రాజ్ నారాయణ్
1917లో వారణాసి సమీపంలో జన్మించిన రాజ్ నారాయణ సోషలిస్టు పార్టీకి చెందిన నేత. ప్రముఖ సోషలిస్ట్ నాయకుడైన రాం మనోహర్ లోహియాకు ఇతడు అత్యంత సన్నిహితుడు. 1952లో ఉత్తర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. ఉత్తర ప్రదేశ్ శాసనసభలో తొలి ప్రతిపక్షనేత కూడా రాజ్ నారాయణే. రెండో పర్యాయం కూడా ఎన్నికై 1962 వరకు శాసనసభ్యుడిగా కొనసాగినాడు. ఆ తరువాత 1966 నుండీ 1972 వరకు మరియు 1974 నుండి 1976 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినాడు.
1971లో ఇందిరా గాంధీ పై ఉత్తర ప్రదేశ్ లోని రాయ్బరేలీ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయాడు. ఆ తరువాత ఆ ఎన్నికలలో ఇందిర ప్రభుత్వం అధికార యంత్రంగాన్ని ఉపయోగించిందని అలహాబాదు హైకోర్టులో కేసువేసి గెలిచాడు. ఈ కేసుపై అలహాబాదు హైకోర్టు ఇందిర ఎన్నిక చెల్లనేరదని 1975, జూన్ 12న తీర్పు ఇవ్వడం, అప్పటికే దేశంలో నెలకొని ఉన్న రాజకీయ వాతావరణం వల్ల 1975లో ఇందిర ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. సోషలిస్టు పార్టీ మరో ప్రధాన రాజకీయ పక్షాలు (భారతీయ జనసంఘ్, భారతీయ లోక్దళ్ మరియు కాంగ్రెస్-ఓ) కలిసి జనతా పార్టీని స్థాపించడంతో అత్యవసర పరిస్థితి అనంతరం 1977 లోక్సభ ఎన్నికలలో రాజ్నారాయణ్ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేశాడు. ఆ ఎన్నికలలో ఇందిర సొంతనియోజకవర్గం రాయ్బరేలీలోనే ఇందిరా గాంధీని ఓడించి రాజ్ నారాయణ్ సంచలనం సృష్టించాడు. 1977లో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంలో రాజ్ నారాయణ్ ఆరోగ్యశాఖ మంత్రిపదవికి కూడా పొందినాడు.
పోరాటయోధుడైన రాజ్ నారాయణ్ తన జీవితకాలంలో దాదాపు 80 సార్లు జైజు శిక్షను అననుభవించాడు. 69 సంవత్సరాల తన జీవితంలో 17 సంవత్సరాలు జైలులోనే మగ్గినాడు. 1986, డిసెంబర్ 31న రాత్రి గం.11.55 ని.లకు ఢిల్లీ లోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో మరణించాడు.