రొమిల్లా థాపర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రొమిల్లా థాపర్
జననం (1931-11-30) 1931 నవంబరు 30 (వయసు 92)
లక్నో, బ్రిటిష్ ఇండియా
జాతీయతభారతీయులు
విద్యాసంస్థపంజాబ్ విశ్వవిద్యాలయం
స్కూల్ ఆఫ్ ఓరియెంటేషన్ అండ్ అఫ్రికన్ స్టడీస్, లండన్ విశ్వవిద్యాలయం[1]
వృత్తిచరిత్రకారులు, రచయిత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత దేశ చరిత్ర గూర్చి పుస్తక రచయిత

రొమిల్లా థాపర్ (జననం 1931 నవంబరు 30) చరిత్ర పరిశోధకురాలు, లౌకిక చరిత్ర నిర్మాత.

బాల్యం-విద్యాభ్యాసం[మార్చు]

ఈమె 1931లో లాహోర్లో జన్మించారు. ఈమె తొలి నామకరణం రమోలా అయితే ఈ పేరు ప్రసిద్ధ ఆంగ్ల నవల ఒకదానిలో విషాదాంత పాత్రకు ఉంది. అందువల్ల ఈమె తల్లి ఆ పేరును రొమిలాగా మార్చివేసారు. తండ్రి భారతీయ సైన్యానికి చెందినవారు కావడం చేత దేశంలోని వివిధ ప్రాంతాలలో విద్యాభ్యాసం జరిగింది. ఈమె తొలుత పంజాబ్ విశ్వవిద్యాలయంలో సాహిత్యంలో డిగ్రీ చేసారు. లండన్ లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికక్ స్టడిస్ లో అడ్మిషన్ కు ప్రయత్నించినప్పుడు బి.ఏలో హిస్టరీ తీసుకోమన్నారు. దీనితో ఈమె "చరిత్ర"ను విషయాంశంగా ఎంచుకున్నారు. ఆ సమయంలో ఈమె వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడంతోపార్ట్ టైం ఉద్యోగం చేసారు. అదీ ఏమంత వెసులుబాటుగా ఉండేది కాదు. ఈమెకు ట్యూటర్ గా ఉన్న ప్రొఫెసర్ ఎ.ఎస్. భాషం ఒక సలహా ఇచ్చారు. పి.హెచ్.డి కోసం లండన్ యూనివర్శిటీ సహాయం కోరమన్నారు. దీనితో ఈమె అనుకోని పరిస్థితులలో "స్కాలర్"గా మారారు.

పరిశోధనలు[మార్చు]

పంజాబ్, లండన్ విశ్వవిద్యాలయాల్లో చదివి బి.ఏ (ఆనర్స్) డిగ్రీ సంపాదించిన ఈమె 1958 లో లండన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టం పొందారు. అశోక చక్రవర్తి గూర్చి ఎ.ఎల్.భాషం పర్యవేక్షణలో ఈమె చేసిన పరిశోధన ఫలితంగా ఈ డాక్టరేట్ లభించింది. లండన్ లో పరిశోధక విద్యార్థిగా ఎంతో ఉత్సాహంగా పరిశోధనలు, గాడాధ్యయనం చేసారు. అయితే ప్రొఫెసర్ భాషం మాత్రం ఎప్పుడూ ఈమె మీద కోపాన్ని ప్రదర్శిస్తూండేవారు. "ఆత్రుతను నియంత్రించుకోలేవు. చదువుకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి..." అంటు మందలించేవారు. అప్పుడు పరిశోధక విద్యార్థిగా కర్తవ్యాలు గుర్తుకు వచ్చి, ఆచరణలో పెట్టేవారు. "అశోకా అండ్ ద డిక్లయిన్ ఆఫ్ ద మౌర్యాస్" పేరుతో 1961 లో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయం ప్రెస్ ఈమె పరిశోధన గ్రంథాన్ని వెలువరించింది. అది ప్రొఫెసర్ ఎ.ఎల్.భాషం కే అంకితమీయబడింది.

అధ్యాపకురాలిగా[మార్చు]

రొమిలా ఆసియా, యూరప్ ఖండాలలో విస్తృతంగా పర్యటించారు. 1957 లో చైనాలో బౌద్ధ గుహలనూ, బోబీ ఎడారిలో టున్-హ్యూయాంగ్ నూ అధ్యయనం కోసం సందర్శించారు. 1958-60 లో లండన్ విశ్వవిద్యాలయంలో ప్రాచీన భారతదేశ చరిత్రను బోధించారు. లండన్లో ఉన్నప్పుడు బి.బి.సి లో "ఇంగ్లీషు టాక్స్ ఫర్ ఏసియా" "హోం అండ్ ద థర్డ్ ప్రోగ్రామ్స్" సీరీస్ లో పలు ప్రసంగాలను అందించారు. 1962 లో బోధకురాలిగా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేరి 1970 లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసరుగా పనిచేసారు.[2] 1991 లో ఉద్యోగ విరమణ చేసి, అదే విశ్వవిద్యాలయంలో హిస్టరీ ఎమెరిటస్ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో ఉన్నత పదవిలో ఉండి, కొత్త సిలబస్ ను ప్రవేశ పెట్టారు. పాతతరం చరిత్ర నుంచి బయటపడి సాంఘిక, ఆర్థిక చరిత్రను ముందుకు తీసుకు వచ్చారు. ఇందుకు చాలామంది విద్యావేత్తలు అబ్బురపడ్డారు, వ్యాఖ్యానించారు. దశాబ్దం చివరినాటికి ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఈమె రూపకల్పన చేసిన సిలబస్ నే అనుసరించాయి.

చరిత్ర పరిశోధకురాలిగా[మార్చు]

ఈమె భారతదేశ చరిత్ర మీద ఏర్పడిన దురభిప్రాయాలను తొలగించడానికి కృషిచేసారు. ప్రాచీన భారతీయ చరిత్ర రచనలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. మతవాద దృక్పథంతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను సాహసోపేతంగా, దృఢ చిత్తంతో ఎదుర్కొని అగ్రపీఠంలో నిలిచారు[3]. చరిత్ర రచనలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రశ్నలను లేవనెత్తి ఆ విషయాలను సుసంపన్నం చేసారు. అరుదైన చరిత్ర కారుల్లో ప్రధాన కర్తగా నిలిచారు. గత చరిత్రను జీర్ణించుకుని భావి తరాల వారికి అందించడంలో ఈమె చేసిన కృషి అపారమైనది. మన దేశ చరిత్రలో భాగంగా పేర్లు, తేదీలు, పుట్టుపూర్వోత్తరాలు మీద ఈమె చేసిన విస్తృత అధ్యయనం అమేయమైనది. యువతరానికి, రాజకీయ హింసా చరిత్రకు వ్యతిరేకంగా పోరాడిన వారికోసం "ఐవరీ టవర్"ను రచించిన ప్రముఖుల్లో రొమిలా ఒకరు. 1966 లో ఈమె రచించిన "ఎ హిస్టరీ ఆఫ్ ఇండియా" ప్రథమ భాగమును అంతర్జాతీయ ఖ్యాతి గడించిన పెంగ్విన్ ప్రచురణకర్తలు ప్రచురించారు.

ప్రొఫెసర్ రొమిలా థాపర్ ప్రాచీన భారతదేశ చరిత్ర (క్రీ.పూ 10 వ శతాబ్ది నుండి సా.శ. 10వ శతాబ్దం వరకు గల చరిత్ర) అంశం మీద విశేష కృషి చేసారు. ఈమె తనకు ముందు గల చరిత్రకారుల కంటే భిన్నంగా భారతదేశ చరిత్రను వ్యాఖ్యానం చేసారు. భారతీయ సంస్కృతి సాంఘికంగా, ఆర్థికంగా ఏ విధంగా పరిణమించిందో విభిన్న సాక్ష్యాలతో నిరూపించారు. సన్యాసం రాజ్యశక్తికి వ్యతిరేకమైన ప్రబల శక్తి అని ఈమె వివరించిన తీరు అత్యద్భుతంగా ఉండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కితాబునందుకున్నది. పురాణాలలోని రాజవంశవృక్షాలు మారుతున్న ఆర్థిక సాంఘిక స్థితిగతులను సూచిస్తాయని కూడా వ్యాఖ్యానించారు. తత్ఫలితంగా "మార్కిస్ట్ చరిత్రకారిణి" అనే ముద్ర వేయించుకున్నారు[4].[5]

జాతి మత విద్వేషాలతో భారతీయ చరిత్రను దోషభూయిష్టం చేసే విధానాలను నిశితంగా విమర్శించారు. ఈమె మౌర్య సామ్రాజ్య లక్షణాలను నూతన దృక్కోణంలోపరిశీలించారు. మెగస్తనీస్ రాతల్లోని మంచి చెడులను వెల్లడించారు. చక్రవర్తి మహావ్యక్తీ అయిన అశోకుని పాలన గూర్చి సూక్ష్మ పరిశీలన చేసారు. అశోకుని శిలా శాసనాల్లోని "ధమ్మం" స్వరూపం ఏ విధంగా ఉన్నదో అద్భుత రీతిలో వివరించారు. అశోకుని అహింసా వాదం వల్ల మౌర్య సామ్రాజ్యం పతనమైందనే వాదనను తునాతునకలూ చేసారు.

Somanatha: The Many Voices of a History గ్రంథ రచనలో సోమనాథ దేవాలయ చరిత్రను వివరించారు. గత రెండు దశాబ్దాల చరిత్రను శోధించి, విభిన్న చరిత్రను సూచించారు[6]. ప్రాచీన భారతదేశంలోని మత, సాంఘక, సంస్కృతి అంశాల మీద గతంలో చెప్పుకున్నవన్నీ నిరాథారమైనవనీ సాక్ష్యాలతో నిరూపించాగా హిందూత్వ రాజకీయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు[7]. ఈమెకు వ్యతిరేకంగా ప్రచండ ఉద్యమాలు నిర్వహించారు. ఈమెకు ఉన్న వృత్తిపరమైన అర్హతలను అపహాస్యం చేసారు. 1999 లో ఎన్నికలలో దేశ నాయకత్వాన్ని చేపట్టిన మూడు నెలలలోపే బి.జె.పి ప్రభుత్వం ఈమెను "ఇండియన్ కౌన్సిల్ ప్రి హిస్టారికల్ రీసెర్చి" నుండి వెళ్లగొట్టింది. ఆ తర్వాత వెనువెంటనే "ప్రసార భారతి" కూడా ఈమెపదవిని రద్దు చేసింది. ఈమెను "యాంటి హిందూ"గా ముద్రవేసి, "యాంటీ నేషనల్" పదాన్ని కూడా జోడించి మనస్తాపం కలిగించింది.

సేవలు[మార్చు]

స్వాతంత్ర్యానంతరం భారతచరిత్ర రచనలో ఏర్పడిన సంప్రదాయాల నిర్మాణంలో కీలకమైన చరిత్ర రచయితల్లో రొమిల్లా థాపర్ ఒకరు. బ్రిటీష్ వారి నిష్క్రమణానంతరం తొలినాటి ప్రభుత్వాల దృక్పథాలతో కొంతవరకూ అకడమిక్ చరిత్ర తిరగరాయబడిన ప్రాధాన్యత కల కాలంలో ఆమె ప్రాముఖ్యం వహించారు. రొమిల్లా థాపర్ ప్రపంచవ్యాప్తంగా భారతీయ చరిత్ర రచయిత్రిగా ప్రాచుర్యం పొందాఉర్. విఖ్యాత కార్నెల్, పెన్సెల్వేనియా విశ్వవిద్యాలయాలు, కాలేజ్ డి ఫ్రాన్స్‌లకు ఆతిథ్య ఆచార్యురాలిగా, 1983లో భారత చరిత్ర కాంగ్రెస్‌కు జనరల్ ప్రెసిడెంట్‌గా, 1999లో బ్రిటీష్ అకాడమీ ఫెలోగా గౌరవం పొందారు. చికాగో విశ్వవిద్యాలయం, ఇన్స్‌టిట్యూట్ డెస్ లాంగ్యుఎస్ ఎట్ సివిలైజేషన్స్ ఓరియంటల్స్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యాపీఠాల నుంచి గౌరవ డాక్టరేట్‌లు అందుకున్నారు. అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో విదేశీ గౌరవ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరిస్తూ, "నేను అకడమిక్ సంస్థల నుంచే తప్ప ప్రభుత్వాల నుంచి పురస్కారాలు అందుకోనని" ప్రకటించారు. ప్రతిష్ఠాత్మకమైన క్లూగ్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ (2008) ను మిలియన్ డాలర్ల ప్రైజ్‌తో పాటుగా పీటర్ బ్రౌన్‌తో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రచించిన భారత చరిత్ర అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గ్రంథాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రముఖ అనువాదకులు సహవాసితో తెలుగులోకి అనువదింపజేసి ప్రచురించారు.

గుర్తింపు, గౌరవాలు[మార్చు]

ఆమె కార్నెల్ విశ్వవిద్యాలయం, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, కాలేజ్ డె ప్రాన్స్ లలో విజిటింగ్ ప్రొఫెసరుగా పనిచేసారు. 2983 లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కు ప్రధానాధ్యక్షురాలిగా నియమితులైనారు. 1999 లో బ్రిటిష్ అకాడమీలో ఫెలోషిప్ పొందారు.[8]

ఆమె ఆక్స్‌ఫర్డు లోని లేడీ మార్గరెట్ హాల్ లో గౌరవ ఫెలోషిప్ ను, యూనివర్శిటీ ఆఫ్ లండన్ లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ లో గౌరవ ఫెలోషిప్ పొందారు. ఆమె చికాగో విశ్వవిద్యాలయం, పారిస్ లోని ఇనిస్టిట్యూట్ నేషనల్ డెస్ లాంగ్వేజెస్ ఎట్ సివిలిసేషన్స్ ఓరియెంటల్స్, ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయం, ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం, కలకత్తా విడ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు పొందారు.[9]

ఆమె 2009 లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి కూడా డాక్టరేట్ పొందారు.[10] ఆమె 2009 లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ యొక్క విదేశీ గౌరవ సభ్యురాలిగా ఎంపికయ్యారు.[11]

2004 లో యునైటెడ్ స్టేట్స్ లోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఆమెను దక్షిణాది దేశాలు, నంస్కృతులలో మొదటిసారి క్లూజ్ చైర్ గా నియమించారు.[10]

2005 జనవరిలో ఆమె భారత ప్రభుత్వం అందజేసిన ప్రతిష్ఠాత్మక పురస్కారమైన పద్మభూషణ్ ను తిరస్కరించింది. అంతకు ముందు 1992 లో కూడా ఆమె పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించింది. ఆమె తాను ఇటువంటి రాష్ట్ర పురస్కారాలను తీసుకోననీ, వృత్తిపరమైన గౌరవాలను మాత్రమే స్వీకరిస్తానని తెలియజేసారు.[12]

రొమిలా ప్రాథమిక రచనలలో కొన్ని[మార్చు]

  • అశోక అండ్ ద డెక్లైన్ ఆఫ్ ద మౌర్యాస్ (1961)
  • ఎ హిస్టరీ ఆఫ్ ఇండియా వాల్యూం :1 (1966)
  • ద పాస్ట్ అండ్ ప్రిజూడిస్ (1975)
  • ఫ్రం లినీగ్ టు స్టేట్ (1984)
  • ద మౌర్యాస్ రీ విజిటెడ్ (1987)
  • ఇంటర్ ప్రెటింగ్ ఎర్లీ ఇండియా (1992)
  • టైం ఈజ్ ఎ మెటాఫర్ ఆఫ్ ద హిస్టరీ (1996)
  • శకుంతల: (1999)
  • హిస్టరీ అండ్ బియాండ్ (2000)
  • కల్చరల్ పాస్ట్స్ (2000)
  • ఇండియా: అనదర్ మిలీనియం (2000) [13]

మూలాలు[మార్చు]

  1. "Romila Thapar". Penguin India. Retrieved 12 December 2014.
  2. "Romila Thapar, Professor Emerita" (PDF). JNU. Archived from the original (PDF) on 16 జూన్ 2015. Retrieved 7 December 2014.
  3. E. Sreedharan (2004). A Textbook of Historiography, 500 B.C. to A.D. 2000. Orient Longman. pp. 479–480. ISBN 81-250-2657-6.
  4. "Romila Thapar's appointment to Library of Congress opposed"- Rediff article dated 25 April 2003
  5. Bidwai, Praful (13 May 2003). "McCarthyism's Indian rebirth". Rediff. Retrieved 4 April 2007.
  6. Perspectives of a history Archived 2006-06-26 at the Wayback Machine – a review of Somanatha: The Many Voices of a History
  7. "Cultural Pasts: Essays in Early Indian History By Romila Thapar - History - Archaeology-Ancient-India". Oup.co.in. 2003-02-03. Archived from the original on 2012-06-04. Retrieved 2014-08-18.
  8. "Romila Thapar". penguin.co.uk. Archived from the original on 2014-12-19. Retrieved 2015-03-11.
  9. "Honoris Causa". Archived from the original on 2011-08-08. Retrieved 2015-03-11.
  10. 10.0 10.1 "Romila Thapar Named as First Holder of the Kluge Chair in Countries and Cultures of the South at Library of Congress". Library of Congress. 17 April 2003. Retrieved 4 April 2007.
  11. "Book of Members, 1780–2010: Chapter T" (PDF). American Academy of Arts and Sciences. Retrieved 21 June 2011.
  12. "Romila rejects Padma award" Archived 2012-10-18 at the Wayback MachineTimes of India article dated 27 January 2005
  13. E. Sreedharan (2004). A Textbook of Historiography, 500 B.C. to A.D. 2000. Orient Longman. pp. 479–480. ISBN 81-250-2657-6.
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

బయటి లంకెలు[మార్చు]