సుమంగళి (1940 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుమంగళి
(1940 తెలుగు సినిమా)

అప్పటి సినిమా పోస్టరు [1]
దర్శకత్వం బి.యన్.రెడ్డి
నిర్మాణం బి.యన్.రెడ్డి,
మూలా నారాయణ మూర్తి
తారాగణం చిత్తూరు నాగయ్య,
ముదిగొండ లింగమూర్తి,
గిరి,
దొరైస్వామి,
కుమారి,
మాలతి,
తాడంకి శేషమాంబ,
గౌరీపతిశాస్త్రి
సంగీతం చిత్తూరు నాగయ్య
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య,
కె.రామనాధ్
నిర్మాణ సంస్థ వాహినీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సుమంగళి వాహినీ పతాకంపై, బి.ఎన్.రెడ్డి నిర్మాణం, దర్శకత్వంలో నిర్మించగా 1940లో విడుదలైన చలనచిత్రం. సినిమాలో చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, గౌరీపతిశాస్త్రి తదితరులు నటించారు.

నిర్మాణం[మార్చు]

అభివృద్ధి[మార్చు]

బి.ఎన్‌.రెడ్డి వాహినీ ఫిలింస్‌ పతాకాన 'సుమంగళి' చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. నిర్మాతగా ఇది బి.ఎన్‌.రెడ్డి మూడో చిత్రం. [1]

నటీనటుల ఎంపిక[మార్చు]

గిరి, నాగయ్య, కుమారి, మాలతి ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు. నాగయ్య ఇందులో నెరసిన జుట్టుతో, కళ్ళజోడు ధరించి ముసలిపాత్రలో సంఘసంస్కర్తగా (ఇష్టం లేకపోయినా బి.ఎన్‌.రెడ్డి సలహాతో) నటించారు.[1]

థీమ్స్, ప్రభావాలూ[మార్చు]

సంఘసంస్కరణలు, విధవా వివాహం ఈ చిత్రంలోని ప్రధానాంశాలు. మేనత్త కూతురుని పెళ్ళి చేసుకోవాలని కుటుంబ సభ్యులు అంటున్నా, ఐ.పి.ఎస్‌ పాసైన సత్యం చదువుకున్న అమ్మాయిని ప్రేమించడం, ఆమెను పెళ్ళి చేసుకుంటాననడం మేనత్త కూతురు ఆత్మహత్య చేసుకోవడం, చేసుకుంటూ బావకు నచ్చిన అమ్మాయితోనే వివాహం చేయమని కోరడం ఈ చిత్రంలోని ప్రధానాంశాలు.[1]

విడుదల[మార్చు]

ప్రచారం[మార్చు]

"పబ్లిసిటీ కోసం నేనెంతో డబ్బు తగలేస్తున్నాను. నువ్వేమో అతి తక్కువ ఖర్చుతో మంచి పబ్లిసిటీ తెచ్చుకుంటున్నావు నీ సినిమాకి"

 —సినిమా ప్రచారం గురించి బి.నాగిరెడ్డితో జెమినీ వాసన్.[2]

సుమంగళి సినిమా నిర్మాణం సమయంలోనే బి.ఎన్.రెడ్డి స్నేహితులు ఒకరు సినిమాని చెన్నై ప్రాంతంలో పంపిణీ చేసేందుకు ముందుకువచ్చారు. బి.ఎన్.రెడ్డికి ఆయన చెప్పిన రేటు నచ్చకపోవడం, బి.ఎన్.రెడ్డి అడిగినంత ఆయన ఇవ్వకపోవడంతో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. మద్రాసు నగరపాలక సంస్థ నుంచి ఆ పంపిణీదారుడు అప్పటికి మద్రాసు మొత్తం మీద స్తంభాలకు వెదురు దట్టీలు కట్టి అడ్వర్టైజ్మెంట్లు అంటించి ప్రచారం చేసే హక్కు పొందారు. తనకు సినిమా పంపిణీ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన పంపిణీదారు మద్రాసులో పోస్టర్ల ద్వారా ప్రచారం చేయనీయలేదు. అయితే సినిమా ప్రచారం లేకుండా విడుదల చేయడం కుదరదు కనుక బి.ఎన్.రెడ్డి తమ్ముడు, తర్వాతి కాలంలో నిర్మాతగా ఎదిగిన బి.నాగిరెడ్డి ఒక పథకం వేశారు. దాని ప్రకారం కార్పొరేషన్ ముద్రలు ఉన్న పోస్టర్లను వెదురుదట్టికి కుట్టిన గోనెసంచులకు అతికించి, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలకు కట్టారు. ఈ వినూత్న ప్రయోగం గురించి అంతా మాట్లాడుకున్నారు. రోడ్లమీద నడిచే జనం నెత్తిన ఈ బ్యానర్లు తెగిపడతాయంటూ కొందరు కోర్టులో కేసు వేశారు. అవన్నీ తొలగించమని తీర్పు వచ్చింది. అయితే రాత్రికి రాత్రి వచ్చిన ఈ తీర్పు అమలై మొత్తం తొలగించేసరికే వారం రోజులు పట్టింది. ఈలోగా చిత్రానికి మంచి ప్రచారం దొరికింది.
మద్రాసులోని పారగన్ థియేటర్లో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతూండడంతో ప్రజలు సినిమాకి రావడానికి భయపడేవారు. కొందరు రౌడీలు ఈ పనిచేస్తూండడంతో వారిని అరికట్టేందుకు అప్పటికి ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్న నాగిరెడ్డి, తన ముఠాకార్మికులను వెంటబెట్టుకుని వచ్చారు. మొదట నాగిరెడ్డి ఓ బ్లాక్ మార్కెట్ రౌడీతో తలపడడం, వెనువెంటనే పథకం ప్రకారం కార్మికులంతా వచ్చి రౌడీల పనిపట్టడం జరిగింది. ఆ తర్వాత వారి నాయకుణ్ణి పిలిచి, ఈ పనిచేసేందుకు వారికి ఎంత వస్తుందో కనుకున్నారు. రోజుకు అర్థరూపాయి వస్తుందని తెలసుకుని, రోజుకు రూపాయి చొప్పున ఊర్లో సినిమా కరపత్రాలు పంచేపనికి పెట్టారు. హోటళ్ళ బయట కరపత్రాలు పంచేవారు, బస్టాపులు, ట్రాముల వద్ద వాహనాల్లోకి కరపత్రాలు వెదజల్లేవారు. చివరకు సినిమాకి చాలా మంచి ప్రచారం లభించడంతో, జెమిని స్టూడియో అధినేత ఎస్.ఎస్.వాసన్ చిత్రం ప్రచారం గురించి నాగిరెడ్డిని అభినందించారు.[2]

ప్రజాదరణ, సమీక్షలు[మార్చు]

ఈ చిత్రం విజయం సాధించలేకపోయినా బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి తన తరహాలో మార్పు చేసుకోకుండా కళాత్మక చిత్రాల రూపకల్పనకే ప్రాధాన్యత ఇచ్చారు. విజయం సాధించకున్నా సినిమాకు విమర్శకుల నుంచి మాత్రం ప్రశంసలు దక్కాయి. 'పాల్‌ముని ఆఫ్‌ ఇండియా' అంటూ నాగయ్యని ఈ చిత్రం చూసి ఫిలిం ఇండియా పత్రికలో బాబురావు పటేల్‌ నాగయ్య గురించి రాసారు.[1]

రీమేక్[మార్చు]

సినిమాని తమిళంలో జెమినీ స్టూడియో అధినేత ఎస్.ఎస్.వాసన్ విడుదల చేశారు.[2]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 14 తెలుగు చిత్రాలు 1940 లో - ఆంధ్రప్రభ ఆగష్టు 26, 2010[permanent dead link]
  2. 2.0 2.1 2.2 బి., నాగిరెడ్డి (మార్చి 2009). జ్ఞాపకాల పందిరి. చెన్నై: బి.విశ్వనాథ రెడ్డి.