ఖాజీ నజ్రుల్ ఇస్లాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దక్షిణ ఆసియా
నవీన శకం
పేరు: ఖాజీ నజ్రుల్ ఇస్లాం
జననం: మే 25, 1899
మరణం: ఆగష్టు 29, 1976 1976 ఆగస్టు 29(1976-08-29) (వయసు 77)
సిద్ధాంతం / సంప్రదాయం: హనఫీ సున్నీ
ముఖ్య వ్యాపకాలు: కవిత్వం, సంగీతం, రాజకీయం, సమాజం
ప్రభావితం చేసినవారు: ఇస్లాం; శక్తి తత్వం; రవీంద్రనాథ టాగూరు, మౌలానా రూమి
ప్రభావితమైనవారు: భారత స్వాతంత్ర్య సంగ్రామం; బెంగాలీ కవిత్వం

కాజీ నజ్రుల్ ఇస్లాం (ఆంగ్లం : Kazi Nazrul Islam) (బెంగాలీ কাজী নজরুল ইসলাম, కాజీ నజ్రుల్ ఇస్లాం) (మే 25, 1899ఆగష్టు 29, 1976), ఒక బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు. ఇతని కవిత్వం భారతస్వాతంత్ర్య సంగ్రామ కాలంలో 'విప్లవ కవి' లేదా 'విరోధి కవి' అనే పేరును తెచ్చి పెట్టింది. ఇతనిని బంగ్లాదేశ్ ప్రభుత్వం తన "జాతీయ కవి"గా గుర్తించింది. భారత ప్రభుత్వము కూడా ఇతనిని సముచితంగా గౌరవించింది.

జీవిత ప్రస్థానం[మార్చు]

నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించిన నజ్రుల్, మతపరమైన విద్యను అభ్యసించాడు,, ప్రాదేశిక మస్జిద్లో ముఅజ్జిన్ (మౌజన్) గా పనిచేశాడు. ఇతను కవిత్వం, నాటకం, సాహిత్యం, థియేటర్ కళలు నేర్చుకున్నాడు. 'బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ' లోనూ పనిచేశాడు. తరువాత కలకత్తాలో జర్నలిస్టుగా పనిచేశాడు. బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా తన గళాన్ని విప్పాడు, తన కలానికి పని ఇచ్చాడు, 'విరోధి కవి' అయ్యాడు. తన 'భంగార్ గాన్' (ప్రళయ గానం) తో గడగడలాడించాడు. తన ప్రచురణ ధూమకేతు ద్వారా స్వదేశీ సంగ్రామాన్ని ఉత్తేజ పరచాడు. అనారోగ్యం, మతిమరుపుతో బాధ పడుతూ బంగ్లాదేశ్లో 1976 ఆగస్టు 29 లో కన్ను మూశాడు.

రచనలు[మార్చు]

నజ్రుల్ తన 21వ సంవత్సరం నిండకుండానే బంధన్ హరా అనే నవలను ప్రకటించి వంగదేశంలో పేరు ప్రతిష్ఠలు ఆర్జించారు.ఆ తరువాత పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు, గేయాలు ప్రకటించారు.దేశభక్తి కవిగా కూడా వీరికి మంచి కీర్తిప్రతిష్ఠలున్నవి.నజ్రుల్ దేశభక్తి గేయాలే కాక, గజల్ అనువాదాలు, బిరహ బిదుర, మర్మి మొదలైన ప్రశస్తమైన రచనలు చేసినప్పటికీ అగ్నివీణ కవితా సంకలనం చెప్పుకోదగ్గది. ఇందులో బిద్రోహి, షాత్ ఇల్ అరాబ్, ప్రళయోల్లాస్, మొదలగు గేయాలు ప్రాముఖ్యమైనవి. ఇందులోని బిద్రోహి భారతదేశంలోని యువకవుల్నందర్నీ ఆకర్షించి ఉర్రూత ఊగించింది.ఈ గేయాన్నే పాఠకులకు తొలిసారి పరిచయం చేయటమనే గౌరవం బిజలి అనే బెంగాలి వార పత్రిక (6, జనవరి 1922) కు దక్కింది.ఈ గేయం ప్రకటించిన తరువాత నజ్రుల్ ఇస్లాం బెంగాల్ దేశంలోని బిద్రోహి కవి (Reel poet) గా ప్రసిద్ధి గాంచినాడు. ఈ కవితకి విశ్వకవి రవీంద్రనాధ టాగూరు ఆశీర్వచనం కూడా లభించింది.ఈ భావ విప్లవ శంఖారావం మొదట వంగదేశంలోనే మారుమోగిన అచిరకాలంలోనే ఇంగ్లీషులోనికి అనువదించటం వలన భారత సాహితీవేత్తలలో సంచలనాన్ని కలిగించింది.కావ్యత్వం పేరుతో అనుకరణ సహజమై పరిధులు దాటడానికి మీనమేషాలు లెక్కిస్తున్న తరుణంలో వీరి బిద్రోహి సాహితీ లోకానికి నవచైతన్యాన్ని ప్రసారించింది.

అభ్యుదయ కవితా సిద్దాంతానికి పట్టుకొమ్మవంటి పాదాలు ప్రజా కవిత్వం, ప్రగతిశీలక కవిత్వము, విప్లవకవిత్వము అను పలు ప్రాంతాల్లో పలు విధాలుగా పిలిచినప్పటికి కవితాధ్యేయము మాత్రము సాహిత్యము ద్వారా సమ సమజనిర్మాణమే. 1936 ఏప్రిల్ 10వ తేదీన మంషీ ప్రేమ్చంద్ అధ్యక్షతన జరిగిన అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘప్రధమ సమావేశం కూడా ఇంచుమించు ఈ భావాల్నే ప్రకటించింది. జవహర్ లాల్ నెహ్రూ, విశ్వకవి రవీంద్రనాధ టాగూరు ఈ సంఘాన్ని ఆశీర్వదించారు. రెండవసారి జరిగిన సమావేశానికి రవీంద్రనాధ టాగూరు అధ్యక్ష్తత వహించారు.తెలుగుదేశమందలి అభ్యుదయ రచయితల సంఘము, మహారాష్ట్రలోని రవికిరణ మండల్, హిందీ రాష్ట్రాలలోని ప్రగతివాద్ రచయితలసంఘము, ఒరిస్సాలోని ప్రజాకవిత్వసంఘము, మలయాళభాషలోని పురోగమనవాదు రచయితల సంఘము, తమిళనాడులోని విప్లవ రచయితల సంఘము మొదలగు వారందరు నజ్రుల్ ఇస్లాం బిద్రోహి గేయ ప్రభావానికి ప్రత్యంక్షంగానో, పరోక్షంగానో లోనైనవారే. అందుకే బిద్రోహి భారతీయ సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిడమే కాక ఒక జాతీయ కవితా ఉద్యమానికి పునాదిగా నిలచింది.

తన భావాలను ప్రచారంచేయడానికి నజ్రుల్ 1922లో ధూమకేతు అనే పత్రిను ఈమహాకవి స్వయంగా స్థాపించాడు.ఈ పత్రిక ద్వారా నజ్రుల్ హృదయం చైతన్యవంతమైన అక్షరరూపం ధరించి ది దిగంతాలలో నవ్యశంఖారావాన్ని వినిపించింది. అయితే కవిగా జీవితాన్నారంభించిన నజ్రుల్ పై రాజ్కీయపార్టీ ముద్ర పడటం వలన పరిస్థితులలో మార్పు వచ్చింది. 1925 డిసెంబరు 25న కమ్యూనిష్టు భావాలు కలిగిన రాజకీయ నాయకులు లేబర్ స్వరాజ్ పార్టీని స్థాపించి తమ భావాలను ప్రచారం చేయటానికి లాంగల్ అనే పత్రికను స్థాపించి నజ్రుల్ ని సంపాదకునిగా నియమించారు. ఈ పత్రిక ద్వారా సామాన్య ప్రజల సమస్యలను వస్తువుగా స్వీకరించి అనేక గేయాలను ప్రకటించారు. ఆ తరువాత 1926 సెప్టెంబరు 25న ఈ పత్రిక పేరును గణవాణిగా మార్చటంతో ఇది సంపూర్ణంగా మార్క్సిష్టు ప్రచార పత్రిక అయింది.కవిగా పేరుపొందిన నజ్రుల్ పై రాజకీయ వ్యక్తిత్వపు ముద్రపడింది. ఈ రోజుల్లోనే ప్రకటించబడిన International అనే గేయం మార్స్కు సిద్ధాంతాల ప్రభావానికి సంబందించిందే.దీనికి తోడు అంతర్జాతీయ రాజకీయ, సాహిత్య కారణాలనేకం.


పద్మ భూషణ పురస్కారం[మార్చు]

భారత ప్రభుత్వం 1960లో పద్మ భూషణ పురస్కారంతో ఈయనను సముచితంగా సత్కరించింది.

సమాధి

మూలాలు[మార్చు]

  • Karunamaya Goswami, Kazi Nazrul Islam: A Biography, (Nazrul Institute; Dhaka, 1996)
  • Rafiqul Islam, Kazi Nazrul Islam: A New Anthology, (Bangla Academy; Dhaka, 1990)
  • Basudha Chakravarty, Kazi Nazrul Islam, (National Book Trust; New Delhi, 1968)
  • Abdul Hakim, The Fiery Lyre of Nazrul Islam, (Bangla Academy; Dhaka, 1974)

నోట్సు[మార్చు]

బయటి లింకులు[మార్చు]