భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఢిల్లీలో డీ.ఆర్.డీ.ఓ. కేంద్రీయ కార్యాలయం

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (Defence Research and Development Organisation) భారత ప్రభుత్వంలో రక్షణ శాఖకు చెందిన ప్రముఖ సంస్థ. ఆంగ్లంలో దీనిని సంక్షిప్త రూపంలో "డీ.ఆర్.డీ.ఓ." (DRDO) అని సంబోధిస్తారు. ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ లోని రక్షణ పరిశోధన, అభివృధ్థి విభాగము పరిధి లోనిది. దేశవ్యాప్తంగా డీ.ఆర్.డీ.ఓ.కు 51 పరిశోధనాలయాలున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన వైమానిక అవసరాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, మాణవ వనరుల అభివృద్ధి, జీవశాస్త్రం, పదార్ధశాస్త్రం, మిసైల్‌లు, యుద్ధశకటాలు, యుద్ధనౌకలు వంటి విషయాలపై ఈ పరిశోధనాలయాలలో పరిశోధనలు జరుగుతుంటాయి. మొత్తం డీ.ఆర్.డీ.ఓ. సంస్థలో 5,000 పైగా సైంటిస్టులు, షుమారు 25,000 మంది సహాయక సిబ్బంది ఉన్నారు.

అగ్ని-5 విజయవంతం[మార్చు]

మనదేశం ఇటీవల అగ్ని-5ను విజయవంతంగా ప్రయోగించింది. ఇది అత్యంత శక్తిమంతమైన, సుదూర లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి. ఈ ప్రయోగంతో భారత్ అంతర్జాతీయ స్థాయిలో మరో ఉన్నత శిఖరాన్ని అధిరోహించింది. ఒకటన్ను బరువున్న వార్‌హెడ్‌తో (ఆయుధం), 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అగ్ని-5 విజయవంతంగా ఛేదించింది. ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత సభ్యదేశాలకు మాత్రమే ఇలాంటి క్షిపణులున్నాయి. అయితే, తాజా విజయం దౌత్యసంబంధాల విషయంలో మనదేశ బాధ్యతను పెంచింది. అగ్రరాజ్యాలు సహా పొరుగు దేశాలతో స్నేహపూరిత వాతావరణం దెబ్బతినకుండా వ్యవహరించాలి. అణుసామర్థ్యం భారత దేశ రక్షణకు ఉద్దేశించిందే తప్ప ఇతర దేశాలపై యుద్ధానికి కాదన్నది సుస్పష్టం. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పినప్పుడే మనం సాధించిన విజయానికి పరిపూర్ణత.

మన సైన్యం అమ్ములపొదిలో అత్యంత శక్తిమంతమైన ఆయుధం అగ్ని-5. అందుకే భారత రక్షణమంత్రి శాస్త్ర సలహాదారుడైన వి.కె.సారస్వత్ దీన్ని గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు. దీని అర్థం - ఇప్పటి వరకూ ఉన్న ఆయుధాలు ఒక ఎత్తయితే ఇదో ఎత్తు అని. మరికొన్ని ప్రయోగాల అనంతరం అగ్ని-5ను సైన్యానికి అందజేస్తారు. దీని వర్గీకరణ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది భారతదేశం ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) అని కొందరు నిపుణులు పేర్కొనగా మధ్యంతర రేంజి బాలిస్టిక్ క్షిపణే (ఐఆర్‌బీయం) అని మరికొందరు వాదించారు. ఐసీబీఎం లక్ష్యం 10 వేల కిలోమీటర్ల వరకూ ఉంటుంది. అగ్ని-5 లక్ష్యం 5000 కిలోమీటర్లు మాత్రమే అని వీరి వాదన. అయితే, ఇది ఐసీబీఎంను పోలిన క్షిపణి అని అందరూ అంగీకరించారు. వివిధ దశల ప్రయోగాల్లో దీని లక్ష్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉందని నిపుణుల వాదన. వర్గీకరణ ఎలా ఉన్నా భారతదేశం సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ప్రయోగించడం ఇదే ప్రథమం.

సుదూర లక్ష్యం[మార్చు]

క్షిపణులు వాటి లక్ష్య దూరం పెరుగుతున్న కొద్దీ దేశాన్ని మరింత శత్రు దుర్భేద్యంగా ఉంచడానికి దోహదం చేస్తాయి. మనదేశం ఇప్పటికే రెండుసార్లు అణు పరీక్షలు జరిపింది. అణ్వాయుధాలు తయారు చేయగల సామర్థ్యంతో పాటు, వాటిని నిర్ణీత లక్ష్యంపై ప్రయోగించేందుకు అవసరమైన క్షిపణులనూ రూపొందించగల శక్తి భారత్‌కు ఉంది. సమీపంలోని లక్ష్యాల విషయంలో ఇలాంటి సామర్థ్యం ఎప్పుడో సంతరించుకున్నాం. పాకిస్థాన్‌లో ఏ ప్రదేశాన్నైనా చేరుకోగల అణుక్షిపణులు ఇప్పటికే ఉన్నాయి. ప్రస్తుతం ప్రయోగించిన అగ్ని-5తో చైనాను చేరుకోగల సామర్థ్యం లభించినట్లయ్యింది. ఆఫ్రికా, మధ్య, తూర్పు యూరప్; మరోవైపు ఆస్ట్రేలియా వరకూ చేరుకోగల సామర్థ్యం అగ్ని-5 సొంతం. దీని అర్థం మనదేశం ఆయా దేశాలపైకి క్షిపణులను ప్రయోగిస్తుందని కాదు. ఇతర దేశాలు మనపై దాడి చేయకుండా నిరోధించే సామర్థ్యం మనకు లభించిందని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుల విశ్లేషణ. ప్రపంచంలోని చాలా దేశాలకు అగ్ని-5తో క్షిపణి రక్షణ కవచాన్ని ఇవ్వవచ్చని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. కానీ, ఇది భారతదేశ విదేశాంగ, దౌత్య విధానాలకు విరుద్ధమైన వాదన. సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ప్రయోగించడం ద్వారా భారత్ స్వీయ రక్షణకు అవసరమైన ఆధునిక మిలటరీ పాటవాన్ని సొంతం చేసుకోదలచుకుంది. అంతేగానీ ప్రపంచ మిలటరీ పోరులో భాగస్వామి కావడం మనదేశ విధానం కాదు.

భారత్ గతంలో ప్రయోగించిన అగ్ని-1, అగ్ని-2ల వ్యాసం ఒక మీటర్ మాత్రమే. కానీ, అగ్ని-3, అగ్ని-5 రెండింటి వ్యాసం 2 మీటర్లు. అందుకే ఇవి అనేక వార్‌హెడ్లను ఏకకాలంలో మోసుకెళ్లగలవు. వీటిని ఎం.ఐ.ఆర్.వి. (Multiple Independently Targeted Re-entry Vehicles) అని పిలుస్తారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అగ్ని-5ను రూపొందించింది. దీన్ని దేశంలోని ఏప్రాంతం నుంచైనా ప్రయోగించవచ్చు. అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4 క్షిపణులు వరసగా 700, 2000, 3500, 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఇప్పుడు ప్రయోగించిన అగ్ని-5 పరిధి 5 వేల కిలోమీటర్లు. ఇవన్నీ మొబైల్ లాంచర్లపై నుంచి కూడా ప్రయోగించే వీలుంది. ఫలితంగా శత్రుదేశాలు వీటిని గుర్తించి, దాడిచేయడం కష్టం. అయితే, ఇలాంటి వాటిలో అనేక సాంకేతిక సవాళ్లు పొంచి ఉన్నాయి. ఈ క్షిపణి ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించాలంటే వాటి పరిమాణాన్ని, బరువును గణనీయంగా తగ్గించాల్సి ఉంటుందని రక్షణశాస్త్ర సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు.

చైనాతో పోలిస్తే ప్రస్తుతం భారత్ సాధించిన విజయానికి ఒక ప్రత్యేకత ఉంది. చైనా బాలిస్టిక్ క్షిపణుల తయారీలో భారతదేశం కంటే ముందే విజయవంతమైన కృషిని ప్రారంభించింది. కానీ, చైనా క్షిపణులు సుదూర లక్ష్యాలను ఛేదించగలిగినా, ఒక వార్‌హెడ్‌ను మాత్రమే తీసుకెళ్లగలవు. వీటికి ఎంఐఆర్‌వీలకున్న సామర్థ్యం లేదు. భారతదేశం అగ్ని-5 విజయవంత ప్రయోగంతో ఆ ఘనతను సాధించింది.

దౌత్యమే కీలకం[మార్చు]

ఈ క్షిపణుల సామర్థ్యం మన దేశానికే పరిమితం కాదు. పొరుగున ఉన్న చైనా, పాకిస్థాన్ బలమైన మిలటరీ పాటవాన్ని ఇప్పటికే సొంతం చేసుకున్నాయి. ఈ రెండు దేశాలకూ అణుక్షిపణులు ప్రయోగించగల సామర్థ్యమూ ఉంది. అంతేగాక ఆ క్షిపణుల సామర్థ్యాన్ని మరింత ఆధునికీకరించే పనిలో ఉన్నాయి. యూన్నన్, క్విన్ ఘాయ్ రాష్ట్రాల్లోని మిలటరీ స్థావరాల్లో ఉన్న క్షిపణులకు చైనా మరిన్ని మెరుగులు దిద్దుతోంది. వాటిలో ద్రవ ఇంధనంస్థానే మరింత ఆధునికమైన ఘన ఇంధనాన్ని నింపే కార్యక్రమం ద్వారా వాటి సామర్థ్యాన్ని ద్విగుణీకృతం చేసే పని మొదలెట్టింది. ఈ క్షిపణులు భారత్ మొత్తాన్ని చేరుకోగలవు. చైనా 2004లో రెండోతరం అణు జలాంతర్గాముల్లో మొదటిదైన 094 అణు జలాంతర్గామిని ప్రయోగించింది. ఇది జెఎల్-2 ఘన ఇంధన బాలిస్టిక్ క్షిపణిని మోసుకెళ్లగలదు. భారత్ ఇటీవల ప్రయోగించిన అగ్ని-5 ఘన ఇంధనంతో నడిచే క్షిపణి. అనేక సుదూర లక్ష్యాలను చేరుకోగల, ఘన ఇంధనంతో నడిచే ఆధునిక షాహిన్-1, 2 క్షిపణులు పాకిస్థాన్‌కు ఉన్నాయి. అవి ఆ దేశానికి విశ్వసనీయ నిరోధక సామర్థ్యాన్ని ఇస్తున్నాయని భారత వ్యూహాత్మక వ్యవహారాల అధ్యయన బృందం తన నివేదికలో పేర్కొంది. అందుకే, అణు క్షిపణులు మనదేశానికి నిరోధక సామర్థ్యాన్ని ఇస్తాయి. కానీ ఇది మాత్రమే సరిపోదు. ముఖ్యంగా భారతదేశ సమీప ప్రాంతంలోని బలమైన దేశాలకు క్షిపణులున్న నేపథ్యంలో ఈ దేశాల మధ్య అవగాహన చాలా కీలకం. ఏ మాత్రం అపోహలు, అనుమానాలు పెరిగినా కూడా అది బహిరంగ ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉంది. అణుక్షిపణులున్న దేశాల మధ్య ఘర్షణ వస్తే తీవ్ర వినాశకర పరిణామాలు తలెత్తుతాయి.

అందుకే క్షిపణుల సామర్థ్యం సాధించడమే కాదు ఘర్షణలు లేని వాతావరణాన్ని ఏర్పరచుకోవడం కూడా దేశ రక్షణకు కీలకం. ఆ మేరకు దౌత్యపరమైన కృషి అవసరం. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, నాటి సోవియట్ యూనియన్ బలాబలాల్లో సమతౌల్యం సాధించడమే కాకుండా మరో ప్రపంచ యుద్ధం రాకుండా నివారణ చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా అణ్వస్త్ర నియంత్రణ అంశాలపై నిరంతరం చర్చలు జరిపాయి. అలాగే భారత్, చైనా, పాకిస్థాన్ కూడా శాంతియుత వాతావరణం కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. అణ్వాయుధాలు, క్షిపణుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. భారత్, చైనాల మధ్య నెలకొన్న అనుమానాలు వ్యూహాత్మక వైరంగా మారకుండా చూడాల్సిన బాధ్యత రెండు దేశాలపైనా ఉంది. వాస్తవానికి భారతదేశ అణు లేదా సైనిక పాటవాలు ప్రత్యేకంగా ఏ దేశాన్నీ ఉద్దేశించినవి కావు. ఈ విషయాన్ని మనదేశం అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది. అలాగే చైనా సాధించిన సైనిక సామర్థ్యం కూడా భారత్‌ను దృష్టిలో ఉంచుకుని చేసింది కాదని మన వ్యూహాత్మక నిపుణులు అంగీకరిస్తున్నారు. అమెరికాతో పోటీగా ప్రపంచంలో బలీయమైన ఆర్థిక, రాజకీయ, మిలటరీ శక్తిగా ఆవిర్భవించాలన్నది చైనా ఉద్దేశం. ఈ నేపథ్యంలో చూసినప్పుడు సంప్రదింపుల ద్వారా తమ మధ్య అనుమానాలు పెరగకుండా ఇరు దేశాలు కృషి చేయాలి. ఇప్పటికే సరిహద్దు విషయంలో సమస్యలు, సంబంధాల్లో సున్నితమైన అంశాలున్న నేపథ్యంలో బాధ్యతాయుత వ్యవహారశైలి ఇద్దరికీ అవసరం. అప్పుడే ఈ రెండు దేశాల ప్రజలకు శాంతి, సుస్థిరత లభిస్తాయి.

ఇక పాకిస్థాన్ సైనిక పాటవం మనదేశాన్ని ఉద్దేశించిందే. పాక్ కూడా భారత్‌తో పోటాపోటీగా అణుపరీక్షలు జరిపింది. దీంతో ఇప్పటివరకు మనదేశానికి సంప్రదాయ యుద్ధక్షేత్రంలో ఉన్న ఆధిక్యత కాస్తా పోయిందని అమర్త్యసేన్ లాంటి వారు వ్యాఖ్యానించారు. ఆయుధాలు మాత్రమే రక్షణ కల్పించవు. ఆయుధ సంపత్తిని ఇతర దేశాలూ పొందగలవు. కాబట్టి అగ్ని-5 ప్రయోగం సందర్భంగా వ్యక్తమైన స్పందనలో కొంత సంయమనం అవసరం. పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలు ముమ్మరం చేయడం ద్వారా దక్షిణాసియా ప్రాంతంలో క్షిపణి పోరు పెరగకుండా భారత్ కృషి చేయాలి.

ఉత్తర కొరియా వివాదాస్పద ప్రయోగం నిర్వహించిన సమయంలోనే భారత్ అగ్ని-5 విజయం సాధించడం గమనార్హం. ఉత్తర కొరియా ప్రయోగాలను అమెరికా, దాని మిత్రదేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ దేశంపై ఆంక్షలు విధించాయి. అయితే భారత క్షిపణి ప్రయోగం పట్ల అమెరికా, పశ్చిమ దేశాల స్పందన భిన్నంగా ఉంది. కొన్నిదేశాలు జరిపే వ్యూహాత్మక క్షిపణి ప్రయోగాలు ఇతర దేశాలు జరిపే వాటికంటే ఎక్కువ ఆమోదయోగ్యమని అమెరికా, నాటో కూటమి, ఆస్ట్రేలియా లాంటి దేశాలు వ్యాఖ్యానించాయి. ఎందుకంటే భారత్ ఎప్పుడూ యుద్ధోన్మాదంతో అణు, క్షిపణి ప్రయోగాలు నిర్వహించలేదు. అయితే, కేవలం ఈ ఒక్కకారణంగానే అమెరికా, దాని మిత్రదేశాలు అగ్ని-5 ప్రయోగం పట్ల సానుకూలంగా స్పందించాయని భావించలేం. గతంలో అణుపరీక్షలు జరిపినప్పుడు అమెరికా ఒకింత వ్యతిరేకత వ్యక్తం చేసింది. క్షిపణి సాంకేతిక నియంత్రణ ఒప్పందం కింద మనదేశ అగ్ని క్షిపణి, రోదసీ కార్యక్రమాలపై అమెరికా ఆంక్షలు విధించింది. వాస్తవానికి ఈ ఒప్పందంలో భారత్ భాగస్వామి కాదు. అయితే, ప్రస్తుతం అమెరికా, పశ్చిమ దేశాలు సానుకూలంగా ఉండటానికి మరో కారణం ఉంది. భారత్ ఇటీవలి కాలంలో అమెరికాతో వ్యూహాత్మక సైనిక ఒప్పందాలు కుదుర్చుకుంది. పెరుగుతున్న భారతదేశ సైనికశక్తి చైనాను నిలువరించడానికి ఉపయోగపడుతుందని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. అందుకే భారతదేశం అగ్రరాజ్యాల వ్యూహాత్మక బంధంలో చిక్కుకోకుండా తన అవసరాలకనుగుణంగా సైనిక బలాన్ని పెంచుకోవాలి. ఇది ఆయుధపోరుకు, ఉద్రిక్తతలకు దారితీయకుండా దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలి.

భారతదేశ భద్రత అవస రాలను దృష్టిలో పెట్టుకొని అగ్ని-6 క్షిపణిని కూడా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రిత్వశాఖ సాంకేతిక సలహాదారులు, డిఆర్‌డివో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ వికె సరస్వత్‌ తెలిపారు. భారతదేశం క్షిపణి రంగంలో ప్రవేశిం చాలని 30 సంవత్సరాలుగా కలలుకంటున్నా మని, అగ్ని క్షిపణి-5 ప్రయోగం విజయ వంతం తో అగ్రరాజ్యాల చెంతకు చేరామని ఆయన న్నారు. అగ్ని క్షిపణి రూపకర్తలను శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఫ్యాప్సీ ఘనంగా సన్మానించింది. డాక్టర్‌ సారస్వత్‌ నేతృత్వంలో పలువురు శాస్త్రవేత్తలకు జరిపిన సన్మాన సభకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బీంరావ్‌ లోకూర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భగా జస్టిస్‌ సారస్వత్‌ మాట్లా డుతూ పూర్తిగా దేశీయ, సాంకేతిక పరిజ్ఞానంతో అగ్ని క్షిపణిలు రూపొందిస్తున్నామని 2050 నాటికి 2 లక్షల కోట్ల విలువ చేసే క్షిపణులను తయారు చేసి, ప్రయోగించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలియజేశారు. ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బీంరామ్‌ లోకూర్‌ మాట్లాడుతూ భారతదేశం మొట్టమొదటిసారిగా 1988లో అగ్ని-1 క్షిపణిని విజయవంతంగా ప్రయోగిం చడాన్ని చూసి అమెరికా శాస్త్ర సాంకే తిక పరిజ్ఞానం అందజేయడం లో నిషే ధాన్ని విధించి ందని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు భారత శాస్త్రజ్ఞులు దేశీయ శాస్త్ర సాంకేతిక పరి జ్ఞానంతో అగ్ని క్షిపణులను తయా రు చేస్తూ వస్తున్నారని, దేశ భద్రత కోసం వారి వారిరంగాల్లో చేస్తున్న కృషి అభినందనీ యమన్నారు.

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]