బొల్లిముంత శివరామకృష్ణ
బొల్లిముంత శివరామకృష్ణ (జ:నవంబరు 7, 1920 - మ: జూన్ 7, 2005) అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు మరియు హేతువాది. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆంధ్రులపై చూపుతోన్న వివక్షని తరిమెల నాగిరెడ్డి చేత పలికించిన రచయిత.. తెలుగు సాహితీ లోకంలో ఆయన నిశ్శబ్ద విప్లవం, మార్క్సిస్టు గాంధీ అని కూడా అంటారు. మనుషులు మారాలి సినిమా సంభాషణకర్త ఆయనే.
గుంటూరు జిల్లా వేమూరు మండలం చదలవాడ లో అక్కయ్య, మంగమ్మ దంపతులకు జన్మించిన శివరామకృష్ణ గుంటూరులోనే హయర్ గ్రేడ్ ట్రెయినింగ్ పూర్తిచేశారు. ఆయన తండ్రి చదలవాడలో పాఠశాల నెలకొల్పడంతో ఉపాధ్యాయుడిగా అందులోనే చేరారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి, త్రిపురనేని గోపీచంద్లతో పరిచయం కలిగింది. 1945లో తన ఉపాధ్యాయ వృత్తిని వదలి వ్యవసాయ కార్మిక సంఘంలో చేరి చల్లపల్లి రాజాకి వ్యతిరేకంగా సాగిన భూపోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాట అనుభవాలతోనే తొలి రాజకీయ నవల మృత్యుంజయులు రాశారు. నగారా అనే పత్రిక నడిపారు. కొడవటిగంటి కుటుంబరావు రాసిన 'పిల్లి' అనే కథపై కొడవటిగంటి తిరోగమన యాత్ర అంటూ విమర్శ రాశారు. బెంగాల్ కరవుపై బుర్రకథ రాశారు. 'రైతుబిడ్డ' హరికథ రాశారు. సూక్ష్మంలో మోక్షం, అంతరాత్మ అంత్యక్రియలు, శివరామకృష్ణ కథలు బొల్లిముంతవే. ఏ ఎండకాగొడుగు, పత్రికా న్యాయం, తెలంగాణా స్వతంత్రఘోష, క్విట్ కాశ్మీర్, ధర్మసంస్థాపనార్థాయ... ఇలా ఎన్నో నాటికలు రాశారు. రాజకీయ గయోపాఖ్యానం, రాజకీయ కురుక్షేత్రం వంటి పద్యనాటకాలు రాశారు. దొంగ దొరికింది, భలేమంచి చౌకబేరం... వంటి రేడియో నాటికలు రాశారు. నేటి భారతం పేరుతో మూకీ నాటిక రాశారు. ప్రజానాట్యమండలి పునరుద్ధరణ సమయంలో బొల్లిముంత శ్రీకాంత్తో కలసి అందరూ బతకాలి నాటకం రాశారు. దీన్ని రక్తకన్నీరు నాగభూషణం వందకు పైగా ప్రదర్శనలిచ్చారు.
1955 మధ్యంతరం ఎన్నికల్లో రెండు పర్యాయాలు బొల్లిముంతపై హత్యాప్రయత్నం జరిగింది. 1960లో మనసుకవి ఆత్రేయ దగ్గర చేరారు. వాగ్దానం, కలసివుంటే కలదుసుఖం, కలిమిలేములు వంటి అనేక చిత్రాలకు ఆరుద్రకు సహరచయితగా సహకరించారు. బి.ఎస్.నారాయణ దర్శకత్వం వహించిన సినిమాల్లో అధిక భాగం ఆయన రాసినవే. 1968లో విశాలాంధ్ర ప్రారంభించిన ప్రతిభ వారపత్రికకి సంపాదకుడయ్యారు. దర్శకుడు వి.మధుసూదనరావు చిత్రాలకు ఎన్నిటికో సంభాషణలు రాశారు. ఆయన రాసిన దాదాపు యాభై సినిమాల్లో మనుషులు మారాలి, ప్రజా నాయకుడు వంటి సీరియస్ సినిమాలేకాక శారద, కళ్యాణమంటపం, మూగకు మాటొస్తే, విచిత్రబంధం వంటి సెంటిమెంట్ ప్రధానమైన చిత్రాలు కూడా ఉన్నాయి. నాటకాల్లో హార్మోనియం వాయించారు. స్త్రీ పాత్రలు ధరించారు.
సినిమా రచయితగా [మార్చు]
- కాలం మారింది (మాటల రచయిత)
- శ్రీదేవి (1970) (మాటల రచయిత)
- తిరుపతమ్మ కథ (1963) (మాటల రచయిత)
- వాగ్దానం (1961) (స్క్రీన్ ప్లే)