స్వయంవరం (1982 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్వయంవరం
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనదాసరి నారాయణరావు (కథ, చిత్రానువాదం, మాటలు)
నిర్మాతడి. రామరాజు, డి. విజయరామరాజు
తారాగణంశోభన్ బాబు
జయప్రద
దాసరి నారాయణరావు
ఛాయాగ్రహణంకె. ఎస్. మణి
సంగీతంసత్యం
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1982
భాషతెలుగు

స్వయంవరం దాసరి నారాయణ రావు దర్శకత్వంలో 1982 లో శోభన్ బాబు, జయప్రద నాయికా నాయకులుగా నటించిన ఒక తెలుగు సినిమా. స్వయంకృషితో వ్యాపారంలో అభివృద్ధి లోకి వచ్చిన ఇద్దరు బావ బావమరుదులు, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడే పొరపొచ్చాల వల్ల అప్పటికే ప్రేమలో ఉన్న వాళ్ళ పిల్లలు పడే బాధలు ఈ చిత్ర ముఖ్య కథాంశం.

కథ[మార్చు]

ధర్మారావు బావమరిది సుబ్బారావు ఒక అగ్ని ప్రమాదంలో భార్యతో పాటు సర్వస్వాన్ని కోల్పోతాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న సుబ్బారావును ధర్మారావు తన భార్య నగలమ్మి తన వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటాడు. ధర్మారావు కొడుకు శేఖర్, సుబ్బారావు కూతురు ప్రియ చిన్నప్పటి నుంచీ ఒకరినొకరు వదలకుండా ఉంటారు. ఇద్దరూ కలిసి చేసిన వ్యాపారం బాగా కలిసి వచ్చి ఇద్దరూ ధనవంతులవుతారు. కొత్తగా ఏ వ్యాపారం చేసినా కలిసే చేస్తుంటారు. ఏ నిర్ణయమైనా కలిసి మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. శేఖర్ ను చదువు కోసం విదేశాలకు పంపిస్తారు. ప్రియను కూడా పంపించాలనుకుంటారు కానీ వీసా సమస్యతో పంపలేరు.

వీళ్ళ సంస్థలో పనిచేసే గుమాస్తా దురాశా పరుడు. లంచాలకు ఆశపడి వ్యాపారానికి చేటు తెస్తుంటే ధర్మారావు ఒకసారి అతన్ని తీవ్రంగా మందలిస్తాడు. ఆ గుమాస్తా భర్తను కోల్పోయిన తన చెల్లెలి ప్రేమను ఎరగా వేసి సుబ్బారావుకు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటాడు. బావ బావమరుదుల మధ్య చిచ్చు పెడతాడు. గుమాస్తా ప్రోద్భలంతో సుబ్బారావు తన కూతురు పేర వ్యాపారాలు ప్రారంభిస్తాడు. అవి బాగా కలిసివస్తాయి. ధర్మారావును ఒప్పించి అతని కొడుకు పేరు మీద కూడా వ్యాపారం ప్రారంభింప జేస్తాడు. కానీ అందులో నష్టం వచ్చి వ్యాపారం పూర్తిగా దివాలా తీస్తుంది. దాంతో లెక్కలు చూసుకుని ఇద్దరూ విడిపోతారు. ధర్మారావు తన సొంత ఇంటిని కూడా అమ్ముకుని ఆ నష్టం పూడ్చవలసి వస్తుంది. విదేశాల్లో ఉన్న శేఖర్ అర్ధాంతరంగా భారతదేశానికి తిరిగి వస్తాడు. తల్లి ద్వారా జరిగింది తెలుసుకుని సుబ్బారావును నిలదీస్తాడు. సుబ్బారావుకు కూడా కోపం వచ్చి తన కూతురుకు వేరే సంబంధాలు చూడ్డం మొదలు పెడతాడు. భార్య సలహాతో ధర్మారావు సుబ్బారావు ఇంటికి వెళ్ళి శేఖర్ కు, ప్రియకు పెళ్ళి చేయమని చెబుతాడు. కానీ సుబ్బారావు అందుకు అంగీకరించడు. పైగా ఓ జమీందారు కుటుంబానికి చెందిన రాజశేఖరం అనే అతనితో తొందరగా పెళ్ళి నిశ్చయం చేస్తాడు. ప్రియ ఎలాగైనా తనను తీసుకెళ్ళమని శేఖర్ కు ఉత్తరం రాసి తన నౌఖరికి ఇచ్చి పంపిస్తుంది. కానీ అతను తిరిగి వచ్చేసరికి అతనికి సుబ్బారావు ఎదురై శేఖర్ ఆమెను అసహ్యించుకున్నాడని అబద్ధం చెప్పమంటాడు. అతను అలాగే చెబుతాడు. మనసు విరిగిపోయిన ప్రియ తండ్రి నిర్ణయించిన రాజశేఖరాన్ని పెళ్ళి చేసుకుంటుంది.

అదే సమయానికి ధర్మారావు గుండెపోటుతో మరణిస్తాడు. కర్మకాండలు జరిపించిన వెంటనే ప్రియ ఇంటికి వెళ్ళిన శేఖర్ నౌకరు ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని బాధ పడతాడు. ప్రియ భర్త రాజశేఖరం విలాస ప్రియుడు. మొదటి రాత్రికి కూడా ఇంటికి రాడు. తనకున్న అలవాట్ల గురించి, సంబంధాల గురించి బాహాటంగా ప్రియతో చెప్పి ఆమెకు కూడా ఇష్టమైతేనే కాపురం చేయమంటాడు. తల్లి బలవంతం మీదనే పెళ్ళి చేసుకున్నాననీ చెబుతాడు. ప్రియకు మాత్రం ఇంకా శేఖర్ కళ్ళలోనే మెదలుతుంటాడు. ప్రియ ఇంట్లో పనిచేసే టీచర్ రమాదేవి సాయంతో శేఖర్ ప్రియను కలిసి నిజం చెప్పాలనుకుంటాడు. కానీ ప్రియ ఇంకా అతని పట్ల ద్వేషంతోనే ఉంటుంది. రమాదేవి శేఖర్ నుంచి నిజం తెలుసుకుని ప్రియకు చేరవేస్తుంది. రమాదేవి ఎలాగైనా వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకునేలా చేయాలని ప్రయత్నిస్తుంటుంది కానీ కుదరదు. ఇదంతా తెలుసుకున్న రాజశేఖరమే ఇద్దరు కలుసుకునేలా చేస్తాడు. వాళ్ళిద్దరూ విడిపోవడానికి అందరూ ఎలా కారణమయ్యారో వివరించి ఇద్దర్నీ పెళ్ళి చేసుకోమంటాడు. కానీ సాంప్రదాయానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడదు. చివరకు రాజశేఖరం ఆత్మహత్య చేసుకుని చివరి కోరికగా శేఖర్, ప్రియలను పెళ్ళి చేసుకోమని కోరడంతో కథ ముగుస్తుంది.

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

వరుస సంఖ్య పాట రచన సంగీతం పాడిన వారు
1 ఆకాశమెందుకో పచ్చబడ్డదీ‍‍ ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డదీ రాజశ్రీ చెళ్ల పిళ్ల సత్యం ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
2 గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం దాసరి నారాయణరావు చెళ్ల పిళ్ల సత్యం కె. జె. ఏసుదాసు
3 ముసుగేసిన మబ్బులలో దాసరి నారాయణరావు చెళ్ల పిళ్ల సత్యం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
4 నేనిక్కడా నువ్వక్కడా కనులిక్కడా కలలక్కడా రాజశ్రీ చెళ్ల పిళ్ల సత్యం పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
5 హరివిల్లు పొదరిల్లూ చుక్కలు, ఆకాశం రాజశ్రీ చెళ్ల పిళ్ల సత్యం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
6 ఇక్కడ ఇక్కడ రాజశ్రీ సత్యం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి


మూలాలు[మార్చు]