ఆల్బర్ట్ కామూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆల్బర్ట్ కామూ
Portrait from New York World-Telegram and the Sun Newspaper Photograph Collection, 1957
జననం(1913-11-07)1913 నవంబరు 7
డ్రీన్, ఎల్ టరెఫ్, ఫ్రెంచ్ అల్జీరియ
మరణం1960 జనవరి 4(1960-01-04) (వయసు 46)
విల్లెబ్లెవిన్, యెన్నె, బర్గండీ, ఫ్రాన్స్
యుగం20వ శతాబ్దపు తత్వ శాస్త్రం
ప్రాంతంపశ్చిమ తత్వ శాస్త్రం
తత్వ శాస్త్ర పాఠశాలలుఅసంగతవాదం
ప్రధాన అభిరుచులునీతి శాస్త్రము, మానవత్వం, న్యాయం, ప్రేమ, రాజనీతి

ఆల్బర్ట్ కామూ (1913 నవంబరు 7 – 1960 జనవరి 4) ఫ్రెంచి వలసరాజ్యమైన అల్జీరియాలో జన్మించిన నోబెల్ బహుమతి పొందిన రచయిత, తత్త్వవేత్త. ఇతని ఆలోచనలు అసంగతవాదం అనే సరి కొత్త తత్వ సిధ్ధాంత పుట్టుకకు ప్రేరణనిచ్చాయి. అతను “The Rebel” అన్నవ్యాసంలో చెప్పుకున్నట్టుగా, తనజీవితాన్ని “వ్యక్తి స్వేచ్ఛగురించి లోతుగా పరిశీలిస్తూనే, nihilism ని వ్యతిరేకించడానికే సరిపోయింది”. (nihilism తార్కికంగా జీవితానికి ఏదో ఒక గమ్యం,లక్ష్యం ఉన్నాయన్న ప్రతిపాదనని ఖండిస్తుంది). సాంకేతిక విజ్ఞాన అభివృధ్ధిని ఆరాథనాభావంతో చూడడానికి అతను పూర్తి వ్యతిరేకి. అతనికి ఏ రకమైన తాత్త్విక ముద్రలూ ఇష్టం లేదు.

బాల్యం[మార్చు]

ఆల్బర్ట్ కామూ 1913 నవంబరు 7 లో అప్పటి ఫ్రెంచ్-అల్జీరియా లోని డ్రీన్ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. అతని తల్లి స్పానిష్ వారసత్వానికి చెందిన స్త్రీ. ఆమె పాక్షికంగా చెవిటిది. ఒక పేద వ్యవసాయ పనివాడుగా ఉన్న కామూ తండ్రి లూసియిన్ మొదటి ప్రపంచ యుధ్ధ సమయంలో జరిగిన మార్నే పోరాటంలో పాల్గొని యుధ్ధంలో మరణించాడు.బాల్యంలో కామూ చాలా పేదరికాన్ని అనుభవించాడు.జీవితంలో ఎడతెగని యాతనలు, భౌతికానందాలు సరిసమానంగానే ఈతనిని ఆకర్షించాయి. ఇవే ఈతనిలో చివరకు తీవ్ర సంక్షోభం రేకెత్తించాయి.ఇందువల్ల నైరాశ్యానుభూతి లేకుండా సుఖాన్వేషణ కొనసాగదని నిర్ణయించుకున్నాడు.

చదువు[మార్చు]

మాధ్యమిక విద్య ముగిశాక కామూ ఉన్నత విద్యాభ్యాసం కోసం అల్జైర్స్ విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడ చదువుతుండగా ఫుట్ బాల్ క్రీడలో చురుగ్గా పాల్గొని గోల్ కీపర్ గా కూడా వ్యవహరించాడు. కానీ తర్వాత క్షయ వ్యాధి సోకడంతో క్రమంగా ఆటలో పాల్గొనడం తగ్గించాడు. అవసరమయిన ఖర్చుల కోసం ప్రైవేట్ ట్యూటర్, కార్ల విడి భాగాల క్లర్కు లాంటి చిన్న ఉద్యోగాలు చేస్తూ 1935 లో తత్వశాస్త్రంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ (BA) పూర్తి చేశాడు. ఆ తర్వాత మే 1936 లో తత్వ శాస్త్రంలో పోస్టు గ్రాడ్య్యేషన్ డిగ్రీ (MA) కోసం Plotinus, Neo-Platonism and Christian Thought అనే విషయాల మీద థీసిస్ సమర్పించాడు.

రచనలు[మార్చు]

కామూ అసంగతవాదం (అబ్సర్డిటీ) "జీవిత పరమార్థం తెలుసు కోవాలని, తెలుసుకునేందుకు ప్రయత్నించి, తెలుసుకునేందుకు ఏమీలేదని నిర్ధారించుకుని, అయినా తెలుసుకునే ప్రయత్నం కొనసాగిస్తున్న" పద్ధతిని ప్రతిపాదిస్తుంది. అసంగతవాదం అంటే ఏమిటో ఆల్బర్ట్ కామూ తన ‘మిత్ ఆఫ్ సిసిఫస్ ‘ వ్యాసంలో విస్తృతంగా చర్చించాడు.

నవలలు[మార్చు]

  • The Stranger (L'Étranger, often translated as The Outsider) (అపరిచితుడు) (1942)
  • The Plague (ప్లేగు వ్యాధి) (1947)
  • The Fall (పతనం) (1956)
  • A Happy Death (ఆనంద మరణం) (1936–1938 లో రాయబడిన ఈ నవల కామూ మరణానంతరం 1971 లో ప్రచురితమయ్యింది)
  • The First Man (మొదటి మనిషి) (అసంపూర్ణమయిన ఈ నవల కూడా మరణానంతరం 1995 లో ప్రచురితమయ్యింది)
  • The Myth of Sisyphus (Le Mythe de Sisyphe) (1942)
  • The Rebel (L'Homme révolté) (1951)

The Stranger (L'Étranger, often translated as The Outsider):[మార్చు]

1941 నాటికి ఫ్రాన్స్  ఫాసిస్టు జర్మనీ దురాక్రమణ కాహుతి అయి ఛిన్నాభిన్న మయింది. '''అవుట్ సైడర్''' ఆనాటి కామూస్ మనస్తత్వం యధాతధంగా ప్రతిఫలిస్తుంది. జీవితాతీతమయిన పరతత్వ (Transcendental Reality) ఏదీలేదు. అంతే కాదు జీవితానికసలు మానవాతీతమయిన విలువ లేవీలేవు. సామాన్యంగా సర్వులు ఆశించే ఆశాజ్యోతి అంతకన్నా శున్యం అని ఇందులో కామూస్ నిగూఢంగా చెప్పదలిచాడు. ఇది చాలా చిన్ననవల. దీనిలో కాధానాయకుడు మేరీ సోల్ట్. ఇతడొక ఆఫీసులో గుమస్తా. శారీరికానుభూతులే ఇతని కెక్కువగా ఆనందం కలిగిస్తాయి.ఇక మిగిలిన అన్నిటిమీద ఈ యువకునికి విపరీతమయిన నిర్ల్ప్తత కలిగిస్తాయి.ఔట్ సైడర్ లో అంతగా చెప్పదగిన కథగాని కథా సంవిధానం ఏదీలేదు. ఇది అల్జీరియాలో జరిగిన కథ. మోర్ తల్లి చనిపోతుంది. ఆవార్త విని ఆఫీసుకి రెండురోజులు సెలవుపెట్టాలి అని చిరాకు పడతాడు. ఆ పైన జరిగిన అంత్యక్రియలలో కూడా ఆతనికి ఏమీ విచారం కలగదు. పైగా మిట్టమధ్యాహ్నం ఆ మండుటెండలో శ్మశానానికి పోవాలా అని బాధ పడతాడు. ఆమరునాడే మోర్ సోల్ట్ కులాసాగా ఈతలాడుతూ కాలక్షేపం చేస్తాడు.ఆ సమయంలో ఆతనికి కొంచెం పరిచయం ఉన్న అమ్మాయి తటస్థపడుతుంది. అటుపై ఆమెతో ఓ స్టంటు సినిమా చూస్తాడు.ఆరాత్రి వాళ్ళిద్దరూ ఖుషీగా కాలం గడుపుతారు.అతనికి ఆ అమ్మాయి గురుంచి అట్టే పట్టింపు లేదు.పెళ్ళి చేసుకోమని అడుగుతుంది ఆమె. పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా ఒకటే అని మాట్లాడుతాడు సాల్ట్.ఉద్యోగ సమయంలో కూడా ఆతనికి ప్రమోషను మీదకంటే పరిసరంలో ఉన్న స్వల్పవిషయాలు, చిన్న చిన్న వస్తువులు పరిశీలించటం పైనే ఎక్కువ ఆసక్తి.

ఆపైన కొన్ని సంఘటనలు జరిగిన తరువాత మోర్ సోల్ట్ ఒకసారి బీచ్ లో షికారు కొట్టడానికి బయలు దేరుతాడు. ఆతనికక్కడ ఒక అరబ్ వ్యక్తితో చిన్న చిలి తగాదా వస్తుంది. ఆ అరబ్ కత్తితో సాల్ట్ ను బెదిరిస్తాడు. ఆతగువులో మోర్ సాల్ట్ తన చెతిలో రివాల్వరుతో ఆ అరబ్బీవాణ్ణి కాల్చి చంపేస్తాడు. ఆతరువాత సాల్ట్ పై హత్యానేరం మోపి విచారణ జరుపుతారు. అయినా సాల్ట్ ధృక్పధంలో మార్పు ఏమీ ఉండదు. పశ్చాత్తాపం ప్రకటించడు.తల్లి శవం దగ్గర ఆతడు కళ్ళనీళ్ళు పెట్టుకోలెదని విచారణ సమయంలో తెలుస్తుంది. అందుకు గాను ఆతనికి ఉరిశిక్ష విధిస్తారు.

ఆపైన కారాగారంలో ఒక క్రైస్తవ మతగురువు ఆతని దగ్గరికి వచ్చి పరలోక విషయ్ం ప్రస్తావించి ప్రార్ధానదులతో ఓదారుస్తాడు. అంతవరకూ నిర్ల్ప్తుడుగా ఉన్న మోర్ అటుపిమ్మట తన సిద్ధాంతం ప్రవచిస్తాడు. ఉన్నది ఈలోకం ఒక్కటే అని ఇక్కడి జీవితమే యధార్ధమనీ మృత్యువుతో అంతా తుడుచుపెట్టుకుపోతుందనీ నొక్కి వక్కాణిస్తాడు. తుది ఘఢియలో, బ్రతికి ఉన్నంతకాలము సుఖంగా ఉన్నాననే భావిస్తాడు. విద్వేషపు పూరితులయిన ప్రేక్షకులెందరో తనకు ఉరిశిక్ష విధించే సమయంలో ఆ ప్రదేశానికి వస్తారనీ తన్నననేక విధాలుగా నిందిస్తారనీ అనుకొని ఆనందిస్తాడు.చిట్ట చివరిదాకా అతని ఉపేక్షాభావంలో మార్పేమీ కనిపించదు!

ఈ నవల రచనలో కామూస్ అపోర్వమైన శిల్పశక్తి ప్రదర్సించాడు. ఇది ఒక విధంగా ఆధునిక శిక్షాస్మృతిపై నిశితమయిన వ్యంగ్య రచన. అంతే కాదు ఇది ఆధునిక సాంఘికార్ధిక నైతికాధ్యాత్మిక సిద్ధాంతాలమీద కూడా విపరీతంగా దుమ్మెత్తిపోస్తుంది.మేరీ సోల్ట్ జీసస్ వంటి వాడనీ ఇంకొక సందర్భంలో తన అభిప్రాయం వెళ్ళడించాడు.

The Myth of Sisyphus (Le Mythe de Sisyphe) (1942)[మార్చు]

ఈ చిన్న నవల పూర్తిగా అవగాహన కావడానికి The Stranger నవల బాగా ఉపయోగపడుతుంది.ఇందులో సామాన్యంగా అందరు అంగీకరించి గౌరవించే ఆదర్శాలు, అభిప్రాయాలు అన్నీ పూర్తిగా తుడుచిపెట్టుకుపోయినట్టే భావించి తన వాదం ప్రారంభిస్తాడు కామూస్. భగంవంతుడుగానీ, గతితార్కిక భౌతికాదివాదాలు గాని, సిద్ధాంతాలుగానీ ఈ గ్రంథానికి ప్రాతిపదికలు కావు.ఇవేవీ లేనప్పుడు మానవునికి కేవలం ఆత్మహత్యే పరమ శరణ్యం కావచ్చునని ఎవరికయినా స్ఫురించవచ్చును. అదే విధమయిన ఆత్మహత్య ప్రాతిపదికమీదనే ఈ నవల ప్రారంభం అవుతుంది.అయితే కామూస్ ఆత్మహత్యే ముఖ్యకర్తవ్యమని వర్ణించడు. ఈవిధమయిన ఆదర్శాలు, ఆంగీకృత సిద్ధాంతాలు లేని ఇటువంటి పరిస్థుతులలో ఒక వ్యక్తి ప్రపంచము, సామాన్యంగా మానవులందరు అవలంబించే ఆదర్శాలు అభిప్రాయ ధోరణలు అన్నీ కేవలం అస్తవ్యస్తంగా అసంబద్ధంగా (Absurd) గా కనిపిస్తాయి.మానవుడీ అస్తవ్యస్త మయిన (Absurd) ప్రపంచంలో ఏకాకిగా నిస్సహాయుడిగా నిలబడుతున్నాడు. ఇక అతని కెదురుగా కనిపించేవి భౌతిక ప్రపంచము, దానికి సంబంధించిన సుఖానుభూతులు మాత్రమే. Absurdity or Absurd Philosophy ఫ్రాన్స్ లో ఇంతకు ముందే జీన్-పాల్ సార్ట్రే రచనలలో గోచరిస్తాయి. ఈ నవలలో ఈ అస్తిత్వవాద ప్రసక్తి ఎక్కడ కనబడదు.అయితే కీర్క్గార్డ్, హూమర్సల్ వారి సిద్ధాంతాలకి కొంత ప్రోద్బల్యం కలిగారు కామూస్.

ప్రపంచం అస్తవ్యస్తం. ఈ అసంబద్ధతకిక పరిష్కారమార్గమేమీ లేదు.మానవ వ్యక్తి ఈ అసంబద్ధత సమీక్షంలోనే తన నిత్యజీవిత యాత్ర కొనసాగించాలి.మృత్యువుతో మనుష్య జీవితం పరిసమాప్తమయిపోతున్నది.కనుక మనుష్య జీవితంలో ప్రతిక్షణము ప్రతి భౌతికానుభూతి అమూల్యాలే. మృతికూడా ఈ అస్తవ్యస్తత కేమాత్రము పరిష్కార మార్గము కాదు. Absurdity ని ఎదుర్కొనలేని భీరువులు మాత్రమే మరణమే పరిష్కార మార్గంగా భావిస్తారు.మృతితో జీవితాసంబద్ధత మొదలంటూ రూపుమాసిపోతున్నది.కనక మృతి కూడా పరిష్కార మార్గం కాజాలదు.ఈ విధమయిన అసంబద్ధత ధృక్పధం అవలంబించిన వ్యక్తికి జీవితం క్షణక్షణము పరిపపూర్ణంగా భోగభాగ్యంగా గోచరించడం సహజం. కేవలం మూల్యరహిత ధృక్పధంతో ఆత్మహత్య ప్రాతిపదికపైన ప్రారంభం అయిన గ్రంథం ఈవిధంగా ఆత్యంతికమయిన జీవితానురక్తికే దారితీస్తుంది.

The Rebel (L'Homme révolté) (1951)[మార్చు]

దిమిత్ అఫ్ సిసిఫస్ రచించిన తరువాత కామూస్ లో ఏర్పడిన పరిణితి స్పష్టంగా గోచరిస్తుంది.అయితే ప్రధాన ధృక్పధంలో మాత్రం మార్పేమీలేదు. ఇందులో కామూస్ Absurdity or Absurdism ను సాంఘిక దృష్టితో వివరిస్తాడు. ఇందులో కామూస్ ఇంచుమించుగా ఐరోపాలో చెలరేగిన విప్లవాలన్నె సమీక్షించాడు.జర్మనీలో జార్జ్ విలియం ఫ్రెడరిక్ హెగెల్తో ప్రారంంభించిన తత్వచింతన క్రమక్రమంగా మార్క్సిజంగా మారింది. రష్యాలో 19వ శతాబ్దిలో అంకురించిన శూన్యవాదం (Nihilism) ఈ పరిణితికి బాగా ప్రోబ్దల్యం కలిగించింది. ఫ్రాన్స్ లో మార్క్విస్ డిసేడ్ మొదలయిన రచయితలు, జర్మనీలో నీచే మొదలయిన తాత్వికులు తమ తమ గ్రంథాలవల్ల వామదక్షిణ పక్షాల నియంతృత్వాలకు బాగచేయూతనిచారు.వీటి వల్ల మానవ వ్యక్తిగౌరవం మొదలంటు రూపుమాపుజేసి నరహత్యాకాండలకు, దురాక్రమణలకు ఉపక్రమించాయి. వ్యక్తి మౌల్యాలీవిధంగా

ఫాసిజం, గతి తార్కిక భౌతికవాదము మొదలయిన నియంతృత్వ సిద్ధాంతాల పాదఘట్టానాలలో పడి నలిగి మతమై రూపుమాసి పోయాయి. రెబెల్ అదే ఈ నవలలో చర్చా ధోరణి ఇదే వివరిస్తుంది.

కామూ స్ మానవతా ధృక్పధాన్ని చాలా వరకు సమర్ధించాడు.మానవుడు సర్వస్వతంత్రుడు అని ఆతనికి మనుజుల్ శ్రేయస్సే పరమావధి ఒక చోట ఇలా వ్రాసాడు:

'''Yes, man is his own end, and he himself the only end to which he can asapre. If he wants to be something it is in this life.... Tense faces fratermity in danger, the shy strong fiendship of men for men, these are true riches because they are mortal. It is in the midst of them that the mind feels best its limits and its powers. '''

The Plague (ప్లేగు వ్యాధి) (1947)[మార్చు]

ఇది కామూస్ వ్రాసిన రెండవ నవల.ఇది అవుట్ సైడర్ కన్నా పెద్దది.ఇది మొదటి ప్రచురణ 1947 లో జరిగింది.అల్జీరియాలోని సముద్రతీరనగరం ఓరస్ లో హఠాత్తుగా ప్లేగ్ వ్యాధి సూచనలు కనిపిస్తాయి.ఎలకలు వేలకు వేలు వీధులలో కుప్పలు కుప్పలుగా పడిచనిపోతాయి.అధికారులు వ్యాధి నివారణ అమలుకు తటపటాయిస్తారు.క్రమంగా రోజు ముప్పై నలభై మంది ఆ వ్యాధి ఆహుతి అవుతుంటారు.అప్పటికి అధికారులు కొంచెం మేలు కుంటారు.తీవ్ర నిబంధనలు విధిస్తారు.ఇక అప్పటి నుంచి నగరానికి పై ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోతుంది.ఎగుమతలు, రాకపోకలు తగ్గిపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు.రోజు రోజు వందలాది జనం చనిపోతారు.ఆ నగరంలో డాక్టర్ రియో ప్రముఖ వైద్యుడు.అతడు రాత్రింబవళ్ళు వైద్య సహాయం చేస్తూ ఓరస్ ప్రజలకు శాయశక్తులా సహాయపడతాడు.ప్లేగ్ వ్యాధి ప్రారంభం కాక మునుపే ఆతని భార్య వేరొక నగరానికి ఆరోగ్య భవనంలో విశ్రాంతి కోసం వెళుతుంది. ప్లేగ్ వలన ఆమె తిరిగి రావటానికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.అయినా డాక్టర్ ప్రజలకు పరి చర్యలు చేస్తూ ఉంటాడు. చివరికి ఆతని భార్య ఆ విశ్రాంతి భవనంలో చనిపోతుంది. అయినా డాక్టర్ తనమానవసేవా తత్పరత విరమించడు.ఇలాగే ఈ నవలలో మరికొందరు వ్యక్తులు ఓరస్ నగరంలో చిక్కుకొని యధాశక్తిగా రోగబాధితులకు ఉపచారాలు చేస్తారు. అయితే ఒక క్రైస్తవ మత ప్రచారకుడు భగవంతుడే ఆవ్యాధి ప్రేరేపించాడని ప్రబోధిస్తాడు. కాని ఒక అమాయకపు శిశువు ఆ భయంకర వ్యాధి కాహుతి అవడంతో ఆతని ధోరణి కొంచెం చల్లబడుతుంది. జోసఫ్ గ్రాండె అనే ఒక గుమాస్తా ప్లేగువ్యాధి వల్ల మరణించినవారి లెక్కలన్నీ జాగ్రత్తగా సేకరించి ఆవ్యాధి హెచ్చు తగ్గులు గమనించడానికి, ఆ విధంగా ఆరోగ నివారణకు ఎంతో సహాయం చేస్తాడు. ఈ నవల కితడె నాయకుడని గ్రంథకర్త వ్యగ్యంగా సూచిస్తాడు. ఆపైన క్రమంగా ప్లేగ్ రోగం తగ్గిపోతుంది. ఓరస్ నగర పౌరులు తిరిగి అత్మీయులను కలుసుకొని ఆనందిస్తారు. ప్లేగ్ రోగకారణాలన్నిటికీ పూర్తిగా రూపుమాసిపోవన్న తీవ్రమయిన హెచ్చరికలతో నవల ముగిసిపోతుంది.

ఇది చదువుతున్నప్పుడు భయంకర మహమ్మారి విలయతాండవం చేస్తున్నట్లు స్ఫురిస్తుంది. పెద్దపెద్ద విప్లవాదర్శాలు చిట్టచివరికి నరజాతిని నట్టేట కలిపి అణిచివేస్తాయనీ డాక్టర్ రియో వంటివారి సాధారణ పరోపకార చర్యలే మానవకళ్యాణ సాధనకు ఉపకరించగలవని కామూస్ ఈ నవలలో సూక్ష్మంగా ధ్వనింపజేస్తాడు.మానవతాజైత్రయాత్ర నిరుపమానంగా రూపుకట్టిన ఈజీవిత చిత్రణ కామూస్ రచనలన్నిటిలోను మహోత్తమమయిన మణిమకుటం.ఇందులో కామూస్ శిల్ప చాతురత అమోఘం.

The Fall (పతనం) (1956)[మార్చు]

ఇది కామూస్ మూడవ నవల.ఇది ప్లేగ కన్నా చిన్న నవల.ఇది ఒక విధమయిన వ్యక్తి స్వభావ చిత్రణ ధోరణిలో సాగిన స్వగతం.కథానాయకుడు క్లెమెన్స్. ఇది చదువుతూంటే మనకితడు పై పైకి చాలా పెద్ద మనిషిలాగా కనిపిస్తాడు. కాని నిగూఢంగా ధ్వనించే క్లెమెన్స్ పాపపంకిల జీవితం మన ఒళ్ళు జలదరింప జేస్తుంది. అంతే కాదు మనమందరము అలాంతి వ్యక్తులమే అని కూడా అనిపిస్తుంది. అసలీ నిగూఢమయిన అవహేళన (Irony) ధోరణి కామూస రచనలన్నింటికీ సర్వ సామాన్యమే. నిశితమయిన మానవాత్మ పరిశీలనలో అధునాతన ఫ్రెంచి రచయితలు సిద్ధహస్తులు. ఫాల్ దీనికొక తార్కాణ.ఈ చిన్ని రచనా సైరాశాంధ్యకాంధాకరంలో ఆశాజ్యోతి లేశమయినా గోచరించదు. ఈ రచన విమర్శించిన ఫ్రెంచి విమర్శకుడొకడు కామూస్ కేథలిక్ మతంలో ప్రవేశించడానికిది ఒక నాందీ ప్రస్తావన కావచ్చునని అభిప్రాయ పడ్డాడు. కాని ఆతడు అలాంటి మత స్వీకరణమేమీ చేయలేదు.

రూపకాలు (Drama):[మార్చు]

ఆల్బర్ట్ కామూస్ రచించిన మొత్తం రూపకాలు నాలుగు.మొదటిది కాలిగ్యులా (Caligula) ఇది ఒక రోమన్ చక్రవర్తి కాలిగ్యులా భయానక చరిత్ర చిత్రణ. రెండవది క్రాస పర్పస్ (Cross-Purpose). దీనిలో ఒక వృద్ధ మాత కుమార్తెతో కలిసి ఒక హోటలు నడిపిస్తూ ఉంటుంది. వారిద్దరు కలిసి అప్పుడప్పుడు తమ హోటలులో బసచేసే యాత్రికులను హత్యచేసి దోచుకుంటారు.అది ఎక్కడో దూరంగా మారుమోలలో ఉన్న హోటలు.ఆ వృద్ధమాత కుమారుడు బాగా చిన్న తనంలోనే విదేశంలో స్థిరపడిపోతాడు.తలవని తలంపుగా ఒకనాడాతడు ఆ హోటలులో బసచేస్తాడు.తల్లి కూతురు కలిసి ఆతన్ని హత్య చేస్తారు. ఆతరువాతే తల్లి కతడు తనకన్న కుమారుడన్న విషయం తెలుస్తుంది. చివరికి ఆ నాటకం దుఃఖాంతంగా ముగిసిపోతుంది. కాలిగ్యులా చరిత్ర కూడా ఇంచుమించుగ ఇలాంటిదె. అతడు తన ప్రజలను అనేక విధాల హింసిస్తాడు. ఏదో సుదూర దర్శ చేరుకోవాలనే దృష్టితోనే అతడా విధమయిన భీకరకృత్యాలకు ఉపక్రమిస్తాడు. చిట్టచివరికి రాజ్యాధికారులలో ముఖ్యులు కొందరేకమై ఆతణ్ణిహతమార్చి వేస్తారు. ఈ రెండు రూపకాలలోను జీవితాసంబద్ధత ప్రదర్శించడమే కామూస్ ప్రధానోద్దేశ్యం. ఇంకా ఆ అసంబద్ధతకు సంబంధించిన ఇతర విషయాలు కూడా ఈ రూపకాల ద్వారా ప్రతిధ్వనిస్తాయి.

ఇక మూడవనాటిక స్టేట్ ఆఫ్ సీజ్.స్పెయిన్ లో కాడిజ్ నగరం దీనికి పూర్వరంగం.ఇక ఇంచుముంచుగా ప్లేగ్ నవలకిది నాటక స్వరూప కల్పనమే అని చెప్పవచ్చును. ప్లేగ్ లో నిగూఢంగా స్ఫురించే కాముస్ అభిప్రయాలీనాటికలో బాగా కొట్టవచ్చినట్లుగా ప్రతిఫలిస్తాయి.కాడిజ్ పట్టణంలో కూడా ప్లేగ్ వ్యాధి వ్యాపిస్తుంది. కామూస్ ఈనాటిక ద్వారా శూన్యవాదం మీద వామదక్షిణ నియంతృత్వాలమీద నిశిత విమర్శాగ్ని వర్షం కురిపిస్తాడు.స్పెయిన్ దేశం దీనికి పూర్వరంగంగా కల్పించడానికి కూడా ఇదే ప్రధాన కారణం.

ఇక నాలగవది ది జస్ట్ (The Just). దీని ఇతి వృత్తాంతానికి రంగస్థలం రష్యా.ఇది 1905 లో ఆదేశంలోని విప్లవకారులకు సంబంధించిన గాథ. కొందరు విప్లవకారులు గ్రాండ్ డ్యూక్ హత్య చేద్దామని కుట్ర పన్నుతారు. కాలియాయవ్ వారిలో ఒక హంతకుడు. కాని అతడు తన కప్పగించిన విధికృత్యం నిర్వహించకుండానే తిరిగి వచ్చి వేస్తాడు.గ్రాండ్ డ్యూక్ ప్రయాణం చేసే అశ్వశాకటంలో అతని మనుమలు కూడా ఉన్నారు.వారు చాలా బాగా పసివారు.ఆ అమాయక పశువులను గ్రాండ్ డ్యూక్తో పాటు హతమార్చడానికి తనకు మనసొప్పలేదనీ, అందుచేత ఆ అశ్వశాకటం మీదికి బాంబు విసలేదనీ కాలియాయవ్ విప్లవనాయకుడు స్టెఫెన్ కు వివరిస్తాడు.హత్యలు, అన్యాయాలు మొదలయిన వేవీలేని ఒక భూతలస్వర్గం నిర్మించే లక్ష్యంతో కాలియాయవ్ మొట్టమొదటగా ఆ హత్యా ప్రయత్నాన్ని ఆంగీకరిస్తాడు.కాని అటువంటి భవిష్యత్కాల స్వప్నం కోసం ప్రస్తుత కాలంలో అయాయక శిశువులను సంహరించడానికి అంగీకరించడు.దానికి విప్లవనాయకుడు అంతిమ విప్లవ విజయానికి ఎటువంటి అకృత్యమయినా ఆచరించవలసిందే అని వాదిస్తాడు.అంతేకాదు భావి విప్లవ విజయం కోసం పరిపూర్ణ శాంతి సౌఖ్యం కోసము వర్తమానంలో జీవించే వారి నెంత మందినయినా హతమార్పివేయాలని ఉద్ఘటిస్తాడు.అది సరికాదని కాలియాయవ్ తన దృఢ నిశ్చయం వ్యక్తీకరిస్తాడు.చిట్ట చివరికి ఆతనికి మరణ శిక్ష విధిస్తారు.ఆత్మ మృతితోనే తన దృఢవిశ్వాసానికి నూతన ధర్మానికి ప్రాన ప్రతిష్ఠ చేస్తాడు కాలియాయవ్.చిట్ట చివరికి మానవ వ్యక్తిత్వ వినాశానికి దారితీసే నియంతృత్వ విప్లవం కంటే పరిమితము తాత్కాలికము అయిన తిరుగుబాటే సర్వోత్తమమమని కేమూస్ ఈ నాటిక ద్వారా సూచిస్తాడు.

కథలు[మార్చు]

  • Exile and the Kingdom (బహిష్కరణ, రాజ్యం) (కథా సంకలనం) (1957)
  • The Adulterous (వేశ్య)
  • The Renegade or a Confused Spirit (తిరుగుబాటుదారు)
  • The Silent Men (నిశ్శబ్ద మనుషులు)
  • The Guest (అతిధి)
  • Jonas or the Artist at Work (కళాకారుడు పనిలో ఉన్నాడు)
  • The Growing Stone (పెరిగే శిల)

ఇవే కాక ఇంకా పలు పుస్తకాలు, నాటకాలు, వ్యాసాలు కూడా రాశాడు. యండమూరి వీరేంద్రనాధ్ రాసిన ప్రసిధ్ధ నవల 'అంతర్ముఖం' కామూ నవల The Stranger కి అనుసరణ.

Exile and the Kingdom (బహిష్కరణ, రాజ్యం) (కథా సంకలనం) (1957) అనే ఒక కథా సంపుటాన్ని కామూస్ ప్రకటించాడు.దీనిలో ఆరు కథలున్నాయి.మొత్తంమీద కామూస్ రచన లన్నింటిలోనూ కొందరు ప్రధాన వ్యక్తులీ ప్రస్తుత అసంబధ్ద సంఘంలో తాము ప్రవాసితులమని (Exiles) భావిస్తారు.అవుట్ సైడర్ అనే శీర్షిక ఇదే భావం సూచిస్తుంది. ఇందులో మొట్ట మొదటి కథ వ్యభిచారిణి. ఈమె పేరు జానీస్.ఈ యువతి ఒక బట్టలు వర్తకుని భార్య.వస్త్ర వ్యాపార సందర్భంలో భర్తతో కలిసి ఉత్తర ఆఫ్రికాలో అరబ్బులు నివాసించే సుదూర ప్రాంతానికి ప్రయాణం చేస్తుందొ. ఆ అరబ్బుల ప్రాకృతిక (Primitive) జీవితం ఆవనిత ఆత్మాంతరాళంలో అజ్ఞాతమయిన ఒక ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఆమె ఆ నగరానికి అనతి దూరంలో గోచరించే ఎడారి వైపు చూచి, నిత్య సంచారులయిన అరబ్బుల అద్భుత జీవిత ధోరణి అత్యాసక్తితో పరిశీలిస్తుంది.అదే తన సహజ స్వాభావిక జీవితమని ఆమె హృదయంలో ఒక విచిత్రమయిన అభిప్రాయం ఏర్పడుతుంది. గతించిన యౌవన సౌందర్యాదులు తలచుకొని ఆమె ఆ భావనాతన్మయతలో లీనమై క్రమంగా ఆకాశంలో తారాతాలళ్యం ధ్యానిస్తుంది.ఆ సమయంలో ఆమె హృదయంలో స్వకీయ జన్మ సందేశంలో ప్రవేశించినట్లొక అపూర్వానుభూతి కలుగుతుంది. ఆనంద బాష్పాలామె చెక్కిళ్ళపై ధారలు కట్టి ప్రవహిస్తాయి. ఆ విధమయిన ప్రాకృతిక సమ్మేళనానుభూతి పారవశ్యం కామూస్ రచనలలో చాలా చోట్ల ప్రత్యక్షమవుతుంది.

ఇలాగా ఈ ఆరుకథలు కాముస్ అభిప్రయాలకత్యంత నిగూఢమయిన సాంకేతిక రూపచిత్రణలు.ఈ కథల రచనలలో కాముస్ వేర్వేరు విధాల శిల్పపద్ధతులు అవలంబిస్తాడు.భావ శిల్పాల పరిణితిని బట్టి కాముస్ రచనలన్నీ మూడు వర్గాలుగా విభజించవచ్చును. అవుట్ సైడర్, ది మిత్ ఆఫ్ సిసిఫస్, కాలిగ్యూలా, క్రాస్ పర్పస్ ఈ నాలుగు ప్రధాన వర్గంలో చేరుతాయి. రెబెల్, ప్లేగ్, ది జస్ట్, స్టేట్ ఆఫ్ సీజ్ ఈ నాలుగు ద్వితీయ వర్గం.ఫాల్, కథాసంపుటి తృతీయవర్గంలోకి వస్తాయి.

కామూస్ దృక్పధము-శిల్పము[మార్చు]

తానొక తత్వవేత్తనని గాని లేక నూతనతత్వం ప్రతిపాదిస్తున్నానని గాని కాముస్ ఎప్పుడు ప్రకటించలేదు. అందుచే ఆయనదొక ప్రత్యేక దృక్పధమే అని పేర్కొనాలి.కాముస్ చాల నిశితమైన సాంఘికాభివివేశం గల రచయిత.జర్మనీ దురాక్రమణ ప్రతిఘటనోద్యమంలో ఇతడు సాగించిన పోరాటమే దీనికి తార్కాణ.అంతే కాదు రధ్యా హంగేరీలో సాగించిన స్వాతంత్ర్య పోరాటానికి శాయ్శక్తులా చేయూతనిచ్చాడు.సర్వ విషయాలలోనూ సంపూర్ణమయిన మానవ వ్యక్తి స్వాతంత్ర్యమే ఇతని పరమావధి.అటు సర్వము దైవాధీనమే అను ప్రతిపాదించే మతవిశ్వాసులుగాని,ఇటు భీకర నియంతృత్వాలకు దారితీసే తాత్వికథోరణులుగాని ఈరచయితకెంత మాత్రము సరిపడవు.ఆధునిక మానవుని ఆత్మసంక్షోభానికి కాముస్ రచనలు పరిపూర్ణ స్వచ్ఛ ప్రతిబింబాలు.

ప్లేగ్ లో ఈయన చూపిన శిల్ప నైపుణి అనన్య సాధారణం.కేవల సారస్వ్త దృష్టితో పరిశీలించినా కామూస్ నవలలు మూడు అత్యుత్తమ శ్రేణిలోకే వస్తాయి.ఇక రూపకాలలో కాలిగ్యులా, క్రాస్ పర్పస్ మిగిలినవాటిలలో శ్రేష్ఠమయినవని అనిపిస్తాయి.మిగిలన వాటిలలో దృక్పధం బాగా కొట్టొచ్చినట్లు కనబడుతుంది.కామూస్ శిల్ప చాతుర్యత పాఠలులను ఎక్కువ ఆకర్షించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

కామూ మరణించే నాటికి అతనికి భార్య, కవలలయిన ఒక కొడుకు, కూతురు ఉన్నారు.

మరణం[మార్చు]

1960 జనవరి 4 న నలభయ్యారేళ్ళ వయసులో కామూ ఒక కారు ప్రమాదంలో మరణించాడు. చనిపోయిన రోజు అతని కోటు జేబులో ఒక రైలు టిక్కెట్ ఉంది. ఆ రోజు అతను భార్యా పిల్లలతో రైలు ప్రయాణం చెయ్య వలసి ఉంది కానీ చివరి నిమిషంలో ఒక పబ్లిషరుతో కారులో ప్రయాణించవలసి వచ్చి ఆ రైలు ప్రయాణం రద్దు చేసుకున్నాడు.

రుడ్యార్డ్ కిప్లింగ్ తర్వాత అతి చిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన రెండవ రచయిత ఆల్బర్ట్ కామూ.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]