Coordinates: 16°09′08″N 77°49′33″E / 16.15226551909936°N 77.82587690263898°E / 16.15226551909936; 77.82587690263898

పూడూరు (గద్వాల)

వికీపీడియా నుండి
(పూదూరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పూడూర్, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలంలోని గ్రామం.[1]

పూడూరు
—  రెవిన్యూ గ్రామం  —
పూడూరు is located in తెలంగాణ
పూడూరు
పూడూరు
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°09′08″N 77°49′33″E / 16.15226551909936°N 77.82587690263898°E / 16.15226551909936; 77.82587690263898
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం గద్వాల
ప్రభుత్వం
 - సర్పంచి శశికళ చెన్రెడ్డి
జనాభా (2011)
 - మొత్తం 10,699
 - పురుషుల సంఖ్య 5,505
 - స్త్రీల సంఖ్య 5,194
 - గృహాల సంఖ్య 2,481
పిన్ కోడ్ 509125
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన గద్వాల ఆగ్నేయాన 10 కి. మీ. దూరంలో ఉంది.తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల మండలంలోని గ్రామం.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [3]ఇది పంచాయతి కేంద్రం.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2481 ఇళ్లతో, 10699 జనాభాతో 5696 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5505, ఆడవారి సంఖ్య 5194. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1084 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 27. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576234.[4]

2001 జనాభా లెక్కల ప్రకారము ఈ గ్రామ జనాభా 9591. అందులో పురుషుల సంఖ్య 4917, స్త్రీల సంఖ్య 4674. అక్ష్యరాస్యత 25.8% మాత్రమే. అక్ష్యరాస్యుల సంఖ్య 2478.పిన్ కోడ్: 509125.

చరిత్ర[మార్చు]

ఇది చారిత్రక ప్రాశస్త్యం కల గ్రామం. నల సోమనాద్రి గద్వాలలో కోటను నిర్మించకముందు పూడూరు రాజధానిగా పాలించాడు. చాళుక్యుల కాలంలో కూడా ఈ గ్రామం సామంత రాజధానిగా ఉండేది. ఈ గ్రామం తొమ్మిదవ శతాబ్దాన అత్యున్నత స్థితిలో ఉన్నట్లు ఇక్కడ లభించిన ఓ కన్నడ శాసనం ద్వారా తెలుస్తుంది.[5].ఈ గ్రామంలోని మల్లికార్జునస్వామి దేవాలయం లోని శాసనంలో ' పుండ్రే సంజ్ఞ పురే దుర్గే యశస్సోదరే ' అను సంజ్ఞ వలన దీని పూర్వనామం "పుండ్రపురం"గా ప్రసిద్ధి చెందినట్లు తెలుస్తుంది. ఈ గ్రామం చుట్టూ వలయాకారంలో దుర్గం ఉండేది. అది ఇప్పుడు ద్వంసం అయింది. అక్కడక్కడ ఎత్తైన శిథిల దిబ్బలుగా దర్శనమిస్తుంది.గద్వాలలోని పూడూరు గ్రామంలో ఊరిబయటి గుడిముందుట నగ్నజైన విగ్రహాలను పెట్టి వాటిని "పూడూరి బయటి దేవర్లు" అని యందురు. అచ్చటనే ఊరిముందట "జైనశాసనము" అను శీర్షికతో చెక్కబడిన 800 ఏండ్లనాటి శాసనము ఉంది. అదేవిధముగా వేములవాడలో జినాలయము శివాలయంగా మారి, పాపము అది జైన విగ్రహాలు గుడి కావలి బంట్లవలె దేవళము బయట దరిదాపు లేనివైనవి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మండల పరిషత్తు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8,జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి గద్వాలలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల గద్వాలలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల కర్నూలులోను, పాలీటెక్నిక్‌ గద్వాలలోను, మేనేజిమెంటు కళాశాల కొండేర్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గద్వాలలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

పూదూర్లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంది.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

పూదూర్లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఇది గద్వాలకు సమీపంలో ఉన్ననూ బస్సు సౌకర్యము నామమాత్రముగా ఉంది. గ్రామంనకు రైలు సౌకర్యము ఉంది. ప్యాసింజర్ రైళ్ళు మాత్రమే ఇక్కడ ఆపబడతాయి. గద్వాల నుంచి కర్నూలు వెళ్ళు రైల్వే మార్గంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

రాజకీయాలు[మార్చు]

2019, జనవరిలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా శశికళ చెన్రెడ్డి ఎన్నికయ్యారు.[6]

దేవాలయాలు/ప్రార్థనాలయాలు[మార్చు]

గ్రామంలో శ్రీచెన్నకేశవాలయం, శ్రీ మల్లికార్జునస్వామి ఆలయం, శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం, చర్చి, మజీదు ఉన్నాయి.

శ్రీచెన్నకేశవాలయం[మార్చు]

గ్రామం నడిబొడ్డున ఈ దేవాలయం ఉంది. ఊరిలో మిగిలిన దేవాలయాలతో పోల్చితే ఇది నూతనమైనది. ఈ ఆలయానికి శిఖరం లేదు. ఒక ఇల్లు వలే కనిపిస్తుంది. ఈ ఆలయ సింహద్వారం చాళుక్య శిల్ప సంప్రదాయములో ఉంది. ఈ ఆలయద్వారం ఒక రైతు పొలం దున్నుతుండగా బయల్పడినదని గ్రామ ఐతిహ్యం. ఈ ఆలయానికి వెనుక వైపు ఉన్న సత్రం చక్కటి పొందికతో నిర్మించబడి, బహు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలోని దేవుడు కేశవస్వామి. ఈ స్వామి గద్వాల సంస్థాన స్థాపకుడైన పెద సోమనాద్రికి, ఇతర గద్వాల ప్రభులకు ఇలవేల్పు. పెద సోమన తన ఆస్థాన కవి అయిన కొటికెలపూడి వీరరాఘవయ్యకు ఈ స్వామి ఆదేశానుసారమే నూతన తిక్కన అను బిరుదునిచ్చాడు. ఈ రాఘవయ్య రచించిన భారత ఉద్యోగపర్వం కూడా ఈ స్వామికే అంకితమివ్వబడినది.[7]

శ్రీ మల్లికార్జునస్వామి ఆలయం[మార్చు]

గ్రామం వెలుపల, గ్రామానికి ఉత్తర దిక్కులో, అతిసమీపాన ఈ శివాలయం ఉంది. ఇక్కడ ఉండిన శివుడిని శ్రీ మల్లికార్జునస్వామిగా భక్తులు కొలుస్తారు. ఇక్కడే శిథిల జైన శిల్పాలు కనిపిస్తాయి. ఓ కన్నడ శాసనం కూడా ఇక్కడే లభించింది.

శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం[మార్చు]

ఈ ఆలయం కూడా గ్రామం వెలుపల, గ్రామానికి ఉత్తర దిక్కులో ఉంది. గ్రామం నుండి గద్వాలకు వెళ్ళే దారిలో శ్రీ మల్లికార్జునస్వామి ఆలయం దాటిన తర్వాత ఈ ఆలయం కనిపిస్తుంది. తూర్పుకు మొఖమై ఉన్న ఈ ఆలయం ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయంలోని శివుడిని శ్రీరామలింగేశ్వరస్వామిగా కొలుస్తారు. ఆలయంలో రామలింగేశ్వరస్వామికి కుడివైపున ఉత్తరం వైపు తిరిగి ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఎత్తైన విగ్రహం ఉంది. అందుకనే ఈ ఆలయాన్ని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయమని, శ్రీవీరభద్రేశ్వరస్వామి ఆలయమని రెండు రకాలుగా పిలుస్తారు. గుడికి ఎదురుగా ముఖమంటపం ఉంది. దానిలో పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు. గుడికి ఉత్తరం వైపులో సత్రాలు ఉన్నాయి. సత్రాలకు సమీపంలోనే స్వామి వారి రథం ఉంటుంది. ప్రతి సంవత్సరం డిసెంబరు మాసంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారి ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద జాతర జరుగుతుంది. గ్రామంలో రెండు శివాలయాలు ఉండటం, కేశవాలయం ఉన్నచోట శివుడికి ఉత్సవాలు, జాతర జరగటం ఈ గ్రామంలో శైవ మత ప్రాబల్యానికి ప్రబల నిదర్శనాలు.

గ్రామంలో జైన సంస్కృతి ఆనవాళ్ళు[మార్చు]

ఈ గ్రామం ఒకప్పుడు జైనులకు ప్రధాన స్థావరంగా ఉండి, 12 వ శతాబ్దిలో జైన, శైవ సంఘర్షణలకు యుద్ధరంగంగా నిలిచినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ గ్రామంలోని మల్లికార్జునస్వామి దేవాలయానికి సమీపంలోని కోటగోడకు ఉన్న కొన్ని విగ్రహాలలో తలపై ఏడు పడగల సర్పం కలిగి ధ్యానముద్రలో ఆసీనుడై ఉన్న జైన తీర్థంకరుని విగ్రహం ఉంది. ప్రధానమైన ఈ విగ్రహంతో పాటు మరో మూడు తీర్థంకరుల విగ్రహాలు కూడా ఉన్నాయి. మల్లికార్జునుని గుడి దగ్గర కూడా చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలలో పార్శ్వనాథుని విగ్రహం, మరో రెండు తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. ఈ గుడి దగ్గర ఓ నల్లని రాతిపై మూడు వైపుల 12 వ చాళుక్య విక్రమ సంవత్సరం నాటి కన్నడ శాసనం ఉంది. ఈ శాసనంలో కూర్చొని ఉన్న ధ్యాన జైన విగ్రహం, జైనుని ప్రశంస, పల్లవ జినాలయ ప్రశంస కనిపిస్తుంది.[8] అదే విధంగా వీరభద్రాలయం దగ్గర ఉత్తరం వైపు ఉన్న సత్రానికి సంబంధించిన గోడపై ఓ రాతి మీద నాలుగు వరుసలలో కొన్ని శిల్పాలను మలిచారు. మొదటి వరుసలో శివలింగంతో పాటు ధ్యాన జైన విగ్రహం కనిపిస్తుంది. ఈ వీరభద్రాలయం పూర్వం జినాలయంగా ఉండి, వీరశైవం విజృంభించిన కాలంలో ధ్వంసమై శివాలయంగా మారినట్లు మారేమండ రామారావు అభిప్రాయపడ్డారు.[8] పల్లవుల కాలంలో త్రిభువనమల్ల విక్రమాదిత్యుని సామంతుడు హల్లకరాసు పుదూరులోని పల్లవ జినాలయ జైనగురువు కనకసేన భట్టారకునికి ఒక సాగులోనున్న భూమిని దానం చేశాడు.[9]

రైల్వే స్టేషను[మార్చు]

ఈ గ్రామంలో మరో ప్రధాన ఆకర్షణీయ స్థలం రైల్వే స్టేషను. అన్ని హంగులతో నూతనంగా నిర్మించబడిన రైల్వే స్టేషను చూపరులను ఆకట్టుకుంటుంది. ఒక కిలో మీటర్ మేర విస్తరించబడిన ప్లాట్ ఫాం, దానిపై ఒక వైపు చక్కటి పూల మొక్కలతో కూడిన తోట పార్కును తలపిస్తుంది. స్టేషను ముందు వైపు గార్డెన్ కూడా చూపరులను ఆకట్టుకుంటుంది. ప్రయాణికులను ఆహ్లదపరుస్తుంది.

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ వెంకట సదాశివరెడ్డి

వీరు గ్రామ దేవాలయాలకు చాలకాలం ధర్మకర్తగా పనిచేశారు. ఊరిలో ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి ఉచితంగా స్థలాన్ని ఇచ్చిన ధాత.

శ్రీ చెన్రెడ్డి రామిరెడ్డి

సుదీర్ఘమైన వెంకట సదాశివరెడ్డి కుటుంబీకుల హయం తరువాత సర్పంచ్ గా ఎన్నికైన ఇతరులలో వీరు మొదటివారు. వీరి హయాంలోనే పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల భవనం నిర్మితమయ్యాయి.

గ్రామ చిత్రమాలిక[మార్చు]

భూమి వినియోగం[మార్చు]

పూదూర్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 160 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 19 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 6 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 21 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 615 హెక్టార్లు
  • బంజరు భూమి: 1334 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 3538 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 5085 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 402 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

పూదూర్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 20 హెక్టార్లు* బావులు/బోరు బావులు: 161 హెక్టార్లు* చెరువులు: 220 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

పూదూర్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, జొన్న

మూలాలు[మార్చు]

  1. GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
  3. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  5. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-23
  6. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013
  7. సమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం,రచన:ఆరుద్ర, ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట-50
  8. 8.0 8.1 గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-24
  9. సమగ్ర ఆంధ్ర చరిత్ర - సంస్కృతి రెండవ భాగం - ముప్పాళ్ళ హనుమంతరావు పేజీ.733

ఇవి కూడా చూడండి.[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]