మసాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మసాలా
దర్శకత్వంకె. విజయ భాస్కర్
కథరోహిత్ శెట్టి
నిర్మాతదగ్గుబాటి సురేశ్ బాబు,
స్రవంతి రవికిషోర్
తారాగణందగ్గుబాటి వెంకటేష్,
రామ్,
అంజలి,
షాజన్ పదాంసీ
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
స్రవంతి మూవీస్,
సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2013 నవంబరు 14 (2013-11-14)[1]
సినిమా నిడివి
160 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్35 కోట్లు

స్రవంతి మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై స్రవంతి రవికిషోర్, దగ్గుబాటి సురేశ్ బాబు సమ్యుక్తంగ నిర్మించిన సినిమా మసాలా. దగ్గుబాటి వెంకటేష్, రామ్, అంజలి, షాజన్ పదాంసీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి కె. విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. హిందీలో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన "బోల్ బచ్చన్" సినిమాకి ఇది తెలుగు రీమేక్. ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2013 నవంబరు 14న విడుదలైంది.[2]

కథ[మార్చు]

అక్కాతమ్ముళ్ళైన సానియా (అంజలి), రహ్మాన్ (రామ్) తమ ఆస్తిని ఓ కోర్ట్ కేస్ వల్ల కోల్పోయి రోడ్డున పడతారు. తమ శ్రేయోభిలాషి అయిన నారాయణ (ఎం. ఎస్. నారాయణ) సలహా మీద వీళ్ళిద్దరూ హైదరాబాద్ వదిలి నారాయణ ఊరయిన భీమరాజపురం వెళ్తారు. అక్కడ నారాయణ ఆ ఊరి పెద్దమనిషి అయిన బలరాం (దగ్గుబాటి వెంకటేష్) దగ్గర రహ్మానుకి ఉద్యోగం ఇప్పిస్తానని మాటిస్తాడు. బలరాం భీమరాజపురం ఊరి ప్రజలకు దైవసమానుడు. అందరినీ తన వాళ్ళలా చూసుకుంటూ వారికి ఏ కష్టం రాకుండా కాపాడుతూ ఆ ఊరి ఉన్నతి కోసం కృషి చేసే ఓ జమీందార్. బలరాం బలవంతుడే అయినా అమాయకుడు. కానీ అతనికి మరో రెండు బలహీనతలున్నాయి. ఒకటి, ఇంగ్లీష్ వారికంటే కూడా మంచి ఇంగ్లీష్ మాట్లాడాలనే ప్రయత్నంలో బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడటం. అయితే ఆ ఊరిలో ఎవరికీ ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవడంతో బలరాం ఇంగ్లీష్ ఉత్తమమని అక్కడ విశ్వసిస్తుంటారు. రెండొది అబద్ధాలన్నా, మోసమన్నా చిరాకు. కేవలం 99 రూపాయల మోసం చేసాడని తన దగ్గర పనిచేసే సూపర్వైసరుని తరిమి తరిమి చచ్చే దాకా కొట్టి ప్రాణాలతో వదిలి పనిలోంచి తీసేసిన వైనం ఆ ఊరిలో ఎవరూ మర్చిపోలేరు.

ఇలాంటి విచిత్ర స్వభావం కల బలరాంకి తన చెల్లెలు మీనాక్షి (షాజన్ పదాంసి) అంటే ప్రాణం. మీనాక్షి హైదరాబాదులో చదువుకుంటూ ఉండే ఓ మామూలు అమ్మాయి. ఐతే బలరాం బావమరిది, తన ముఖ్యవైరి, భీమరాజపురం అభివృధ్ధికి అడ్డుపుల్లలు వేస్తూ ఎప్పుడూ ఓడిపోయే నాగరాజు (పోసాని కృష్ణ మురళి) మీనాక్షిని ఎలాగైనా పెళ్ళిచేసుకోవాలని కుట్ర పన్నుతుంటాడు. కానీ ఈ విషయంలో కూడా ఎప్పుడూ బలరాం చేతిలో ఓడిపోతూనే ఉంటాడు. ఇదంతా నారాయణ సానియాకు అర్థమయ్యేలా ప్రయాణ సమయంలో చెప్తాడు. భీమరాజపురంలో నారాయణ కొడుకు సూరి (ఆలీ) మసాలా డ్రామా కంపెనీ నడుపుతూ దాని కళ శాఖకు సంబంధించిన బాధ్యతలను సానియాకి అప్పగిస్తాడు. రహ్మాన్, సూరి, తన స్నేహితులు మూసి ఉన్న గుడి దగ్గర కాలువ వద్ద కాలం వెళ్ళదీస్తున్నప్పుడు ఓ పిల్లాడు ఆ గుడిలోని కోనేటిలో పడిపోతాడు. రహ్మాన్ గుడి తలుపులను బద్దలుకొట్టి ఆ పిల్లాడిని కాపాడగా నాగరాజు మనుషులతో గొడవ పడాల్సి వస్తుంది. ఇంతలో బలరాం పోలీసులతో కలిసి అక్కడికి చేరుకోవడంతో నాగరాజు తన మనుషులతో పరారవుతాడు. బలరాం రహ్మాన్, సూరి, నారాయణలను తన మహలుకి పిలిపిస్తాడు. అక్కడ రహ్మాన్ సూరి సలహా మీద తన పేరు రాము అని చెప్తాడు. తన ధైర్యసాహసాలకు మెచ్చి, నారాయణ సిఫార్సు మేరన రాముకి సూపర్వైసర్ ఉద్యోగమిచ్చి నెలకి 40 వేల జీతం కూడా ఇస్తానంటాడు.

రాము తన నిజాయితితో, పనిలో తన నైపుణ్యంతో బలరాం మనసును గెలుచుకుంటాడు. అయితే రాములో ఏదో తేడా ఉందనే శంకతో మెదులుతుంటాడు బలరాం కుడిభుజంగా వ్యవహరించే ఎద్దుల కామేశ్వరరావు లేక ఎద్దులోడు (జయప్రకాశ్ రెడ్డి), ఎద్దు అని కూడా పిలవబడే ఎద్దులోడు ఒక్క రహ్మాన్ విషయంలోనే కాదు దేన్నైన అనుమానిస్తుంటాడు. మహా సందేహ ప్రాణి. ఓ నాడు మీనాక్షి పుట్టినరోజున తనని కల్లుద్దామని తను చదివే కాలేజికి వెళ్తారు బలరాం, రాము, ఎద్దులోడు. అక్కడ తన అన్న మొరటుతనాన్ని భరించలేక మీనాక్షి తన కోసం బహుమతిగా తెచ్చిన ఖరు నడుపుతూ భీమరాజపురానికి బయలుదేరుతుంది. కారు పంచర్ అయ్యి ఆగిపోయాక తను నాగరాజు ఉండే ఊరికి కొంత దూరంలో ఉందని తెలుసుకుంటుంది. అప్పుడే నాగరాజు తనని కిడ్నాప్ చేసి బలరామ్ని బెదిరిస్తాడు. అప్పుడు రాము, బలరాం కలిసి వాడి మనుషులను చావబాది మీనాక్షితో కలిసి ఇంటికి చేరుకుంటారు. ఆ రోజునే బలరాం రాముని తన నమ్మిన బంటు అని ప్రకటించి తనతో కలిసి భోజనం చెయ్యమని అడుగుతాడు. ఐతే రాము ముస్లిం అవ్వడం చేత, అది రంజాన్ పవిత్ర మాసం అవ్వడం చేత భోజనం చెయ్యలేని పరిస్థితి కనుక బలరాం దగ్గర తను అమ్మ కోసం ఉపవాసమున్నానని అబద్ధం చెప్తాడు. రాము మీద అభిమానంతో రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మని కలుస్తానని బలరాం సెలవిస్తాడు. దానితో రాముగా తన ముందు తిరుగుతున్న రహ్మాన్ సూరిని ఏదైనా ఉపాయం చెప్పమంటే వాల్లిద్దరూ పక్కూరిలో రికార్డింగ్ డన్సులు వేసే చింతామణి (కోవై సరళ)ని రాము తల్లిగా నటించమని అడుగుతారు. అప్పుడు తన వయసు చాలా తక్కువని, అలాంటి ముసలి పాత్రలు చెయ్యలేనని చెప్పడంతో రహ్మాన్, సూరిలు వెళ్లిపోతారు. మరుసటి ఉదయం రహ్మాన్, సూరి, తమ స్నేహితులు, నారాయణలు తెగ తెన్షన్ పడుతుంటారు.

ఇంతలో బలరాం రానే వస్తాడు. ఎప్పటి నుంచో రాముపై అనుమానంగా ఉన్న ఎద్దులోడు ఆ రోజు తన తల్లి ఇంట్లో లేకపోవడంతో రాము ఓ మోసగాడు అన్న వాదన వినిపించాలనుకునేలోపే చింతామణి ముసలావిడ వేషం వేసుకుని తను రాము తల్లి అంజలి దేవినని అబద్ధమాడి తమ నాటకాన్ని సుఖాంతం చేస్తుంది. అంతా బాగానే ఉందనుకున్న వేళ సూరి స్నేహితుడొకడు మరో రంగస్థల నటి (గీతాంజలి)ని తల్లి వేషంలో పంపుతాడు. సమయస్పూర్థితో రాము ఆవిడ మా పెద్దమ్మ అని, తనే నన్ను పెంచిందని చెప్తాడు. ఇంతలో మరొకడు పంపిన మరో నటి (శ్రీలక్ష్మి) అలాగే వస్తుంది. ఈ సారి వచ్చినావిడ తన చిన్నమ్మని, ఆవిడ తనని చదివించిందని, ముగ్గురు తల్లుల పెంపకంలో తను పెరిగానని చెప్పాక బలరాం పొంగిపోతాడు. ముగ్గురు తల్లుల ప్రేమను పంచుకుని పెరిగిన శ్రీరాముడిలాంటివాదివని పొగిడి భోజనానికి సిద్ధమవుతుండగా సానియా ఇంటికి వస్తుంది. తనని తన అక్క సరితగా బలరాంకి పరిచయం చేస్తాడు రాము. అయితే తను అచ్చం తన చనిపోయిన ప్రియురాలు సావిత్రిలా ఉండటంవల్ల షాకైన బలరాం ఎద్దులోడితో కలిసి తన మహలుకి ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పి బయలుదేరతాడు. నిజం తెలియక పోవడం వల్ల తన ఈ ప్రవర్తన అటు రహ్మాన్ ఇటు సానియా ఇద్దరికీ అర్థం కాదు. ఇలా ఉండగా ఓ రోజు కలెక్టర్ గారిని కలవడానికి బలరాం, ఎద్దులోడు కలిసి బయలుదేరతారు. మసీదులో రంజాన్ అవ్వడం వల్ల ముస్లింలు ప్రార్థనలు చేస్తుంటారు. అక్కడే వాళ్ళ ప్రార్థన ముగిసేందుకు ఎదురుచూస్తున్న బలరాం, ఎద్దులోడు అక్కడ నమాజ్ చేస్తున్న రహ్మానుని చూస్తారు.

కోపంతో రాముని నిలదీసి అడిగితే రాము, సూరి, సానియ మరియూ వాళ్ళ స్నేహబృందం కలిసి మీరు మసీదులో చూసింది రాం సవతి తమ్ముడు రహ్మాన్ అని చెప్తారు. ఇద్దరూ అచ్చం ఒకేలా ఉన్నా రహ్మానుకి మీసాలు ఉండవు, రాముకి మీసాలు ఉంటయని చెప్తారు. అక్కడ మసీదు దగ్గర అంత మంది జనంలో చూడటం వల్ల బలరాం మీసం ఉన్నది లేనిది గమనించడు. రహ్మాన్ తల్లి మరణించిందని, అప్పటి నుంచి తన బాధ్యత, రహ్మాన్ బాధ్యత రాము మోస్తున్నాడని తెలుసుకున్న బలరాం రహ్మాన్ మంచి నృత్యకారుడని తెలుసుకుని తనని కూడా పనిలో పెట్టుకుంటానంటాడు. అయితే తప్పించుకునేందుకు రహ్మాన్ నపున్సకుడు అని చెప్పినా అది తనకు మరింత మేలు చేసే విషయమని, తన చెల్లెలికి డాన్స్ నేర్పేవాడు నపున్సకుడైతే అఫైర్ల గోల ఉండదని తన మహలుకి పంపమని చెప్పి వెళ్ళిపోతాడు. వేరే దారి లేక రహ్మాన్ మీసాలు తీసేసి రంగు రంగుల షర్టు, ప్యాంటు వేసుకుని వెళ్ళి అనుకోకుండా సెలెక్ట్ ఔతాడు. ఒప్పందం ప్రకారం పగలంతా అమ్మ అంజలి దేవి సేవలో ఉంటాడు కనుక రహ్మాన్ రాత్రి 8-9 మీనాక్షికి డన్స్ నేర్పుతానని, అప్పటిదాకా రాము పనిచేస్తాడని చెప్తాడు. అందుకు బలరాం సరేనంటాడు. అలా పగలంతా సూపర్వైసర్ పనిచేస్తూ, రాత్రి ఇంటికి వెళ్ళి రహ్మాన్ వేషం వేసుకుని మీనాక్షికి డాన్స్ నేర్పడం చేస్తుంటాడు. రాము-రహ్మాన్ రహస్యం తెలుసుకున్న మీనాక్షి అసలా అబద్ధం ఎందుకు ఆడాడో తెలుసుకున్నాక ఈ నిజం తన అన్నకు చెప్పకపోవడమే మేలని రాముతో చెయ్యి కలుపుతుంది. అనుకోని నేపథ్యాలలో రహ్మాన్, మీనాక్షి ప్రేమలో పడతారు.

ఓ రోజు ఎద్దులోడు టి.వి.లో రజినీకాంత్ నటించిన తిల్లు ముల్లు తెలుగు అనువాదమైన మీసం కోసం సినిమాలో ఓ సన్నివేశం చూస్తాడు. ఆ సన్నివేశంలో రజినికాంత్ తన యజమానితో తనకు ఓ కవల తమ్ముడున్నాడని, వాదికి మీసాలు లేవు నాకు మీసాలు ఉన్నాయి, వాడిని చూసి మీరు నన్ను అనుమాననించారని చెప్తాడు. ఎద్దులోడు బలరాంకి ఇది చూపించి రాము, రహ్మాన్ ఒక్కరేనేమో అన్న సందేహం వ్యక్తం చేస్తారు. తమ సందేహం నిజమో కాదో తెలుసుకోడానికి రాము గదిలో పనిచేసుకుంటూ ఉండగా బయట తలుపుకి గొళ్ళెం వేసి వాళ్ళు రాము ఇంటికి బయలుదేరుతారు. తలుపు తీసిన మీనాక్షి అంతా రాముకి చెప్తే అతను వాళ్ళ కంటే ముందే అక్కడికి చేరుకుని అక్కడ రహ్మానుల బట్టలు వేసుకుని మీసం తీసేసి వాళ్ళు రాగానే సమయస్పూర్థితో బాగా నటించి వాళ్ళని నమ్మిస్తాడు. వాళ్ళు మహలుకు వెళ్ళే ముందే రాములా బట్టలు వేసుకుని మీసం పెట్టుకుని గదిలోకి వెళ్ళిపోతాడు. మీనాక్షి గొళ్ళెం వేసి తన పనిలో తానుంటుంది. తిరిగి వచ్చాక రాము లోపలే ఉన్నాడని తెలుసుకున్నాక రాము నన్ను అనుమానించారు కనుక నేనిక్కడ పనిచెయ్యలేనంటాడు. ఎద్దులోడి వల్లే ఇదంతా జరిగింది అని బలరాం వారించి ఎద్దులోడిని ఇంకా అనుమానమయితే ఆ మీసం లాగమంటాడు. ఎద్దులోడు మీసం లాగబోతుంటే బలరాం ఎద్దులోడిని చావబాది బయటికి తీసుకుపోతాడు. ఆ రాత్రి ఇద్దరూ బయటికి వెళ్ళినప్పుడు చింతామణిని చూస్తారు. తను కూడా తప్పించుకోడానికి తను అంజలి దేవికి చెల్లెలినని అబద్ధమాడుతుంది. మళ్ళీ ఎద్దులోడి మాటలు విని బలరాం రాము ఇంటికి వెళ్తాడు. ఎలాగోలాగ వెనుక దారి నుంచి వచ్చి అంజలి దేవిగా నిలబడుతుంది చింతామణి. దానితో ఎద్దులోడి దారులన్నీ మూసుకుపోతాయి.

జరిగిందంతా మర్చిపోయి అందరూ హాయిగా ఉన్నప్పుడు ఒకసారి బలరాం సివిల్ ఇంజినీరు (వేణుమాధవ్)ని రప్పిస్తాడు తమ స్థలంలో ప్రజలకు మేలు చేసే ప్రయత్నాల గురించి చర్చించడానికి. దూరాలని చూసే బైనాకులర్ వాడి పరిసరాలని చూస్తున్న ఆ ఇంజినీరు రహ్మాన్, మీనాక్షిలు ఒకరినొకరు పట్తుకుని నిలబడటం చూస్తాడు. ఇదే బలరాంకి అక్కడున్న ఎద్దులోడు చూపిస్తాడు. ఈ దృశ్యం చూసిన నారాయణ పారిపోతాడు. మీనాక్షి ఓ నపున్సకుడిని పెళ్ళిచేసుకోవాలనుకోవడం పిచ్చి అనుకున్న బలరాం రహ్మానుని వదిలెయ్యమని బ్రతిమాలతాడు. తను వినదు. రాముని రహ్మాన్ తన చెల్లెలి దగ్గరికి రాకుండా చూసుకొమ్మని బెదిరిస్తాడు. తను సరేనంటాడు. ఇంట్లో తనకి సంబంధాలు చూస్తున్నారని తన అమ్మమ్మ ఊరికి వెళ్తూ రాముని తన అన్నని ఒప్పించమని, కుదరకపోతే తనని లేపుకుపొమ్మని చెప్పి వెళ్ళిపోతుంది మీనాక్షి. తను వెళ్ళే బస్ చీపౌరుపల్లి గ్రామం బస్ డిపోలో ప్రయాణికుల భోజనం కోసం ఆగుతుంది. అప్పుడు నాగరాజు తన మనుషులతో వచ్చి తనని లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇంతలోనే రాము, బలరాం వచ్చి నాగరాజుకి, తన మనుషులకి దేహశుద్ధి చేసి వాళ్ళని పోలీసులకు పట్టిస్తాడు. రహ్మాన్ ఊరొదిలి పారిపోయాడని అందరూ నమ్మాక బలరాం తన చెల్లెలిని కాపాడిని రాముని తన చెల్లెలిని పెళ్ళి చేసుకొమ్మని బ్రతిమాలతాడు. కానీ తన అక్క సరిత పెళ్ళి అవ్వనిదే తనెలా పెళ్ళి చేసుకోవడమని వాదించడం విని కుండమార్పిడి పెళ్ళి కుదురుస్తాడు. దీని ద్వారా రాము - మీనాక్షి, బలరాం - సరితల పెళ్ళిళ్ళు ఒకే సారి జరుగుతాయి.

ఇది తెలుసుకున్న సానియా బలరాం ముందుకి వెళ్ళి మిమ్మల్ని నేను పెళ్ళి చేసుకోలేనంటుంది. అప్పుడు బలరాం తన గతం గురించి చెప్తాడు. తను ప్రేమించిన సావిత్రి అచ్చం మీలాగే ఉండేదని, 4 ఏళ్ళ క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని, అందుకే మీలో నా సావిత్రిని చూసుకుని మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలని అనుకున్నానంటాడు బలరాం. కానీ తను సరిత అని, సావిత్రి కాదని గ్రహించడం కుదరలేదంటాడు. అయినా రాము లాంటి మంచి మనిషి తన చెల్లెలి మొగుడవ్వడం తనకు చాలా సంతోషంగా ఉందని అంటాడు. పశ్చాత్తాపంతో ఉన్న సానియా రహ్మాన్ దగ్గరికి వెళ్ళి బలరాంకి నిజం చెప్పమంటుంది. దానికి రహ్మాన్ సరేనంటాడు. ఇదంతా సెల్ ఫోనులో రికార్డ్ చేసిన ఎద్దులోడు బలరాంకి చూపిస్తాడు. కోపంతో నన్ను వంచించారన్న బాధతో వాళ్ళని చంపాలనుకుంటాడు బలరాం. మరుసటి ఉదయం బలరాంకి నిజం చెప్పేద్దామని బయలుదేరబోతున్న రహ్మాన్, సానియా, సూరి, నారాయణ, చింతామణి, సూరి స్నేహబృందాన్ని బలరాం మనుషులు దగ్గరుండి మహలుకు తీసుకెళ్తాడు. అక్కడ నాటక రూపంలో జరిగిన కథంతా బలరాం చూపించి వెంటనే వాళ్ళందరిని తుపాకితో కాల్చాలనుకుంటాడు. ఇంతలోపే వాళ్ళు మీనాక్షితో కలిసి పరిపోతారు, బలరాం తన మనుషులతో కలిసి వాళ్ళని తరుముతుంటాడు. ఓ కొండ చరియలో బలరాం కారు పడిపోయి ఓ రాయిపై నిలుస్తుంది. రహ్మాన్ ఎలాగైనా బలరామ్ని కాపాడాలని పరిగెత్తి పొరపాటున పైకెక్కిన బలరామ్ని తిరిగి కింద కారు మీద పడేలా చేస్తాడు. మళ్ళి పైకెక్కుదామంటే బలరాం రహ్మానుని నమ్మడు. అప్పుడు రహ్మాన్ తను అబద్ధాలాడింది నిజమే అయినా అవి తన అవసరాల కోసమే ఆడానని, అన్ని అబద్ధాలాడినా ఒక్క రూపాయి కూడా అటూ ఇటూ పోనీలేదని, నిజాయితీగా పనిచేసానని వాదిస్తాడు. రహ్మాన్ జారి పడబోతుంటే బలరాం రహ్మానుని కాపాడుతాడు. బలరాం రహ్మానుని క్షమించి తిరిగి అందరూ సుఖంగా ఉండటంతో సినిమా ముగుస్తుంది.

సంగీతం[మార్చు]

ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతాన్ని అందించారు. రామజోగయ్య శాస్త్రి పాటలను రచించారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా హైదరాబాదులో 2013 అక్టోబరు 13న విడుదలయ్యాయి.[3] ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభించింది.

నెం. పాట గాయకులు నిడివి
1 "నిను చూడని" రంజిత్, శ్రేయా ఘోషల్ 4:56
2 "కోట్లల్లో ఒక్కడేరా" శంకర్ మహాదేవన్ 4:04
3 "మీనాక్షి మీనాక్షి" సుచిత్ సురేశన్, ఎం.ఎం. మానసి 3:42
4 "అచ్చారే అచ్చారే" రంజిత్, బిందు 4:02
5 "మసాలా" రాహుల్ నంబియర్, నవీన్ మాధవ్, బిందు 2:26

మూలాలు[మార్చు]

  1. "నవంబర్ 14న మసాలా వడ్డింపులు". తెలుగువన్. Retrieved Oct 24, 2013.[permanent dead link]
  2. "నవంబరు 14న మసాలా". ప్రజాశక్తి దినపత్రిక. Retrieved Oct 22, 2013.
  3. "'మసాల' ఆడియో విడుదల !". ఆంధ్రవిలాస్. Retrieved Oct 13, 2013.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=మసాలా&oldid=3945858" నుండి వెలికితీశారు