వెంగమాంబ పేరంటాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

19వ శతాబ్దపు తెలుగు కవయిత్రి వెంగమాంబ కొరకు చూడండి తరిగొండ వెంకమాంబ

నర్రవాడ దేవాలయం వద్ద వెంగమాంబ లైటింగ్

పతి భక్తికి ప్రతిరూపంగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అంటరానితనం నిర్మూలన కర్తగా మెట్ట ప్రాంత ఆరాధ్య దేవతగా విరాజిల్లుతున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు.నెల్లూరుజిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో ప్రశాంత వాతావరణంలో వెలసినది. పెమ్మసాని కమ్మరాజుల కాలం నాటి ఆమె విశిష్టతను, భక్తులు నేటికీ మరచిపోకుండా, శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలను, ఇక్కడ ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించుచున్నారు. బ్రహ్మోత్సవాలు ఏటా జ్యేష్ఠమాసం పౌర్ణమి గడిచిన తదుపరి ఆదివారం నుండి గురువారం వరకు ఐదురోజులపాటు కన్నులపండువగా నిర్వహించెదరు.

కార్యక్రమాల వివరాలు[మార్చు]

  1. వెంగమాంబ పచ్చవ కమ్మవారి వంశంలో జనించిన వీరనారి. ఆదివారం నాడు నిలుపు కార్యక్రమంలో, వడ్డిపాళెంలోని వెంగమాంబ పుట్టినిల్లు అయిన "పచ్చవ" వారి నివాసంలో, ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా అక్కడి దేవాలయంలో, వెంగమాంబ పేరంటాలు ఆడబడుచులు, వంశస్థులు, భక్తులు, కుటుంబసమేతంగా పసుపుదంచే కార్యక్రమంలో పాల్గొంటారు. అంతకుముందు దేవర ఇంటిలో ఏర్పాటుచేసిన, శ్రీ రేణుకా ఎల్లమ్మ శ్రీ వెంగమాంబకు మహిళలు ప్రత్యేకపూజలు చేసెదరు. పసుపు దంచిన అనంతరం, పసుపు, కుంకుమలను ఊరేగింపుగా వెంగమాంబ పేరంటాలను దేవస్థానం వరకు తీసుకొనివచ్చి, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఆ రోజున సంతానం లేని మహిళలు అమ్మవారి ముందు వరపడెదరు.
  2. సోమవారం నాడు, గ్రామోత్సవం :- వడ్డిపళెంలో వెంగమాంబ పేరంటాలు పుట్టినింటినుండి ప్రారంభమైన గ్రామోత్సవం, స్నేహితురాలు తుమ్మల పెదవెంగమ్మ, అత్తమామల ఇళ్ళమీదుగా, నర్రవాడ, గుదివారిపాలెం, ఉలవావారిపాలెం మీదుగా దేవస్థానానికి చేరుకొనును. గ్రామోత్సవంలో భాగంగా వెంగమాంబ దంపతులను ప్రత్యేకంగా అలంకరించి వాహనంలో ఊరేగించెదరు. శ్రీ వెంగమాంబ పేరంటాలు భర్త గురవయ్యనాయుడుతోపాటు, ఉత్సవమూర్తిగా రథంపై కూర్చొని భక్తులకు దర్శనమిచ్చెదరు. దారి వెంబడి ప్రతి ఇంటివద్ద, వెంగమాంబ అమ్మవారికి భక్తులు పూజలు చేసెదరు. ప్రతి ఇంటివద్ద భక్తులు, కాయా కర్పూరం సమర్పించి, ఆపద మొక్కులతల్లీ, మా కోర్కెలు తీర్చు తల్లీ, అంటూ మొక్కుకొనెదరు. బైనేడీల వాయిద్యాల మధ్య గ్రామోత్సవం వైభవంగా నిర్వహించెదరు. సంతానంలేని మహిళలు, అమ్మవారి ముందు వరపడితే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాడవిశ్వాసం. ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం, వందలాది మండి మహిళలు అమ్మవారివద్ద వరపడటం ఆనవాయితీగా వస్తున్నది. మహిళలు తలస్నానాలు చేసి తడిబట్టలతో వెంగమాంబను వేడుకొనెదరు. ఆదివారం రాత్రి నిలుపు కార్యక్రమంలో పాల్గొని సంతానం కోసం వరపడిన మహిళలు, సోమవారం ఉపవాసం ఉండి, మళ్ళీ అమ్మవారి వద్ద వరపడెదరు.
  3. మంగళవారం నాడు గ్రామోత్సవం వైభవంగా నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంగమాంబ పేరంటాలు, ప్రత్యేక వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చెదరు. గ్రామవీధులలో ఊరేగిన అమ్మవారికి, భక్తులు, కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకొనెదరు.
  4. బుధవారం నాడు పగలు కళ్యాణోత్సవం అత్యంత కన్నులపండువగా నిర్వహించెదరు. వేదపండితులు అట్టహాసంగా కళ్యాణం నిర్వహించెదరు. ఈ సందర్భంగా, పసుపు, కుంకుమల ఉత్సవం గూడా నిర్వహించెదరు. ఈ కళ్యాణానికి దేవాదాయశాఖ వారు విచ్చేసి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించెదరు. ఈ కళ్యాణం తిలకించడానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చెదరు. రాత్రికి ప్రధానోత్సవం (హంసవాహనసేవ) నిర్వహించెదరు. కళ్యాణోత్సవం జరిగిన రోజు రాత్రి వెంగమాంబ దంపతులకు ప్రధానోత్సవం జరిపించటం ఆనవాయితీగా వచ్చుచున్నది. ఈ సందర్భంగా ప్రధానోత్సవంలో, వెంగమాంబ దంపతులు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చెదరు. ప్రధానోత్సవం ఊరేగింపు వెంగమాంబ పుట్టినిల్లు అయిన వడ్డిపాళెం వద్ద ప్రారంభమై నర్రవాడ, గుదివారిపాళెం, ఉలవవారిపాళెం, గ్రామాలలో కొనసాగుతుంది. అడుగడుగునా భక్తులు, అభిషేకాలతో, ప్రత్యేకపూజలతో ఉత్సవం కమనీయంగా సాగుతుంది. ప్రతి ఇంటివద్ద భక్తులు ధూప, దీప, నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేయుదురు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు.
  5. గురువారం నాడు బండ్ల పొంగళ్ళు, ఎడ్ల బండ లాగుడు పందెములు. ఈ పందెములను, 3, 4 లక్షల మంది వీక్షించెదరు.

ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు ఏడు లక్షల మంది భక్తులు విచ్చేస్తారు. జీవనోపాధికోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలస వెళ్ళిన ఈ ప్రాంతాలవారు, ఈ తిరునాళ్ళకు తరలివచ్చి, బందుమిత్రులతో ఆనందోత్సాహాలతో గడిపెదరు. ఆర్.టి.సి. వారు ఈ ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు నడిపెదరు. ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు, వాకాడు, కావలి, సూళ్ళూరుపేట, నాయుడుపేట తదితర డిపోలనుండి, ఈ ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసెదరు. ఇవేగాక, కడప, ప్రకాశం జిల్లలనుండి గూడా, పెద్ద సంఖ్యలో బస్సులు నడిపెదరు. దేవస్థానం వారు భక్తులకొరకు విస్తృతంగా సౌకర్యాలు కలుగజేయుదురు. పోలీసు శాఖవారు శాంతిభద్రతలకొరకు ప్రత్యేక బందోబస్తు నిర్వహించెదరు. [ఈనాడు నెల్లూరు ; 2014, జూన్-14 ; 5వ పేజీ]

16 రోజుల ఉత్సవం :- అమ్మవారి కళ్యాణం జరిగిన 16 రోజుల తరువాత వచ్చే మొదటి గురువారం నాడు, 16 రోజుల ఉత్సవం జరపటం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పాటు, విశేష పూజలు నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల నుండి తరలివచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం మరియూ మంచినీటి సౌకర్యం ఏర్పాటుచేసెదరు. [ఈనాడు నెల్లూరు ; 2014, జూలై - 1 ; 3వ పేజీ]

నెల పొంగళ్ళు :- ప్రతి సంవత్సరం వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం, నెలరోజుల తరువాత వచ్చే మొదటి గురువారం నాడు, వెంగమాంబకు నెలపొంగళ్ళ ఉత్సవం జరపడం ఆనవాతిగా వచ్చుచున్నది. ఈ ఉత్సవాలకు నెల్లూరు జిల్లా గ్రామస్తులేగాక, చుట్టుప్రక్కల జిల్లాల నుండి గూడా భక్తులు భారీగా తరలివచ్చెదరు. [ఈనాడు నెల్లూరు ; 2014, జూలై - 15, 3వ పేజీ]