భూసార పరీక్ష
భూమి యొక్క సారాన్ని పరీక్షించి తెలుసుకొనే పద్ధతిని భూసార పరీక్ష అంటారు. భూమి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు మరియు దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. రైతు నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలన ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకొని మంచి దిగుబడులు ఇచ్చే పంటను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది. వేసిన పంటకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనపుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గినాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక నేలకు అందించే పోషకాల ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు, దీని ద్వారా పంటపై పెట్టే పెట్టుబడి తగటమే కాక మంచి దిగుబడుల వలన మంచి ఆదాయం పొందవచ్చు. పంట పండించడానికి నేలకు సరిపడ పోషకాలను అందించటం వలన నేల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టడమేకాక భవిష్యత్ తరాలకు పంట పండించడానికి అనుకూలమైన మంచి నేలను అందించగలుగుతాము. నేలలోని కొంత మట్టిని సేకరించి రసాయన పద్ధతుల ద్వారా లేదా ఇతర విశ్లేషణ పద్ధతుల ద్వారా పరీక్షించటం వలన నేలలో మొక్కకు కావాలసిన పోషక పదార్థాలు ఏయే పాళ్ళలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. నేలలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాషియం మొదలైన పోషక పదార్థాలను మొక్కలు సేకరించటం వలన భూసారం తగ్గుతూ ఉంటుంది, అందువలన పంటను వేసే ముందే మట్టి నమూనా పరీక్షించటం ద్వారా ఆ నేలలో తగ్గిన పోషకాలను తెలుసుకొని పంట వేసినప్పుడు తగ్గిన పోషక పదార్థాలను ఎరువుల రూపంలో అందిస్తే సరిపోతుంది.
విషయ సూచిక |
ప్రయోజనాలు [మార్చు]
మట్టి పరీక్షలో అమ్ల, క్షార సూచిక లవణాల స్థాయి మరియు సేంద్రియ కర్బనం, లభ్య భాస్వరం, లభ్య పొటాషియం మొదలైనవి ఏ నిష్పత్తిలో ఉన్నాయో తెలుసుకోవటం వలన నాటిన పైరుకు వయసును బట్టి, కాలాన్ని బట్టి అవసరమైన ఎరువులను సరైన పాళ్లలో అందించవచ్చు. ఈ పరీక్షల వలన అమ్లగుణం ఉన్న నేలలను సున్నంతో, క్షారగుణం ఉన్న నేలలను జిప్సంతో బాగుచేసుకోవచ్చు.
పొలం నుంచి మట్టి నమూనా సేకరణ [మార్చు]
మట్టి నమూనాను భూమి విస్తీర్ణంను బట్టి, వాలును బట్టి, రంగును బట్టి అవసరమయినని నమూనాలను సేకరించవలసి ఉంటుంది, ఒకటి నుంచి ఐదు ఎకరాల భూమిని ప్రామాణికంగా తీసుకొని భూమిలో పలుచోట్ల ఉన్న మార్పులను బట్టి మట్టి నమూనాలను సేకరించాలి.