మోడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి రచించిన తెలుగువారి జానపద కళారూపాలు

మోడి అనునది ఒక జానపద కళా రూపం. మోడి అనగా మంత్ర, తంత్ర విద్యను ప్రదర్శించడం. ఫలానా రోజున ఫలానా పల్లెలో మోడి ఎత్తుతారు అని ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటారు. ఇద్దరు మంత్ర గాళ్ళ మధ్యన పోటి ఈ మోడీ. మంత్రాలతో ఎత్తులకు పైయెత్తులు వేసి ఒకరి నొకరు అడ్డు కుంటుంటారు. చివరకు ఎవరో ఒకరు గెలుస్తారు. ఈ గారడి విద్య యాబై ఏళ్ళ క్రితమే మరుగైనది. ఇప్పుడెక్కడా మచ్చుకైనా జరగడము లేదు. నేటి తరం వారికి మోడి అంటే ఏమాత్రం తెలియని పరిస్థితి.

ప్రదర్శన[మార్చు]

ఊరి బయట ఒక పందిరి వేసి, దాని ముందు బొగ్గు పొడితోనూ, ముగ్గు పొడి తోనూ భయంకరమైన బొమ్మలను తీర్చి ఉంటారు. పందిరి ముందు బార కొకటి చొప్పున ఏడు చిన్న గుంతలు తీస్తారు. అందులో కుంకుమ, పసుపు లాంటివి చల్లుతారు. ఒక్కొక్క గుంతలో ఒక్కొక్కటి చొప్పున ఏడు వస్తువులు ఉంచుతారు. సామాన్యంగా ఆ వస్తువులు కొబ్బరికాయ, అరటి పండు, కోడి గ్రుడ్డు, ఇలాంటివే ఉంటాయి. మోడి కట్టడి చేసే మాంత్రికుడు చేసిన ఏర్పాటు ఇది. ఇంతా చేసి ఆమాంత్రికుడు ఆయా గుంతల వద్దకు ఎవరిని రానీయకుండా మంత్రాలతో కట్టడి చేసి ఉంటాడు. మోడి కట్టడి చేసిన ఆ యా గుంత్లలో ఉన్న వస్తువులను తన మంత్ర విద్యలతో ఎదుటివాని మంత్రాలను చిత్తు చేసి ఆ గుంతలలో ఉన్న వస్తువులను బయటకు తీస్తే అవతలి మంత్రగాడు గెలిచినట్లు, లేదా ఓడి పోయినట్లు.

జరిగిన కథ[మార్చు]

పూర్వ కాలంలో యథార్థంగా జరిగిన ఒక మోడి కళా విన్యాసం:

ఒకసారి మారేపల్లి సిద్దయ్య అనే ఒక పెద్దమనిషి ఉండేవాడు. అతడేమి పెద్ద మాత్రికుడు కాదు కాని అతని ఆహార్యం మాత్రం మంత్రగాడిలాగే ఉండేది. పెద్ద గడ్డం, మెడలో రుద్రాక్షలు, మొహాన విభూతి రేఖలపై పెద్ద కుంకుమ బొట్టు. అతను ఒక సాధారణ సాధుజీవనం గడుపుతూ భార్యా పిల్లలతో ఆ వూర్లోనే కాపురం ఉండేవాడు. ప్రతిరోజు రాత్రులందు భజనలు చేసుకుంటూ ఉండేవాడు. అతని తోడుకు కొంత మంది సాధువులు వచ్చి పాటలు పాడుతుండే వారు. వారు ఎక్కువగా బ్రహ్మం తత్వాలు పాడు తుండే వారు. పిల్లల సంతోషార్థం చిన్న చిన్న మాయలు, మంత్రాలు చేస్తుండే వాడు. బయటి ఊరినుండి ఒక మంత్ర గాడు వచ్చి సిద్దయ్యతో తాను మోడి ఎత్తుతానని మాట కట్టుకున్నాడు. సిద్దయ్య మోడి కట్టడి చేసే టట్టు, పర ఊరి మంత్రగాడు మోడి ఎత్తే టట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఊరి బయట ఒక పందిరి వేశారు. దానిముందు ముగ్గు పిండితో, బొగ్గు పిండి తోను దయ్యం ముగ్గులు వేసి మధ్యలో కుంకుమ, పసుపు, వేసి అక్కడక్కడా కోసిన నిమ్మకాయలను వేశారు. పందిరి ముందు బార కొక్కటి చొప్పున ఏడు చిన్న గుంతలు త్రవ్వారు. మొదటి గుంత త్రవ్వు తుండగా జానెడు లోతులోనే ఒక చింత వేరు అడ్డు పడింది. సిద్దయ్యకు ఒక ఆలోచన వచ్చింది. దాని ప్రకారం .... ఎద్దుల మెడకు కట్టే ఒక పలుపు తాడు తెచ్చాడు, పలుపు తాడు రెండు చివరలను ఒకటిగా కడితే అక్కడ ఒక బంతిలాగ ఉంటుంది. ఆ పలుపు తాడును గుంతలో కనబడిన చింత వేరుకు బంధించి దాని కొసన ఉన్న బంతి మాత్రము పైకి పెట్టి దానికి పసుపు, కుంకుమ పూసి, అక్కడ రెండు నిమ్మకాయలు కోసి వేసినాడు. దాని తర్వాత గుంతలో ఒక కోడి గుడ్డును, మూడో గుంతలో ఒక కొబ్బరి కాయను, ఆ తర్వాత ఒక నిమ్మకాయను ... .... ఇలా ప్రతి గుంతలోనూ ఒక వస్తువును ఉంచి వాటిని మంత్రంతో కట్టడి చేశాడు. కట్టడి అంటే వాటి దగ్గరకి ఎవరైనా వస్తే రక్తం కక్కుకుని పడిపోతారు, లేదా ఇంకో పెద్ద ఉపద్రవం ముంచు కొస్తుంది. ఇదంతా చేసి, మంత్ర గాడిని మోడి ఎత్తమని సవాలు చేశాడు.

మంత్ర గాడు పాముల బుర్ర వూదుతూ పాములాగా మెలికలు తిరుగుతూ వింత విన్యాసాలు చేస్తూ మొదటి గుంత వద్దకు వచ్చి దాని చుట్టు తిరిగి అందులోని వస్తువును తీయడానికి ప్రయత్నించి క్రింద పడిపోయాడు. ఒళ్లంతా దురద పెట్టి నట్లు ఒళ్ళంతా గోక్కుంటున్నాడు. తన శిష్యుడు వచ్చి ఏదో మంత్రించిన పొడిని చల్లుతాడు. అంతట తన బాధలను పోగొట్టుకొని తిరిగి పాములబుర్ర ఊదుతూ.... మొదటి గుంతలో నున్న వస్తువును అతి కష్టంగా తీసి వేశాడు. ఆ తర్వాత రెండో గుంత.... అందులో కోడి గ్రుడ్డు ఉంది. ఆ గుంత చుట్టూ పాముల బుర్ర ఊదుతూ అనేక విన్యాసాలు చేసి గుడ్డును తీయడానికి ప్రయత్నించగా ఆ గుడ్డు పిల్లగా మారి ఎగిరి పోతుంది. దానివెంబడి పడి పట్టుకొస్తాడు. మరో గుంత వద్దకు రాగానే దాని చుట్టూ మంటలు వ్వాపించాయి. దాన్ని అర్ప బోతే ఎంతకూ ఆరదు. మరో గుంతలోనున్న వస్తువును తీయబోతే అది పామై అతని చేయిని చుట్టుకుంటుంది. మంత్రంతో దానిని కట్టడి చేసి సంచిలో వేసి కట్టేస్తాడు. మరో గుంతలో చేయి పెట్టగానే అనేక తేళ్ళు బయటకు వస్తాయి. వాటి నన్నిటిని తన మంత్ర విద్యతో అచేతనం చేసి మరో సంచిలో పడేస్తాడు. ఇంతలో ఎవరో వాతలు పెట్టినట్టు వళ్ళంతా వాతలు తేలుతాయి. రక్తం కక్కుకుని నేలమీద పడి ఇక వీడి పని ఇంతే అనేంతగా విలవిల్లాడి పోతాడు మంత్ర విద్యల ప్రభావంతో. అంతలో అతని శిష్యుడు వచ్చి ఏవో మంత్రాల వేసి రక్షిస్తాడు. మరలా పాముల బుర్ర పట్టుకొని ఊదుతూ తిరుగుతాడు. ఇలా అన్ని గుంతల వద్దా అనేక పడరాని పాట్లు పడి, ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అవతలి వ్వక్తి మంత్రాలను చిత్తు చేస్తూ ఏడో గుంత వద్దకు వచ్చాడు. పసుపు, కుంకుమ పూసిన ఆ బంతి ఎలాంటి వస్తువో అతనికి అర్థం కాలేదు. మారేపల్లి సిద్దయ్య మాత్రం ముగ్గు మధ్యలో కూర్చొని మంత్రాల వల్లిస్తూనే ఉన్నాడు. అతని మంత్రాలు ఫలించి ఎదుటి మంత్రగాడి మంత్రాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి., ఈ గుంతల్లో పెట్టే వస్తువులు ఒకే విధంగా ఉండవు.. ఒక్కో మంత్రగాడు ఒక్కోవిధంగా వస్తువులను ఏర్పాటు చేస్తాడు. కప్ప, పాము, పావురము, కాకి, తొండ వంటి ప్రాణులు, కొబ్బరికాయ, నిమ్మకాయ, మరెన్నో వింత వస్తువులు ఉంటాయి.

ఎంత ప్రయత్నించినా ఆ బంతి లాంటి పదార్థము బయటకు రాలేదు. ఎన్నిమంత్రాలు వేసినా ఫలించ లేదు. చివరకు ఆ మంత్ర గాడు తన ఓటమిని అంగీకరించాడు. ప్రేక్షకులనుండి తలా కొంత ధనం బహుమానంగా ఇస్తారు ఇద్దరి మంత్ర గాళ్ళకి. ఆ విధంగా మోడి ముగుస్తుంది.

గారడీ విద్య[మార్చు]

మోడి చూడ్డానికి అతి భయంకరం గానూ, జుగుప్సాకరం గాను, ఒక్కోసారి అసహ్యంగానూ ఉంటుది. కనుక చిన్న పిల్లలను, స్త్రీలను మోడిని చూడడానికి అనుమతించరు. (ఈ మోడి లోని అసలు రహస్యం ఆ తర్వాత చాలకాలానికి తెలిసింది. అదేమంటే ...... ఆ మంత్ర గాళ్ళిద్దరూ ముందుగానే ఒక రహస్య ఒప్పందానికి వచ్చి ఈ మోడి ప్రక్రియను మొదలు పెడతారు అని. అక్కడ జరిగిన ఘోరాలు, ప్రమాదాలు మొదలగునవి కేవలం గారడి విద్యలనీ, అక్కడ బయట పడిన పాములు, తేళ్ళు ముందుగా తాము తెచ్చుకున్నవనీ తెలిసింది.) దీనిని చిత్తూరు జిల్లా, చిత్తూరు జిల్లా సరిహద్దు లైన తమిళ నాడులో ఎక్కువ ప్రచారంలో వుండేది. దీనిని మోళి అని కూడా అంటారు. కానీ ఇది ఎక్కువగా మోడీ గానే ప్రసిద్ధి (ఉదాహరణ: మిక్కిలి నేని రాధ కృష్ణ మూర్తి గారి తెలుగు వారి జానపద కళా రూపాలు: అనే గ్రంథంలో కూడా మోడి/ మోళి అనే రెండు పదాలు కూడా ఉపయోగించారు. )

మూలాలు[మార్చు]

  • తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మోడి&oldid=3494096" నుండి వెలికితీశారు