నేదురుమల్లి జనార్ధనరెడ్డి
| నేదురుమల్లి జనార్దనరెడ్డి | |
|---|---|
![]() |
|
| నేదురుమల్లి జనార్ధనరెడ్డి | |
| రాజ్యసభ సభ్యుడు, మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ కేంద్ర మంత్రి |
|
| Preceded by | డా.మర్రి చెన్నారెడ్డి |
| Succeeded by | కోట్ల విజయభాస్కరరెడ్డి |
| Personal details | |
| Born | ఫిబ్రవరి 20 1935 (వయసు 78) నెల్లూరుజిల్లా వాకాడు |
| Political party | కాంగ్రెస్ పార్టీ |
| Spouse(s) | నేదురుమల్లి రాజ్యలక్ష్మి |
| Religion | క్రైస్తవ మతము |
| As of మార్చి 30, 2009 | |
నేదురుమల్లి జనార్థన్ రెడ్డి (Nedurumalli Janardhana Reddy) 1935, ఫిబ్రవరి 20న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వాకాడులో జన్మించాడు.[1] భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతలలో ఒకడైన జనార్థన్ రెడ్డి 1992-94 కాలంలొ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2004 లోకసభ ఎన్నికలలో విశాఖపట్నం లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ఇటీవల 2009, మార్చి 16న రాజ్యసభకు ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎన్నికయ్యాడు.[2] ఇతని భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి 2004 శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందింది.
విషయ సూచిక |
బాల్యం మరియు వ్యక్తిగత జీవితం [మార్చు]
నేదురుమల్లి జనార్దనరెడ్డి 1935, ఫిబ్రవరి 20న శేషమ్మ, సుబ్బరామిరెడ్డి దంపతులకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు గ్రామంలో జన్మించాడు. నెల్లూరులో బి.ఏ., బి.ఎడ్. వరకు విద్యనభ్యసించాడు. 1962, మే 25న రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. వారికి నలుగురు కుమారులు. భార్య రాజ్యలక్ష్మి 2004లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందినది.
రాజకీయ ప్రస్థానం [మార్చు]
1972లో రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జనార్థనరెడ్డి ఆరేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగి ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (పిసిసి) కార్యదర్శిగా నియమించబడ్డాడు. 1978లోనే ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో పదవి కూడా పొందినాడు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేవరకు ఆ పదవిలో ఉన్నాడు. 1988లో ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1989లో మళ్ళీ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, మంత్రిమండలిలో చోటు సంపాదించాడు. మర్రిచెన్నారెడ్డి రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు జనార్దనరెడ్డి చేపట్టినాడు. 1992లో రాజీనామా చేసే వరకు ఈ పదవిలో ఉండి, 1998లో 12వ లోక్సభకు ఎన్నికయ్యాడు. 1999లో 13వ లోక్సభకు మళ్ళీ ఎన్నికయ్యాడు. ఈ కాలంలో అనేక పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా పనిచేశాడు. అతిముఖ్యమైన పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీకి 1999 నుండి మూడేళ్ళ వరకు ప్రాతినిధ్యం వహించాడు. 2004లో 14వ లోక్సభకు విశాఖపట్టణం నియోజకవర్గం నుండి ఎన్నికై మూడవసారి లోక్సభకు వెళ్ళినాడు. ఇదివరకు తన స్వంత నియోజకవర్గం రిజర్వ్డ్గా ఉండటంతో నెల్లూరు నుండి పోటీచేయడానికి వీలులేకపోగా, తాజాగా పునర్విభజనలో జనరల్ స్థానంగా మారిన నెల్లూరు నుండి పోటీచేయాలని తలచిననూ జనార్దనరెడ్డికి సీటి లభించలేదు. దీనితో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళవలసి వచ్చింది.
ముఖ్యమంత్రిగా [మార్చు]
1991 లో హైదరాబాదులో జరిగిన మతకల్లోలాలకు నైతిక బాధ్యత వహిస్తూ మర్రి చెన్నారెడ్డి రాజీనామా చేయగా ఆయన స్థానంలో కాంగ్రేస్ అధిష్టానం నేదురుమల్లి జనార్ధనరెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. పార్టీలో వివిధ ముఠాలను అదుపులో పెట్టడంలో సమర్ధుడైన జనార్ధనరెడ్డి పార్టీలో అసమ్మతిని అదుపుచేయటానికి అనేక చర్యలు చేపట్టాడు. శాసనసభా సభ్యుల మద్దతు కూడగట్టుకోవటానికి వాళ్ళకు హైదరాబాదులోని సంపన్న ప్రదేశాలలో స్థలాలు మంజూరు చేశాడు. టెలిఫోను బిల్లులకై ప్రత్యేక అలవెన్సులు, కార్లు కొనుక్కొవడానికి సులువైన ఋణాలు ఇప్పించాడు. 1992 జూన్ లో సీటుకు ఐదు లక్షల చొప్పున కాపిటేషన్ ఫీజు వసూలు చేసుకునే ప్రైవేటు యాజమాన్యంలోని 20 ఇంజనీరింగు మరియు వైద్య కళాశాలలకు పర్మిట్లు ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ విధంగా కళాశాలలను స్థాపించడానికి పర్మిట్లు పొందిన అనేక సంస్థలు సారా వ్యాపారులు, ఎక్సైజు కాంట్రాక్టర్లు మరియు మంత్రులు పెట్టుబడి పెట్టినవే. వీటికి అనుమతులు మంజూరు చేయడానికి జనార్ధనరెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని వదంతులు వ్యాపించాయి. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి తీర్పుగా ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం కళాశాలకు అనుమతులు మంజూరు చేయడంలో అనేక అవకతవకలు జరిగినట్టు నిర్ణయించి, అనుమతి జారీ చేస్తూ ప్రభుత్వం చేసిన ఉత్తర్వును రాజ్యంగ విరుద్ధమని కొట్టివేసింది.[3]
హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రతిపక్షాలతో సహా సొంత పార్టీలోని అసమ్మతి వర్గాల నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఈయన స్థానంలో కోట్ల విజయభాస్కరరెడ్డిని కాంగ్రేసు అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించింది.
హత్యాయత్నం [మార్చు]
సెప్టెంబర్ 7 2007లన రిమోట్ కంట్రోల్ ద్వారా మావోయిస్టులు నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కారు పేల్చివేయడానికి కుట్రపన్నగా జనార్థన్ రెడ్డి, ఆయన భార్య రాజ్యలక్ష్మి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.[4] ఈ దుర్ఘటనలో ముగ్గురు కార్యకర్తలు మృతిచెందారు. నేదురుమల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1992 మేలో తొలిసారిగా నక్సలైట్లపై నిషేధం విధించబడినందుకు ఆయన నక్సలైట్ల హిట్లిస్టులో ఉన్నారు. 2003లో కూడా ఇదే తరహా దాడి జరుపగా తప్పించుకున్నాడు.
గుర్తింపులు [మార్చు]
- 2007 డిసెంబర్లో తిరుపతి లోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం జనార్థన రెడ్డికి డాక్టరేట్ ప్రధానం చేసింది. [5]
| ఇంతకు ముందు ఉన్నవారు: డా.మర్రి చెన్నారెడ్డి |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 17/12/1990—09/10/1992 |
తరువాత వచ్చినవారు: కోట్ల విజయభాస్కరరెడ్డి |
మూలాలు [మార్చు]
- ↑ http://parliamentofindia.nic.in/ls/lok12/biodata/12ap16.htm
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 17-03-2009
- ↑ Parties, elections, and mobilisation By K. Ramachandra Murty, D. Suran Naidu పేజీ.59 [1]
- ↑ యాహూ వార్తలు-తెలుగు తేది 07-09-2007
- ↑ యాహూ వార్తలు-తెలుగు తేది 18-12-2007
యితర లింకులు [మార్చు]
|
|||||
