సింగిరెడ్డి నారాయణరెడ్డి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| సి.నారాయణరెడ్డి | |
| జన్మ నామం | సింగిరెడ్డి నారాయణరెడ్డి |
|---|---|
| జననం | 1931,జూలై 29 |
| నివాసం | హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ |
| ఇతర పేర్లు | సినారె |
| వృత్తి | కవి, గేయరచయిత, & సాహితీవేత్త |
| పదవి | డాక్టర్ సి.నారాయణరెడ్డి |
సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988లో విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి
విషయ సూచిక |
బాల్యం, విద్యాభ్యాసం [మార్చు]
సి.నారాయణరెడ్డి 1931, జూలై 29 (అనగా ప్రజోత్పత్తి సంవత్సరం నిజ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు) న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేటలో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి.నారయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలోనీ హరికథలు, జానపదాలు,జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్ల లో మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు.తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు.విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో శ్రద్ధగా అనేక గ్రంథాలు చదివాడు.
ఉద్యోగం [మార్చు]
ఆరంభంలో సికింద్రాబాదు లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడుఉస్మానియా విశ్వవిద్యాలయము లో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందాడు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.
ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రిక లో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.
రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించాడు.
సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మళయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ , డెన్మార్క్,థాయ్ ల్యాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగా లో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనం లో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.
పురస్కారాలు [మార్చు]
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ
- కేంద్ర సాహిత్య అకాడెమీ
- భారతీయా భాషా పరిషత్
- రాజలక్ష్మీ పురస్కారం
- సోవియట్-నెహ్రూ పురస్కారం
- అసాన్ పురస్కారం
మొదలైనవి ఆయన్ను వరించాయి. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. [1]
కుటుంబం [మార్చు]
ఆయనది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి.
పదవులు [మార్చు]
విద్యాత్మకంగా,పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించారు.
- ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981)
- అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985)
- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989)
- ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992)
- రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు
భారత రాష్ట్రపతి ఆయన్ను 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు.ఆరేళ్ళపాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు , ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి.1993 నుంచి అంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడుతున్నాడు.
రచనలు [మార్చు]
కవిత్వం:
- విశ్వంభర
- ఆరోహణ
- మనిషి - చిలక
- ముఖాముఖి
- భూగోళమంత మనిషి
- దృక్పథం
- కలం సాక్షిగా
- కలిసి నడిచే కలం
- కర్పూర వసంతరాయలు
- మట్టి మనిషి ఆకాశం
- నాగార్జున సాగరం
- కొనగోటి మీద జీవితం
- రెక్కల సంతకాలు
- వ్యక్తిత్వం
వ్యాసాలు:
- పరిణత వాణి
సినీ ప్రస్థానం [మార్చు]
పురస్కారాలు [మార్చు]
- డాక్టరేటు డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో
- 1988వ సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం
ప్రశంసలు [మార్చు]
డా.సి. నారాయణరెడ్డి గురించి ప్రముఖుల ప్రశంసలను చీకోలు సుందరయ్య ఇలా ఉదాహరించాడు [2]
- చేరా - "ఇప్పటి కవుల్లో నారాయణరెడ్డిగారికున్నంత శబ్దస్ఫూర్తి ఉన్నవాళ్లు ఎక్కువ మంది లేరు. శబ్దస్ఫూర్తి అంటే శబ్ద సంపద ప్లస్ స్ఫూర్తి. అంతేకాదు. ఆ శబ్దాలను అతికే శక్తి మహాద్భుతమైనది. శబ్దాలకు రంగు, రుచి, వాసన కలిగించే ఆల్కెమీ ఏదో సినారె దగ్గర ఉండి ఉండాలి. అది అనిర్వాచ్యం. అది పరిశోధనకందదు.
- ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం - "విశ్వమానవ హృదంతరాళాల్లోని చైతన్య జలపాతాల సవ్వడినీ, విప్లవ జ్వాలల వేడినీ రంగరించి కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దుతున్న శిల్పి సి.నారాయణరెడ్డి. పద్యం నుండి గేయానికి, గేయం నుండి వచనానికీ అభ్యుదయాన్ని సాధిస్తూ పట్టింది బంగారంగా, పలికింది కవిత్వంగా ప్రగతి సాధిస్తున్న కవిచంద్రులు రెడ్డిగారు. మనిషిలోని మమతను, బాధను, కన్నీటినీ, మున్నీటినీ, అంగారాన్నీ, శృంగారాన్నీ, వియోగాన్నీ, విప్లవాన్నీ కవితల్లో కీర్తించడం రెడ్డిగారి మతం"
- సాహితీ చరిత్ర రచయిత డాక్టర్ జి.నాగయ్య - "ప్రణయ కవిత్వమును, చారిత్రక గాథలను రచించి ప్రఖ్యాతులైన సి.నారాయణరెడ్డిగారు పద్యమును, గేయమును చక్కగా నడిపించగల దిట్టలు. ఛందోరహస్యము తెలిసిన నారాయణరెడ్డి ఆధునిక యుగధర్మమున కనుగుణముగా ప్రగతి మార్గములో పయనించి వచన కవిత్వమును నాజూకుగా నడిపించి ఆ ప్రక్రియకు వన్నె చేకూర్చారు. నారాయణరెడ్డి ఏదో ఒక 'ఇజము'నకు కట్టుబడక సమకాలిక సంఘటనలు తనను ప్రేరేపించినపుడు కవిగా స్పందించి చక్కని గేయాలు రచించి వాటిని సంపుటాల కెక్కించాడు... నారాయణరెడ్డి కావ్యాలలో మధ్యతరగతివారి కష్టసుఖాలే ఎక్కువగా కనబడతాయి... కులమతమ్ముల ఉక్కుడెక్కల, నలిగిపోయెడు మాలలంగని, అల్లనాడే కంటనీరిడినట్టి వెన్నెల మనసు నీయది అని ఆయన గురజాడకు కైమోడ్పు ఘటించాడు. ఆకలి వాకిట కేకలు పెట్టిన, ఆరని బాధల అంచులు ముట్టిన జ్వాలా శిశువుగా వీరు శ్రీశ్రీని అభినందించారు
- వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు - "నారాయణరెడ్డి తిలక్లాగా రెండంచుల పదును గల కత్తి. కవిత్వంలో అగ్ని చల్లగలరూ, అమృతం కురిపించగలడూ"
ఇవికూడా చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
- ↑ మార్చి 11, 2011(పుట 86) చతుర లో గోవిందరాజు రామకృష్ణా రావు రాసిన జ్ఞానపీఠాలు శీర్షిక నుంచి
- ↑ ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం