భట్ట రాజులు

వికీపీడియా నుండి
(భట్రాజులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భట్టు రాజులుగా పిలవబడే ఈ జాతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోనే కాక అలహాబాద్, లక్నో, పంజాబ్, బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఢిల్లీ, కాశీ, మహారాష్ట్ర, సారనాథ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రలలో అధికంగా ఉన్నారు. వీరు పేర్ల చివర రాజు, వర్మ, సింగ్, ఉన్న రాజవర్ణ వ్యవస్థ. వీరిని బ్రహ్మ క్షత్రియ, పండిత రాజులు అని కూడా పిలుస్తారు.వీరు ఉత్తరభారతదేశంలో ఉన్న చంద్రవంశం తెగకు చెందినవారు.వీళ్ళ మూల పురుషుడు విశ్వమిత్రుడు.[1][2][3]

ఆవిర్భావం

పురాణాల ప్రకారం సృష్టి ఆదిలో బ్రహ్మ రుద్రులచే వరుణ యజ్ఞము చేయబడెను. ఆ యజ్ఞంలో బృగు, అంగీర, కవి అను ముగ్గురు తేజశాలురు ఉద్భవించారు. కవి ఉద్భవింపగానే బ్రహ్మను స్తుతి చేయడం ఆరంభించాడు. అప్పుడు అతనికి బ్రహ్మరావ అని నామకరణం చేశాడు. తరువాత కవి వేదరూపియై వేదవాక్కు బ్రహ్మను స్తోత్రం చేయగా బ్రహ్మ కవిని భట్టు అనే పేరుతో అశీర్వదించాడు. ఈ విధంగా కవికి బ్రహ్మ భట్టు అను పేరు వచ్చింది.[4]

భట్టు పదం - దాని అర్ధం

భట్టు పదం పరిభాషణ పదం నుండి వచ్చింది. భట్టు పదానికి అనేక అర్ధాలున్నాయి. భట్టు అనగా ఉద్భత్, విద్వాన్, కవి, పండితుడు, క్షత్రియుడు అని నిఘంటువులో పేర్కొనబడినవి. భట్టు అనగా అగ్ని, స్వామి, యోధ, సూర్యుడు అని చెప్పబడినవి. భట్టును గురువు, సాహిత్య నిపుణుడు అని అంటారు. ద్రావిడ భాష (తమిళం) లో భట్టు శబ్దమునకు పురోహితుడు అని అర్ధమున్నది.[5]

భట్టు రాజుల్లో ముఖ్యాంశాలు

భట్టు జాతి అతి ప్రాచీనమైన జాతి.కవి ఋషి సంతానము బ్రాహ్మణ వర్ణంలోనే ఒక భాగమై భట్టు పదమును తన పేరులో ధరించెడివారు. క్రీస్తు పూర్వం గుప్తుల కాలంలో 'బ్రహ్మరావ భట్ట' అనే పేరుతో భట్ట జాతి ఆవిర్భవించింది. తరువాత 500 సంవత్సరాల వరకూ భట్ట జాతి - బ్రహ్మ భట్ట, మహారాజ్, భట్ట, భట‌్టా చార్య అను 5 శాఖలుగా విస్తరించింది. తరువాత కాలక్రమేణా భట్ట జాతిలో అనేక మార్పులు కలిగినవి. కొన్ని శాఖలు సన్నగిల్లాయి, మరికొన్ని శాఖలు ఉత్పన్నమయ్యాయి. ప్రస్తుత కాలంలో భట్ట జాతిలో 5 ముఖ్యమైన శాఖలు, ఎన్నో ఉపశాఖలు భారతదేశమంతటా విస్తరించి ఉన్నాయి. భట్ట రాజపుత్రులు అను శాఖవారు రాజస్తాన్ రాష్ట్రంలోను, బ్రహ్మ భట్ట అను శాఖవారు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్టాలలోను, భట్టరాయ అనువారు బీహార్, బెంగాల్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలోను, బారోట్ అను శాఖవారు గుజరాత్ రాష్ట్రంలోను, భట్టు రాజు అను శాఖవారు ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోను ప్రబలియున్నారు. భట్టు రాజపుత్రులలో 89 ఋషి గోత్రములు చెప్పబడియున్నవి. భట్టు రాజులు వారు ఎన్నో ఇతర జాతులవారికి గురువులుగా వెలసిల్లారు. ఛత్రపతి శివాజి మహారాజుకు గంగా భట్టు గురువుగా వ్యవహరించాడు, విక్రమాదిత్య మహారాజుకు భేతాళ భట్టు ఉపదేశికుడుగా ఉండేవాడు, ఆంధ్ర ప్రదేశ్ లో భట్టు రాజులు క్షత్రియులకు, వెలమ, రెడ్డి, దొరలకు గురువులుగా ఉండేవారు. భట్ట రాజులు బ్రాహ్మణ ఉపకులాల్లో ఒక కులము. అందువలన వీరికి కూడా బ్రాహ్మణ గోత్రాలు ఉన్నాయి.[6][7]

రాజ్య పరిపాలన

కౌరవ-పాండవ యుద్ధానంతరం ధర్శరాజు రాజ్యపాలన చేసాడు.తదనంతరం మనుమడగు పరీక్షన్మహరాజు రాజ్యపాలన కావించాడు.భారత యుధ్ధానంతరం ఈ దేశంలో అయోధ్య, హస్తిన, మగధ, నేపాళం, కాశ్మీరం అనే అయిదు రాజ్యాలు గుర్తింపు కలిగి ఉన్నాయి.

ఇక్ష్వాకుణామయం వంశః సుమిత్రంతో భవిష్యతి యతస్తం ప్రాప్య రాజానం, సంస్థానం ప్రప్స్యతి వెైకలా

బ్రహ్మక్షత్రస్వయో యోనిర్వంశో దేవర్షి సత్కతః క్షేమకం ప్రాప్యరాజానాం సంస్థనం ప్రాప్స్యతేకలౌ.

భారత యుధ్ధానంతరం అయేధ్య, హస్తిన రాజ్యాలు క్రమంగా సుమిత్రుడు, క్షేమకుడు అను వారితో రాజ్యాధికారాన్ని పోగొట్టుకొన్నడు, తదనంతరం బ్రహ్మ క్షత్రియులు భారతదేశ పాలకులైనట్లు తెలియచున్నది. మగధ రాజ్యాన్ని "కలి"పూర్వం36వ సంవత్సరం లగాయితూ క్రీస్తుపూర్వము 3136 సంవత్సరములను ఈక్రింది వంశాలు పరిపాలన కావించాయి.

22 మంది బార్వద్రధ వంశ రాజులు 930సం॥లు

5 గురుప్రజ్యోతి వంశ రాజులు 138సం॥లు

10 మందిశిశు నాగ వంశ రాజులు 360సం॥లు

9మంది నందవంశ శూద్రరాజులు 100సం॥లు

12మంది సూర్య వంశ శూద్రరాజులు 316సం॥లు

10 మంది మౌర్య శూద్రరాజులు 399 సం॥లు

4 కాణ్వ వంశ బ్రాహ్శణరాజులు 85సం॥లు

32 మంది బ్రహ్మక్షత్రియ వంశీయులు 506సం॥లు రాజ్యాపాలన చేసారు.

బ్రహ్మాక్షత్రియులే తొలి ఆంధ్రరాజులు. వీరు ఆంధ్ర దేశంలోనే కాక కాణ్వవంశం రాజులు కాలంలో మగధ సామ్రాజ్యాన్ని వశపరచుకొన్నారు.ఈ బ్రహ్మాక్షత్రియులే భట్టు రాజులు ".వీరి కాలంలోనే ప్రజలందరికీ నైతిక, ఆధ్యాత్మిక ప్రవృత్తి గలవారుగా ప్రభోధము చేసేందుకు అంతకు పూర్వమున్న మతాల 'సారంగభట్ట మతం' స్థాపించెను.[8]

ఆచార వ్యవహరాలు

బ్రాహ్మణుల వలే భట్టురాజులు కూడా ద్విజులు. - అనగా ఉపనయనము (ఒడుగు) సమయంలో జంద్యము (యజ్ఙోపవీతం) ధరించే ఆచారం ఉంది. బారసాల, కేశఖండనం, ఉపనయనం, కన్యాదానం, కాశీ యాత్ర వగైరా ఉన్నాయి. .

సేవా సంస్థలు

1.బ్రహ్మ భట్ట పంచాయత్ (ఢిల్లీ) 2.బ్రహ్మ భట్ట నవ యువక్ మండలి (ఢిల్లీ) 3.భట్ట సేవా సంఘం (లక్నో) 4.బ్రహ్మ భట్ట యువజన సంఘం (ఉత్తర ప్రదేశ్) 5.బ్రహ్మ భట్ట సంఘం (ఉత్తర ప్రదేశ్) 6.బ్రహ్మ భట్ట నవ యువక్ సంఘం (ప్రయాగ) 7.బ్రహ్మ భట్ట సభ (మధుర) 8.శ్రీ బ్రహ్మ భట్ట సభ (ఝాన్సీ) 9.శ్రీ బ్రహ్మ భట్ట బ్రహ్మ వికాస్ పరిషత్ (ఉరయా) 10.శ్రీ బ్రహ్మ భట్ట సమాజ్ సేవా పరిషత్ (రాయబరేలి) 11.గుజరాత్ బ్రహ్మ భట్ట సభ (అహ్మదాబాద్) 12. బ్రహ్మ భట్ట మండలి, భగినీ సమాజ్ (అహ్మదాబాద్) 13.బ్రహ్మ భట్ట విద్యుత్తేజక్ మండలం (బరోడా) 14.బ్రహ్మ భట్ట సమాజ్ (గాంధీనగర్) 15. బ్రహ్మ భట్ట మండలం (ఆనంద్) 16. బ్రహ్మ భట్ట సమాజ్ (కలకత్తా) 17.బీహర్ ప్రాంతియ బ్రహ్మ భట్ట సభ (ముజఫర్ పూర్) 18.బ్రహ్మ భట్ట నవ యువక్ సంఘం (సారన్) 19.భట్ట రాజ సంఘం (చెన్నై) 20.రాజక్కల్ సంఘం (చెన్నై) 21.రాజుల సంఘం (బెంగళూరు) 22. భట్టరాజ పుత్ర సూర్యదయ సభ (భట్లమకుటూరు) 23.విద్యత్ కుల దీపికా భట్టు సంఘం (పూలపల్లి, తూర్పుగోదావరి జిల్లా) 24.భట్టురాజు మహాజన సభ (విజయవాడ) 25.నిజాం రాష్ట్ర ఆంధ్రదేశ భట్ట రాజులు సంఘం (హైదరాబాద్) 26.భట్ట రాజు సంఘం (హైదరాబాద్) 27.భట్టు రాజుల సంఘం 28.రాజుల సంఘం విజయవాడ 29. తెలంగాణ భట్రాజు సంఘం (హైదరాబాద్)

ప్రస్తుత స్థితి

నేడు భట్టురాజులు గోదావరి జిల్లాలలో, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కడప ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తారు. వీరి పేర్ల చివర ఎక్కువగా రాజు లేక వర్మ అని ఉంటుంది. ఆంధ్ర భట్టురాజులు గృహనామాలు,, గోత్రాల పేర్లు బట్టి వీరిని గుర్తుబట్టవచ్చును. భారతీయ కుల వర్గీకరణ వ్యవస్థ ప్రకారం నేడు ఆంధ్ర ప్రదేశ్ లో (ఒబిసి) విభాగానికి చెందుతారు. మీగత రాష్ట్రాల్లో ఒసి విభాగానికి చెందుతారు. ప్రస్తుతం భట్టురాజులు జనాభా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కేవలం 3% మాత్రమే ఊన్నారు. ఒకప్పుడు పండితులుగా, రాజ్యాలేలిన వీరు ప్రస్తుతం ప్రధానంగా ఉపాధ్యాయులు, వ్యవసాయం, వ్యాపారరంగం, పారిశ్రామిక రంగం, సినిమా రంగంలో ఉన్నారు. భట్టురాజుల కొద్ది మంది మాత్రమే ధనవంతులుగా ఉన్నా చాలా వరకూ దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. అందుచేత రిజర్వేషన్ సిష్టమ్ కేవలం కులాన్ని బట్టి కాకుండా ఆర్థిక స్థితిని బట్టి ఉంటే న్యాయమని సామాజిక విశ్లేషకుల భావన.

అక్షరాస్యత

వీరు సరస్వతీపుత్రులుగా కొనియాడబడ్డారు. తమలో 95 శాతం మంది అక్షరాస్యులు ఉన్నారని వీరు గర్వంగా చెప్పుకొంటారు. ఎక్కువమంది ఉపాధ్యాయులుగా దర్శనమిస్తుంటారు. కొద్దోగొప్పో ఆర్థికంగా నిలదొక్కుకున్నవారు ప్రైవేటు పాఠశాలలను నెలకొల్పి తాము బతకటమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్, ఇంజనీరింగ్ కళాశాల 80 శాతం భట్టు రాజులవే భట్టు రాజులు పండితులుగా ఆయా గ్రామాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పి కుటుంబాన్ని పోషించుకునే వారు.అప్పట్లో వీరికి అగ్రహారాలు, జాగీరులు ఇచ్చి గౌరవించినవారూ ఉన్నారు. ఇప్పటికీ గుంటూరు, నల్లగొండ జిల్లాలో భట్టువారిపల్లి, భట్టుగూడెం వంటి పేర్లు వినిపిస్తాయి. విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన కారణంగా వీరిలో అక్షరాస్యత శాతం బాగా పుంజుకుంది.

ఇతర విషయాలు

శబరిమలైలో అయ్యప్ప దేవాలయంలో ఇప్పటికీ పూజారులుగా ఆనువంశీకులుగా భట్టురాజులే అర్చకులుగా కొనసాగుతున్నారు. ఆరో శతాబ్దపు ఆర్యభట్టు నాటి నుండి భట్ట రాజులు విద్యావికాసం, ఔన్నత్యం చరిత్రపుటలలో నిక్షిప్తమై ఉందనేది వాస్తవం. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకరైన రామరాజభూషణుడు (భట్టుమూర్తి) మొదలు వనపర్తి, గద్వాల్‌వంటి సంస్థానాల వరకు ఆయా రాజుల కొలువుల్లో ఆస్థాన పండితులుగా వెలుగొందారు భట్టరాజులు. పండిత అర్థం ధ్వనించే `భట్‌' రాజులు వీరు. కనుకనే తాము బ్రాహ్మణుల కన్నా అధికులమని ప్రకటించుకోవటంతోపాటు, మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ నియమనిష్ఠలతో జీవితం గడిపిన వారూ వీరిలో ఉన్నారు. కొన్ని దశాబ్దాల క్రిందట `భట్టు బ్రాహ్మణ సంఘం' అని ఒక సంఘాన్ని కూడా స్థాపించి బ్రాహ్మణులకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కనుకనే అప్పట్లో వారి పేర్ల చివర `భట్టు'అనే పదాన్ని చేర్చుకున్నారు.పురాణాలనే కాకుండా, చారిత్రక గ్రంథాలనూ ఆపోసన పట్టడంతో విద్యాపరంగా వీరు ప్రత్యేక గుర్తింపు పొందారు.

మహా పురుషులు

  • రామరాజభూషణుడు: అష్టదిగ్గజాలలో ఒకడు. 16వ శతాబ్దముకు చెందిన తెలుగు కవి, సంగీత విద్వాంసుడు.
  • షణ్ముఖి ఆంజనేయ రాజు ప్రసిద్ధ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక ప్రయోక్త.
  • తుమ్మెద సుబ్బరాజు: ప్రసిద్ధ రంగస్థల నటుడు.
  • కాసుల పురుషోత్తమ కవి: శ్రీకాకుళం గ్రామములోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ శ్రీకాకుళేశ్వరస్వామివారిని కీర్తించుచూ రచించిన ఆంధ్రనాయకశతకం లోని 108 పద్యాలను, ఆ ఆలయప్రాంగణంలో రాతి శాసనాల రూపంలో భద్రపరచారు.
  • బిరుదురాజు రామరాజు జానపద సాహిత్యంపై కృషి చేసిన ప్రముఖ రచయిత.
  • భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ( రత్నాకరం సత్యనారాయణరాజు) : ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు.

మూలాలు

  1. శర్మ, దేవ దత్త (1934). భట్టు రాజులు జాతి అన్వేషణం. ఢిల్లీ: దేవ దత్త శర్మ. p. 08.
  2. చెన్నమాధువుని, రామ రాజు. భట్టు రాజులు చరిత్ర. హైదరాబాద్: రామ రాజు.
  3. కెసి, బారోట్ (1990). బ్రహ్మ భట్ట సంహిత. అహ్మదాబాద్: డా"కెసి బారోట్. p. 240.
  4. భల్లం, ఎస్. ఆర్. భట్టు రాజులు చరిత్ర. భల్లం సూర్యనారాయణ రాజు. p. 1.
  5. భల్లం, ఎస్. ఆర్. భట్టు రాజులు చరిత్ర. భల్లం సూర్యనారాయణ రాజు. pp. 6, 7.
  6. భల్లం, ఎస్. ఆర్. భట్టు రాజులు చరిత్ర. భల్లం సూర్యనారాయణ రాజు. p. 2.
  7. జనపనీని, సూర్య నారాయణ రాజు (1927). భట్ట రాజు పుత్ర సూర్యోదయం. పశ్చిమగోదావరి జిల్లా: సూర్య నారాయణ రాజు. p. 240.
  8. భల్లం, ఎస్. ఆర్. భట్టు రాజులు చరిత్ర. భల్లం సూర్యనారాయణ రాజు. pp. 64, 65, 66.