నాటక విజ్ఞాన సర్వస్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము వారి కొమర్రాజు వేంకట లక్ష్మణరావు తెలుగు విజ్ఞానసర్వస్వ కేంద్రం వారిచే ప్రకటింపబడినద విజ్ఞాన సర్వస్వం సంపుటాలలో నాటక విజ్ఞాన సర్వస్వం 8వది.

సంపుటంలోని అంశాలు[మార్చు]

నాటకరంగంలో వివిధ శాఖల గురించిన విజ్ఞాన సముదాయాన్ని ఒక్కచోట సమీకరించి, అటు పరిశోధకులకు తోడ్పడే పరామర్శ గ్రంథంగాను, ఇటు నాటాకాభిమానులైన సామాన్య పాఠకులకు కరదీపికగాను ఉపయుక్తంగా ఉండే రీతిలో ఈ నాటక విజ్ఞాన సర్వస్వం రూపొందించారు.

ఈ సంపుటంలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. మొదటిభాగం సమీక్షా వ్యాస సమన్వితం. రెండవది కారాది వ్యాసాల వివరణ. వివిధ దేశాలలో నాటకరంగ ఆవిర్భావ వికాస దశల గురించి వివరించే వ్యాసాలతో పాటు, రంగస్థల సేవకు అంకితమైన కళాకారుల, కళాపోషకుల జీవిత విశేషాలు, నాటక రయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, ప్రసిద్ధ నాటక సమాజాలు, నాటక గ్రంథాల గురించి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది.

శ్రీనివాస చక్రవర్తి గారికి అంకితమివ్వడం

నాటకరంగానికి పరిమితమైన ప్రస్తుత సంపుటాన్ని తనదైన ప్రణాళికతో 1960 నాటికి నాటక విజ్ఞాన సర్వస్వం పేరుతో మౌలికంగా తయారుచేసినవారు కీ.శే. శ్రీనివాస చక్రవర్తి గారు. వీరు తెలుగు నాటకరంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ, భారతీయ, ప్రపంచ నాటకరంగాలను స్పృశించి వదిలేశారు. భారతీయ నాటకరంగంలోని, ప్రపంచ నాటకరంగంలోని ప్రముఖుల గురించి ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిచేత రాయించడం జరిగింది. ఈ సంపుటంలో 80 మంది రచయితలు పాలుపంచుకున్నారు. ప్రాచ్చ-పాశ్చాత్య నాటక సాహిత్యంమీద, రంగస్థల పరిణామ దశల మీద కూలంకషంగా పరిశోధన చేసి పట్టుసాధించి తెలుగులో అనేక గ్రంథాలు, పరిశోధక వ్యాసాలు వెలువరించి నాటకరంగాన్ని సుసంపన్నం చేసిన సుప్రసిద్ధ పరిశోధకులు, ప్రస్తుత నాటక విజ్ఞాన సర్వస్వం సంపుటానికి మౌలిక రూపానిచ్చిన కీ.శే. శ్రీనివాస చక్రవర్తికి (1911-1976) గారికి అంకితమిచ్చారు.

ఆధునిక నాటకరంగంలో విప్లవాత్మకమైన మార్పులెన్నో జరిగిన దృష్ట్యా 1960 నుండి 2006 వరకు సమకాలీన పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఎన్నో మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఏర్పడింది.

మారుతున్న కాలానికి, అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా, సమకాలీన నాటకరంలోని ప్రముఖ వ్యక్తులను, సమాజాలను, నాటకరచనా విధానం, ప్రదర్శనా పద్ధతుల్లో చోటుచేసుకున్న మార్పులను ప్రయోగాలను దృష్టిలో ఉంచుకొని ఇందులో ఎన్నో కొత్త అంశాలను చేర్చడం జరిగింది.

నాటకరంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలు, నంది అవార్దు గ్రహీతలు, ఎన్.టి.ఆర్ రంగస్థల పురస్కార గ్రహీతల పేర్లను కూడా చేర్చడం జరిగింది.

నాటకరంగంలో కృషి చేసిన కొంతమంది ప్రసిద్ధ కళాకారుల, నాటకకర్తల జీవిత విశేషాలు ఎక్కడా గ్రంథస్థం కాకపోవడంవల్ల వారి గురించి సరైన వివరాలు లభించకపోవడంతో ఆనాడు వారితో నటించిన సహ నటుల ద్వారా, బంధుమిత్రుల ద్వారా కొన్ని వివరాలు సేకరించి ఈ సంపుటంలో చేర్చడం జరిగింది. జననమరణ తేదీలు, తల్లిదండ్రుల పేర్లు, స్వస్థలం మొదలైన వివరాలు లభించిన వివరాలలనే ఇక్కడ ఇవ్వడం జరిగింది.

నాటకరంగంలో 20,25 సంవత్సరాలకు పైబడి ఏదోఒక విభాగంలో సేవలు అందించిన కళామూర్తులను మాత్రమే ఇందులో చేర్చారు.

సంపాదకవర్గం[మార్చు]

నిర్వాహక సంపాదకులు - ఆచార్య కె. ఆనందన్; సంపాదకులు - కీ.శే. డా. పి.వి. రమణ, డా. జి.ఎస్. ప్రసాదరెడ్డి; సంగ్రాహక సంపాదకులు - గండవరం సుబ్బరామిరెడ్డి; సహాయ సంపాదకులు - డా. డి. మల్లన్న; సమన్వయ సంపాదకులు - ఆచార్య జి. చెన్నకేశవరెడ్డి.

వ్యాస రచయితలు[మార్చు]

మూలాలు[మార్చు]