వీధి నాటకం

వికీపీడియా నుండి
(వీధి నాటకాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దామల చెరువు గ్రామంలో మహాభారత నాటకాల సందర్భంగా హరికథ చెప్పే హరికథ కళాకారిణి

వీధి నాటకం అనునది బహిరంగ ప్రదేశాలలో ప్రేక్షకుల నుండి ప్రత్యేక చెల్లింపు లేకుండా కళాకారులు చేసే రంగస్థల ప్రదర్శన. ఈ ప్రదర్శనా ప్రాంతాలు షాపింగ్ కేంద్రాలు, కారుపార్కులు, వినోద కేంద్రాలు, కళాశాల లేదా విశ్వవిద్యాలయ క్యాంపస్ లు, వీధిలో బహిరంగ ప్రదేశాలు ఏవైనా కావచ్చు. ఈ ప్రదర్శనకారులు ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఉన్న జనసమూహం గల ప్రాంతాలలో ప్రదర్శనలిస్తుంటారు. వీధినాటకాలలో ప్రదర్శించే కళాకారులు ఏదైనా రంగస్థల సంస్థలకు చెందినవారు కానీ, లేదా వారి ప్రదర్శనలను పలువురికి చూపాలనే ఔత్సాహిక కళాకారులు గానీ ఉంటారు. పల్లెల్లో ప్రజలు వినోదార్ధం వీధి నాటకాలు వేసే వారు. ముఖ్యంగా భారతంలో ప్రధాన ఘట్టాలను ఆడే వారు. వేష ధారణతో, పాటలతో, హావ భావాలతో సాగే ఇటువంటి వీధి నాటకాలు ప్రజలనెంతో అలరించేవి. నాటక ప్రక్రియల్లో వీధి నాటకం ఒకటి.[1]

పల్లెవాసులే నటులు[మార్చు]

నాటకం లోని స్త్రీ పాతలను కూడా మగ వారే వేసే వారు. పల్లెల్లోని కొంత మంది ఔత్సాహికులు కలిసి ఒక గురువును తీసుకొని వచ్చి అతని ద్వారా నాటకాన్ని నేర్చుకునేవారు. సుమారు ఒక నెల పాటు నేర్చుకునే వారు. దీన్ని ఒద్దిక (రెహార్సిల్) అనేవారు. ముఖానికి రంగులు లేకుండా, వేషం కట్టకుండా పాటలను, పద్యాలను బట్టీ పట్టేవారు. ఇది సాధారణంగా ఆవూరి గుడిలోనో, భజన మందిరంలోనో జరిగేది. దానిని చూడడానికి కూడా ఆవూరి ప్రజలు వచ్చేవారు. పూర్తిగా నేర్చుకున్న తర్వాత అసలు నాటకాన్ని మొఖానికి రంగులు వేసుకొని, వేషాలు కట్టి ఒక వేదికమీద ఆడేవారు. దాన్ని చూడడానికి చుట్టు ప్రక్కల పల్లెల నుండి ఎక్కువగా జనం వచ్చేవారు. వారి వేషధారణకు కావలసిన ఆభరణాలు, ఆయుధాలు, బట్టలు, తెరలు వంటి వస్తువులను అద్దెకిచ్చే కొన్ని అంగళ్ళూ చిన్న పట్టణాలలో ఉండేవి.రాను రాను పల్లెవాసులు ముఖాలకు రంగులేసుకునే కాలం పోయింది. ఆ నాటకాలలో పద్యాలు పాడడానికే ఎక్కువ ప్రాముక్యత వుండేది. ఒక పద్యానికి సుమారు పది నిముషాలు సమయం రాగం తీసేవారు. దాన్ని ప్రజలు కూడా మెచ్చుకునేవారు. ఇలాంటి నాటకాలు రాత్రులలో సుమారు పది గంటలకు మొదలై తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో ముగిసేయి. అంత సేపూ ప్రజలు ఓపిగ్గా కూర్చుని చూసేవారు.[2][3]

నాటకం తీరు[మార్చు]

ఒక వేషధారి వేదికమీదికి రాగానే.... తన పాత్ర పేరు చెప్పుకుంటూ పాట పాడుతూ ఆ వేదికపై గుండ్రంగా తిరుగు తాడు. ఉదాహరణకు దుర్యోధనుని పాత్ర ధారి వేదికమీదికి తన సహోధరులతో వేదిక మీదికి రాగానే రాజు వెడలె రవి తేజములలరగ.... కుడి ఎడమల్ డాల్ కత్తులు మెరయగ..... అని పాడుతూ వస్తాడు. దాంతో ఆ వచ్చినది దుర్యోధనుడని ప్రేక్షకులకు తెలుస్తుంది. ఆ తర్వాత అతను ధుర్వోధన.....[4] అంటూ చేతులు వూపుతూ తిరుగుతుంటే వెంట నున్న సోదరులు.. రాజే... రాజే.... రాజే... అంటూ సుమారు పది నిముషాలు తిరుగుతారు. ఆతర్వాత దుర్వోధనుడు సింహాసనం పై ఆసీనుడై.. పాట రూపంలో..... సుఖమా మన రాజ్యామెల్లను జయమా.. అంటూ రాగాలు తీస్తూ పాడితే... దానికి వంతగా మిగతావారు సామూహికంగా వంత పాడతారు. ఈ వంత పాటలను వేదిక మీద వున్న వేష ధారులే కాక.... తెర వెనుక వున్న ఇతర వేష ధారులు కూడ కలిసి పాడుతారు. అసలు కథకన్నా ఇటువంటి వాటికే ఎక్కువ సమయం అయి పోతుంది. భీముడు- దుర్వోధను వాగ్వివాదము జరిగే సందర్భంలో..... వారి సంభాషణ చాల మొరటుగాను, అపహాస్యంగాను, వ్వక్తిగత నిందారోపణలు చేసుకున్నట్టు వుంటుంది. భాష కూడ అదే తీరులో వుంటుండి. పల్లెల్లో నిజంగా ఏదైన కొట్లాట జరిగితే ఆసందర్భంలో జరిగే మాటల లాంటివె... ఆ భాషనే సమయా సందర్భంగా వాడుతారు. కాని ప్రేక్షకులు దానిని కూడ స్వాగతిస్తారు. ఈ మధ్యలో ఏదేని మంచి పద్యం పొడుగ్గా రాగం తీస్తే.... దాన్ని మళ్ళీ పాడమని ఒన్ సు మోర్ అని అరుస్తారు. విధిగా ఆ పద్యాన్ని తిరిగి వారు పాడేవారు. సందర్బాను సారంగా మధ్య మధ్యలో ఒక మోస్తరు భూతు మాటలు కూడ పేలేవి. దానికి ప్రేక్షకులు కరతాళ ద్వనులతో ఈలలతో స్వాగతించేవారు. యుద్ధ సమయంలో ఎవరు ఎక్కువగా గంతులేస్తే వారు అంత బాగా నటించినట్లు లెక్క. ఆలా ఆవేశంతో రాత్రంతా గంతులేసి వళ్ళు హూనం చేసుకునేవారు నటులు. ఆవిధంగా ఆనాటి వీధి నాటకాలు సాగేవి...... పల్లెవాసులు కూడ బాగా ఆదరించేవారు.

మహాభారత నాటకాల సందర్భంలో ధుర్యోధనుని వద ఘట్టం ప్రారంబానికి ముందుకు వస్తున్న భీమ, ధుర్యోధనుల వేష ధారులు. దామల చెరువులో తీసిన చిత్రం

వృత్తిరీత్యా నాటకాలాడేవారు[మార్చు]

పల్లె ప్రజలే నాటకాలను నేర్చి ఆడే కాలం పోయి..... వృత్తి రీత్యా నాటకాలాడే వారిని పిలిపించి పల్లెల్లో నాటకాలాడించే కాలం వచ్చింది. వారిని పిలిపించి నాటకాలాడించే వారు. వారి వద్ద వేష వస్త్రాలు, ఆయుదాలు, ఆభరణాలు, తెరలు, కిరీటాలు వంటివే కాక హార్మోనియం, తబలా వంటి వాయిద్య పరికరాలు కూడ వుండేవి. వీరు వృత్తి రీత్యా నాటకాలాడే వారు కనుక పాత్రకు తగిన దేహదారుడ్యం, హావ బావాలు బాగా వుండేవి. పైగా పద్యాలు, పాటలు రాగయుక్తంగా పాడేవారు. వేష ధారణ కూడ చాల బాగా వుండేది. వారు వృత్తిరీత్యా నాటకాలు వేసే వారు గనుక ప్రజలు మెచ్చక పోతే.... వారిని మరెవరు పిలువరు. కనుక జాగ్రత్తగా నటించేవారు. అలా మంచి పేరున్న బృందాలకు ఒక పల్లెలో నాటకం పూర్తవగానే మరొక పల్లె వారు తమ పల్లెలోకూడ నాటకం అడమని ఒప్పందం కుదుర్చు కునేవారు. కానీ వీరు కూడ సందర్బాను సారంగా పిచ్చి గంతు లేయడం, బూతుమాటలు విసరడం, వ్వంగ్య సంభాషణ వంటివి పూర్తిగా పోలేదు. పాత వాసనలు అలా ఇంకా కొనసాగేవి. ప్రేక్షకులు వాటిని స్వాగస్తున్నారు.

మహా భారత నాటకాలు[మార్చు]

పల్లె వాసులు ముఖాలకు రంగులేసుకుని వీధుల్లో నాటకాలాడే రోజులలోనే..... ప్రధానమైన పల్లెల్లో అక్కడక్కడా పాండవుల ఆలయాలుండేవి. అక్కడ ప్రతి సంవత్సరం మహాభారతం పేరుతో... అందులోని 18 ఘట్టాలను 18 రోజుల పాటు రాత్రులందు ఆడేవారు. పగటి పూట ఆ రోజు రాతికి ఆడబోయే ఘట్టాన్ని పరికథ రూపంలో చెప్పేవారు. పగలు కూడ ప్రజలు బాగా వచ్చేవారు. రాత్రి నాటకాలకైతే చుట్టు ప్రక్కల పల్లె ప్రజలు ఎద్దుల బండ్లమీద వచ్చేవారు. భారతం జరిగే ఈ ప్రాంతం అంతా చాల కోలాహలంగా వుండేది.[5] అదొక తిరుణాల లాగ వుండేది. చిన్న షాపులు, కాఫీ., టీ అంగళ్ళూ, పిల్లల బొమ్మలు అమ్మేవారు, రంగుల రాట్నం, కీలుగుర్రం, తోలుబొమ్మలాటలు, దొమ్మరాటలు, చక్రాలాట, చింత పిక్కలాటలు ఇలా అనేక హంగులతో ఆ ప్రాంతమంతా ఆ పద్దెనిమిది రోజులు చాల కోలాహలంగా వుండేది. కాలానుగుణంగా తర్వాతి కాలంలో విద్యుత్తు వచ్చినందున విద్యుత్తు దీపాలంకరణ కూడ వుండేది. దాంతో ఆ ప్రాంతమంతా చాల చాల వుత్సాహంగా కనబడేది. ఈ నాటకాలాడడానికి వృత్తి రీత్యా ఆడేవారినే ధనమిచ్చి రప్పించేవారు. వారితో బాటు పల్లెల్లోని ఔత్చాహికులు వేషాలు వేయడానికి చాల ఆరాట పడే వారు. ముఖానికి రంగు లేసుకోవాలంటే వారికెంత ఇష్టమో చెప్పలేము. అవిదంగా చిన్న చిన్న వేషాలు పల్లె వాసులు కూడ వేసే వారు. ప్రేక్షకులు కూడ వారిని ఆవిధంగానె ఆదరించే వారు. ఆ విధంగా మహా భారత నాటకాలు పద్దెనిమిది రోజుల పాటు జరిగేవి. ఇన్ని రోజుల పాటు నటీనటులు గాని, నాటక సమాజం గానీ ఎంతో నిష్టగా , ఒక యజ్ఞం లాగ పూర్తి చేసే వారు. చివరగా .... కొసరుగా మహాభారతానికి సంబంధంలేని ఒక్క నాటకాన్ని చివరి రోజున ఆడేవారు. దాంతో ఈ మహా యజ్ఞం పూర్తయ్యేది.[6][7]

మహాభారతంలో 3 ప్రధాన ఘట్టాలు[మార్చు]

ఎక్కువగా మహాభారతం లోని ఘట్టాలను, వీధి నాటకాలుగా వేసేవారు. వీరు కాకుండా నాటకాలు వేయడమే వృత్తి గా వున్న బృందాలు అక్కడక్కడా వుండేవి. వారిని పిలిపించి తమకు కావలసిన నాటకాన్నీ వేయించి ఆనందించేవారు. ప్రస్తుత కాలంలో ఈ వీధినాటకాలు చాల వరకు కనుమరుగైనాయి. పల్లెవాసులు ఇప్పుడు మొఖాలకు రంగులేసుకోవడం లేదు. కాని వృత్తిగా నాటకాలేసే వారిని పిలిపించి మహాభారత ఘట్టాల నాటకాలు సుమారు ఇరవై రోజుల పాటు ఆడిస్తున్నారు. ఇందుకొరకు కొన్ని గ్రామాలకు కలిపి అక్కడ పంచపాండవుల విగ్రహాలున్న ఆలయాలున్నవి. అక్కడ ఈ భారతం జరుగుతుంది. ఇది ఒక పెద్ద జాతర లాగ రాత్రి పగలు కూడ జరుగుతుంది. పగలంతా మహాభారత ఘట్టాలను హరికథ రూపంలో కథ చెప్పితే అదే ఘట్టాన్ని ఆ రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. అదీ కేవలం చిత్తూరు జిల్లాలో ఈ నాటకాలు వేస్తున్నారు. అది కూడా పేరు మోసిన నాటక కంపెని వారి చేత వేయిస్తున్నారు. పల్లె వాసులు మాత్రం మొఖానికి రంగు లేసుకోవడం లేదు.

బక్కాసుర వధ[మార్చు]

పగటి పూట జరిగే కార్యక్రమం: బక్కాసుర వధ నాడు., భీముని వేష దారి, అలంక రించిన ఒక ఎద్దుల బండి పై కూర్చొని ఆ చుట్టు పక్కల నున్న పల్లెల్లో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తిరుగు తాడు. పల్లెల్లోని ప్రతి ఇంటి వారు ఇందు కొరకు తయారు చేసిన ఫలహారాలను ఆ బండిలొ వేస్తారు. అలా తిరిగి సాయంకాలానికి ఆ బండి భారతం మిట్ట కు చేరు కుంటుంది. బండి పైనున్న భీమ వెషధారి దారి పొడుగునా బండి లోని ఆహార పదార్థాలను తింటూ, లేదా తిన్నట్టు నటిస్తూ వుంటాడు. చివరకు ఆ బండి మైదానానికి చేరిన తర్వాత అందులోని అహార పదార్థాలను అక్కడున్న వారందరికి పంచు తారు. ఆ రాత్రికి బక్కాసుర వధ నాటకం ప్రదర్సిత మౌతుంది. ఈ మహాభారత నాటకాలు ఈ రోజుల్లోను జరుగుతున్నాయి.[8]

ఆర్జునుడు తపస్సు మాను ఎక్కుట[మార్చు]

ఇది పగటి పూట జరిగే మరో ఘట్టం: ఒక పొడవైన మానును భారత మిట్టన పాతి వుంటారు. దాన్ని ఎక్కడానికి కర్ర మెట్లను ఏర్పాటు చేసి బాగా అలంక రించి వుంటారు. అర్జున వేష దారి తన వెంట పెద్ద జోలెలను మెట్లకు తగిలించు కొని[9], పద్యాలు పాటలు పాడుతూ మెట్లను ఎక్కుతుంటాడు. ఆ తపస్సు మాను చుట్టు పిల్లలు కలగని తల్లులు తడి బట్టలతో సాష్టాం ప్రమాణ ముద్రలో 'వరానికి' వడి వుంటారు. వారు దోసిళ్లను పట్టుకొని వుంటారు. అర్జునుడు మెట్లు ఎక్కుతూ పాటలు పాడుతూ తన జోలిలో వుండే, వీభూతి పండ్లను, నిమ్మకాయలను, అరటి పండ్లను పూలను విసురు తుంటాడు. ఆ విసిరనవి క్రింద 'వరానికి' పడివున్న వారి చేతిలో పడితే వారికోరిక నెరవేరి నట్లే. చుట్టు అనేక మంది ప్రేక్షకులు కూడా వుంటారు. వారు కూడా అర్జునుడు విసిరే ప్రసాదం కొరకు ఎదురు చూస్తుంటారు. అర్జునుడు చివరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వేదిక పై ఆసీనుడై విల్లంబులు చేత బూని కొన్ని పద్యాలు పాడతాడు. ఈ వుత్సవానికి కూడా ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఈ కార్యక్రమం సుమారు రెండు మూడు గంటలు సాగు తుంది[10] [11]

దుర్యోధనుని వధ[మార్చు]

పగటి పూట జరిగే మహాభారత ఘట్టాలలో చివరిది.... అత్యంత ప్రజాదరణ కలిగినది ధుర్యోధన వధ: దీనికొరకు మైదాన మధ్యలో మట్టితో ధుర్యోధనుడు వెల్లకిలా పడుకొని వున్నట్లున్న అతి బారి విగ్రహాన్ని మట్టితో తయారు చేసి వుంచు తారు. దానికి తొడ భాగంలో ఎర్రని కుంకుమ కలిపిన కుండను గాని గుమ్మడి కాయను గాని పాతి వుంటారు. ధుర్యోధన పాత్ర దారి గదను చేత బూని ఆ విగ్రహంపై తిరుగుతూ పాట పాడు తుంటాడు. భీమ వేష దారి ఆ విగ్రహం చుట్టు తిరుగుతూ పాటలు పద్యాలు పాడు తుంటాడు. భీముడు..... ధుర్యోధనుని విగ్రహం పైకి ఎక్కరాదు. ధుర్యోధనుడు అప్పు డప్పుడు క్రిందికి దిగు తాడు. అప్పుడు ఇద్దరు కొంత సేపు యుద్ధం చేస్తారు. ఇలా సుమారు రెండు మూడు గంటల పాటు ప్రేక్షకులను అలరించి చివరి ఘట్టా నికొస్తారు. అప్పుడు భీమ వేష దారి ధుర్యోధనుని విగ్రహానికి తొడలో దాచిన గుమ్మడి కాయను పెద్ద కర్రతో పగల కొడతాడు. దుర్యోధన వేషదారి అ విగ్రహంపై పడి పోతాడు. నాటకం సమాప్తం. అంత వరకు ఏకాగ్రతో నాటకాన్ని వీక్షిస్తున్న వందలాది ప్రజలు ఒక్కసారిగా ధుర్యోధనుని విగ్రహం మీద పడి రక్తంతో తడిసిన ఆ మట్టిని, అందంగా అలంక రించిన తల భాగంలోని రంగు మట్టిని తలా కొంత పీక్కొని వెళ్లి పోతారు. ఆ మట్టిని తమ గాదెలలో వేస్తే తమ గాదె ఎన్నటికి తరగదని వారి నమ్మకం. అలాగే ఆ మట్టిని తమ పొలాల్లో చల్లితే తమ పంటలు సంవృద్దిగా పండ తాయని ప్రజల నమ్మకం.'[12][13]

యివికూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

  1. మిక్కిలినేని, రాధాకృష్ణమూర్తి (1992). "Wikisource link to వీథి నలంకరించిన వీథి నాటకం". Wikisource link to తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. వికీసోర్స్. 
  2. "Indian Street Theatre". IndiaNetzone.com. Retrieved 2023-04-17.
  3. "Explained: Why Street Theatre Is Still Relevant And Why It Should Be Encouraged". IndiaTimes (in Indian English). 2021-11-17. Retrieved 2023-04-17.
  4. IPAS (2008). "Indian street drama" (in అమెరికన్ ఇంగ్లీష్). {{cite journal}}: Cite journal requires |journal= (help)
  5. Valente, T. W., Poppe, P. R., Alva, M. E., Vera de BricenÄo, R., & Cases, D. (1995). Street theater as a tool to reduce family planning misinformation. International Quarterly of Community Health Education, 15, 279±290.
  6. Robin Williams began his career on the streets of San Francisco as a street performer: https://movies.yahoo.com/movie/contributor/1800013042/bio
  7. Archive Video
  8. Coult, Tony; Kershaw, Baz, eds. (1983). Engineers of the Imagination: The Welfare State Handbook. Methuen. ISBN 0-413-52800-6.
  9. Valente, T. W., Poppe, P. R., Alva, M. E., Vera de BricenÄo, R., & Cases, D. (1995). Street theater as a tool to reduce family planning misinformation. International Quarterly of Community Health Education, 15, 279±290.
  10. Robin Williams began his career on the streets of San Francisco as a street performer: https://movies.yahoo.com/movie/contributor/1800013042/bio
  11. International list of performers
  12. Archive Video
  13. Doyle, Michael William (2001). Imagine Nation: The American Counterculture of the '60s and '70s. Routeledge. ISBN 0-415-93040-5.

యితర లింకులు[మార్చు]