షారామ భీమేశ్వర శతకం" ఒకటి. దీనిని ప్రొఫెసర్ వి.యల్.యస్. భీమశంకరం రచించాడు.
విషయ సూచిక |
[మార్చు] స్థల విశేషములు
- ఆలయాన్ని దేవతలు కట్టించార అంటారు. ఇందుకు రుజువుగా పూర్తికాని ప్రహరీ గోడని చూపుతారు.విశ్వకర్మ దీనిని తెలవారొ కోడి కూసే లోపల పూర్తి చేయాలని మొదలు పెట్టగా, ఒక గోడ పూర్తి కాలెదని, ఎన్ని సార్లు దానిని పూర్తిచేయడానికి ప్రయత్నించినా కుదరదని చెబుతారు.
- ఆలయం లోపల ఒక చిన్న నమూనా మాదిరి ఇంకో ఆలయము ఉంది. కాలక్రమము లో మానవులు పొట్టిగా అవుతారని, వారి కోసము ఆ చిన్ని ఆలయాన్ని నిర్మించారని అంటారు.
- ఆలయం గర్భగుడి లో వజ్రాలు ఉండేవని , ఔరంగజేబు దండయాత్ర చేసినప్పుడు అవి రాళ్ళగా మారిపోయాయని చెబుతారు
[మార్చు] పండుగలు
- శరన్నవరాత్రులు(దేవీనవరాత్రులు)- ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు
- కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు - జ్వాలాతోరణం (కార్తీక పున్నమి నాడు)
- మార్గశిర శుద్ధ చతుర్దశి- శ్రీవారి జన్మోత్సవాలు
- మాఘ మాసం బీష్మైకాదశి- స్వామి కళ్యాణం
- మహాశివరాత్రి -మాఘమాసం చివరి రోజు
- సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం- మార్గశిరశుద్ధ షష్ఠి నాడు
[మార్చు] చాటువు
శ్రీనాథమహా కవి చాటువులకు ప్రసిద్ధి. అతడు ద్రాక్షారామానికి సంబంధించి చెప్పిన చాటువు గా దిగువపద్యం ప్రచారంలో ఉంది.
అక్షయ్యంబగు సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షాదానము సేయరా సుకవిరాట్ బృందారక శ్రేణికిన్
దక్షారామభీమవర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించుతద్వాసనల్
[మార్చు] బయటి లింకులు
|
|
|
|---|---|
| చోడవరం · అంబికపల్లి అగ్రహారం · నరసాపురపుపేట · ఓదూరు · యనమదల · తాడిపల్లి · కాపవరం · కందులపాలెం · వెల్ల · యేరుపల్లి · ఉట్రుమిల్లి · వేలంపాలెం · నెలపర్తిపాడు · ముచ్చెరువు · మామిడిగుట · మట్టలచెరువు · జగన్నాయకులపాలెం · ద్రాక్షారామ · వెంకటాయపాలెం (రామచంద్రాపురం మండలం) · వేగాయమ్మపేట · తోటపేట · హసన్వాడ · ఉండూరు · భీమక్రోసుపాలెం · రామచంద్రాపురం |
|
|||||||||||