శ్రీనాథుడు
చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు రచియించితి మరుత్తరాట్చరిత్ర - బాల్యములోనే బృహత్కావ్యాన్ని రచించిన ప్రౌఢ కవి శ్రీనాధుడు. వీరి రచనలలో వీరి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. పాండిత్య గరిమతో అచంచల ఆత్మవిశ్వాసం మూర్తిభవించిన నిండైన విగ్రహం వారి రచనలు చదువుతూ ఉంటే గోచరిస్తుంది.
విషయ సూచిక |
[మార్చు] రాజాశ్రయం
శ్రీనాధుడు 15వ శతాబ్దమున జీవించినాడు. వీరు కొండవీటి ప్రభువు సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్ధాన కవి. విద్యాధికారి. ఈ కాలమందు ఎందరో కవిపండితులకు రాజాశ్రయం కల్పించినారు.
[మార్చు] ఘనత - బిరుదులు
డిండిమభట్టు అనే పండితుని వాగ్యుధ్ధంలో ఓడించి అతని కంచుఢక్కను పగుల గొట్టించినాడు. ఈతనికి కవిసార్వభౌముడ ను బిరుదము కలదు.
[మార్చు] రచనలు
ఇతను ఎన్నో కావ్యాలు రచించినాడు. వాటిలో కొన్ని: భీమ ఖండము, కాశీ ఖండము, మరుత్తరాట్చరిత్ర, శృంగార నైషధము మొదలగునవి. ఈయన వ్రాసిన చాటువులు ఆంధ్రదేశమంటా బహు ప్రశస్తి పొందినాయి.
- మరుత్తరాట్చరిత్ర
- శాలివాహన సప్తశతి
- శృంగార నైషధము
- భీమేశ్వర పురాణము
- ధనుంజయ విజయము
- కాశీ ఖండము
- హర విలాసము
- శివరాత్రి మాహాత్యము
- పండితారాధ్య చరిత్రము
- నందనందన చరిత్రము
- మానసోల్లాసము
- పల్నాటి వీరచరిత్రము
- క్రీడాభిరామము
- రామాయణము పాటలు
కాశీఖండమునందు చెప్పుకున్నట్టుగా
- చిన్నారి పొన్నారి చిఱుత కూఁకటినాఁడు
- రచియించితి మరుత్తరాట్చరిత్ర.
- నూనుగు మీసాల నూత్న యౌవనమున
- శాలివాహన సప్తశతి నుడివితి.
- సంతరించితి నిండు జవ్వనంబునయందు
- హర్షనైషధకావ్య మాంధ్రభాషఁ
- బ్రౌఢ నిర్భర వయఃపరిపాకమునఁ గొని
- యాడితి భీమనాయకుని మహిమ
- ప్రాయమింతకు మిగులఁ గైవ్రాలకుండఁ
- గాశికాఖండ మను మహాగ్రంథ మేను
- తెనుఁగు జేసెదఁ గర్ణాటదేశ కటక
- పద్మవనహేళి శ్రీనాథభట్టకవిని.
[మార్చు] శ్రీనాథుని జీవిత విశేషాలు తెలిపే కొన్ని పద్యాలు
దీనారటంకాల దీర్థమాడించితి
దక్క్షిణాధీశు ముత్యాలశాల,
పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య
నైషధగ్రంథ సందర్భమునకు,
పగులగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి
గౌడడిండిమభట్టు కంచుఢక్క,
చంద్రభూష క్రియాశక్తి రాయలయొద్ద
పాదుకొల్పితి సార్వభౌమ బిరుద,
మెటుల మెప్పించెదో నన్ను నింకమీద
రావు సింగ మహీపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సకలసద్గుణ నికురంబ! శారదాంబ!
కవిరాజుకంఠంబు కౌగిలించెనుగదా
పురవీధినెదురెండ బొగడదండ,
సార్వభౌముని భుజాస్కంధ మెక్కెనుగదా
నగరివాకిటనుండు నల్లగుండు,
ఆంధ్రనైషధకర్త యంఘ్రి యుగ్మంబున
దగలియుండెనుగదా నిగళయుగము,
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత
వియ్యమందెనుగదా వెదురుగొడియ,
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు?
కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి
రత్నాంబరంబు లే రాయడిచ్చు?
కైలాసగిరి బండె మైలారువిభుడేగె
దినవెచ్చ మేరాజు దీర్పగలడు?
రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు
కస్తూరి కేరాజు ప్రస్తుతింతు,
స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ
పాత్రాన్న మెవ్వని పంక్తి గలదు?
భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె
కలియుగంబున నిక నుండ కష్టమనుచు
దివిజకవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి.
[మార్చు] శ్రీనాథుని చాటువులు
శ్రీనాథమహాకవి చాటుపద్యాలకు ప్రసిద్ధి. ఆయన వ్రాసిన ఒకటి రెండు చాటువులనైనా చెప్పుకోకపోతే విషయానికి సమగ్రత చేకూరదు. మచ్చుకి దిగువ రెండుపద్యాలూ అవధరించండి.
కుల్లాయుంచితి, కోకసుట్టితి, మహాకూర్పాసమున్ బెట్టితిన్,
వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా
చల్లాయంబలి ద్రావితిన్, రుచులు దోసంబంచు పోనాడితిన్,
తల్లీ! కన్నడ రాజ్య లక్ష్మి! దయలేదా? నేను శ్రీనాథుడన్ .
కవితల్ సెప్పిన పాడనేర్చిన వృధాకష్టంబె, యీ భోగపుం
జవరాండ్రేగద భాగ్యశాలినులు, పుంస్త్వంబేటికే పోగాల్పనా ?
సవరంగాసొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టించుచో
యెవరేనిన్ మదిమెచ్చి ధనంబులిత్తురుగదా నీరేజపత్రేక్షణా!
నీలాలకా జాల ఫాల కస్తూరికా తిలకంబు నేమిట దిద్దువాడ నంగనాలింగనా నంగ సంగర ఘర్మ శీకరం బేమిట జిమ్మువాడ మత్తేభగామినీ వృత్తస్తనంబుల నెలవంక లేమిట నిల్పువాడ భామామణీ కచాభరణ శోభితమైన పాపట నేమిట బాపువాడ ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పరిచి కలికి చెంగల్వ రేకుల కాంతి దనరి … అహహ పోయె నా గోరు తన చేతి పోరు మాని
ఒకసారి శ్రీనాధ కవిసార్వభౌములు పల్నాటిసీమ కు వెళ్లారు. అక్కడి నీటి ఎద్దడి చూసి ఈ కంద పద్యాన్ని చాటువుగా చెప్పేరట -
సిరిగలవానికిజెల్లును
తరుణులు పదియారువేలుతగపెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశాగంగవిడువు పార్వతిచాలున్
[మార్చు] సమకాలీకులు
ఈయన పోతన కు సమకాలీనుడు. పోతనకు బంధువని, పోతన రచించిన శ్రీమదాంధ్రభాగవతాన్నిసర్వజ్ఞసింగభూపాలునికి అంకితమిప్పించడానికి ఒప్పింప చూసేడనే కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి కానీ చారిత్రాక ఆధారాలు లేని కారణంగా వాటి విశ్వసనీయత పై పలు సందేహాలు, వివాదాలు ఉన్నాయి.
[మార్చు] చరమాంకం
శ్రీనాధుని అంతిమ దినాలు బహు దుర్బరంగా గడిచాయి. కొండవీటి ప్రాభవంతో పాటు శ్రీనాధును ప్రభ మసకబారింది. ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టేయి. కృష్ణాతీరాన ఉన్న గ్రామాన్ని గుత్తకు తీసుకొని శిస్తు కట్టిన కారణంగా ఆయన భుజంపై ఊరిబయటనున్న శిలను ఉంచి ఊరంచా ఊరేగించేరని ఆయన చరమ పద్యంద్వారా తెలుస్తుంది.
[మార్చు] మూలాలు
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన శ్రీనాథ మహాకవి శృంగార నైషధం