మంగళంపల్లి బాలమురళీకృష్ణ
| మంగళంపల్లి బాలమురళీకృష్ణ | |
ఒరిస్సా, భువనేశ్వర్ లో నిర్వహించిన రాజారాని సంగీత మహోత్సవంలో బాలమురళీకృష్ణ |
|
| జన్మ నామం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ |
|---|---|
| జననం | 6 జులై, 1930 శంకరగుప్తం, రాజోలు తాలుకా, తూర్పు గోదావరి జిల్లా |
| స్వస్థలం | శంకరగుప్తం |
| నివాసం | చెన్నై , తమిళనాడు |
| ఇతర పేర్లు | మంగళంపల్లి |
| ప్రాముఖ్యత | కర్ణాటక సంగీత విధ్వాంసులు |
| వృత్తి | కర్ణాటక సంగీత విద్వాంసులు |
| పదవి | పద్మ విభూషన్ |
| మతం | హిందు |
| తండ్రి | మంగళంపల్లి పట్టాభిరామయ్య |
| తల్లి | సూర్యకాంతమ్మ |
రాజోలు తాలూకా శంకరగుప్తంలో 1930వ సంవత్సరం జూలై 6న మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, కవి, వాగ్గేయకారుడు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ ఆయన ప్రొఫెషనల్ కచేరీలూ చేస్తూనే ఉన్నాడు. ఆయన వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మళయాళం సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్లను వంటి బిరుదులను పొందాడు. ప్రపంచ స్థాయిలో బెనిలియర్ అనే అత్యుత్తమ పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నాడు.
విషయ సూచిక |
బాల్యం మరియు నేపథ్యం [మార్చు]
బాలమురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ లోని శంకరగుప్తంలో జన్మించాడు. ఆయన కుటుంబీకులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం. ఆయన ప్రముఖ సంగీతకారుడు మరియు వేణువు, వయోలిన్, వీణ విధ్వాంసుడు. వయోలిన్ టీచర్ గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవాడు. పుట్టిన 13వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో అమ్ముమ్మగారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగాడు. చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి శ్రీ పారుపల్లి రామకృష్ణ పంతులు దగ్గరకి శిష్యరికానికి పంపారు.
ఎనిమిదేళ్ళ ప్రాయంలోనే విజయవాడలోని త్యాగరాజ ఆరాధనలో కచేరి చేశాడు. అతని తల్లిదండ్రులు మురళీకృష్ణ అని నామకరణం చేయగా ప్రముఖ హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ "బాల" అని పేరుకు ముందు చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు.
వృత్తి జీవితం [మార్చు]
బాలమురళీకృష్ణ తన వృత్తి జీవితాన్ని చాలా చిన్న వయసు లో ప్రారంభించాడు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 25000 కచేరీలు చేశాడు. సంగీతంలోని అన్ని విభాగాలలోను విస్తారమైన పాండిత్యము,మంత్రముగ్దులను చేసే గాత్రం, కంపోసింగ్ లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హిందుస్తానీ సంగీతంలోని ప్రముఖ సంగీతకారులతో కలిసి పని చేశాడు మరియు జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యుడు. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్ సేన్ జోషి తో కలిసి ముంబయి లో నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోరీ అమోన్కర్, మొదలగు వారితొ కూడా జుగల్ బందీ కచేరీలు చేసాడు. ఈ కచేరీలు అతనికి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక, సంగీతం ద్వారా దేశ సమైఖ్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి. బాలమురళీకృష్ణ వయోలిన్, వయోలా, వీణ, మృదంగం మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్నారు. ఈయన తిరుపతి తిరుమల దేవస్థానము, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు [1].
కచేరీలు [మార్చు]
తన చిన్నప్పుడు గురువు పారుపల్లి రామక్రిష్ణయ్య వెంట తమిళనాడు అంతా తిరిగాడు. అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రసికమణి అని పేరుమోసిన ఒక ధనవంతుడైన సంగీతప్రియుడుండేవాడు. అతని మెప్పు పొంది, వాళ్ళింటో కచేరీ చేస్తేనే యువ కళాకారులకి గౌరవం దక్కేది. చిన్నవయసులో గురువు వెంట వెళ్ళిన బాలమురళి వారందరి ముందరా గాత్రం వినిపించి బహుమతులూ, ప్రశంసలూ పొందడంతో అతనికి అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవి. క్రమంగా ఈ పాతకాలపు పద్ధతులన్నీ వెనకబడడంతో సంగీతసభల ప్రాబల్యం పెరిగింది.
బాలమురళీకృష్ణ అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేశియా, సింగపూర్ మరియు అనేక ఇతర దేశాలలో కచేరీలు చేశాడు. తెలుగులోనే కాక సంస్కృతం, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషలలో కూడా పాటలు పాడాడు. భక్త ప్రహ్లాద చిత్రంలో నారదునిగా నటించటమే కాక తన పాటలు తానే పాడుకున్నాడు.
బిరుదులు మరియు పురస్కారాలు [మార్చు]
బాలమురళీకృష్ణకి ఎన్నో బిరుదులు మరియు పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని : - సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞాన సాగర, మొదలైనవి.
దేశ సమైక్యతకు కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నరు బాలమురళీకృష్ణని సన్మానించాడు. కర్నాటక సంగీతకారులలో 3 జాతీయ పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు.
రాగాలు [మార్చు]
మహతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి, సిద్ధి అనే కొన్ని కొత్త రాగాలను కూడా ఆవిష్కరించాడు.[2] ఈ కొత్త రాగాలు కనిపెట్టడం వల్ల ఆయన కొన్ని విమర్శలకు కూడా గురయ్యాడు.
జీవితంపై పుస్తకాలు [మార్చు]
బాలమురళీకృష్ణ సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర అనదగ్గ పుస్తకం బందా వెంకయ్య రాసిన “మురళీమాధురి”. ఈ పుస్తకంలో బాలమురళి చిన్ననాటి సంగతులు, ఆయన అభిమానులకు ఆసక్తి కలిగించే ఎన్నో విషయాలు ఉన్నాయి. దీనికి నూకల చినసత్యనారాయణ ఉపోద్ఘాతం రాశాడు.
మూలాలు [మార్చు]
- ↑ వన్ ఇండియా వెబ్సైటులో బాల మురళీ కృష్ణపై వ్యాసం, జులై 1, 2007న సేకరించారు.
- ↑ http://thehindu.com/arts/music/article503041.ece?